German elections
-
సీడీయూ, సీఎస్యూ కూటమిదే జర్మనీ
బెర్లిన్: ఒలాఫ్ ష్కోల్జ్ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోవడంతో అనివార్యమైన జర్మనీ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్యూ) కూటమి ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందేసరికి సీడీయూ,సీఎస్యూ కూటమికి 28.6 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో సీడీయూ పార్టీ చీఫ్ ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి ఛాన్స్లర్ కావడం ఖాయమైంది. వలసలను తీవ్రంగా వ్యతిరేకించే అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీకి 20.8 శాతం ఓట్లు పడ్డాయి. గత మూడేళ్లుగా అధికారం చలాయించిన ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్డీపీ) ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. ఈ పార్టీకి కేవలం 16.4 శాతం ఓట్లు పడ్డాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నుంచి పురుడపోసుకుని పార్టీగా అవతరించిన ది గ్రీన్స్ పా ర్టీకి కేవలం 11.6 శాతం వచ్చాయి. ది సారా వాగెన్ కనెక్ట్–రీజన్ అండ్ జస్టిస్ పార్టీ (బీఎస్ డబ్ల్యూ) 4.97 శాతం ఓట్లు సాధించింది. 630 సీట్లున్న బండేస్టాగ్( జర్మనీ పార్లమెంట్)లో సీడీయూ, సీఎస్యూ కూటమి అత్యధికంగా 208 చోట్ల విజయం సాధించింది. ‘‘ అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీకి ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యాల నుంచి ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొని యూరప్ను ఐక్యంగా ఉంచేందుకు పోరాడతా’’ అని మెర్జ్ అన్నారు.సంకీర్ణ ప్రభుత్వం దిశగా..ఏ కూటమి/పార్టీకి స్పష్టమైన మెజారిటీరాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అధిక సీట్లు సాధించిన సీడీయూ, సీఎస్యూ కూటమి మూడో స్థానంలో వచ్చిన ఎస్డీపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వీలుంది. రెండోస్థానంలో వచ్చిన ఏఎఫ్డీ పార్టీకి సీడీయూ,సీఎస్యూ కూటమికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఒలాఫ్ షోల్జ్కు చెందిన ఎస్డీపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుందని వార్తలొచ్చాయి. అవస రమైతే నాలుగోస్థానంలో వచ్చిన గ్రీన్స్ పార్టీని ప్రభు త్వంలో కలుపుకోవాలని సీడీయూ, సీఎస్యూ కూటమి భావిస్తోంది. పెద్దపెద్ద షరతు లు పెట్టకుండా ఎస్డీపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కు కలిస్తే అంతా సవ్యంగా సాగుతుంది. లేదంటే ఏఎఫ్డీ పార్టీలోని నేతల కు ఎరవేసి తమ కూటమి లో కలుపుకునే ప్రయత్నా లను సీడీయూ, సీఎస్ యూ కూటమి ముమ్మరం చేయొచ్చు. గత మూడేళ్లుగా గ్రీన్స్, ఫ్రీ డెమొక్రటిక్ పార్టీతో కలిసి ఎస్డీపీ ప్రభుత్వాన్ని షోల్జ్ నడిపించారు. బలపడనున్న అమెరికాతో మైత్రిరష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న సీడీయూ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఉక్రెయిన్కు ఒక రకంగా సానుకూలమైన వార్త. మెర్జ్ సారథ్యంలోని సర్కార్ ఇకమీదటా ఉక్రెయిన్కు తగు రీతిలో ఆయుధ, ఆర్థిక సాయం చేసే వీలుంది. మరోవైపు జర్మనీ, అమెరికా సత్సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని మెర్జ్ సోమవారం స్పష్టంచేశారు. ‘‘ అమెరికా మాత్రమే ఎదగాలనే ‘అమెరికా ఫస్ట్’ నినాదం వాస్తవరూపం దాల్చితే అమెరికా ఒంటరి అయిపోతుంది. అలాకాకుండా ఇరుపక్షాలు లాభపడేలా జర్మనీ, అమెరికా బంధాన్ని బలపరుస్తా. అమెరికా సత్సంబంధాలను తెంచుకుంటే యూరప్ దేశాలు మాత్రమే దెబ్బతినవు. దాని విపరిణామాలను అమెరికా కూడా అనుభవించాల్సి ఉంటుంది’’ అని ఎన్నికల ముందస్తు ఫలితా లొచ్చాక తొలి మీడియా సమావేశంలో మెర్జ్ వ్యాఖ్యా నించారు. యూరప్ దేశాల కంటే దేశ స్వీయ ప్రయో జనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తున్న వేళ మెర్జ్ ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం. -
జర్మనీ విజేత ఎవరు?.. ఈసారి ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?
జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్యూ) కూటమి ఈసారి హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి. మరోవైపు 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడంతో ఉద్యమంగా మొదలై ఇప్పుడు అతివాద పార్టీగా ఎదిగిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీ సైతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జర్మనీలోకి పోటెత్తుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడం, ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించే సత్తా ఉన్న పార్టీకే ఈసారి ఓటర్లు పట్టంకట్టనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. బండేస్టాగ్(జర్మనీ పార్లమెంట్)లో అధికార పీఠంపై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నడూలేనంతగా జర్మనీలో జనసమ్మర్థ ప్రదేశాల్లో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. అక్రమ వలసదారులే ఈ దాడులకు పాల్పడుతున్నారన్న ఆగ్రహావేశాలు స్థానికుల్లో పెరిగాయి. దీంతో అక్రమ వలసదారుల కట్టడి, శరణార్థులుగా గుర్తింపునకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడం వంటి డిమాండ్లు ఓటర్లలో ఎక్కువయ్యాయి. మాన్హైమ్, జోలింగన్, మాగ్డీబర్గ్, అషాఫన్బర్గ్ నగరాల్లో దాడి ఘటనలతో అక్రమవలస ఇప్పుడు∙కీలకాంశమైంది. ఇటీవల మ్యూనిక్లో అఫ్గాన్ పౌరుడు వేగంగా కారు పోనివ్వడంతో జర్మనీ జాతీయురాలు, ఆమె రెండేళ్ల కూతురు తీవ్రంగా గాయపడిన ఘటనతో అక్రమ వలసదారుల కట్టడి అంశాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఈసారి ఐదుగురు ఛాన్స్లర్ పదవి కోసం పోటీపడుతున్నారు.ఫ్రిడిష్ మెర్జ్..క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) అధినేత ఫ్రిడిష్ మెర్జ్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపే వీలుంది. ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ సీడీయూ పార్టీలో చేరి పార్టీ నాయకత్వ పోరులో 2018లో మెర్కెల్, 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ‘‘ జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’’ నినాదంతో సీడీయూ చీఫ్గా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా’’ అని హామీలు గుప్పించారు.ఒలాఫ్ షోల్జ్..సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత అయిన ఒలాఫ్ షోల్జ్ ఇప్పటికే మూడేళ్లకు పైగా దేశ చాన్స్లర్గా సేవలందించారు. అయితే కూటమి సర్కార్ను నిలబెట్టుకోలేకపోయారు. రెండు నెలల క్రితం బలపరీక్షలో ఓడిపోయారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రత్యక్షంగా జర్మనీ ఆర్థికవ్యవస్థపై విపరిణామాలు చూపడంతో ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. అది చివరకు ప్రభుత్వం కూలడానికి కారణమైంది. గత ఏడాది జరిగిన విశ్వాస పరీక్షలో 733 మంది సభ్యులున్న సభలో కేవలం 207 ఓట్లు సాధించడం తెల్సిందే. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్ను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు.ఎలీస్ వీడెల్..2013లో ఏఎఫ్డీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ తరఫున చాన్స్లర్ పదవి కోసం 46 ఏళ్ల నాయ కురాలు ఎలీస్ వీడెల్ పోటీపడుతున్నారు. ఈమెకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల మ్యూనిక్కు వచ్చిన ప్పుడు ఈమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈమె కు యువతలో పెద్ద క్రేజ్ ఉంది. ‘‘వలసలు.. ఇమ్మిగేషన్కు విరుగుడుగా రిమిగ్రేషన్(తిరిగి పంపేయడం) తీసుకొస్తా. జర్మనీపై రష్యా ఆంక్షలను ఎత్తేసేలా కృషిచేస్తా. ధ్వంసమైన నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ను పునరుద్ధరిస్తా’’ అని ఎలీస్ పలు ఎన్నికల హామీ గుప్పించారు. రాబర్ట్ హబెక్..మూడు దశాబ్దాల క్రితం పర్యావరణ ఉద్యమంగా మొదలైన రాజకీయ పార్టీగా అవతరించిన ‘ది గ్రీన్స్/అలయన్స్ 90’ పార్టీకి సారథ్యం వహిస్తున్న 55 ఏళ్ల రాబర్ట్ హబెక్ సైతం చాన్స్లర్ రేసులో నిలిచారు. షోల్జ్ ప్రభుత్వంలో ఈయన వైస్ ఛాన్స్లర్గా, ఆర్థికశాఖ మంత్రిగా సేవలందించారు. ‘‘పునరుత్పాదక ఇంధన విధానాలకు పట్టం కడతా. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు సాయం కొనసాగిస్తా. అణువిద్యుత్ శక్తి ఉత్పత్తిని తగ్గిస్తా. పవన విద్యుత్కు పాతరేస్తా’’ అని ఎన్నికల హామీ ఇచ్చారు. సారా వాగెన్ కనెక్ట్రష్యాకు మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో బలమైన ఓటు బ్యాంక్ను సాధించిన ‘ది సారా వాగెన్ కనెక్ట్ –రీజన్ అండ్ జస్టిస్ పార్టీ(బీఎస్డబ్ల్యూ)’ సైతం చాన్స్లర్ పదవిపై కన్నేసింది. బీఎస్డబ్ల్యూ సహ వ్యవస్థాపకురాలు సారా వాగెన్ కనెక్ట్ తమ పార్టీ.. ఏఎఫ్డీకి అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నారు. ఏఎఫ్డీ తరహాలోనే అక్రమ వలసలపై బీఎస్డబ్ల్యూ పార్టీ ఉద్యమిస్తోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమని అంచనాలు వెలువడ్డాయి. ఓటింగ్ ఎలా చేపడతారు?18 ఏళ్లు దాటిన వారంతా ఓటేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 299 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం ఒక ఓటు వేయాలి. దేశంలో 16 రాష్ట్రాలు ఉండగా ఓటరు తన సొంత రాష్ట్రం కోసం మరో ఓటు వేయాల్సి ఉంటుంది. రెండో ఓటులో కనీసం 5 శాతం ఓట్లను సాధించిన పార్టీ సభ్యులకు నేరుగా పార్లమెంట్లో సభ్యత్వం కోరే అర్హత ఉంటుంది. సంస్కరించిన పోలింగ్ విధానాన్ని తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమలుచేయనున్నారు. దీంతో పార్లమెంట్లో ఇన్నాళ్లూ ఉన్న 733 సీట్లు తగ్గిపోయి 630కి చేరుకోనున్నాయి. అత్యధిక సీట్లను సాధించిన పార్టీ లేదా కూటమి నుంచి చాన్స్లర్ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం తాత్కాలికంగా అధికారంలో ఉంది. ఈసారి సీడీయూ, సీఎస్యూ కూటమి విజయం సాధించవచ్చని ఎన్నికల పండితులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ
బెర్లిన్: జర్మనీ ఎన్నికల్లో చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్కు చెందిన యూనియన్ కూటమి ఓట్ల వేటలో వెనుకబడింది. సోషల్ డెమోక్రాట్ పార్టీ స్వల్ప మెజారిటీ సాధించింది. మొత్తం 735 నియోజకవర్గాల్లో సోమవారం ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి సోషల్ డెమోక్రాట్లకు 25.7% ఓట్లు(206 సీట్లు), యూనియన్ కూటమికి 24.1%ఓట్లు(196 సీట్లు) పడ్డాయని ఎన్నికల అధికారులు చెప్పారు. తర్వాతి స్థానాల్లో ఉన్న గ్రీన్ పార్టీ 14.8%(118 సీట్లు), ఫ్రీ డెమోక్రాట్లు 11.5% ఓట్లు(92 సీట్లు)సాధించాయి. వైస్ చాన్సెలర్, ఆర్థిక మంత్రి సోషల్ డెమోక్రాట్ పార్టీ చాన్సెలర్ అభ్యర్థి ఒలాఫ్ షోల్జ్ ‘జర్మనీలో తాము ఒక మంచి, ఆచరణాత్మక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది ప్రజలిచ్చిన తీర్పు’అని అన్నారు. అయితే, చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కూడా ప్రయత్నిస్తామని యూనియన్ కూటమి పేర్కొంది. సోషల్ డెమోక్రాట్లు, యూనియన్ కూటమి కూటమి నేతలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, గ్రీన్ పార్టీ సోషల్ డెమోక్రాట్లవైపు, ఫ్రీ డెమోక్రాట్లు యూనియన్ కూటమి వైపు మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మాదిరిగా యూనియన్, సోషల్ డెమోక్రాట్లు కలిసి ‘గ్రాండ్ కూటమి’ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గతంలో మెర్కెల్ పాలనలో 12 ఏళ్లపాటు ఈ కూటమి ప్రభుత్వమే ఉంది. -
జర్మనీ పీఠం మళ్లీ మెర్కెల్దే?
బెర్లిన్: జర్మనీ పార్లమెంటుకు ఆదివారం జరిగిన ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 6.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నాయకత్వంలోని సీడీయూ-సీఎస్యూ -ఎఫ్డీపీ కూటమి మూడోసారి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఆమె నాయకత్వంలోని సంప్రదాయ, ఉదారవాద కూటమికి 45 శాతం ఓట్లు దక్కే సూచనలున్నాయి. ప్రతిపక్ష కూటమి (ఎస్డీపీ-గ్రీన్పార్టీ-లెఫ్ట్ పార్టీ)కి 44 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి.