
టీడీపీ నేతలు ‘పప్పు’ తాలింపు ఆపి..
తెలుగుదేశం పార్టీ నిండా ‘పప్పు’ బ్యాచ్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.
- ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించండి
- సంప్రదాయాల గురించి అఖిలప్రియ మాట్లాడటం విడ్డూరం
- నంద్యాల ప్రచారంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా విసుర్లు
నంద్యాల: తెలుగుదేశం పార్టీ నిండా ‘పప్పు’ బ్యాచ్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆ నాయకులంతా అమరావతిలో కూర్చొని ‘పప్పు’ తాలింపు వేసుకోవడం ఆపి, పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాలు విసిరారు.
నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా శనివారం ఎమ్మెల్యే రోజా, దివంగత నాయకుడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి తదితరులు పట్ణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రోజా.. టీడీపీకి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
నంద్యాలతో వైఎస్సార్సీపీ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంతో టీడీపీ నాయకులకు మతిభ్రమించిందని, అందుకే అక్రమ మార్గాల్లో ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రోజా ఆరోపించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరికి డబ్బులు ఇచ్చి టీడీపీ నేతలు ధర్నాలు చేయిస్తున్నారని ఆక్షేపించారు.
‘కాల్మనీ సెక్స్రాకెట్, డ్వాక్రా మహిళలకు వెన్నుపోటు.. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు మహిళలను మోసగిస్తున్న సంగతి మంత్రి అఖిలప్రియకు తెలియదా? సంప్రదాయాల గురించి అఖిలప్రియ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. శోభానాగిరెడ్డి చనిపోయినప్పుడు కనీసం చూడటానికైనా చంద్రబాబు వచ్చారా? ఆమెకు తల్లిదండ్రుల కంటే పదవులే ముఖ్యమయ్యాయి’ అని రోజా అన్నారు.
అబద్ధాలు చెప్పడంలో బాబు దిట్ట: శ్రీదేవి
పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసగించడంలో చంద్రబాబునాయుడు దిట్ట అని దివంగత వైఎస్సార్సీపీ నేత నారాయణరెడ్డి భార్య శ్రీదేవి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి బుద్ధిచెప్పే సమయం వచ్చిందని, నంద్యాల నుంచే పచ్చ పార్టీ పతనం మొదలవుతుందని ఆమె అన్నారు.