
ట్రంప్ ఎఫెక్ట్..మార్కెట్లు డౌన్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా కోల్పోగా, నిఫ్టీ 8400 స్థాయి కిందికి పడిపోయింది. ప్రస్తుతం 78 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 27,230వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8411 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు ఈ రోజు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ఆందోళన నెలకొందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ లో సెల్లింగ్ ప్రెజర్ నేపథ్యంలో ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇతర బ్యాంకులు, హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ,టాటా మోటార్స్, ఇన్ఫ్రాటెల్, అంబుజా, ఐసీఐసీఐ నష్టపోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్ గా నిలిచింది. దాదాపు 6 శాతం నష్టాలతో కొనసాగుతోంది. ఐడియా, సిప్లా, గెయిల్, యస్బ్యాంక్, ఐషర్ లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, గురువారం నగదు విభాగంలో ఎఫ్ఐఐలు రూ. 132 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అయితే దేశీ ఫండ్స్ లో రూ. 380 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
అటు కరెన్సీ మార్కెట్లో డాలర్ బలహీనపడింది. దీంతో రూపాయికి మద్దతు లభిస్తోంది. గురువారంనాటి రూ.68.12 ముగింపు తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 0.03 పైసలు లాభపడి రూ. 68.04 వద్ద ఉంది. బంగారం ధరలు కూడా బలహీనంగా ఉన్నాయి. పది గ్రా. పుత్తడి ధర ఎంసీఎక్స్ మార్కెట్ లో రూ.254 దిగజారి రూ. 28,537 వద్ద ఉంది.