
'త్వరలో శుభవార్త వింటారు'
లక్నో: వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ)పై త్వరలో శుభవార్త వింటారని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఓఆర్ఓపీ అమలు చేయాలని పదవీ విరమణ చేసిన సైనికోద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.
'ఓఆర్ఓపీ అమలు అనేది రక్షణశాఖ అంతర్గత వ్యవహారం. దీనిపై కసరత్తు దాదాపు కొలిక్కివచ్చింది. దీనికి చాలా సమయం పడుతుంది. అయినప్పటికీ ఓఆర్ఓపీపై త్వరలోనే గుడ్ న్యాస్ వింటారు' అని పారికర్ వ్యాఖ్యానించారు.
ఓఆర్ఓపీ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఇంతకుముందు స్పష్టం చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ సైనిక ఉద్యోగులకు పీఆర్సీ సిఫారసు ఆధారంగా పెన్షన్లు ఇస్తున్నారు.