GRAB
-
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?
దుబాయ్: దూకండి... దూకండి... బయటకు దూకండి! లగేజీని వదిలేయండి...ముందు మీరు బయటపడండి, బయటకు జారిపోండి! తిరువనంతపురం నుంచి దూబాయ్కి చేరుకున్న ఎమిరేట్స్ విమానం బుధవారం విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఇవి. ఓ పక్క ప్రమాదం ముంచుకొస్తున్నా ప్రయాణికులు మాత్రం తమ లగేజీలను వెంట తీసుకెళ్లేందుకే ప్రయత్నించిన విషయం తెల్సిందే. కొంత మంది తమ ఖరీదైన లాప్టాప్ల గురించి వెతుక్కోవడం కూడా ఓ వీడియో ఫుటేజ్లో కనిపించింది. ఇలాంటి విపత్కర సమయాల్లో 90 సెకండ్లలో విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించడం విమానం సిబ్బంది బాధ్యత. ఎందుకు ఇలా 90 సెకండ్లలోనే ఖాళీ చేయించాల్సి ఉంటుందంటే. ఆ తర్వాత విమానంలో మంటలు తీవ్రమవుతాయనే విషయాన్ని పలు అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు వైమానిక నిపుణుడు ఆశ్లీ న్యూన్స్ తెలిపారు. అందుకనే ఎమిరేట్స్ విమాన సిబ్బంది నిర్దేశిత సమయంలో ప్రయాణికులను ఖాళీ చేయించేందుకు అవసరమైన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. చివరకు తమ లగేజీలను తీసుకొని ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేశారు. అందుకు నిమిషంపైనే పట్టింది. రన్వేపై జారిపోతున్న విమానం ఇంజన్ నుంచి మంటలు చెలరేగడం కూడా 1.23 సెకండ్ల వీడియో ఫుటేజ్లో కనిపించింది. అంటే అర నిమిషం లేటైనా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలేసేవే. ఇలా ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా మానవులు తమ బ్యాగ్లు, లాప్ట్యాప్లు, పాస్పోర్టులు, పర్సులు, ఇంటి తాళం చేతుల కోసం ఎందుకు వెతుకుతారు? ప్రాణంకన్నా వస్తువులపై మమకారం ఎక్కువా? ఒక్క ఎమిరేట్స్ విమానం విషయంలోనే ఇది జరగలేదు. గతేడాది సెప్టెంబర్ నెలలో బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన విమానం లాస్ వెగాస్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా ప్రయాణికులు ఇలాగే వ్యవహరించారు. 2013, జూలై నెలలో ఆసియాన విమానం శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో క్రాష్ ల్యాండింగ్కు గురైనప్పుడు కూడా ప్రయాణికులు తమ లగేజ్ల కోసం ఇలాగే వెంపర్లాడడం కనిపించింది. మానవుడి నైజమే ఇంత! అని ఒక్కమాటలో సమాధానం చెప్పవచ్చునేమోగానీ ఈ విషయంలో మానవ మేథస్సుపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను కంప్యూటర్ ద్వారా విశ్లేషించడం సాధ్యం కాదు. ఎందుకంటే జీవన్మరణ సమస్యను అందులో సృష్టించలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఎమిరేట్స్ విమానం ఫుటేజ్ వైమానిక సిబ్బంది ‘సేఫ్టీ డ్రిల్స్’కు ఎంతో ఉపయోగపడగలదు. ఇక ముందు ప్రయాణికులకు కూడా ఎలాంటి శిక్షణ ఇవ్వాలో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. -
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?
-
'ఎస్ఆర్సీసీ'లో తమిళనాడు విద్యార్థుల ప్రభంజనం!
న్యూఢిల్లీః దేశ రాజధాని నగంరంలో విద్యావిధానంలోనే తనకంటూ ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకొని, స్థానిక విద్యాలయాలకు దీటుగా ప్రత్యేక గౌరవాన్ని పొందుతున్న ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఇప్పుడు తమిళనాడు విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. భారతదేశంలోనే కామర్స్ విద్యకు నెలవుగా ప్రఖ్యాతి పొందిన ఎస్ఆర్సీసీ.. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లో భాగంగా బీకాం హిస్టరీ, ఎకనామిక్స్ లను విద్యార్థులకు అందిస్తోంది . అటువంటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఢిల్లీ యూనివర్శిటీ సారధ్యంలోని ఎస్ఆర్సీసీ కళాశాలలో సీటు పొందాలంటే కటాఫ్ మార్కులు 98 శాతం దాటాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఒక్క తమిళనాడుకు చెందిన విద్యార్థులే 75 నుంచి, 80 శాతం సీట్లను కైవసం చేసుకొని కళాశాల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీశారు. ఇప్పటివరకూ భర్తీ చేసిన సీట్లలో మరి కొందరు కేరళకు చెందినవారు ఉన్నట్లుగా సిబ్బంది చెప్తున్నారు. స్థానిక విద్యాలయాలకే తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో తమిళనాడు విద్యార్థుల హవా కొనసాగింది. ఈ విద్యాసంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్లు ఇచ్చేందుకు కళాశాల నిర్వహించిన మొదటి రెండురోజుల డ్రైవ్ లో తమిళనాడుతోపాటు అత్యధికంగా కేరళ విద్యార్థులు కూడ ఎన్ రోల్ చేసుకున్నారు. కామర్స్ ఎడ్యుకేషన్ అంటే దేశంలోనే మొదటిగా గుర్తుకొచ్చే శ్రారామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో సీటు సంపాదించడం ఎంతో కష్టం. అటువంటిది ఇప్పుడు 75 నుంచి 80 శాతం సీట్లు కేవలం తమిళనాడు విద్యార్థులే కైవసం చేసుకోవడం కళాశాల సిబ్బందినే ఆశ్చర్యపరుస్తోంది. తమ సర్వీసులో ఇటువంటి అనుభవం ఎప్పుడూ జరగలేదని సిబ్బంది చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇచ్చిన అడ్మిషన్లలో 80 శాతం వరకూ తమిళనాడునుంచి వచ్చినవారే ఉన్నారని, మిగిలినవారిలో కొందరు కేరళ బోర్డుకు చెందిన విద్యార్థులు కూడ ఉన్నారని ఎస్ఆర్సీసీ కళాశాల అడ్మిషన్ ఇన్ ఛార్జ్ అనిల్ కుమార్ తెలిపారు. ఢిల్లీ యూనివర్శీటీ స్టేట్ బోర్డ్స్ నుంచి వచ్చే విద్యార్థుల మార్కుల విషయంలో ఎటువంటి నిబంధనలు విధించలేదన్నారు. ఇప్పటివరకూ 339 మంది విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, ఫీజు చెల్లించటంకోసం యూనివర్శిటీకి కూడ పంపించినట్లు అనిల్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా బికాం హిస్టరీలో అడ్మిషన్లకోసం తమిళనాడునుంచి అత్యధికశాతం విద్యార్థులు వచ్చారని, కేవలం ఒకే రాష్ట్రంనుంచి ఇంతమంది విద్యార్థులు అడ్మిషన్లకు పోటీపడటం కళాశాల చరిత్రలోనే చూడలేదని ఎస్ఆర్సీసీ కాలేజీ అధికారులు కొందరు చెప్తున్నారు. అయితే ఈయేడు ఇప్పటివరకూ తాము అడ్మిషన్లు ఇచ్చినవారిలో అత్యధిక మార్కులున్న విద్యార్థిని కేరళ బోర్డుకు చెందిన ఎలిజబెత్ థామస్ అని తెలిపారు. అడ్మిషన్లకు మరో రోజు మాత్రమే గడువు ఉందని, ఒకవేళ పూర్తిశాతం సీట్లు భర్తీకాని పక్షంలో రెండో లిస్టును తయారు చేయడం గాని, లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందినవారికి అవకాశం ఇవ్వడంగాని జరుగుతుందని కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం తమిళనాడు బోర్డు అత్యధికశాతం మార్కులను స్కోర్ చేసిందని, అందుకే ఎస్ఆర్సీసీలో ఇప్పుడు అధికశాతం తమిళనాడు విద్యార్థులకు అడ్మిషన్లు లభించాయని కళాశాల ఫ్యాకల్టీ మెంబర్ ఒకరు తెలిపారు. తమిళనాడు బోర్డులో 99 శాతం మార్కులు దాటినవారే అధికంగా ఉన్నారని, అటువంటప్పుడు కాంపిటేషన్ లో వారు ముందుండటం సహజమేనన్నారు. దీన్నిబట్టి చూస్తే విద్యాభ్యాసానికి ఢిల్లీ సరైన ప్రాంతం అని మరోసారి రుజువైందని తెలిపారు. -
టాక్స్ రిటర్న్స్ దాఖలుకు చివరి అవకాశం
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. పెండింగ్ టాక్స్ రిటర్న్స్ క్లియర్ చేయడానికి ప్రత్యక్షపన్నుల శాఖ మరో చివరి అవకాశాన్ని ప్రకటించింది. గత ఆరేళ్లుగా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయనివారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. 2009 నుంచి 2016 వరకు ఇంకా తమ టాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయనివారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) మరో అవకాశం కల్పిస్తోంది. ఈ మొత్తం ఆరేళ్లకు కలిపి ఒకేసారి రిటర్న్స్ దాఖలు చేయడానికి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. ఈలోగా తమ రిటర్స్ ను ఫైల్ చేయాలని, లేదంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది. అంతేకాదు ఇదే చివరి అవకాశమని కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే ఆన్ లైన్ లో రిటర్న్స ఫైల్ చేసిన వారు 'ఐటీఆర్ ధ్రువీకరణ' (ఐటిఆర్ -వెరిఫికేషన్) పత్రాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది. ఆదాయం పన్ను శాఖ బెంగళూరు ఆధారిత సేకరణ కేంద్రం నుంచి ఐటీఆర్-వి రసీదు కాపీ 120 రోజుల లోపుల పన్ను చెల్లింపుదారులకు చేరాలని, ఒకవేళ చేరకపోతే ఆ చెల్లింపును చెల్లనిదిగా పరిగణిస్తారని పేర్కొంది. కావాలంటే ఐటీఆర్ వీ స్టేటస్ ను టాక్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికి పాన్ నెంబర్, సంబంధిత అంచనా సంవత్సారాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రయోజనం పొందాలని టాక్స్ ప్లానర్.కామ్ ప్రతినిధి సుధీర్ కౌశిక్ తెలిపారు. ఇపుడు ఫైల్ చేయకపోతే, రిఫండ్స్ ప్రాసెస్ చేయడం జరగదన్నారు. వీటిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి అనుమతి ఉండదని కౌశిక్ వివరించారు. మరోవైపు ఇపుడు విఫలమైతే మొత్తం అన్నిసంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటారని, కనీసం రూ. 5,000 జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అందుకే మరింత ఆలస్యం లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కాగా గత ఏడాది ఆధార్ కార్డు ద్వారా ఐటీఆర్-వీ, ఓటీపీ వెరిఫికేషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకునేలా ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5 శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి. -
దేవలయ భూముల్ని కబ్జా చేశారు!
-
కబ్జాలో పోలీసు భూమి
-
జలాశయాలు.. కబ్జా!
మొయినాబాద్, న్యూస్లైన్: హైదరాబాద్ మహానగరంతోపాటు జిల్లాలోని మొయినాబాద్ మండలానికి నీరందించే గండిపేట (ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్ జలాశయాలకు ముప్పు ముంచుకొస్తోంది. వీటిని క్రమంగా అక్రమార్కులు చెరబడుతున్నారు. దీంతో ఈ రెండూ.. రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక ఓ వైపు, ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్- జలాశయం నిండినప్పుడు విస్తరించే భాగం) పరిధి లో రిసార్టులు, ఫాంహౌస్ల నిర్మాణాలు జలాశయాల ఉనికికే ప్రమాదం తెస్తున్నాయి. జంట జలాశయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం జారీచేసిన 111 జీఓ అక్రమార్కుల ఆగడాలను నియంత్రించలేకపోతోంది. యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఏమిటి ఆపద? జంట జలాశయాల్లో దశాబ్దాల నుంచి పూడిక తీయలేదు. యేటా వరద నీటితోపాటు పూడిక వచ్చి చేరుతోంది. దీంతో వీటి నీటి నిల్వ సామర్థ్యం బాగా తగ్గిపోయింది. గండిపేట జలాశయం నిర్మించినప్పుడు దాని పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 5.5టీఎంసీలు. ప్రస్తుతం అది 3.9టీఎంసీలకు పడిపోయింది. ఇక హిమాయత్సాగర్ జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 3.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.9 టీఎంసీలకు తగ్గిపోయింది. కబ్జాల మాటేంటి? జంటజలాశయాల పరిధిలో శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. ఇప్పటికే రెండు జలాశయాల పరిధిలో సుమారు 340 ఎకరాల శిఖం భూమి కబ్జాలకు గురైనట్లు తెలుస్తున్నది. జలాశయాల్లో నీళ్లు లేనప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పట్టా భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకోవాలి. కానీ అలాంటి పట్టాభూములను చాలామంది ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందినవారికి అమ్మేశారు. ఆ భూముల్లో వారు రిసార్ట్స్, ఫాంహౌస్లు నిర్మించుకున్నారు. మరికొన్ని భూములు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో జలాశయాల విస్తీర్ణం తగ్గి వాటి రూపురేఖలే మారిపోతున్నాయి. ప్రస్తుతం గండిపేట జలాశయం విస్తీర్ణం 24.74 చదరపు కిలోమీటర్లు కాగా హిమాయత్సాగర్ జలాశయం విస్తీర్ణం 28.16 చదరపు కిలోమీటర్లు. 111 జీఓ.. ఏం చెబుతోంది? జంట జలాశయాల పరిరక్షణ కోసం 1996లో ప్రభుత్వం 111 జీఓను జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం జలాశయాల ఎగువ భాగంలోని పరీవాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదు. కానీ ఈ నిబంధనలను అక్రమార్కులు గాలికి వదిలేశారు. ఇప్పటికే జలాశయాల సమీపంలో వందల సంఖ్యలో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఫాంహౌస్లు, రిసార్టులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి, అక్రమ లేఅవుట్లు, వెంచర్లు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఏం చేస్తున్నారు? గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో శిఖం భూమి కబ్జాకు గురవుతున్నా, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. రిసార్ట్స్లు, ఫాంహౌస్లు వెలుస్తున్నా ఇటు జలమండలి గానీ, అటు రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. జలాశయాల్లోకి పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చినా ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన రిసార్ట్స్లు, ఫాంహౌస్లలోకి నీళ్లు రాకుండా మట్టి పోసి ఎత్తు పెంచేసుకుంటున్నారు. జలాశయాలను ఆనుకుని జరుగుతున్న నిర్మాణాలన్నీ బడాబాబులవే కావడంతో అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
యువకుడి ఔదార్యం
అప్పలఅగ్రహారం(సంతకవిటి), న్యూస్లైన్ : ఖాళీ స్థలం కనిపిస్తే చాలు..కబ్జా చేసే రోజులివి. అలాంటిది సొంత స్థలాన్ని ఒక సామాజిక అవసరానికి విరాళంగా ఇవ్వడం నిజంగా ఉదాత్త నిర్ణయమే. అదీ పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఒక యువకుడు ఈ నిర్ణయం తీసుకోవడం.. దానికి సాక్షి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన జనసభ వేదిక కావడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత కొన్నాళ్లుగా గ్రామాల్లో జనసభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సంతకవిటి మండలం అప్పల అగ్రహారంలో బుధవారం జరిగిన జనసభలో పలువురు యువకులు, వివేకానంద యూత్ సంస్థ సభ్యులు గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సభలో పాల్గొన్న ఎంపీడీవో ఎల్.త్రినాథరావును కోరారు. ఆయన స్పందిస్తూ స్థలం సమస్యగా ఉందని, ఎవరైనా స్థలం చూపిస్తే గ్రంథాలయం ఏర్పాటుకు వెంటనే నిధులు మంజూరు చేస్తానన్నారు. దాంతో సభలోనే ఉన్న చిగులపల్లి ఉపేంద్రనాయుడు అనే యువకుడు కలగజేసుకొని ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన స్థలంలో గ్రంథాలయానికి ఎంత అవసరమైతే అంతా ఇస్తానని సభా ముఖంగా ప్రకటించాడు. ఆ విషయం లిఖితపూర్వకంగా తెలియజేయాలని, పంచాయతీ సర్పంచ్ ఆమోద పత్రం కూడా కావాలని అధికారులు సూచించడంతో.. అక్కడికక్కడే పెద్దలు, సభలో పాల్గొన్న ప్రజల సమక్షంలో స్థలం విరాళంగా ఇస్తానని రాసి ఇచ్చాడు. అక్కడే ఉన్న సర్పంచ్ దవళ సీతమ్మ కూడా వార్డు సభ్యులందరితో మాట్లాడి పంచాయతీ తరఫున త్వరలోనే ఆమోద పత్రం ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఉపేంద్రనాయుడు డిగ్రీ వరకు చదువుకున్నా.. తనకున్న ఐదారు ఎకరాల భూమినే సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనలాంటి చదువరుల కోసం గ్రంథాలయం ఏర్పాటుకు ఆయన ఉదారంగా ముందుకు రావడం ముదావహమని.. సాక్షి జనసభ వల్లే దీర్ఘకాల సమస్య పరిష్కారమైందని వివేకానంద యూత్ సభ్యులు సీహెచ్ సత్యనారాయణ, ఎ.రమేష్, డి.శ్రీనివాసరావు, జి.తవిటినాయుడు, ఇతర గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.