విద్యారంగ ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి
రాజమహేంద్రవరం సిటీ: విద్యారంగంలో పేరుకుపోతున్న ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన పోరుబాటలో భాగంగా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై సరైన శ్రద్ధ చూపించడం లేదని అన్నారు.29 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ పీఆర్సీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు డీఏలు, పీఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవులు, మెడికల్ రీయింబర్స్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారో రోడ్ మ్యాప్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ పోరుబాట ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉనికి కోల్పోతున్నాయన్నారు. భవిష్యత్తులో మోడల్ పాఠశాలల పేరుతో గ్రామాల్లోని చాలా పాఠశాలలను ఎత్తివేసే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు.గ్రామాల్లో కామన్ పాఠశాలలు ఉండాలని, విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం నిధులు ఖర్చు చేయాలని ఎన్నో సూచనలు చేసిన కొఠారి కమిషన్ నివేదికను ప్రభుత్వాలు ఆచరించటం లేదన్నారు. ఊరి బడిని బతికించుకోవటానికి ఉపాధ్యాయులంతా నడుం కట్టాలన్నారు. అందుకోసం పిల్లలు, పిల్లల తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా విధానానికి పాలకులు పెద్దపీట వేయాలన్నారు.పోరాటాల ద్వారా మాత్రమే ఉపాధ్యాయుల హక్కుల సాధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోటకూర చక్రవర్తి, అరుణకుమారి, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.