Advertisement
Groundnut peasants
-
తొలకరి ఆశలతో సాగుకు సన్నద్ధం
►ఈసారీ అడపాదడపా చినుకులు ►అన్నదాతలో మొలకెత్తిన ఉత్సాహం ►వెంటాడుతున్న విత్తన కొరత ►వేరుశనగ రైతాంగం ఆందోళన దశాబ్దకాలంగా ఏటా నష్టాలు చవిచూస్తున్న జిల్లాలోని వేరుశనగ రైతులు ఈ ఏడాది ఖరీఫ్పై ఆశలు పెంచుకుంటున్నారు. అయితే తొలకరి జల్లుగా పలకరించి.. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేస్తుండడంతో సాగుపై సందిగ్ధత నెలకొంది. గతేడాది ప్రభుత్వం రెయిన్గన్లతో పంటలను రక్షిస్తామంటూ ఊదరగొట్టినా చివరికి ఫలితం మా త్రం తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. అయితే ప్రస్తుతం ఊరిస్తున్న కారుమబ్బులతో ఈ ఏడాది పంటకు పెట్టుబడి, విత్తనాల కోసం రైతులు వెతుకులాటను ప్రారంభించారు. ప్రభుత్వం మాత్రం సగం పంటకు సరిపోయే విత్తనాలను మాత్రమే సబ్సిడీపై అందించనుంది. చిత్తూరు (అగ్రికల్చర్): ఏటా ఖరీఫ్ సీజనులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా జిల్లాలోని రైతులు పంట నష్టపోతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో వేరుశనగ పంటసాగుకు పూనుకుంటు న్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే తొలకరి పలకరించడంతో ఎంతో ఉత్సాహంగా వేరుశనగను సాగుచేయడం, ఆఖరికి నష్టాలను చవిచూడడం పరిపాటైపోయింది. అదే తరహాలోనే గత రెండు వారాలుగా జిల్లాలో అడపాదడపా తొలకరి చినుకులు పలకరిస్తున్నాయి. నిత్యం కారుమబ్బులతో వరుణుడు దోబూచులాడుతుండడంతో రైతుల్లో సాగుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. జిల్లాలోని రైతులు ఏటా ఖరీఫ్ సీజన్లో వర్షాధార వేరుశనగను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తారు. అత్యధికంగా పడమటి మండలాల రైతులు ఈ పంటను సాగుచేయడం పరిపాటి. తూర్పున 15 మండలాలు మినహా మిగిలిన 51 మండలాల్లో 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో రైతులు వేరుశనగ పండిస్తారు. సకాలంలో వర్షాలు కురిస్తే జూన్ 7 నుంచి ప్రారంభమయ్యే మృగశిర కార్తె, జూన్ 22 నుంచి ప్రారంభమయ్యే ఆరుద్రకార్తెలో వేరుశనగను విత్తడం పూర్తి చేస్తారు. ఈ సమయంలో విత్తిన పంటల నుంచి దిగుబడి ఆశించిన మేరకు రావడం జరుగుతుంది. ఇందుకు అనుగుణంగానే ఈ ఖరీఫ్కు గాను గత పదిరోజులుగా జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు ఓ మోస్తరుగా కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో వేరుశనగ పంట సాగుపై ఆశలు చిగురించాయి. గతఏడాది తీవ్ర నష్టం 2015 నవంబరులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని రైతులు రబీ సీజనులో పంటలను ఎంతో ఉత్సాహంగా సాగు చేశారు. తరువాత 2016 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో వేరుశనగ పంటను జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 1.21 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. అయితే ఆగస్టు మొదటి వారం నుంచి పూర్తిగా వరుణుడు కనుమరుగయ్యాడు. తీవ్ర వర్షాభావం ఏర్పడడంతో రైతులు విత్తిన వేరుశనగ గింజలు నేలపాలయ్యేయే గానీ, పంట చేతికందలేదు. ఫలితంగా జల్లా రైతులకు ఈ ఖరీఫ్కు విత్తేందుకు అవసరమైన విత్తన కాయలు కూడా లేకుండా పోయాయి. విత్తనాల కోసం అన్వేషణ ప్రారంభం ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తన కాయల కోసం రైతులు అన్వేషణ ప్రారంభించారు. హెక్టారు విస్తీర్ణంలో విత్తేందుకు గాను 150 కిలోల వేరుశనగ కాయలు అవసరం. జిల్లాలో మొత్తం 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో విత్తేందుకు గాను దాదాపు 2.04 లక్షల క్వింటాళ్ల వేరుశనగ కాయలు అవసరం ఉంది. ఏటా ప్రభుత్వం సబ్సిడీపై అందించే వేరుశనగ కాయలుతో పాటు రైతులు తమ వద్ద ఉండే కాయలను కూడా కలుపుకుని విత్తేవారు. అయితే గత ఏడాది ఏమాత్రం పంట చేతికందని కారణంగా రైతులకు విత్తన కాయలు కూడా చేతికందలేదు. ప్రభుత్వం మాత్రం ఈ ఖరీఫ్కు జిల్లాకు 84,500 కింటాళ్ల వేరుశనగ కాయలు మాత్రమే కేటాయించింది. దీంతో రైతులు విత్తన కాయలు కోసం వెదుకులాట ప్రారంభించారు. భారీగా విత్తన కాయల ధరలు.. రైతులు వేరుశనగ విత్తన కాయల కోసం ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పక్క జిల్లాల నుంచి తెప్పిస్తున్నామంటూ, కిలో కాయలు రూ. 50 నుంచి రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ విత్తేందుకు గాను కాయలకే రూ. 3 వేల నుంచి రూ. 3,600 వరకు వెచ్చించాల్సి ఉంది. దీనికితోడు దుక్కులు దున్నేందుకు గాను ట్రాక్టర్కు గంటకు రూ. 600 నుంచి రూ. 800 వరకు Ðð చ్చించాలి. అదేగాక జిప్సం, కూలీలు తదితరాలు కలిపి ఖర్చులు మోపెడవుతున్నాయి. ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి పంట సాగు చేసినా ఆశించిన మేరకు దిగుబడి అందుతుందనే నమ్మకం రైతుల్లో ఏమాత్రం లేదు. అధిక మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సి రావడంతో ఈ ఖరీఫ్కు వేరుశనగ సాగయ్యేనా..? అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అదుకోవాలి వేరుశనగ సాగు చేయాలంటే పెట్టుబడులు అధిక మొత్తంలో పెట్టాలి. గతేడాది తీవ్ర నష్టం వాటిళ్లడం వల్ల ప్రస్తుతం రైతుల వద్ద విత్తనకాయలు లేవు. దీనికితోడు ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం వేరుశనగ రైతులను ఆదుకోవాలి. సబ్సిడీ కాయలు రైతులకు కావలసిన మేరకు అందించాలి. -
విపత్తేనా..!
⇒జిల్లాలో 70 శాతం మేరకు కే–6 వేరుశనగ విత్తనాల కేటాయింపు ⇒ఆగస్టు బెట్టను తట్టుకోలేకపోతున్న కదిరిరకం ⇒ఈ కారణంగానే ఏటా నష్టాలంటున్న రైతులు ⇒సొంత విత్తనాల వైపు మొగ్గు ఏటా కే–6 రకం విత్తనాలతో వేరుశనగ రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం మాత్రం తన మొండివైఖరి మార్చుకోవడం లేదు. శాస్త్రవేత్తల సూచనలను సైతం పెడచెవిన పెడుతూ ఈ ఏడాది కూడా ఇదే రకం విత్తనాలను దాదాపు 70 శాతం మేరకు విక్రయించేం దుకు సిద్ధమైంది. ఫలితంగా ఈసారీ దిగుబడి అంతంతమాత్రమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక సొంత విత్తనాలతోనే సాగుకు సన్నద్ధమవుతున్నారు. పలమనేరు: ప్రభుత్వం గతేడాది రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు రైతులను నట్టేట ముంచేశాయి. అధికారుల నిర్లక్ష్యంతో కరువుకు తట్టుకోలేని, పెద్దగా నాణ్యత లేని కే–6(కదిరి–6) విత్తనాలను సర్కారు అందజేసింది. వర్షాభావ పరిస్థితులను తట్టుకోలేక ఈరకం చెట్లు భారీగా చనిపోయాయి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశనగ రైతులు నష్టాలపాలయ్యారు. ఈదఫా కూడా కే–6 రకం విత్తనకాయలనే రైతులకు అందజేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది కే–6 విత్తనాలను వేసి చేతులు కాల్చుకున్న రైతులు ఈదఫా సొంతవిత్తనాలవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి ఈదఫా ఖరీఫ్లో వేరుశనగ సాగు 1.20 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇందుకోసం వ్యవసాయశాఖ 90 వేల క్వింటాళ్ల విత్తనకాయలను పంపిణీ చేసేందుకు అధికారులు అలాట్మెంట్ సిద్ధం చేశారు. ఈనెల 15 నుంచి జిల్లాలోని పంపిణీ కేంద్రాలకు స్టాకు చేరనుంది. ఆపై కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ సమావేశమై విత్తనాల పంపిణీ తేదీని ఖరారు చేయనున్నారు. ఏటా నాణ్యత ప్రమాణాలు గాలికే.. ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి–6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. మా మూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలి స్తే దాదాపు 70 గ్రాముల గింజలు బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. దీంతోపాటు సీడ్ జర్మినేషన్ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. లోడ్ల వారీగా ఇక్కడికందే విత్తన కాయలను చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబరేటరీ లో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. కానీ ఇదంతా పేరుకుమాత్రమే. గతేడాది కూడా విత్తన పరీక్షలు తూతూమంత్రంగానే జరిగాయి. కనీసం ఈ సారైనా జరుగుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు. గతేడాది రైతులకు దాదాపు 300 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆగస్టు బెట్టను కే–6 తట్టుకోదు.. వర్షాభావానికి తట్టుకోని కే–6 ఈ ప్రాంతానికి సరిపోదని ఇప్పటికే వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపింది. గతంలో కూడా వ్యవసాయశాఖ ఈ సమస్య కారణంగానే ఈ ప్రాంతంలో కే–6ను పంపిణీ చేయలేదు. కానీ తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం కొన్నేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు పంట చేతికందలేదు. ముఖ్యంగా ఆగస్టులో వచ్చేబెట్ట ( డ్రై స్పెల్స్)ను ఈ రకం తట్టుకోదు. అప్పట్లోనే పలువురు రైతులు ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇదంతా పైస్థాయిలో జరిగే ప్రక్రియ అంటూ చేతులు దులుపుకున్నారు. దీంతో రైతులు సొంత విత్తనాలవైపు మొగ్గు చూపుతున్నారు. శాస్త్రవేత్తలు సూచించినా పట్టించుకోలేదు.. రెండేళ్ల క్రితం వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు కుప్పం మండలంలోని పీబీ నత్తం, వి.కోట మండలంలోని కొమ్మరమడుగు, శాంతిపురం మండలం లోని అబకలదొడ్డిలలో కే–6 పంట నష్టంపై పంటకోత ప్రయోగాలను చేపట్టింది. ఇందులో 250 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు దిగుబడి వచ్చినట్టు తేల్చారు. అంటే ఎకరాకు 40 కిలోల మాత్రమే వచ్చినట్టు. దీని ఆధారంగా 90 శాతం పంట నష్టపోయినట్టు వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఇదే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన ధరణి, నారాయణి రకాలు బెట్టను తట్టుకుని మంచి దిగుబడిని ఇవ్వడాన్ని గుర్తిం చారు. దీంతో ధరణి తదితర రకాలను ఈదఫా రైతులు పంపిణీ చేయాలని సూచించారు. కానీ అధికారులు ఈ దఫా 70శాతం కే–6 మిగిలిన 30శాతం మాత్రమే ధరణి, ఐసీజీఎస్–91114ను అందజేయనున్నట్టు తెలిసింది.