kabir das
-
Kabir Das గడ్డిపోచ కూడా...!
కబీర్ దాస్ ఆధ్యాత్మిక కవి. సాధువు. మధ్యయుగ భక్తి ఉద్యమ కారుల్లో ఆయన ఒకరు. ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన... రామానంద బోధనలకు ప్రభావితమై ఆయన్ని గురువుగా స్వీకరించారు. కబీర్ అన్ని మతాల అర్థరహిత, అనైతిక పద్ధతులను ప్రధానంగా ప్రశ్నించారు. ఆయన మరణించినప్పుడు హిందువులు– ముస్లింలు ఇరువురూ ఆయనను తమవారంటే తమవారని చెప్పుకున్నారు.కబీర్ సత్యాన్ని తెలుసుకోవడానికి, ‘అహాన్ని‘ వదిలివేయమని సూచించారు. ఆయన రాసిన దోహాలు నాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. అటువంటి కబీర్ జీవితంలో జరిగిన సంఘటనగా చెప్పే ఉదంతం ఇది: ఒకానొకరోజు కబీర్ తన కొడుకుని ఆవులకు మేత కోసం గడ్డి కోసుకు రమ్మన్నారు. సరేనని వెళ్లిన కుమారుడు చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో కబీర్ కొడుకును వెతుక్కుంటూ వెళ్లారు. పచ్చిక బయళ్ల మధ్యలో నిల్చుని ఉన్న కొడుకు కనిపించాడు. చల్లటి గాలి వీస్తోంది. గడ్డి అటూ ఇటూ ఊగుతోంది. కబీర్ తన కొడుకు కూడా అది చూసి మైమరచిపోయి హుషారుగా ఊగుతూ ఉండడాన్ని చూశారు. దగ్గరకువెళ్లి ఎందుకు ఊగుతున్నావని అడిగారు. అప్పుడతను ‘నాన్నా! నేనిక్కడికి వచ్చేసరికి ఈ గడ్డంతా ఏకాంతంలో గాలికనుగుణంగా కదలాడుతోంది. ఆ దృశ్యం చూడటానికి ఎంతో బాగుంది. నాకు కూడా గడ్డితోపాటు అలా కదలాలనిపిస్తోంది. ఆహా! ఏమానందం? ఏమానందం?’ అన్నాడు. ఇదీ చదవండి : బిలియనీర్తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!అతని మాటలకు దిగ్భ్రాంతి చెందిన కబీర్, ‘నేను నిన్ను గడ్డి కోసుకురమ్మన్నాను కదా? మరచిపోయేవా?’ అన్నారు. అందుకు ‘ఏమిటీ? పచ్చికను కోయాలా? నేనెప్పటికీ అలా చేయలేను. నాకీ పచ్చిక ఎనలేని ఆనందాన్నిచ్చింది. నేను పచ్చికతో సన్నిహిత సంబంధాన్నిపెంచుకున్నాను. ప్రస్తుతానికి నేను వేరే ప్రపంచంలో ఉన్నాను’ అన్నాడతను. ‘ఈ భగవంతుని సృష్టిలో ప్రతిదీ విలువైనదే... ఆనందమిచ్చేదే’ కదా అంటూ కబీర్ కుమారునితో కలిసి వెనుదిరిగారు. (Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!)– యామిజాల జగదీశ్ -
నింద భోజనం
కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ ‘నిందలు వేయరాదు’ అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! ‘వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట’ అన్నాడాయన. సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ‘ఏం చేస్తామండీ ఖర్మ’ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం. కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి ‘బాల వ్యాకరణం’ వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని ‘అవును.. కాపీయే’ అని నిందించడం. ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. ‘లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి’ అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి ‘రాధికా సాంత్వనం’ ఎంత సాంత్వనం కోల్పోయిందని?తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, ‘నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ’ అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు. నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే. నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధు లతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్ఛీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ! -
ప్రశ్నించినవారికి నిర్బంధమా?
సర్వమత సామరస్యాన్నీ, సర్వుల మనోభావాలనూ గౌరవించడం ద్వారా సమాజ శాంతిని శాశ్వతం చేయడం సాధ్యమని నమ్మి ప్రచారం చేసినవాడు కబీర్ దాసు. మానవ మనుగడకు ఐకమత్యం అత్యవసరమనీ, ప్రేమను మించిన శక్తి లేదనీ బోధించిన కరుణామయుడు కబీర్. ఇలాంటి సమగ్ర దృక్పథం, సమన్వయ దృష్టి మన రాజకీయ నాయకులకు ఎందుకు లోపిస్తోంది? ఇంకా మత దురహంకారాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? వీటిని ప్రశ్నించినవారు నిర్బంధాల పాలవుతున్నారు. లౌకిక రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దేశాన్ని అభ్యుదయ మార్గానికి మళ్లించే అవకాశాన్ని కమ్యూనిస్టు పార్టీలు చేజార్చుకోవడం కూడా మితవాద శక్తులు బలపడటానికి కారణమైంది. ‘‘మానవ హక్కుల సంరక్షణకు కృషి చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన తీస్తా సెతల్వాడ్ను అరెస్టు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం భావించి, అరెస్టు చేయమని సూచించిందా? ప్రస్తుతం ఆమె గుజరాత్ పోలీసుల కస్టడీలో ఉంది. ఆమెను అరెస్టు చేయడంగానీ, అరెస్టు చేయాలన్న ఉద్దేశంగానీ తమకు లేదని స్పష్టం చేస్తూ సుప్రీం న్యాయమూర్తులు తక్షణం స్పందించాలని నేను కోరడం తప్పని అనుకోవడం లేదు. కనుక తీస్తా సెతల్వాడ్ను తక్షణం బేషరతుగా విడుదల చేయాలనీ; ఆమె అరెస్టునూ, ఆమె డిటెన్షన్ కొనసాగింపునూ కొట్టివేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను.’’ – న్యూస్పోర్టల్ ‘ద వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు గౌరవ మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ 2002 నాటి గుజరాత్ అల్లర్లలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న (నేటి ప్రధాని) నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత్రపై ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ ఇచ్చిన నివేదికను ప్రశ్నిస్తూ, తిరిగి దాని పూర్వా పరాలను విశ్లేషించి నివేదికను సమర్పించాలని సుప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్ను సుప్రీంకోర్టు కోరింది. కోర్టు ఆదేశాల మేరకు 2011 జనవరి – జూలైలలో ప్రత్యేక సలహాదారు హోదాలో రాజు రామచంద్రన్ రెండు నివేదికలు సమర్పించారు. అల్లర్ల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్స్ వద్ద హోంశాఖతో సంబంధం లేని ఇద్దరు మంత్రులు ఉండటాన్ని రామచంద్రన్ నివేదిక తప్పుపట్టింది. ఇదిలా ఉండగానే, రానున్న పరిణామాలను ముందుగానే హెచ్చరించడంలో దిట్ట అయిన గుజరాత్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆర్.బి. శ్రీకుమార్ను కూడా తీస్తా సెతల్వాడ్ మాదిరిగా పోలీసులు అరెస్టు చేసి డిటెన్షన్కు పంపడానికి కొన్ని గంటల ముందు ‘నేను జంకేది లేదు, నిజ నిర్ధారణ కోసం పోరాడుతూనే ఉంటాను. నా వ్యక్తిగత కష్టనష్టాలను భరించడానికైనా సిద్ధంగా ఉన్నాను’ అని ప్రసిద్ధ మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించాడు. అంతేగాదు, గుజరాత్ మాజీ గూఢచారి శాఖాధిపతిగా శ్రీకుమార్ తన విధేయత కేవలం భారత రాజ్యాంగ పత్రానికేగానీ, ఏ రాజకీయ పార్టీకి కాదనీ, ఎంతటి శక్తిమంతమైన కరడుగట్టిన రాజ కీయ నాయకుడినైనా ఎదుర్కొని నిలబడటానికి తాను సిద్ధంగా ఉన్నా ననీ ప్రకటించాడు. అంతేగాదు, గుజరాత్ హత్యాకాండ ఘటనలపై సీబీఐ విచారణను కోరుతూ సుప్రసిద్ధ నర్తకి, సామాజిక కార్యకర్త అయిన మల్లికా సారాభాయి సుప్రీంకోర్టులో రిట్ వేయకుండా తప్పిం చేందుకు ఆమె లాయర్కు నాటి మోదీ ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇచ్చిందని శ్రీకుమార్ ఆరోపించాడు. ఇదే ఆరోపణను మల్లికా సారా భాయి కూడా 2011లో పత్రికా గోష్ఠిలో చేయడం మరొక విశేషం! ఇన్ని గొడవలతో దేశ రాజకీయాలు సాగుతున్నాయి. పాలనా విధానాలూ, ప్రజా వ్యతిరేక చర్యలూ, పౌరహక్కుల అణచివేత, కోర్టులను అపమార్గం పట్టించే విధానాలూ, ఒక్కమాటలో – లౌకిక రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే చర్యలు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ‘పళ్ల బిగువు’ మీద తొలి ముప్పయ్యేళ్లు అలా అలా ‘తూట్లు’ పడకుండా లౌకిక రాజ్యాంగం నిలిచింది. ఆ తరువాత కాంగ్రెస్ – బీజేపీ పాలకులు, వారు నిర్వహించిన అవకాశవాద రాజకీయాలతో బీటలు వారడం మొదలైంది. ఇందిరాగాంధీ, రాజీవ్, మన్మోహన్ సింగ్, వాజ్పేయి పాలనలు కూడా క్రమంగా తొట్రుబాటుతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. చివరికి కాంగ్రెస్ ఐక్య సంఘటన ప్రభుత్వంలో ప్రధాన భూమిక వహించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ మద్దతుతో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ఇందిర సమకాలికుడు జ్యోతిబసును దేశ ప్రధానమంత్రిగా నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలు – ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకవాక్యత లేక విఫలమయ్యాయి. అనుభవజ్ఞుడైన జ్యోతిబసు ప్రధాన మంత్రిత్వంలో భారత పాలనా శకపు రాజకీయ పటమే అభ్యుదయ మార్గానికి మళ్లి ఉండేది. ఆ అవకాశాన్ని ఆ పార్టీలే కాదు, దేశమూ, శ్రమ జీవులైన కార్మిక, కర్షక లోకమూ కోల్పోయింది. మితవాద శక్తులు పేట్రేగి పోవడానికి వీలుగా తరువాతి పాలకులు మత దురహంకారం రెచ్చగొట్టారు. తద్వారా కల్లోల భారత సృష్టికి పునాదులు వేశారు. ఇందుకు తోడ్పడుతున్నవి తిరిగి వలస పాలనా చట్టాలేనని మరచిపోరాదు. పార్టీల నుంచి తరచుగా ‘కప్పదాటు’ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి రాజ్యాంగంలో అనుబంధపు అధ్యాయాలలో పొందు పరచిన యాంటీ డిఫెక్షన్ చట్టానికి కూడా రాజకీయ పక్షాలు అడుగడుగునా తూట్లు పొడుస్తూనే ఉన్నాయి. తరచుగా ‘ఆయారాం– గయారాం’ రాజకీయాలకు స్వస్తి చెప్పించగల సత్తా తరచూ పార్టీలు మార్చే ఫిరాయింపుదారులైన రాజకీయ నాయకులకు లేదు. వారికి ప్రస్తుత ఫిరాయింపుల నిషేధ చట్ట నిబంధనలు ముగుదాడులు కాగల పరిస్థితి లేదు. ఫిరాయింపుల నిషేధ చట్టంలోని పదవ షెడ్యూల్ ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. అందుకే ఈ అస్పష్టతకు అవకాశమిస్తున్న చట్టంలోని నాల్గవ పేరాను పదవ షెడ్యూల్ నుంచి తొలగించాలని రాజ్యాంగ నిపుణుల నిశ్చితాభిప్రాయంగా కన్పిస్తోంది. ఈ ప్రతి పాదన కొత్తదేమీ కాదు. 1999లో లా కమిషన్, 2002లో రాజ్యాంగ నిర్వహణ వ్యవహారాల సమీక్షకు ఏర్పడిన జాతీయ స్థాయి కమిషన్ ఇలాంటి సిఫారసులే చేశాయని మరచిపోరాదు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్న ఈ సమయంలోనైనా దేశంలో కనీస ప్రజా స్వామ్య విలువలు వృద్ధి చెందడం అత్యవసరం. లేకపోతే అదు పాజ్ఞలు తప్పే పాలకులకు, ప్రభుత్వాలకు... మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా సమాజంలో అశాంతికి, అరాచకాలకు దోహదం చేసే నూపుర్ శర్మ లాంటి వారిని అదుపు చేయడం సాధ్యమేనా? ‘దేశంలో ఉద్రిక్త పరిస్థితికి, అశాంతికి, పెక్కు రాష్ట్రాలలో హింసాకాండకు బీజేపీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మ బాధ్యు రాలని సుప్రీం బెంచ్ గౌరవ న్యాయమూర్తి సూర్యకాంత్ శఠించవలసి వచ్చింది. ఇంతకూ విచిత్రమైన సంగతేమిటంటే – సర్వమత సామర స్యాన్ని, సర్వుల మనోభావాలను గౌరవించడం ద్వారా సమాజ శాంతిని శాశ్వతం చేయడం సాధ్యమని నమ్మి ప్రచారం చేసినవాడు కబీర్ దాసు. హిందూ, ముస్లిం మతాల్లో సంప్రదాయాలు కట్టుబాట్ల పేరిట జరిగే అనేక అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి పోరాడిన సంస్కర్త, విప్లవకర్త కబీర్. నీవు నడిచే బాటలో ముళ్లు పరిచే వాళ్ల మార్గంలో సహితం నీవు పూలనే ఉంచు; పూలనూ, ముళ్లనూ బేరీజు వేసి వాటి విలువ నిర్ణయించే వాడు పరమాత్మ అన్నాడు. కబీర్కు ఈ సమగ్ర దృక్పథం, సమన్వయ దృష్టి ఎలా అబ్బింది? ఉత్తర భారత సమాజంలోని హిందూ, ముస్లిం, జైన, బౌద్ధ మతాలలో ఉన్న కఠిన సాధనాలను, మూఢ విశ్వాసాలను తూర్పారబట్టి, ప్రేమతో నిండిన శక్తియుక్తుల భక్తి మార్గాన్ని ప్రజలకు అందించాడు కబీర్. మానవ మనుగడకు ఐకమత్యం అత్యవసరమనీ, ప్రేమను మించిన శక్తి లేదనీ బోధించిన కరుణామయుడు కబీర్. అందాకా ఎందుకు? ‘మనుషు లందున ఎంచి చూడగ రెండె కులములు – మంచియన్నది మాల అయితే, మాల నేనగుదున్’ అని మతాతీతంగా, కులాతీతంగా మహా కవి గురజాడ చాటలేదూ? ఇంతకూ – రాబందుకూ, రాజుకూ తేడా లేదన్న సామెత ఎందుకు పుట్టిందోగానీ, ‘నిండిన కడుపు నీతి వినదు’ సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కందుకూరి పురస్కారాలకు ఎంపికైంది వీరే
అమరావతి: 2017వ సంవత్సరానికి ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి కందుకూరి రంగ స్థల పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో ముగ్గురిని, జిల్లాకు ఐదుగురు చొప్పున ప్రభుత్వం ఎంపిక చేసింది. కర్నాటి లక్ష్మీనరసయ్య, చింతా కబీర్ దాస్, అగ్గరపులు రజనీబాయి ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన కమిటీ పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది. రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష, జిల్లా స్థాయి గ్రహీతలకు రూ.10వేలతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాలను రాజమహేంద్రవరంలో ఈ నెల 30న ప్రదానం చేస్తారని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ ఎండీ ఎస్.వెంకటేశ్వర్ వివరించారు. విజేతల పూర్తి వివరాల కోసం www.apsftvtdc.in వెబ్ సైట్లో ను సందర్శించాలని చెప్పారు.