mada bushi sreedhar
-
నకలు కాదు... సిసలు రాజ్యాంగం!
భారత స్వాతంత్య్ర సంగ్రామం చివరికి ఉపఖండం భారత్ (India), పాకిస్తాన్లుగా విభజితమవ్వడంతో ముగిసింది. బ్రిటిష్ రాణి 1947 జూలైలో ‘భారతీయ స్వాతంత్య్ర చట్టం–1947’ను ఆమోదించారు. ‘3వ జూన్ ప్లాన్’ పేరున ‘మౌంట్ బాటెన్ ప్రణాళిక’కింద రెండు (భారత్–పాక్) డొమినియన్ల సృష్టి జరిగింది. అవి స్వతంత్ర దేశాలని అనుకుంటున్నాం కాని, బ్రిటిష్ రాణి (British Queen) దయవల్లనే వాటికి డొమినియన్ స్థాయిని ఇచ్చారు (ఇది దానం వలె ‘ఇచ్చింది’ అని అర్థం చేసుకోవాలి). స్వాతంత్య్ర చట్టం ఆమోదానికి ముందే మన రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ సభ (1946) ఏర్పడింది. మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మన రాజ్యాంగ నిర్మాణం సాగి 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అయితే మన రాజ్యాంగం (Indian Constitution) కాపీ కొట్టిన రాజ్యాంగం అనే అపప్రథను మూట కట్టుకుంది. ఇప్పటికీ ఆ విమర్శ ఉంది. బ్రిటిష్ వాళ్లు చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం–1935’ను మక్కీకి మక్కీ నకలు చేశారంటారు. అలాగే అనేక ప్రపంచ దేశాల నుంచి నచ్చిన అంశాలను గ్రహించి మన రాజ్యాంగంలో చేర్చారు. మనకు ఉన్న దేశాధ్యక్షుడు (రాష్ట్రపతి), మంత్రి వర్గం, పార్లమెంట్, న్యాయవ్యవస్థ వంటివి ప్రపంచంలో అనేకానేక ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నవే. ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇవన్నీ సాధారణ అంశాలు (భాగాలు) కాబట్టి అది నకలు అనడానికి వీల్లేదు. మనం ప్రజాస్వామ్య విధానం పాటిస్తున్నాం కాబట్టి మనకు నచ్చిన అంశాలను స్వీకరించడం తప్పుకాదు కదా. ఇక ఏ ఏ అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించామనే విషయానికి వస్తే... బ్రిటన్ నుంచి పార్లమెంటరీ ప్రభుత్వ పరి పాలన, రూల్ ఆఫ్ లా, శాసన ప్రక్రియ, క్యాబినెట్ పద్ధతిలో ప్రజాస్వామ్యం, ప్రభుత్వ నిర్వహణలో న్యాయరంగంలో ఆజ్ఞల పాత్ర (రిట్ గొప్పతనం) వంటివి ఉన్నాయి.ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నికల పద్ధతి, రాష్ట్రపతి రాజ్యసభలో సభ్యులను ఎంపిక చేసే పద్ధతిని స్వీకరించాము. అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించినవాటిలో అధికారం నుంచి రాష్ట్రపతిని తొలగించడం (మహా అభిశంసనం), రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అధికారాలను నిర్వహించే విధానం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షాధికారం, న్యాయ స్వతంత్రత, రాజ్యాంగ పీఠిక ఉన్నాయి. సమాఖ్య తరహా అధికారిక కేంద్రీకరణ... అంటే రాష్ట్రాలతో పోల్చితే బలమైన కేంద్రం, రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాలు కాక మిగిలిన అన్ని అధికారాలను కేంద్రానికి అప్పగించడం, కేంద్రానికి రాష్ట్రాల గవర్నర్ (రాజ్ పాల్) నియామక అధికారం, సుప్రీంకోర్టుకు సలహా ఇచ్చే అధికారం వంటి వాటిని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించాం. ఆస్ట్రేలియా నుంచి కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయగలిగిన అంశాల జాబితా (ఉమ్మడి జాబితా), లోక్సభ, రాజ్యసభల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించడంవంటి అంశాలు; సోవియట్ యూనియన్ నుండి ప్రాథమిక విధులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ లక్ష్యాలను పీఠికలో చేర్చడం; ఫ్రాన్స్ నుండి గణతంత్ర లక్షణం, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను పీఠికలో చేర్చడం వంటివాటిని స్వీకరించాం. అలాగే జర్మనీ నుంచి ఎమర్జన్సీలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసే (సుషుప్తావస్థలో ఉంచే) విధానాన్ని, దక్షిణ ఆఫ్రికా నుంచి రాజ్యసభ ఎన్నికల విధానం, రాజ్యాంగ సవరణవంటివి మనం తీసుకున్నాం. ఈ లక్షణాలన్నీ వివేకంగా ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగ నిర్ణాయక సభలో నిర్ణయించారు. అంతకుముందు బీఎన్ రావ్ ఒక ముసాయిదా రాశారు. అయితే అది పూర్తిగా మారిపోయింది. పోల్చుకోవడం కూడా సాధ్యం కాని విభిన్నమైన ప్రజాస్వామ్యాల నుంచి అనేక అంశాలు, కీలకమైన కొన్ని విధానాలు చేర్చ వలసి ఉందని ఆయనే స్పష్టంగా చెప్పారు.చదవండి: బాలయ్య మాటల్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలంటే..అందుకు తగినట్లే అనేక రాజ్యాంగాల నుంచి తగిన విషయాలను స్వీకరించడం జరిగింది. కానీ ఇప్పటికీ కొందరు పెద్దలు అసలు మొదటి రాజ్యాంగం రాసింది రావ్ గారే తెల్సా అని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. మన తాజా దేశభక్తులు కూడా ఇదే వాదన చేస్తుంటారు. విధిలేక అంబేడ్కర్ను ఈ భక్తులు మొక్కుతున్నారు గాని రాజ్యాంగ నిర్ణాయక సభ (లేదా రాజ్యాంగ నిర్మాణ పరిషత్)లోని సప్త రుషులవంటి ఏడుగురు రాజనీతిజ్ఞుల అవిరళ కృషి, మార్గదర్శకాలతో తొలి డ్రాఫ్ట్ రూపొందింది. తరువాత ఆ ఏడుగురిలో ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణం చేశారని అర్థం చేసుకోవాలి. ప్రతి నియమానికి నానా కష్టాలు పడి, చర్చించి, ఒప్పించి, అందరూ ఏకాభిప్రాయం సాధించిన తరువాత ఈ రాజ్యాంగం ఏర్పడిందని గ్రహించాలి.-మాడభూషి శ్రీధర్, మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
జవాబు పత్రాలు తండ్రికివ్వరా?
విశ్లేషణ ఒక తండ్రి విజయ్ కుమార్ మిశ్రా తన కుమారుడు (కేంద్ర ద్వితీయ స్థాయి విద్యామండలి) సీబీఎస్ఈ నిర్వహించిన 12వ తరగతి లెక్కలు, విజ్ఞాన శాస్త్రం పరీక్షలలో రాసిన జవాబుపత్రాల ప్రతులను ఇమ్మని సమాచార హక్కు చట్టం కింద కోరారు. తమ నియమాల ప్రకారం పరీక్ష రాసిన కొడుకే పత్రాలు అడగాలి కాని ఆయన తండ్రి అడగడానికి వీల్లేదనీ కనుక ఇవ్వబోమని సీబీఎస్ఈ పట్టుపట్టింది. పరీక్ష రాసిన విద్యార్థులకు జవాబు పత్రాల సమాచారం ఇవ్వబోనని సుప్రీంకోర్టు దాకా సీబీఎస్ఈ పోరాడింది. 2011లో ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం జవాబు పత్రాలు ఇచ్చితీరాలని సీబీఎస్ఈని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబు పత్రాలు ఇవ్వకూడదని, ఈ విషయంలో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) (ఇ) ఇచ్చిన మినహాయింపు తమకు వర్తిస్తుందని సీబీఎస్ఈ చేసిన వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. పరోక్షంగా అనేకానేక ప్రతిబంధకాలు కల్పించి జవాబు పత్రాల సమాచారం నిరాకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. విజయ్ కుమార్ మిశ్రాను కూడా ఈ విధంగానే వేధించారు. రెండో అప్పీలులో కమిషన్కు రాక తప్పలేదు. తమ నియమాల ప్రకారం చివరి తేదీ దాటిన తరవాత దరఖాస్తు వచ్చిందని, అభ్యర్థి కాకుండా అతని తండ్రి అడిగాడు కనుక ఇవ్వబోమని సీబీఎస్ఈ వాదించింది. సంతకం పరిశీలించి అడ్మిట్ కార్డు దరఖాస్తులో ఒక సంతకం ఉంటేనే ఇస్తామని, కానీ మరెవరో సంతకం చేస్తే ఇవ్వబోమని చెప్పింది. ఫలి తాలు ప్రకటించిన పది రోజుల్లో మాత్రమే అడగాలని, దానికి తగిన రుసుము అనుబంధాలు ఇస్తేనే జవాబు కాపీలు ఇస్తామన్నారు. సొంతంగా అభ్యర్థి తన దస్తూరీతో అండర్ టేకింగ్ ఇవ్వాలి. సంతకాల్లో మార్పు ఉండరాదు. పరీక్షించిన అధికారిని సవాలు చేయడానికి వీల్లేదు. కూడికలో తప్పులు విద్యార్థి మాత్రమే పది రోజుల్లో ఎత్తిచూపాలి. మళ్లీ జవాబులు పరిశీలించాలని కోరడానికి వీల్లేదు. పరీక్షించిన అధికారి పేరును కనిపిం చకుండా చేస్తారు. ఆ విధంగా తీసుకున్న జవాబు పత్రా లను ప్రదర్శించడానికి గాను ఏ సంస్థకూ ఇవ్వకూడదు, వార్తాపత్రికలకు ఇవ్వకూడదు, వాణిజ్య అవసరాలకు వాడుకోకూడదు. ఆ విధంగా చేయబోనని ఒక వాగ్దాన పత్రం (అండర్ టేకింగ్)పైన సంతకం చేయాలి. అప్పు డు మాత్రమే జవాబు పత్రాలు ఇస్తామని, లేకపోతే లేదని వాదించారు. జవాబు పత్రాలు కోరిన సమయంలో సీబీఎస్ఈ వద్ద ఆ పత్రాలు ఉంటే వాటిని నిరాకరించడానికి సెక్షన్ 8, 9 కింద మినహాయింపులు వర్తిస్తాయా లేదా అని మాత్రమే పరిశీలించాలి. జవాబు పత్రాల ప్రతులను తయారు చేసే ఖర్చును తీసుకోవాలి. అదీ ఆర్టీఐ నియ మాల ప్రకారమే. జవాబులు పునఃపరిశీలించాలని కోరే హక్కు వదులుకుంటేనే ఇస్తామని, జవాబులు ఎవ్వరికీ చూపబోమని, వాణిజ్య ప్రయోజనాలకు వాడు కోబో మని, ప్రింట్ మీడియాకు ఇవ్వబోమని వాగ్దాన పత్రాలపైన సంతకాలు చేయాలనడం, హక్కులు వాడు కోకుండా ఒత్తిడి చేయడం అవుతుందని, ఇందువల్ల ఆ షరతులన్నీ అసమంజసమైన షరతులనీ, సమాచార హక్కును నిరాకరించడానికి కల్పించిన చట్టవ్యతిరేక పరిస్థితులని కమిషన్ భావించింది. పునః మూల్యాంకనం చేయాలని కోరే హక్కు సహజంగా పరీక్ష రాసిన విద్యార్థికి లభిస్తుంది. కేవలం జవాబు పత్రాన్ని అడిగిన విద్యార్థి ఆ హక్కును వదులుకోవాలని ఒత్తిడి చేయడం ప్రభుత్వ సంస్థకు న్యాయం కాదు. ఒకవేళ అత్యుత్తమ జవాబు పత్రమైతే, ఆ విద్యార్థి తన జవాబు పత్రాన్ని ఇతరులకు ఎందుకు చూపగూడదు? ఆ విద్యార్థికి పాఠాలు చెప్పిన విద్యా సంస్థ ఆ జవాబు పత్రాన్ని గ్రంథాలయంలో ఎందుకు పెట్టగూడదు? మంచి జవాబు రాసినా మార్కులు ఇవ్వకపోతే సీబీఎస్ఈని ఎందుకు విమర్శించకూడదు? అసలు సమాచారం కోరేదే అవసరమైతే వినియోగించడానికి. ఏ విధం గానూ వినియోగించకూడదని షరతులు పెట్టే అధికారం సీబీఎస్ఈకి ఎవరిచ్చారు? మీడియాకు ఇవ్వకూడదని షరతు విధించడం రాజ్యాంగం ఆర్టికల్ 19 (1)(ఎ) కింద పౌరులకు ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్ని, అభివ్యక్తి స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అభ్యర్థి తండ్రికి తన కుమారుడి జవాబు పత్రాలు కోరే హక్కు లేదా? అభ్యర్థి మైనర్ బాలకుడే అవుతాడు కనుక అతని సహజ సంరక్షకుడైన తండ్రికి తనయుడి తరపున చట్టపరమైన అన్ని హక్కులు కోరే అధికారం ఉంటుందని చట్టాలు వివరిస్తున్నప్పుడు ఆ హక్కులను నిరాకరించే అధికారం సీబీఎస్ఈకి ఎవరిచ్చారు? సహజ సంరక్షకుడి హోదాలో తండ్రికి తన కుమారుడి విద్యా ప్రయోజనాలను రక్షించే అధికారం ఉండి తీరు తుంది. ఒకవేళ తన కొడుకు జవాబు పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేదని ఆయన అనుమానిస్తే ఆ పరిస్థితిని సవరించి న్యాయం కోరే అధికారం తండ్రికి ఉంది. కుమారుడి జవాబు పత్రాలు ఇవ్వడానికి నిరాకరించడం చట్టవ్యతిరేకం. అసమంజసమైన షరతులు విధించడం ద్వారా అభ్యర్థి సమాచార హక్కును పరిమితం చేయడానికి వీల్లేదు. ఈ విధంగా వేధించినందుకు 25 వేల రూపా యల పరిహారం చెల్లించాలంటూ జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కమిషన్ ఆదేశించింది. (విజయకుమార్ మిశ్రా వర్సెస్ సీబీఎస్ఈ పాట్నా, CIC/RM/A/2014/0000014-SA లో డిసెంబర్ 3న నా తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్) professorsridhar@gmail.com