
'ఆ నటి బుగ్గల్లా రోడ్లు ఉండాలి'
పాట్నా: బాలీవుడ్ నటి హేమమాలిని మంగళవారం సాయంత్రం పాట్నాలో తన ఇద్దరు కుమార్తెలతో 'ద్రోపది' నాటక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ షోకు బీహార్ నాయకులంతా వెళ్తుండగా.. అందరి దృష్టి ఒకరి మీదే ఉంది. ఆయనే రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్.హేమ మాలిని స్టేజ్ షోకి లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.
ఈ విషయం తెలుసుకోవాలంటే కొద్ది సంవత్సరాలు వెనుకకు వెళ్లాలి. 1990లో లాలూ బీహార్ సీఎంగా పనిచేస్తున్న సమయంలో బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మెత్తగా తయారు చేయాలని చమత్కరించారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమంలో మాలిని భర్త తనకు అన్నయ్య అవుతారని వ్యాఖ్యానించి ధర్మేంద్ర-హేమమాలినిలను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
కాగా, ఆ తర్వాత మంగళవారం రాత్రి బీహార్ రాజధానిలో మాలిని(68) తన కూతుళ్లు ఈషా డియోల్, ఆహానా డియోల్ లతో కలిసి నాటక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ నాటకానికి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారులు హాజరుకానున్నారు.