‘ఎంఎస్జీ’ సినిమాపై ఆందోళన
న్యూఢిల్లీ: దేరా సచ్ఛా సౌదా నేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్ ’ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీలో శుక్రవారం శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు వారు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. ఈ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ రాజీనామా చేశారని, అయితే ఈ వివాదాస్పద సినిమాకు ఫిల్మ్ సర్టిఫికేషన్ అపెల్లెట్ ట్రిబ్యునల్ (ఎఫ్సీఏటీ) ఎలా క్లియరెన్స్ ఇచ్చిందని వారు ప్రశ్నించారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ సినిమాపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఆందోళనకు పంజాబ్, హర్యానా నుంచి వందలాదిమంది తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఒక సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కాగా, గురువారం రాత్రి సెన్సార్ బోర్డ్ చైర్పర్సన్ లాలా శ్యాంసన్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాకు ఎఫ్సీఏటీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. తాను రాజీనామా చేసిన విషయం వాస్తవమేనని, విషయాన్ని ఐ అండ్ బీ సెక్రటరీకి తెలియపరిచానని చెప్పారు. సినిమాల సెన్సార్ సమయంలో బయటవారి జోక్యం, ప్యానల్ సభ్యుల్లో అవినీతి, సెన్సార్ బోర్డ్ అధికారులపై ఆరోపణలు తదితర కారణాలతో తాను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇదిలా ఉండగా, ఎంఎస్జీ సినిమా శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది.