ఆఫ్ఘానిస్థాన్ గజనీ ప్రావిన్స్లోని చార్ దివార్ ప్రాంతంలో తీవ్రవాదులు రెచ్చిపోయారు.
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ గజనీ ప్రావిన్స్లోని చార్ దివార్ ప్రాంతంలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. రహదారిపై వెళ్తున్న వాహనంపైకి విచక్షణరహితంగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులతోపాటు ఓ సైనికుడు మరణించాడు. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవద్దని ప్రజలకు తీవ్రవాదులు ఇప్పటికే సూచించారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉండవద్దని.... ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించవద్దని ప్రజలకు తీవ్రవాదులు హితవు పలికారు. అయితే ప్రభుత్వానికి తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 16 వందల మంది పౌరులు మరణించగా.... 3300 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల యూఎన్ మిషన్ వెల్లడించింది.