టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ బుధవారం భారీగా దూసుకుపోతోంది.
ముంబై: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ బుధవారం భారీగా దూసుకుపోతోంది. కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు ఎనలిస్టుల అంచనాలను బీట్ చేయడంతో ఒక దశలో 10 శాతానిపైగా ఎగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ఆకట్టుకోవడంతో ఈ కౌంటర్లో మదుపర్లు కొనుగోళ్ల జోరందుకుంది.
క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం 13 శాతం పెరిగి రూ. 255.75 కోట్లను అధిగమించింది. మొత్తం అమ్మకాలు 14 శాతం పెరిగి రూ. 3926 కోట్లను తాకాయి. టైటాన్ ఈబీఐటీడీఏ లేదా ఆపరేటింగ్ లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 309 కోట్ల పోలిస్తే 21 శాతం ఎగసింది. ఈ ఏడాది రూ. 373 కోట్లగా నమోదుచేసింది. ఇబిటా మార్జిన్లు 9 శాతం నుంచి 9.5 శాతానికి బలపడ్డాయి. అమ్మకాలలో జ్యువెలరీ విభాగం నుంచి 15 శాతం అధికంగా రూ. 3255 కోట్లు లభించగా.. వాచీల బిజినెస్ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకింది. జ్యువెలరీ ఇబిటా 15 శాతం ఎగసి రూ. 334 కోట్లయ్యింది. వాచీల ఇబిటా మరింత అధికంగా 63 శాతం జంప్చేసి రూ. 53 కోట్లను తాకింది.
మంచి ఫెస్టివల్ సీజన్, పెళ్లిళ్ల సీజన్ ,టైటాన్ రిటైల్ అమ్మకాల వృద్ధికి దోహదపడిందని, లాభాలకు తోడ్పడిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డిమానిటైజేషన్ తరువాత చాలా బంగారం షాపులు మూతపడడంతో తమకు డిమాండ్ ఏర్పడిందని టైటాన్ కంపెనీ సీఎఫ్వో ఎస్ సుబ్రమణ్యం చెప్పారు. దీపావళివ కి గోల్డ్ కాయిన్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయన్నారు. మొత్తంగా ఈ క్వార్టర్ వృద్ధి ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు.