మీ లెక్కల్లో తప్పులున్నాయి!
► ప్రాజెక్టులపై జీఎస్టీ తగ్గించాలన్న రాష్ట్ర వాదనపై జైట్లీ
►ఇప్పటికే తెలంగాణ విజ్ఞప్తి మేరకు పన్ను తగ్గించాం
►మరింతగా తగ్గించాలని కోరడం సరికాదు
►అలా చేస్తే ప్రభుత్వ ఖజానా కంటే కాంట్రాక్టర్లకే లబ్ధి
►ప్రభుత్వ ఏజెన్సీల కాంట్రాక్టులపై మినహాయింపు
►హైదరాబాద్లో జీఎస్టీ కౌన్సిల్ 21వ సమావేశం
►డీలర్ల రిటర్నుల దాఖలుకు గడువు పెంపు
►జీఎస్టీ శ్లాబ్ తగ్గించిన వస్తువుల సంఖ్య -30
►ఊరట- హస్తకళలు
►మినహాయింపు- ఖాదీ వస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజోపయోగ ప్రాజెక్టులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టుల పనులపై జీఎస్టీని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే 18 నుంచి 12 శాతానికి తగ్గించామని.. ఇంకా తగ్గించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చూపెడుతున్న లెక్కల్లో తప్పులు న్నాయని పేర్కొన్నారు. దానివల్ల ప్రభుత్వానికంటే కాంట్రాక్టర్లకే ఎక్కువ లబ్ధి కలుగుతుందన్నారు. శనివారం హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జీఎస్టీ కౌన్సిల్ 21వ సమా వేశం జరిగింది. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలసి అరుణ్జైట్లీ మీడియాతో మాట్లాడారు.
‘‘కాం ట్రాక్టు పనులపై జీఎస్టీ తగ్గించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఆ మేరకు ఇప్పటికే జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించాం. కాంట్రాక్టు పనుల నిర్వచనాన్ని విస్తృతపర్చాలని, ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని కేసీఆర్ కోరారు. దానిని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిం చింది. అయితే అన్ని కాంట్రాక్టు పనులపై జీఎస్టీని ఇంకా తగ్గించాలని కోరడం సరికాదు. అలా తగ్గిస్తే ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రయోజనం కన్నా కాంట్రా క్టర్లకే ఎక్కువ లబ్ధి కలుగుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను లెక్కిస్తే రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి కాంట్రా క్టర్లకు కొంత మొత్తం చెల్లించాల్సి వస్తుంది..’’ అని జైట్లీ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ ఏజెన్సీలు చేసే కాంట్రాక్టు పనులను జీఎస్టీ నుంచి మినహాయిం చాలని కొన్ని రాష్ట్రాలు కోరాయని.. ఆయా ప్రతిపాదనలను ఫిట్మెంట్ కమిటీ పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో సమా వేశమని, ఈ సందర్భంగా జీఎస్టీ అమలు ప్రగతిపైనే ఎక్కువగా చర్చించామని జైట్లీ తెలిపారు. మొత్తం 21 లక్షల మంది డీలర్లు జీఎస్టీ పరిధిలోనికి వచ్చారని, పన్ను వసూళ్లు కూడా ఆశాజనకంగా ఉన్నాయ న్నారు. జూలై నెలకు సంబంధించి రూ.95 వేల కోట్ల పన్ను వసూలైందని.. అందులో వ్యాట్ కూడా కొంత ఉందని తెలిపారు. ఐజీఎస్టీ కింద రూ.48 వేల కోట్లు వచ్చిందని.. అందులో రూ.10 వేల కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేశామని, మరో రూ.37 వేల కోట్లు పంపిణీ దశలో ఉన్నాయన్నారు. జీఎస్టీ అమలు నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఆర్థిక సంక్లిష్ట తను ఎదుర్కొంటున్నాయన్న అంశం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి రాష్ట్రాలకు జీఎస్టీ నిబంధ నలకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు
→ రిటర్నుల దాఖలులో ఇబ్బందుల నేపథ్యంలో గడువును పొడిగించారు.
→ కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ చేసుకోలేకపోయిన డీలర్లు సెప్టెంబర్ 30 వరకు కాంపోజిషన్ను ఎంచుకోవచ్చు. వారికి 2017 అక్టోబర్ 1 నుంచి స్కీం వర్తిస్తుంది.
→ అంతర్రాష్ట్ర లావాదేవీలు చేసే డీలర్లు వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే జీఎస్టీలో రిజిస్టర్ చేసుకోవాలి. హస్తకళలపై రూ.20 లక్షలలోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులు అంతర్రాష్ట్ర లావాదే వీలు జరిపినా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ నంబర్, వేబిల్లు ఉంటే సరిపోతుంది.
→ అంతర్రాష్ట్ర లావాదేవీలు చేస్తున్న జాబ్వర్క్లకు కూడా ఇదే వర్తిస్తుంది. కానీ చాప్టర్ 71 పరిధిలోకి వచ్చే బంగారు ఆభరణాలు, స్వర్ణకా రులు, వెండి నగల తయారీదారులకు ఇది వర్తిం చదు.
→ 1200 సీసీ (పెట్రోల్), 1500 సీసీ (డీజిల్) వరకు సామర్థ్యమున్న కార్లపై జీఎస్టీ యథాతథంగా ఉంటుంది. మధ్య తరహా కార్లపై జీఎస్టీని (సెస్తో కలిపి) 43 నుంచి 45 శాతానికి పెంచారు. లగ్జరీ కార్లపై 5 శాతం, స్పోర్ట్స్ కార్లపై 7%సెస్ పెంచారు. 13 సీట్ల వాహనాలపై యథాతథ స్థితి కొనసాగుతుంది.
→ జీఎస్టీ ట్రాన్స్–1 ఫారంను సవరించుకునేందుకు అనుమతిస్తారు. దీని సమర్పణ గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు.
→ టీడీఎస్, టీసీఎస్ వర్తించే డీలర్ల రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం అవుతుంది. మినహాయింపు ఎప్పుడు అనేది కౌన్సిల్ త్వరలో నోటిఫై చేస్తుంది.
→ ఎగుమతులపై విధించే పన్ను అంశాలను పరిశీలించడానికి రెవెన్యూ కార్యదర్శి అధ్యక్షతన కేంద్ర, రాష్ట్రాల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.
→ జీఎస్టీ అమల్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి పలు రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కమిటీ వేయనున్నారు. రెండు, మూడు రోజుల్లో దానిని ప్రకటిస్తారు.
30 వస్తువులపై పన్ను తగ్గింపు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొత్తం 65 రకాల వస్తువులపై జీఎస్టీ అమలును సమీక్షిం చామని.. అందులో 30 వస్తువులపై పన్ను రేటును తగ్గించామని జైట్లీ చెప్పారు. అందులో చింతపండు, ఇడ్లీ, దోశ పిండి, ఆయిల్కేక్లు, అగరుబత్తీలు, ప్లాస్టిక్ రెయిన్కోట్లు, రబ్బరు బ్యాండ్లు వంటివి ఉన్నాయన్నారు. బ్రాండెడ్ ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధానాన్ని సవరిం చామని.. 2017 మే 15 లోపు రిజిస్టర్ చేసు కున్న బ్రాండెడ్ ఆహార ఉత్పత్తుల అమ్మకం దారులంతా 5% జీఎస్టీ చెల్లించాలని చెప్పారు.
పన్ను రిటర్నుల దాఖలుకు సవరించిన షెడ్యూల్..
రిటర్నులు పన్ను కాలం దాఖలుకు గడువు
జీఎస్టీఆర్–1 జూలై, 2017 10, అక్టోబర్, 2017
జీఎస్టీఆర్–2 జూలై, 2017 31, అక్టోబర్, 2017
జీఎస్టీఆర్–3 జూలై, 2017 10, నవంబర్, 2017
జీఎస్టీఆర్–4 జూలై–సెప్టెంబర్, 2017 18, అక్టోబర్, 2017
జీఎస్టీఆర్–6 జూలై, 2017 3, అక్టోబర్, 2017