Golla
-
విద్యతోనే గొల్ల, కురుమల అభివృద్ధి
కేయూ క్యాంపస్/చేర్యాల(సిద్దిపేట): గొల్ల, కురుమల్లో అనేకమంది ఇంకా ఆర్థికంగా వెనుకబాటులోనే ఉన్నారని, కుల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నవారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యతోనే వారి అభివృద్ధి జరుగుతుందని, గొల్ల, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో, సిద్దిపేట జిల్లా చేర్యాలలో దత్తాత్రేయ గౌరవార్థం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. హన్మకొండలో గోకుల్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళలు, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బలహీనవర్గాల కోసం ముద్ర రుణాలను ఇస్తోందని, గొల్ల, కురుమలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. ఒగ్గు కళలు అంతరించిపోకుండా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. శంషాబాద్లో ప్రియాంకారెడ్డి, వరంగల్లో మానసపై జరిగిన ఘటనలు దురదృష్టకరమని దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రియాంక హత్య ఉదంతం తనను కలచి వేసిందని చేర్యాల సభలో అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా చట్టాలు చేసేలా కృషి చేస్తానన్నారు. కాగా, హిమాచల్ప్రదేశ్లో పర్యటించేవారికోసం హైదరాబాద్లో త్వరలోనే ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. -
దళారుల దందా!
‘పక్క చిత్రం జగిత్యాల మండలం బాలపెల్లి గ్రామంలో పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలది. ఈ గ్రామంలో మొత్తం 89 యూనిట్లను మంజూరు చేసిన అధికారులు నెలక్రితం 27 మంది లబ్ధిదారులను తమవెంట గుంటూరు జిల్లా మాచర్లకు తీసుకెళ్లి గొర్రెలు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఒక్కో గొర్రెపిల్ల వయస్సు ఏడాది ఉండాలి. కానీ ఈ లబ్ధిదారుల్లో దాదాపు అందరికీ సగం నెల, రెండునెలల వయస్సున గొర్రె పిల్లలు, మిగిలిన సగం పెద్ద జీవాలు అందాయి. ప్రతి యూనిట్లో ఓ పొట్టెలు కచ్చితంగా ఉండాలి. కానీ 17 యూనిట్లకు కూడా ఒక్కపొట్టెలూ లేకుండానే గొర్రెలు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇచ్చిన గొర్రెలు కూడా ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక పంపిణీ చేసినవాటిలో చాలావరకు చనిపోయాయి. చెట్టె కొమురెల్లి, గుంటి పోశవ్వకు చెందిన రెండు యూనిట్లలో పది గొర్రె పిల్లలు చనిపోయాయి. వీరిద్దరు ఎక్కువగా నష్టపోయారు. అంతేకాదు.. మరో 20 యూనిట్లకు సంబంధించిన డీడీలు లబ్ధిదారుల వద్ద ఉన్నాయి. వారికి ఇంకా జీవాలు పంపిణీ కాలేదు..’ ‘కోరుట్ల మండలం యూసుఫ్నగర్కు చెందిన పలువురు గొల్లకుర్మలు గతేడాది నవంబర్లో ఓ పశువైద్యాధికారితో కలిసి ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్లారు. అక్కడ పశువైద్యాధికారి చూపించిన గొర్రెలు బలహీనంగా ఉండడంతో వాటిని తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీంతో సదరు వైద్యుడు వారిని అక్కడే వదిలేసి నాలుగు రోజులపాటు మాయమయ్యాడు. చివరకు లబ్ధిదారులు నేరుగా ఓ ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. ఆయన జిల్లా అధికారులకు సమాచారమిచ్చి మరో వైద్యుడిని అక్కడికి పంపగా.. లబ్ధిదారులను తిరిగి తీసుకొచ్చాడు. అదే నెలాఖరులో మళ్లీ కనిగిరి వెళ్లిన లబ్ధిదారులు తమకు నచ్చిన గొర్రెలు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. పై రెండు ఉదాహరణలు చాలు.. జిల్లాలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలు తీరును బేరీజు వేసేందుకు. సాక్షి, జగిత్యాల : అధికారుల వైఫల్యంతో సబ్సిడీ గొర్రెల పథకం జిల్లాలో అభాసుపాలైంది. పథకం అమలులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పథకం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జీవాలు ఇప్పించడంలో క్యాష్ టీం.. (లబ్ధిదారుల వెంట వెళ్లిన పశువైద్యులు), దళారులు కలిసి అవినీతికి పాల్పడినట్టు లబ్ధిదారులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నా రు. తమ గొర్రెలు విక్రయించినందుకుగానూ విక్రయదారుల వారినుంచి రూ.5వేల వరకు లంచం తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. అక్కడి పరిస్థితుల గురించి ఏమీ తెలియ ని తమను ఎటూ వెళ్లనీయకుండా చేసి వారికి నచ్చిన గొర్రెలు మాత్రమే చూపించి వాటిని మాత్రమే ఇప్పించారని బాధితులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం సబ్సిడీ మీద అందించే జీవాలు ఏడాది నిండి ఉండాలి. కానీ నెల, రెండు నెలలున్న గొర్రెల పిల్లలు, పొట్టేలు లేకుండా లబ్ధిదారులకు అంటగట్టడం పశువైద్యాధికారులకే చెల్లింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం అనుకూలించక వందల సంఖ్యలో గొర్రెల పిల్లలు చనిపోయాయి. దీంతో గొల్లకుర్మలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. మరోపక్క.. పక్క రాష్ట్రంలోని జిల్లాలకు లబ్ధిదారులను తీసుకెళ్లిన పశువైద్యాధికారులు వారు చూపించిన గొర్రెలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. జీవాలు బలహీనంగా ఉన్నా.. తమకు నచ్చకున్నా వాటినే తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. గత్యంతరం లేక సబ్సిడీ రూపంలో వచ్చిన గొర్రెలను కాదనకుండా జీవాలను తమ వెంట తీసుకొచ్చామని చెప్తున్నారు. ఉద్దేశమొకటి.. జరుగుతున్నదొకటి.. చితికిపోతున్న గొల్లకుర్మ కుటుంబాలకు చేయూతనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకాన్ని ప్రారంభించింది. గతేడాది ఏడాది ఏప్రిల్ 18న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో లబ్ధిదారులతో కలిసి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలు పర్యటించిన పశువైద్యాధికారులు జిల్లా వాతావరణాన్ని తట్టుకుని జీవించేలా అనువుగా ఉండే గొర్రెలను కొనుగోలు చేశారు. మహారాష్ట్ర జీవాలపై లబ్ధిదారులు అనాసక్తి చూపడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వినుగొండ, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, నెల్లూరు జిల్లా ఉదయగిరి, ప్రకాశం జిల్లా పామూరు, కనిగిరి ప్రాంతాల నుంచి గొర్రెల ను కొనుగోలు చేసి జిల్లాలో గొల్లకుర్మలకు అప్పగించారు. ఒక్కొ యూనిట్కు రూ.1.25 లక్షల చొప్పున ఇప్పటి వరకు 9,739 యూని ట్లు లబ్ధిదారులకు అందించారు. ఒక్కో యూని ట్కు ఇరవై గొర్రెలు.. ఒక పొట్టెలు చొప్పున ఇచ్చారు. ప్రతి యూనిట్కు సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.93,750 (75 శాతం) చొప్పున రూ.31 కోట్ల పైచిలుకు ఖర్చు చేసింది. మిగిలిన రూ.31,250 (25శాతం) లబ్ధిదారులు భరించారు. దీంతో పాటు ప్రతి జీవిపై ఏడాదిపాటు ఇన్సురెన్స్ చెల్లించారు. ఆ లోపు గొర్రె, పొట్టే చనిపోతే దానిస్థానంలో మరో జీవిని ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు గొర్రెలు ఇప్పించడంలో అధికారులు విఫలమయ్యారు. నిర్ణయించిన లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిదేమీ లేదు లబ్ధిదారుల ఇష్టం మేరకే సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశాం. ఇష్టం లేని ఎంతోమంది జీవాలు లేకుండానే తిరిగొచ్చారు. మరోసారి వారిని తీసుకెళ్లి ఇష్టం మేరకు జీవాలు ఇప్పించాం. గొర్రెలు ఇప్పించడంలో దళారుల ప్రమేయం లేదు. పొట్టేలు తక్కువగా ఉండడంతో పలు యూనిట్లకు ఇవ్వలేకపోయాం. -అశోక్రాజు, జిల్లా పశువైద్యాధికారి చిన్నపిల్లలు కొనిచ్చారు గొర్రెల పథకంలో లబ్ధిదారులు ఏరుకున్న గొర్రెలు కాకుండా నచ్చలేదని చెప్పినా వినకుండా 10 పెద్దవి, 11 చిన్న గొర్రెలు కొనిచ్చారు. ఇప్పటికే మూడు పిల్లలు చనిపోయాయి. అధికారులు చిన్న గొర్రెపిల్లలు వద్దని చెప్పినా పట్టించుకోకుండా కొనిచ్చారు. – చెట్టె బుచ్చయ్య, బాలపల్లి పొట్టేలు లేకుండానే ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసి ఇచ్చారు. 10 పెద్ద గొర్రెలు, 10 చిన్న పిల్లలు ఇచ్చారు. గొర్రెలు నచ్చలేదని చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడకు వచ్చేలోపు పిల్లలు చనిపోయాయి. నెల్లూరు జిల్లా మాచర్ల, కుంటాల ప్రాంతాల్లో వారే గొర్రెలను చూసి కొనుగోలు చేసి ఇచ్చారు. – ఏగుర్ల రెడ్డి, బాలపల్లి మేం చూసినవి వద్దన్నరు కర్నూలు గొర్రెలు బాగున్నాయి. అధికారులు కుదరవని, కుంటకు తీసుకెళ్లారు. చిన్నవి సగం, పెద్దవి సగం కొనివ్వడంతో కొంత మంది మి విధిలేక తీసుకున్నాం. కొంతమంది వాపస్ వచ్చారు. 20 యూనిట్ల లబ్ధిదారులు గొర్రెలు తీసుకోలేదు. – చెట్టె కొమురయ్య, బాలపల్లి -
ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోకాపేటలో గొల్ల, కురుమ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..గొల్ల, కురుమ జాతి అత్యధికంగా ఉన్న తెలంగాణ భారతదేశానికి దిక్సూచి కావాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 35 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వీటితో వేల కోట్ల సంపదను యాదవలు సృష్టించబోతున్నారన్నారు. పశువుల కోసం మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచి తెలంగాణ నుంచే గొర్రెలు ఎగుమతి అయ్యే పరిస్థితి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తామని సీఎం తెలిపారు. అదే పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి కేవలం 7 గంటలే విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
బీసీలకు అన్నిరంగాల్లో అవకాశాలు: కేసీఆర్
-
టీడీపీ నేత బాదన్న హత్య
కొడవళ్లు, కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు పోలీసుల అదుపులో నిందితులు...? పాత కక్షలు భగ్గుమన్నాయి. సూర్యోదయం వేళ విచ్చు కత్తులు పైకి లేచాయి. నెత్తురు రుచి మరిగిన వేటకొడవండ్లు సైతం గాలిని చీల్చుకుంటూ శరీర భాగాలను బలంగా తాకాయి. తప్పించుకునేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థులు చుట్టుముట్టి విచ్ఛణారహితంగా మారణాయుధాలతో దాడి చేయడంతో వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్, టీడీపీ సీనియర్ నేత బాదన్న హతమయ్యారు. ఘటనతో కళ్యాణదుర్గం ప్రాంతం ఉలిక్కిపడింది. కళ్యాణదుర్గం: నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత బాదన్న(65)ను గోళ్ల శివారులో ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. రోజువారి దినచర్యలో భాగంగా గురువారం తెల్లవారుజామున కళ్యాణదుర్గం రోడ్డులో వాకింగ్కు బయలుదేరిన అతను గ్రామ శివారులోని దురగమ్మ చెలిమి వద్దకు చేరుకోగానే మాటు వేసిన ప్రత్యర్థులు చుట్టుముట్టారు. కొడవళ్లతో తల, భుజంపై నరికారు. వీపుపై కత్తులతో పొడిచారు. బాదన్న కుప్పకూలి పోయాడు. అదే సమయంలో అటుగా బస్సు వస్తుండడంతో గమనించిన ప్రత్యర్థులు వెంటనే పారిపోయారు. విషయాన్ని బస్సులో వారు గ్రామస్తులకు తెలపడంతో హుటాహుటిన స్థానికులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే అతన్ని కళ్యాణదుర్గం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సలు అందేలోపు అతను మరణించాడు. పోస్టుమార్టం అనంతరం బాదన్న మృతదేహాన్ని గోళ్లకు చేర్చారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ టి.ఎస్. వెంకటరమణ, సీఐలు చలపతి, శివప్రసాద్ పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ ఉన్నతాధికారులతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని పదుల సంఖ్యలో ఎస్ఐలు, వందలాది మంది కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు, వజ్ర సిబ్బందితో గోళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను మల్లాపురం గ్రామ రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానితుల్లో గోళ్లకు చెందిన ఒకరు, కర్ణాటకలోని ఓబుళాపురం, తిప్పారెడ్డిపల్లికి చెందిన ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. భూతగాదాలే కారణమా? భూతగాదాలే బాదన్న హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. గోళ్ల గ్రామానికి చెందిన వ్యక్తికి కుటుంబసభ్యులతో భూ తగాదాలు ఉన్నాయి. ఈ విషయంపై బాదన్న పంచాయితీ నిర్వహించి, న్యాయ పరిష్కారం చూపినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇదే విషయంపై తనకు న్యాయం చేయాలంటూ సదరు వ్యక్తి మంత్రి కాలవ శ్రీనివాసులును ఇటీవల కలిసి విన్నవించుకోగా, బాదన్న వద్దకెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో బాదన్నపై కక్ష పెంచుకున్న అతను కర్ణాటకలోని తన బంధువులతో కలిసి హత్యకు పథకం వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బాదన్న హత్యను ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన కుమారుడు మారుతీ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రామాంజినేయులు పలువురు టీడీపీ నేతలు ఖండించారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో వనజ (22) అనే యువతి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించింది. వనజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వనజ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వనజ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వనజ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.