
బ్యాంకుల విలీనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూడిల్లీ: 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఎస్బీఐ)లో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం మరోసారి పచ్చజెండా ఊపింది. దీంతో ఎస్బీఐ ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటిగా మారనుంది. తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు స్టేట్ బ్యాంకు అనుబంధ బ్యాంకులుగా చలామణి అవుతూ వస్తున్న 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్', 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్', 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్', 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా', 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్లు' ఎస్బీఐలో విలీనం కానున్నాయి. అయితే భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ విలీనం ఎప్పటినుంచి అమల్లోకి వచ్చేది త్వరలో నేప్రకటిస్తామని జైట్లీ చెప్పారు. దీంతో దేశంలో బ్యాకింగ్ రంగం ఏకీకరణ దిశగా కీలక అడుగు పడినట్టయింది.
అయితే అనుబంధ బ్యాంకుల విలీనంపై గతంలో (2016 , జూన్) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ డీమానిటైజేషన నేపథ్యంలో ఈ ప్ర్రక్రియ వాయిదాపడింది. ఇపుడు కేబినెట్ ఆమోదంతో త్వరలోనే ఈ విలీనానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.
స్వాప్ రేషియో ప్రకారం'స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ వాటాదారులు ప్రతి 10 షేర్లు (రూ 10 ప్రతి) ఎస్బీఐ 28 షేర్లు (రూ .1 చొప్పున) పొందుతారు. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ వాటాదారులు ప్రతి 10 షేర్లకు ఎస్బీఐ 22 షేర్లు పొందనున్నారు. ఈ విలీనంతో రూ 37 లక్షల కోట్లు, 22,500 శాఖలు, 58,000 ఎటీఎంలతో ఒక ప్రపంచ-పరిమాణ బ్యాంకుగా మారనుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే దాదాపు 50 కోట్ల వినియోగదారులను ఎస్బీఐ ఖాతాలో చేరనున్నారు.
కాగా అంతకంతకు పెరుగుతున్న బ్యాంకుల మొండి బకాయిల సమస్యతో పోరాడటానికి, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకురావడానికి కేంద్రం బ్యాంకుల ఏకీకరణ చర్యలకు నిర్ణయించింది. 2008లో తొలిసారి ఎస్బీఐ స్టేట్బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను విలీనం చేసుకొంది. అనంతరం రెండేళ్ల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ను విలీనం చేసుకున్న సంగతి విదితమే.