Islamic State (IS) militants
-
సొమాలియాలో అమెరికా వైమానిక దాడులు
వాషింగ్టన్: సొమాలియాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) లక్ష్యంగా అమెరికా మిలటరీ శనివారం వైమానిక దాడులకు పాల్పడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక సొమాలియాలో జరిగిన మొట్టమొదటి దాడి ఇది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సొమాలియా ప్రభుత్వ సహకారంతో యూఎస్ ఆఫ్రికా కమాండ్ ఈ దాడులు చేపట్టిందని రక్షణ మంత్రి పీట్ హగ్సెత్ తెలిపారు. వైమానిక దాడిలో పలువురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. అయితే, పౌరులెవరికీ ఎలాంటి హాని కలగలేదని తెలిపింది. సీనియర్ ఐసిస్ నేతతోపాటు మరికొందరు లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సీనియర్ నేత కోసం అమెరికా చాలా ఏళ్లుగా గాలిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం మాత్రం ఇతడి అడ్డు తొలగించడంలో ఎంతో ఆలస్యం చేసిందని విమర్శించారు. ఆ పని తాము చేశామని ట్రంప్ ప్రకటించుకున్నారు. తాజా దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వారు దాక్కున్న గుహలు నామరూపాల్లేకుండాపోయాయని తెలిపారు. అయితే, ఈ దాడుల్లో సదరు ఐఎస్ నేత ఎవరు? అతడు హతమయ్యాడా లేదా? అనే విషయాలను ఆయన వెల్లడించలేదు. అమెరికన్లపై దాడులకు పాల్పడే ఐసిస్ తదితర గ్రూపులకు నా హెచ్చరిక ‘మీరెక్కడున్నా కనిపెట్టి, మట్టుబెడతాం’అని ఆయన ప్రకటించారు. సొమాలియా ఉత్తర ప్రాంతంలో దాక్కున్న ఐసిస్ నాయకత్వం విదేశీయులను కిడ్నాప్ చేయడం, డ్రోన్ల దృష్టిలో పడకుండా తప్పించుకోవడం, యుద్ధ తంత్రాలపై తమ శ్రేణులకు తర్పీదు నిస్తున్నాయని అమెరికా సైనికాధికారులు అంటున్నారు. -
సిరియాలో ఐఎస్ను ఓడించాం: ట్రంప్
వాషింగ్టన్: సిరియా నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. సిరియాలో ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ను ఓడించామని అమెరికా ప్రకటించింది. ‘సిరియాలో ఐఎస్ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. సిరియా నుంచి అమెరికా దళాలు వెనుతిరిగాయని వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు. ఉగ్రవాదం వల్ల, లేదా వేరే ఏ ఇతర కారణం వల్ల కానీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలకు ప్రమాదం వాటిల్లే సందర్భాల్లో యూఎస్, దాని మిత్రదేశాల దళాలు తమ సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు. ‘సిరియాలో విజయం సాధించాం. కానీ ఐఎస్పై పోరాటం ఇంకా ముగియలేదు’ అని యూఎస్ రక్షణ శాఖ ప్రతినిధి డానా డబ్ల్యూ వైట్ పేర్కొన్నారు. సిరియా నుంచి దళాల ఉపసంహరణను.. లక్ష్యం చేరకముందే తీసుకున్న అర్ధాంతర నిర్ణయంగా వాల్స్ట్రీట్ జర్నల్ అభివర్ణించింది. -
170 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం
బీరూట్ : సిరియాలో ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డకట్టవేసేందుకు అక్కడి ఆర్మీ అధికారులు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా జరిపిన వైమానికి దాడుల్లో దాదాపు 170 మంది ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారని కుర్దీష్ స్వయం ప్రతిపత్తి ప్రాంత రక్షణ శాఖ ఉన్నతాధికారి నాజర్ హజ్ మన్సూర్ వెల్లడించారు. గత ఆదివారం నుంచి ఐఎస్ తీవ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు. మృతులంతా జీహదీలే అని సిరియాలోని మానవహక్కుల సంఘం పరిశీలకులు చెప్పారు. మృతుల సంఖ్య 200 మంది ఉండవచ్చని వారు పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో గాయపడిన వారి వివరాలు మాత్రం అందలేదని తెలిపారు.