ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఈ నెల 12 నుంచి నిర్వహించ తలపెట్టిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని 19 పట్టణాల్లో, 108 కేంద్రాల్లో జరగనుంది.
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఈ నెల 12 నుంచి నిర్వహించ తలపెట్టిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని 19 పట్టణాల్లో, 108 కేంద్రాల్లో జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వైజాగ్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, అమలాపురం, గుంటూరు, కడప, తిరుపతి, అనంతపురం, హిందూపురంలలో కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం వివరాలను బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా 10 లేదా 12 రౌండ్లలో.. ఒక్కో రౌండ్లో వెయ్యి కేంద్రాల్లో చాయ్ పే చర్చ కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు. ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సహా పార్టీ నేతలను ప్రశ్నలు అడగవచ్చని, సలహాలు ఇవ్వవచ్చని చెప్పారు. డీటీహెచ్, శాటిలైట్, ఇంటర్నెట్, మొబైల్, సోషల్మీడియా ద్వారా కూడా కార్యక్రమం నిర్వహిస్తామని, 2 కోట్ల మందిని చాయ్ పే చర్చలో భాగస్వాములుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.