ఆగని టీడీపీ అరాచకం..
సాక్షి, గుంటూరు : ఎన్నికల పోలింగ్ ముగిసినా టీడీపీ నేతల ఆరాచకాలు ఆగడం లేదు. ఓడిపోతామనే అక్కసుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. కత్తులు, కర్రలతో స్వైరవిహారం చేస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లపై టీడీపీ కార్తకర్తలు కత్తులతో దాడి చేశారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత సీఎం రమేష్ స్వగ్రామం పోట్లదుర్తిలో ఆయన అనచరులు దాష్టీకానికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ తరఫున ఏజెంటుగా కూర్చున్న రామ్మోహన్ రెడ్డిని ఇళ్లు ఖాళీ చేయించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిలో ఉంటూ ప్రతిపక్ష పార్టీకి ఎలా మద్దతిస్తావంటూ చిందులు తొక్కారు. ఈ సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి అక్కడికి చేరి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిపై టీడీపీ వారి పెత్తనం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇంటికి తాళం తీయించాలని డిమాండ్ చేశారు.