వాయువ్య పాకిస్థాన్లోని పెషావర్ నగరం మరోసారి రక్తమోడింది. పెషావర్ నగరంలో గురువారం ఉదయం తాలిబన్లు చెలరేగిపోయారు. తాలిబన్కు చెందిన ఆత్మాహుతి జరిపిన దాడిలో 15 మంది మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారని, వారు నగరంలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
గత రెండు వారాల కాలంలో తాలిబాన్లు జరిపిన నాలుగో ఘాతుక చర్య అని వారు పేర్కొన్నారు. గత ఆదివారం పెషావర్లోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించి 50 మందికి పైగా మరణించారని గుర్తు చేశారు. అలాగే మరో అదివారం నగరంలోని చర్చ వద్ద తీవ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 80 మందికిపైగా మృతి చెందారని వివరించారు.
వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తున్న బస్సుపై చేసిన దాడిలో 17 మంది మరణించారని చెప్పారు. గత కొద్ది కాలంగా తాలిబాన్లు పాకిస్థాన్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, పాకిస్థాన్లో మోహరించిన ఆర్మీ దళాలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాలిబాన్లు ఆ దాడులు చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.