karma phalam
-
ఎన్ని జన్మలెత్తినా, ఎంతటి వారైనా కర్మఫలాన్ని తప్పించుకోలేరు!
భూమిపై ఎవరైనా సరే కర్మఫలం అనుభవించక తప్పదు. అది మంచైనా చెడైనా తగిన ప్రతిఫలం అనుభవించ వలసిందే అని కృష్ణపరమాత్మ మాట. యుద్ధంలో తమ కుమారులు మరణించిన దుఃఖంలో ఉన్న ధృతరాష్ట్ర దంపతులను ఓదార్చ డానికి కృష్ణుడు రాజభవనానికి మర్యాదపూర్వకంగా వెళ్ళాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ‘నేను అంధుడిగా ఎందుకు పుట్టానో, యుద్ధంలో నా వంద మంది కొడుకులను ఎందుకు కోల్పోయానో, ఈ వయసులో మాకీ పుత్రశోకం ఎందుకు వచ్చిందో చెప్పు కృష్ణా’ అన్నాడు.అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు -‘ఈ ప్రపంచం అంతా కర్మతో ముడి పడింది. ఈ ప్రపంచంలో మానవుడు చేసే ప్రతి చర్యా... అది మంచిదైనా చెడ్డదైనా అతని ప్రస్తుత జీవితంపై మాత్రమే కాకుండా అతని భవిష్యత్తు జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. మానవ జీవితంలోని ప్రతి మంచి, చెడు వెనుక, ఒక కర్మ కారణమై ఉంటుంది. కాబట్టి, మీరిప్పుడు ఆ వంద జీవితాల వెనుక మరొక జీవి తానికి వెళ్లి మీరు ఏమి చేశారో చూస్తే, ఈ జీవితంలో మీ అన్ని బాధల వెనుక ఉన్న కారణాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఈ జీవితానికి ముందు నువ్వు క్రూరమైన రాజువి. ఒకరోజు నువ్వు వేటకు వెళ్లి చెరువులో ఆడుకుంటున్న తల్లి హంస – పిల్ల హంసలను చూశావు. దేవుడు నీకు ఇచ్చిన కళ్ళతో వాటి ఆటను ఆస్వాదించడానికి బదులుగా నువ్వు తల్లి హంస కళ్ళను నిర్దాక్షిణ్యంగా లాక్కుని పిల్లలను క్రూరంగాచంపావు. తల్లి హంస దుర్భరమైన మరణాన్ని చవిచూసింది. ఇంతటి అన్యాయమైన, క్రూరమైన కర్మను చేసినందుకు ఒక జీవితాంతం బాధపడాలి. అయితే, తరువాతి వంద జన్మలలో అనేక మంచి కర్మలను చేశావు. ఆ వంద జన్మలలో నువ్వు చేసిన మంచి కర్మలన్నిటినీ కూడబెట్టుకుని, ఈ జన్మలో రాజుగా జన్మించావు; కానీ ఆ జన్మలో నువ్వు చేసిన క్రూరమైన చెడు కర్మలు కూడా అదే స్థాయిలో పరిపక్వం చెందడంతో నువ్వు అంధత్వంతో బాధ పడుతున్నావు. ఆ దుష్ట కర్మ గత వంద జన్మలుగా నిన్ను వెంటాడుతూనే ఉంది. చివరికి ఈ జన్మలో నువ్వు అంధుడిగా పుట్టి, నీ క్రూరత్వం వల్ల తల్లి హంస తన వంద మంది పిల్లలను కోల్పోయినట్లే, నీ వంద మంది కుమారులనూ కోల్పోయావు.’ ఎన్ని జన్మలెత్తినా, ఎంతటి వారైనా కర్మఫలం తప్పించుకోలేరని గ్రహించాలి.– యామిజాల జగదీశ్ -
Viral Video: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం అంటే ఇదేనేమో!
న్యూఢిల్లీ: మనం చేసిన పనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. చేసిన కర్మకు వెంటనే ప్రతిఫలం వస్తుందంటుంటారు. అందుకు ఈ యువకుడు చేసిన పనే నిదర్శనంగా నిలుస్తోంది. గాడిదను కొడుతూ.. కాళ్లతో తంతూ తీవ్రంగా హింసించిన వీడియో చూస్తే మీరూ అవుననక ఉండలేరు. ఆ యువకుడి వీడియోను శక్తి కపూర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై నెటిజన్లు సంతృప్తి చెందారు. కర్మకు తక్షణ ఫలితం ఉంటుందని యువకుడిపై విమర్శలు గుప్పించారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఓ యువకుడు గాడిదను తాడుతో కట్టి పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఇష్టమొచ్చినట్లు చితకబాదాడు. ఆ తర్వాత దానిపైనే ఎక్కి అక్కడి నుంచి వెళ్లేందుకు యత్నించాడు. యువకుడి దాడితో సహనం కోల్పోయిన గాడిద ఎదురుదాడికి దిగింది. కింద పడేసి ఆ కిరాతకుడి కాలు పట్టుకుని చుట్టూ తిప్పుతూ కాళ్లతో తన్నుతూ దాడి చేసింది. ఈ వీడియోకు రెండు రోజుల్లోనే లక్షకుపైగా వ్యూస్ వచ్చాయి. గాడిద ప్రతీకారాన్ని సూచిస్తూ.. కర్మకు ప్రతిఫలం తప్పదంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. ‘రెండోభాగంలో వీడియో సూపర్.. సంతృప్తిగా ఉంది’ అని ఓ వ్యక్తి పేర్కొన్నారు. మంచిపని అయింది.. నీకు అదే కావాలి అంటూ మరొకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Shakti Kapoor (@shaktikapoor) ఇదీ చదవండి: పావురం బ్యాక్ జంప్!.. చూస్తే అవాక్కవ్వాల్సిందే: వీడియో వైరల్ -
కర్మఫలం
ఒకసారి ఓ రాజుగారు తన ముగ్గురు మంత్రుల్నీ పిలిచి, అడవికి వెళ్లి ముగ్గురినీ మూడు సంచులనిండా పండ్లు తెమ్మన్నారు. రాజాజ్ఞ మేరకు, మొదటి మంత్రి అడవంతా గాలించి మంచి మంచి పండ్లను, మాగిన పండ్లను, తియ్యటి పండ్లను సేకరించాడు. రెండో మంత్రి, అంత శ్రమకోర్వలేక ‘మనమేం తెచ్చామో రాజుగారు చూస్తారా ఏంటి?’ అనుకుని పండ్లూ, కాయలూ, పిందెలూ అన్నీ ఏరి సంచీ నింపాడు. మూడో మంత్రి ‘రాజుగారు నేను తీసుకువెళ్లే సంచి ఎంత పెద్దదిగా ఉందో చూస్తారుగానీ, సంచిలో ఏమున్నాయో చూడరుగా’ అనుకుని సంచిని రాళ్లూరప్పలూ, ఆకులూ అలములతో నింపాడు. రాజుగారు మంత్రులు తెచ్చిన సంచుల్లో ఏమున్నాయో చూడకుం డానే ముగ్గురినీ మూడేసి మాసాలపాటు జైలులో ఉంచమని అధికారులను ఆదేశించారు. జైల్లో ఉన్న సమయంలో వాళ్లు అడవినుంచి సేకరించి తెచ్చుకున్న ఫలాలే తినాలి తప్ప బయటి ఆహారమేదీ వాళ్లకు సరఫరా చేయరాదని కూడా హుకుం జారీ చేశారు. మొదటి మంత్రి జైలులో ఉన్న మూడు నెలలూ తను సేకరించి తెచ్చుకున్న మధుర ఫలాలు తింటూ సుఖంగా ప్రాణాలు నిలుపుకున్నాడు. రెండో అతను– కొన్నాళ్లు మంచి పండ్లు తిన్నాడు. ఆ తర్వాత ఆకలికి తాళలేక పచ్చిపండ్లు, పిచ్చి పండ్లు అన్నీ తిన్నాడు. దాంతో అనారోగ్యం పాలయ్యాడు. మూడోమంత్రి సంగతి ఇంక చెప్పేదేముంది? తినడానికి ఏమీలేక, ఆకులూ అలములూ తినలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మనం చేసిన కర్మల ఫలితాలను మనమే అను భవించాలి. భవన నిర్మాణ పనుల్లో సమర్థుడని పేరుగాంచిన ఒక మేస్త్రీ ఇంక ఆ పనులు చేయదలుచుకోక అదే మాట తన యజమానితో చెప్పాడు. యజమాని ఎంత నచ్చ చెప్పినా వినలేదు మేస్త్రీ. ‘సరే ఒప్పుకున్న ఇళ్లలో ఒకే ఒకటి మిగిలిపోయింది. ఆ ఒక్కటీ కట్టి ఆపైన విరమించుకో’ అన్నాడు యజమాని. మేస్త్రీ సరేనన్నాడు. మొక్కుబడిగా అయిందనిపించాడు కూడా. ఇదివరకు అతను ఇల్లుకడితే నల్లరాతి మీద నగిషీలు చెక్కినట్టుండేది. ఇప్పుడు ఈ ఇల్లు చూస్తే తలదాచుకునేందుకు మొండిగోడలమీద పైకప్పు వేసినట్లుగా ఉంది. ఇల్లు కట్టడం పూర్తయ్యాక సెలవు తీసుకుందామని యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘నీ కోసమే ఆ ఇల్లును కట్టమన్నాను. ఇన్నాళ్లూ నువ్వు చేసిన సేవలకు గుర్తుగా ఆ ఇంటిని నీకు బహుమతిగా ఇవ్వదలుచుకున్నాను. ఆ ఇల్లు నీదే! నువ్వూ నీ కుటుంబం సుఖంగా ఉండండి’ అన్నాడు యజమాని, తాళం చేతులు మేస్త్రీ చేతికిస్తూ. మేస్త్రీ అవాక్కయ్యాడు. ఈ సంగతి ముందే తెలిసుంటే ఎంత బాగుండేది అనుకుని తలపట్టుకున్నాడు. గుర్తుంచుకోండి. మనం చేసిన కర్మల ఫలాన్ని మనమే అనుభవించాలి. మంచైనా చెడైనా..! – ప్రయాగ రామకృష్ణ