group-2 mains exam
-
గ్రాడ్యుయేట్లను నమ్మలేం.. టీచర్లను ‘చూడండి’
సాక్షి, అమరావతి: మరో మూడ్రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో టీడీపీ కూటమిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రెండ్రోజుల క్రితం జరిగిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష సందర్భంగా చెలరేగిన నిరుద్యోగుల ఆగ్రహజ్వాల రాష్ట్రవ్యాప్తంగా ఎగసిపడుతుండడమే ఇందుకు కారణం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ఎన్డీఏ కూటమి నేతలు టీచర్లకు వల వేస్తున్నారు. ఉద్యోగులుగా ప్రభుత్వ పక్షాన ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా టీచర్ల ఓట్లతో గెలవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. కృష్ణా–గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం టీచర్లనే టార్గెట్ చేశారు. ఒక్కో కుటుంబంలో కనీసం ముగ్గురు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారన్న అంచనాతో ముందుకెళ్తున్నారు. బాయ్కాట్ ఎలక్షన్.. బాయ్కాట్ కూటమి.. 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని, గ్రూప్–2 రోస్టర్లో తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, తమ ప్రభుత్వం ఏర్పడగానే ఈ తప్పును సరిచేసి న్యాయం చేస్తామన్నారు. ఇదే అంశంపై టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేపాడ చిరంజీవి తనకు ఓటువేసి గెలిపిస్తే ఈ సమస్యపై పోరాడతానంటూ యువతను ఆకట్టుకున్నారు. దీంతో ఉద్యోగార్థులంతా చిరంజీవిని గెలిపించారు.అయితే.. గెలిచాక అదే వ్యక్తి గ్రూప్–2 రోస్టర్లో తప్పుల్లేవని చెప్పడంతో గ్రాడ్యుయేట్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గత మూడు వారాలుగా ఆందోళన బాట పట్టారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయరాదని నిరుద్యోగులు గట్టిగా నిర్ణయించుకుని ‘బాయ్కాట్ ఎలక్షన్.. బాయ్కాట్ కూటమి అభ్యర్థి’ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ల నుంచి ఓట్లుపడే ఛాన్స్లేదని భావించిన టీడీపీ కూటమి తాజాగా టీచర్లను టార్గెట్ చేసింది. ‘మా ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుంది. తర్వాత మీ ఇష్టం’ అంటూ వారిని భయపెడుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ సంఘాలు ఈ బాధ్యత తీసుకుని టీచర్లతో ఓట్లు వేయించాలని చెబుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్ల ఫైర్.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వ వంచనపై గ్రాడ్యుయేట్స్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదాపై చివరివరకు తమను తప్పుదోవ పట్టించి తమ జీవితాలతో ఆడుకున్న సర్కారుకు ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని మండిపడుతున్నారు. నిజానికి.. రోస్టర్పై గతేడాది వేపాడ చిరంజీవితో కొన్నాళ్లు డ్రామా ఆడించి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ లాభపడింది.ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. అలాగే, గ్రాడ్యుయేట్లను పక్కదారి పట్టించేందుకు రెండుసార్లు మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. కానీ, రోస్టర్ అంశం వారికే చుట్టుకుంది. రోస్టర్లో తప్పులున్నాయని చెప్పారు కాబట్టి, ఇప్పుడా తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో మంత్రులు పరీక్షకు ఒకరోజు ముందు వాయిదాపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కానీ, పరీక్ష వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో ప్రభుత్వం తమను మోసంచేసేందుకు డ్రామా ఆడుతోందని అభ్యర్థులు నిర్ణయానికొచ్చారు. టీడీపీ కూటమికి మా సత్తా చూపిస్తాం.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా కలచివేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూటమి నాయకుల మాటలు నమ్మి గతేడాది జూలైలో జరగాల్సిన పరీక్షను వాయిదా వేయించి, దాదాపు 8 నెలల కాలాన్ని వృధా చేశారని.. ఫలితంగా దాదాపు 72 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగావకాశం కోల్పోయారని వాపోతున్నారు. తమను నిలువునా ముంచిన టీడీపీ కూటమికి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.పైగా.. ‘ప్రభుత్వం మొదటి నుంచి చాలా క్లియర్గా ఉంది. మనమే గమనించలేకపోయాం. మన టైం మొత్తం వృధా చేయించి పరీక్ష అంశాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్పైకి నెట్టేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఇక్కడ వాడారు. అంతే..’ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది. ‘ఒక ఎగ్జామ్ను కంట్రోల్ చేయలేకపోయారు. వీరు మన జీవితాలను బాగుచేస్తారా? స్వర్ణాంధ్రను సృష్టిస్తారా?’ అంటూ మరొకరు పోస్టు చేశారు. ‘మా ఆశలను, కలలని, మా భవిష్యత్తును చంపుతున్నారు. మేమూ మీ ఆశలను, కలలను, భవిష్యత్తును చంపగలం. ఆట మీరు మొదలుపెట్టారు. మేము ముగిస్తాం’.. అంటూ మరొకరు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. -
గ్రూప్-2 అభ్యర్థులను కూడా చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అందరినీ ఏ విధంగా మోసం చేస్తారో చెప్పేందుకు గ్రూప్–2(Group-2) పరీక్షల అభ్యర్థుల పరిస్థితే ప్రత్యక్ష నిదర్శనం. మూడు వారాలుగా వారి అభ్యంతరాలు వింటున్నట్లుగా నటించి.. సమస్యను పరిష్కరిస్తానని నమ్మబలికి చివరకు నట్టేట ముంచాడు. విద్యార్థులను లాఠీలతో కొట్టించడమే కాకుండా ఆఖరికి తీవ్ర అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణమని చంద్రబాబు సర్కారు మోసాలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) నిప్పులు కురిపించారు.అధికారం చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు అన్ని వర్గాలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అంశాల వారీగా వివరిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కడిగి పారేశారు. మోసాలకు, అన్యాయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన చందబాబుపై ప్రజలు ఆగ్రహంతో పోరాటాలు చేస్తున్నారని, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్ జగన్ ట్వీట్లో ప్రస్తావించిన అంశాలివీ..⇒ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు.. అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్ృ2 అభ్యర్థులను కూడా నిలువునా మోసం చేశారు.⇒ మూడు వారాలుగా గ్రూప్ృ2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్లు నటించి, వాటిని పరిగణనలోకి తీసుకుని తగిన న్యాయం చేస్తున్నట్లు నమ్మబలికి, చివరకు వారిని నట్టేట ముంచారు. అభ్యర్థుల నుంచి అందిన విజ్ఞాపనలను వింటున్నానని, తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు రెండు రోజుల ముందు విద్యాశాఖ మంత్రి, మీ కుమారుడు మోసపూరిత ప్రకటన చేశారు. మరోవైపు తాను చెప్పినా సరే, ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న మీ వాయిస్తో ఆడియోను లీక్ చేసి మరో డ్రామా చేశారు. ఇంకోవైపు ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులతో లాఠీఛార్జీ చేయించి అమానుషంగా ప్రవర్తించారు. మీరు ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే. ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం.⇒ మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి.. మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం ఒక మోసమే.⇒ ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసలు దాని గురించి పట్టించుకోకపోవడం కూడా మీరు చేసిన మోసమే.⇒ వలంటీర్లకు రూ.పది వేలు ఇస్తానని చెప్పి.. జీతం సంగతి దేవుడెరుగు చివరకు 2.6 లక్షల మంది ఉద్యోగాలను ఊడగొట్టడమూ మోసమే.⇒ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కుదింపు పేరిట వారిని వేరే డిపార్ట్మెంట్లకు సర్దుబాటు చేసి అక్కడ ఖాళీలకు శాశ్వతంగా కోత పెట్టడమూ మోసమే.⇒ నిరుద్యోగ భృతి అని, నెల నెలా రూ.3,000 అని, ప్రతి ఇంటినీ మోసం చేయడం ఇంకో మోసం.⇒ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో 18 వేల మందిని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లనూ, ఫైబర్ నెట్ కార్పొరేషన్లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారిని తొలగించి వారి జీవితాలను నడిరోడ్డుపై నిలబెట్టడం కూడా మీరు చేస్తున్న మోసాల్లో భాగమే.⇒ అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమే.⇒ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అంటూ ఉన్న పీఆర్సీ ఛైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించి, కొత్త పీఆర్సీ ఇంతవరకూ వేయకపోవడమూ ఇంకో మోసమే.⇒ ఒకటో తేదీనే జీతాలు అంటూ ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత ప్రతి నెలా ఉద్యోగులు ఎదురు చూసేలా చేయడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమే.⇒ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డీఏలు పెండింగ్లో పెట్టడం కూడా ఒక అన్యాయమే.⇒ ట్రావెల్ అలవెన్స్లు, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్మెంట్.. అన్నీ పెండింగ్లో పెట్టడం కూడా ఇంకో అన్యాయమే.⇒ ఉద్యోగస్తులకు సంబంధించి వారి జీఎల్ఐ, జీపీఎఫ్ కూడా మీ అవసరాలకు వాడేసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టించడం కూడా మీరు చేస్తున్న అన్యాయాల్లో భాగమే.⇒ మోసాలు, అన్యాయాలకు కేరాఫ్గా మారిన చంద్రబాబూ.. మీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో పోరాటాలు చేస్తున్నారు. ప్రజా పోరాటాలకు మా పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుంది. 1. @ncbn గారూ… నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారు.2. మూడు వారాలుగా గ్రూప్-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 23, 2025 -
గ్రూప్–2 అభ్యర్థులతో 'బాబు బంతాట'
డ్రామాలో భాగంగానే సీఎం పలుకులు మెయిన్స్ వాయిదా వేస్తే మరిన్ని పోస్టులు కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలనే భావంతోనే ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. పరీక్షను రద్దు చేయాలని చెప్పినా ఏపీపీఎస్సీ చేయట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం ఈ డ్రామాలో భాగమే. ప్రతిపక్షం కూడా లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు నిరుద్యోగులకు బాగా బుద్ధి చెప్పారు. యువగళం పేరుతో లోకేశ్ ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ఈ 900 పోస్టులు పూర్తి చేసి ఈ ఐదేళ్లు ఉద్యోగాలు భర్తీ చేసేశాం అని డబ్బా కొట్టుకోవడానికే ఈ డ్రామాలు. – గ్రూప్–2 అభ్యర్థినిసాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులను అనేక రకాలుగా మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్ పరీక్షకు కొన్ని గంటల ముందు వరకు వారి భావోద్వేగాలతో ఆడుకుంది. ఆదివారం పరీక్ష ఉందనగా.. శనివారం సాయంత్రం వరకు రకరకాల విన్యాసాలతో నాటకాలాడిన తీరు విస్తుగొలుపుతోంది.. ఓ పరీక్ష విషయంలో ఇంతటి గందరగోళం, 8 గంటల ముందు వరకు నాన్చుడు వ్యవహారం ఏపీపీఎస్సీ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. బాబు సర్కారు బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట. ఆదివారం ఉదయం పరీక్ష ఉందనగా, శుక్రవారం రాత్రి వాయిదాకు అనుకూలంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అభ్యర్థుల్లో ఆశలు రేపారు. అయితే, పరీక్ష వాయిదా అంటూ ‘సోషల్ మీడియా’లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ శనివారం ఉదయం ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత శనివారం మధ్యాహ్నానికి పరీక్ష వాయిదాకు అనువుగా నిర్ణయం తీసుకోవాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. వాస్తవానికి రోస్టర్ అమలులో సమస్యలున్నాయని, వాటిని సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని, అప్పటిదాకా పరీక్ష వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం కలిసి విజ్ఞప్తులు చేశారు. కానీ, ఏ ఒక్కరూ నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకోలేదు. దీంతో వారం రోజులుగా అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే, కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఎమ్మెల్సీలు హామీ ఇవ్వడంతో ఈ నెల 20వ తేదీ వరకు ఆగారు. కోర్టు గ్రూప్–2 మెయిన్స్ రద్దుకు అంగీకరించకపోవడంతో పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. పరీక్షలు నేడు యథాప్రకారం జరగనున్నాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం కుదరదని ఏపీపీఎస్సీ చైర్మన్ అనూరాధ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై గ్రూప్ –2 అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని చూసి లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ కూడా కోపంతో రగిలిపోతున్నారు. ఇంత దగా చేసిన కూటమి సర్కారును వదిలిపెట్టకూడదని, ‘బాయ్కాట్ ఎలక్షన్’ కాదు.. ఎన్నికల్లో పాల్గొని తగినవిధంగా బుద్ధిచెప్పాలని గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రాడ్యుయేట్స్ తీర్మానించుకుంటున్నారని తెలుస్తోంది. ‘బాయ్కాట్ ఎలక్షన్’ నిర్ణయంతో సర్కారు డ్రామాలు.. గ్రూప్–2 మెయిన్స్ నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు సర్కారుకు మొరపెట్టుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం నిర్ణయాధికారం ప్రభుత్వ పరిధిలోకి వచ్చినందున రోస్టర్ సవరించే వరకు పరీక్షను వాయిదా వేయాలని ఈనెల 20నుంచి కోరుతున్నారు. అయిన్పటికీప్రభుత్వం స్పందించలేదు. దీంతో అభ్యర్థులు ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించింది. ‘‘పరీక్షలను వాయిదా వేయమని గ్రూప్–2 అభ్యర్థుల నుంచి నాకు అనేక అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు అన్ని మార్గాలను అన్వేíÙస్తాము’’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే, శనివారం ఉదయం ఏపీపీఎస్సీ మరో ప్రకటన విడుదల చేసింది. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఒకే అంశంపై రెండు వ్యవస్థలు భిన్న అభిప్రాయాలను వెల్లడించడంతో అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారు. పరీక్ష మరో 14 గంటలు ఉందనగా ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో రోస్టర్ సమస్యను పరిష్కరించి పరీక్ష నిర్వహించాలని, అప్పటిదాకా మెయిన్స్ వాయిదా వేయాలని ప్రభుత్వ కార్యదర్శి.. ఏపీపీఎస్సీకి రాసినట్టుగా ఓ లేఖ శుక్రవారం తేదీతో శనివారం మధ్యాహ్నం బహిర్గతమైంది. దీనిపైనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్వీస్ కమిషన్ చైర్మన్ అనురాధను తప్పుబడుతూ ఉన్న ఆడియోను లీక్ చేశారు. ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయమంటే ఏపీపీఎస్సీ పట్టించుకోవడం లేదన్నది ఆ ఆడియో సారాంశం. ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు? గ్రూప్–2 రిజర్వేషన్లలో రోస్టర్ అమలు తప్పులున్నాయని ఏడాది కాలంగా ప్రచారం చేస్తూ వచి్చన కూటమి ప్రభుత్వంలోని నేతలు కేసు కోర్టు పరిధిలోకి వచ్చేవరకు ఎందుకు మార్చే ప్రయత్నం చేయలేదన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. వాస్తవానికి ఎన్డీఏ సర్కారు ఏర్పడి దాదాపు 9 నెలలు పూర్తవుతోంది. గ్రూప్–2 మెయిన్స్ ఒకసారి జూలైకి, మరోసారి డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ క్రమంలో తప్పులు సరిచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు సైతం తప్పులు లేవని చెప్పారని, ఒకవేళ తప్పులుంటే సరి చేస్తామని పేర్కొన్నట్టు చెబుతున్నారు. పరీక్ష తేదీ సమీపించే వరకు వాయిదా వేసే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు. ఆదివారం పరీక్ష ఉందనగా, శనివారం మధ్యాహ్నం పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ తప్పేంలేదని చెప్పేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ తీరుతో సుదూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరుకావాల్సిన వారు మూడు రోజులుగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వివాదాలే ‘అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ కేలండర్ ఇస్తాం. నిరుద్యోగులకు మేలు చేసేలా సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తా’మని చెప్పిన ఎన్డీఏ కూటమి నాయకులు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్వీస్ కమిషన్ను నీరుగార్చే పనిలో పడ్డారు. ఏడాది పదవీ కాలం ఉండగానే.. రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్న కమిషన్ చైర్మన్ను రాజకీయ కుట్రతో తొలగించారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరగకుండా వాయిదాలు వేశారు. ఇందులో గ్రూప్–2తో పాటు గ్రూప్–1 మెయిన్స్, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు వంటి కీలమైన 21 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటికి నిర్విరామంగా సిద్ధమవుతున్న దాదాపు 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్ను అగమ్యగోచరంగా మార్చేశారు. ఇప్పుడూ గ్రూప్–2 మెయిన్స్ కొన్ని గంటల వ్యవధిలో ఉందనగా రాజకీయం ప్రారంభించారు. ఇందులో సాక్షాత్తూ ‘ముఖ్య’ నేతలే అభ్యర్థుల భావోధ్వేగాలతో ఆడుకోవడం గమనార్హం.ఇప్పటికిప్పుడు మెయిన్స్ వాయిదా వేయలేం : ఏపీపీఎస్సీ చైర్మన్ గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఇప్పటికిప్పుడు వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ ద్వారా అవసరమైన వివరణ ఇచ్చేందుకు పరీక్షను వాయిదా వేయాలని శనివారం జీఏడీ సర్వీస్ కమిషన్కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పైవిధంగా స్పందించినట్టు సమాచారం. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాక.. గంటల వ్యవధిలో వాయిదా వేయాలనడం సబబుకాదని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం. నేడు గ్రూప్–2 మెయిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాలు సిద్ధంగ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్–1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 పేపర్–2 నిర్వహిస్తారు. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9.30 లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9.45కు కేంద్రాల గేట్లను మూసివేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీల వీరంగంవిజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కోట కూడలిలో శనివారం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గ్రూప్–2 అభ్యర్థులపై ఖాకీలు వీరవిహారం చేశారు. ఉన్నత విద్యావంతులని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపుల్లో ఎక్కించారు. నిరసన శిబిరాన్ని చెదరగొట్టారు. పలువురు అభ్యర్థులను రాత్రి సమయాన జీపుల్లో దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టారు. రోస్టర్ విధానంపై స్పష్టత ఇచ్చాకే గ్రూప్–2 మెయిన్స్ నిర్వహించాలని కోరిన పాపానికి ప్రభుత్వం పోలీసులతో నిరుద్యోగుల ఆందోళనను అణచివేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానం ప్రకటించాలని కోరుతూ కోట కూడలి వద్ద అభ్యర్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన, ఆదేశాలు రాకపోవడంతో సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో కోట వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో వన్టౌన్, టుటౌన్ సీఐలు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూడలి వద్దకు చేరుకుని నిరుద్యోగులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు.ఈ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మా చెప్పుతో మేం కొట్టుకుంటున్నాం..నిరుద్యోగులకు మేలు చేస్తుందని ఆశించి మేమంతా ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా రెండు చెప్పులతో మేం కొట్టుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా రోస్ట్ర్ సరిచేయకుంటే మేమంతా పెద్ద ఎత్తున నష్టపోతామంటూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించకుండా మెయిన్స్ నిర్వహిస్తోంది. మా భవిష్యత్ను, ఆశలను తుంగలొకి తొక్కిన ఈ ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లు అధికారంలోకి రాకుండా మేం బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. – గ్రూప్–2 అభ్యర్థి -
జూలై 28న గ్రూప్–2 మెయిన్స్
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్ పరీక్షలను జూలై 28వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు పరీక్ష కేంద్రంతోపాటు తమ పోస్టు, జోనల్/జిల్లా ప్రాధాన్యతను సమర్పించాలని సర్వీస్ కమిషన్ సూచించింది. జూలై 28వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఆఫ్లైన్లో పరీక్ష ఉంటుందని ప్రకటించింది. ఈసారి మెయిన్స్ పరీక్షకు 92,250 మంది హాజరుకానున్నారు. ఏపీపీఎస్సీ 899 గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.పరీక్ష నిర్వహించిన 45 రోజుల రికార్డు వ్యవధిలో ఏప్రిల్ 10న ప్రిలిమ్స్ ఫలితాలను కూడా వెల్లడించింది. గతానికి భిన్నంగా ఎక్కువ మంది నిరుద్యోగులకు మేలు చేసేందుకు మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. చివరిగా 2018లో నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్ రాసినవారి నుంచి 1:12 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే, నిరుద్యోగుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందికి మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేశారు. గ్రూప్ పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం సర్వీస్ కమిషన్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో 899 పోస్టులకు గాను 92,250 మంది మెయిన్స్ రాయనున్నారు.ఇవీ పోస్టుల వివరాలు... ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతోపాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండగా, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏవో), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్స్ పరీక్షలో పేపర్–1, పేపర్–2లకు 150 మార్కులకు 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు తమ పరీక్ష సెంటర్, ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత, జోనల్/జిల్లా ప్రాధాన్యతలకు కమిషన్ వెబ్సైట్ http:// www.psc.ap.gov.in లో బుధవారం నుంచి నమోదు చేయాలి. -
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేసే ప్రసక్తే లేదు
హైదరాబాద్ : ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసే ప్రసక్తే లేదని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 20,21 తేదీల్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఉదయభాస్కర్ సూచించారు. పరీక్ష వాయిదాకు సహేతుకమైన కారణాలేవీ లేవని ఆయన అన్నారు. కాగా ఏపీపీఎస్సీ మే లో నిర్వహించబోయే గ్రూప్–2 మెయిన్ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని జాతీయ బి.సి.సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్–2 పోస్టులను పెంచాలని, మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిన్న నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. గ్రూప్–2 నిరుద్యోగుల పాలిట శాపం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై ఏపీపీఎస్సీ చైర్మన్ స్పందిస్తూ ...మెయిన్స్పై స్పష్టత ఇచ్చారు.