
రావణుడు..ఔరంగజేబు..గాడ్సే..చంద్రబాబు!
చంద్రబాబు నాయుడును ప్రజాకోర్టులో నిలదీసిన వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మంత్రులు, నేతలు విమర్శించడాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు.
- కుతంత్రాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్
- నైతిక విలువలులేని టీడీపీ నేతలా జగన్ను విమర్శించేది?
- అధికార పార్టీపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజాకోర్టులో నిలదీసిన వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మంత్రులు, నేతలు విమర్శించడాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. నైతిక విలువలు లేని టీడీపీ నేతలకు జగన్ గురించి మాట్లాడే అర్హతలేదని, అసలు కుట్రలు, కుతంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని హితవుపలికారు. హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
‘ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో నాటి సీఎం వైఎస్సార్ పనిచేశారు. కానీ ఆయన ప్రతి ప్రయత్నానికి చంద్రబాబు అడ్డుపడ్డారు. ఇవాళ అదే చంద్రబాబు.. నేనే సీమకు నిళ్లిచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదం. నంద్యాలలో జగన్ ఏమన్నారు? 600 హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చంద్రబాబును.. పబ్లిసిటీ పిచ్చితో 29 మంది పుష్కర భక్తులను చంపేసిన చంద్రబాబును న్యాయమూర్తులుగా ప్రజలే శిక్షించాలని అన్నారు. ఇదేదో తప్పైనట్లు, చంద్రబాబేదో మంచివారైనట్లు టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు’ అని రోజా వ్యాఖ్యానించారు.
‘;పురాణాల్లో రావణుడిని చూశాం. చరిత్రలో తండ్రిని చంపిన ఔరంగజేబును, మహాత్ముడిని పొట్టనబెట్టుకున్న గాడ్సేను చూశాం. ఆ కోవకు చెందిన వ్యక్తే చంద్రబాబు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవటం మొదలు.. అడ్డొచ్చిన కుటుంబసభ్యులపై సొంత మీడియాతో బురదజల్లించడం, చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోవడం, కాంగ్రెస్తో కుమ్మక్కై వైఎస్ జగన్పై కేసులు బనాయించడం, ఇటీవలి కాలంలో 20 మంది ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, వైఎస్సార్సీపీ నాయకులను అతిదారుణంగా చంపించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు, ఆయన పార్టీ నేతల పాపాలకు అంతే ఉండదు. శవాలమీద రాజకీయపునాదులు నిర్మించుకున్న టీడీపీ నేతలకు వైఎస్ జగన్ను విమర్శించే అర్హతే లేదు’ అని రోజా అన్నారు.