Nabha jail
-
మోస్ట్ వాంటెడ్ విక్కీ ఖతం
ఛండీగఢ్ : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ విక్కీ గౌండర్ ఎట్టకేలకు హతమైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి రాజస్థాన్ పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో విక్కీ ప్రధాన అనుచరుడు, నభా జైలుదాడి సూత్రధారి ప్రేమ లహోరియా కూడా మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే చిన్నతనం నుంచే నేరప్రవృత్తిని అలవర్చుకున్న విక్కీ.. తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్గా మారిన పరిణామం అంశం ఓసారి పరిశీలిస్తే... విక్కీ ఓ సంచలనం... విక్కీ గౌండర్ అలియాస్ జిందర్.. అసలు పేరు హర్జిందర్ భుల్లార్. విక్కీది స్వగ్రామం టర్ఫ్ లంబిలోని సరవాన్ బొద్లా. చిన్నతనంలో జేబు దొంగలకు సహయకుడిగా వ్యవహరించేవాడు. ఆ పై బ్లేడు దొంగగా మారి క్రమక్రమంగా గ్యాంగ్స్టర్ గా మారిపోయాడు. సుపారీలు తీసుకుని స్థానిక నేతలను హత్య చేయటం.. అక్రమ ఆయుధాల సరఫరా.. ఉగ్రవాదులకు సాయం... ఇలా మొత్తం 83 కేసులు అతని మీద ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకుల అండతోనే అతను అలా చెలరేగిపోయేవాడని.. పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా అతనికి సహకరించేవారన్న ఆరోపణలు ఉండేవి. ఇక గౌండర్ ఫేస్ బుక్లో ఎప్పుడూ క్రియాశీలకంగా ఉంటాడు. పోలీసులు తనపై కేసులు నమోదు చేసినప్పుడల్లా వారికి చిక్కకుండా.. ఫేస్బుక్ ద్వారానే వాటిని ఖండిస్తుంటాడు. అయితే జైలుకెళ్లాక అక్కడి నుంచి కూడా అతను ఫేస్బుక్లో అప్డేట్లు చేయటం విమర్శలకు దారితీయగా.. ఇద్దరు అధికారులు సస్పెండ్కు గురయ్యారు కూడా. ఇక్కడ సంచలన విషయం ఏంటంటే.. నభా జైలుపై దాడి జరిగింది ఉగ్రవాదులను విడిపించేందుకు కాదు. విక్కీ కోసమే. అయితే దాడి గురించి ముందుగా తెలుసుకున్న ఉగ్రవాదులు.. విక్కీతో డీల్ కుదుర్చుకోవటంతో వారిని కూడా తప్పించారు. ఈ విషయాన్ని దాడి ప్రధాన సూత్రధారి పర్విందర్ సింగ్ పిందా విచారణలో వెల్లడించటంతో పోలీస్ శాఖ ఉలిక్కి పడింది. నభా జైలు దాడి... పటియాలాలోని నభా జైలుపై 2016 నవంబర్ చివరి వారంలో 10మంది సాయుధులు పోలీసు దుస్తుల్లో వచ్చి దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్, ఉగ్రవాది కశ్మీరా సింగ్ తోపాటు మరో నలుగురు గ్యాంగ్స్టర్లను విడిపించుకెళ్లారు. వారి పేర్లు విక్కీ గోండ్రా, గుర్ప్రీత్ సింగ్, నితిన్ డియోల్, విక్రమ్జీత్ సింగ్. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మింటూ... పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి థాయ్లాండ్లో శిక్షణ పొందిన హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూ పంజాబ్లో వేర్పాటువాద చిచ్చును రగిల్చేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని 2014 నవంబర్లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. నభా జైలు ఘటనలో అతను తప్పించుకోవటంతో అతన్ని పట్టుకునేందుకు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆపై పది రోజుల్లోనే మింటూను ఢిల్లీ సరిహద్దులో అరెస్ట్ చేశారు. ఇక జైలు నుంచి నలుగురు గ్యాంగ్స్టర్లలో ఇద్దరిని గతేడాది అదుపులోకి తీసుకోగా.. విక్కీతోపాటు మరొకరు ఇంతకాలం పరారీలో ఉన్నారు. ఉగ్రవాది కశ్మీరా సింగ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎట్టకేలకు విక్కీ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. -
మింటూ.. మామూలోడు కాదు!
చండీగఢ్: పంజాబ్ లోని నభా జైలు నుంచి తప్పించుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూకు సంబంధించి దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. నభా జైలులో ఉండగా అతడు పాకిస్థాన్ కు ఫోన్లు చేసినట్టు విచారణలో వెల్లడైంది. అతడు పాకిస్థాన్ లో ఎవరికి ఫోన్ చేశాడనే దానిపై దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఫోన్ కాల్ వివరాలు పరిశీలిస్తున్నారు. ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతిపరులు, ఐఎస్ఐ అధికారులతో మింటూ మాట్లాడినట్టు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ సహకారంతో మింటూ ఆగ్నేయాసియా, ఐరోపాలో తన కార్యకలాపాలు విస్తరించినట్టు భావిస్తున్నారు. అతడిని అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. నభా జైలు నుంచి తప్పించుకుని పట్టుబడ్డ అతడి దగ్గర కొంత డబ్బు దొరికింది. ఈ నగదు అతడికి ఎవరు ఇచ్చారో కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
నబా జైలుపై దాడి; ఓ వ్యక్తి అరెస్ట్
చండీగఢ్: పంజాబ్లోని నబా జైలుపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని షామ్లీలో కారులో వెళ్తుండగా పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. జైలుపై దాడికి పాల్పడినవారికి నిందితుడు సహకరించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్నవారు నేపాల్కు పారిపోయే అవకాశముందని సమాచారం రావడంతో ఉత్తరప్రదేశ్లో హై ఎలర్ట్ ప్రకటించారు. ఆదివారం నబా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతో పాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
నబా జైలు ఘటనలో విషాదం
-
నబా జైలు ఘటనలో విషాదం
చండీగఢ్: పంజాబ్లోని నబా జైలు ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఓ పికెట్ వద్ద ఆపకుండా వెళ్లిన కారుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఆదివారం నబా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతో పాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జైలు నుంచి సుమారు 50 కిలో మీటర్ల పరిధిలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఓ పికెట్ వద్ద కారు ఆపకుండా వెళ్లడంతో పోలీసులు కాల్పులు జరిపారు. -
పోలీసుల దుస్తుల్లో వచ్చారు.. వస్తూనే.. !
-
పోలీసుల దుస్తుల్లో వచ్చారు.. వస్తూనే.. !
అమృతసర్: కరుడుగట్టిన ఖలీస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ సింగ్ మింటూ జైలు నుంచి పరార్ కావడంతో పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దసంఖ్యలో వచ్చిన సాయుధులు నబా జైలుపై దాడి చేసి.. హర్మిందర్ సింగ్తోపాటు మరో నలుగురు గ్యాంగ్స్టర్లను విడిపించుకుపోయారు. ఈ సందర్భంగా వందరౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్టు సమాచారం. సాయుధులు దాడి చేసి.. అత్యంత భద్రత నడుమ ఉన్న కీలక తీవ్రవాద సూత్రధారిని జైలు నుంచి విడిపించుకొనిపోవడం తీవ్ర భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన, అనంతర పరిణామాలపై పంజాబ్ డీజీపీ, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ బాదల్ భేటీ అయి చర్చించారు. మరోవైపు ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనపై పలు వివరాలు తెలిపారు. దాదాపు 20 మంది సాయుధులు పోలీసు దుస్తుల్లో జైలును ముట్టడించారని, వస్తూనే పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూ విరుచుకుపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాయుధుల్లో ఒకడు ఏఎస్ఐ యూనిఫాం వేసుకోగా, మిగతావారు పోలీసు దుస్తులు వేసుకున్నారని చెప్పారు. మరోవైపు తప్పించుకుపోయిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. గస్తీని ముమ్మరం చేశారు. -
జైలుపై దాడి.. తీవ్రవాద చీఫ్ పరార్
-
ఫ్లాష్: జైలుపై దాడి.. తీవ్రవాద చీఫ్ పరార్
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయి.. ఆ తర్వాత హతమైన ఘటనను మరిచిపోకముందే.. పంజాబ్లో పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు ఒక జైలుపై విరుచుకుపడ్డారు. పంజాబ్లోని నభా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతోపాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. మింటూతోపాటు పరారైన నలుగురు కూడా గ్యాంగ్స్టర్లే కావడం గమనార్హం. గుర్ప్రీత్ సింగ్, విక్కీ గోండ్రా, నితిన్ డియోల్, విక్రమ్జీత్ సింగ్ అలియాస్ విక్కీ జైలు నుంచి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఖలీస్థాన్ చీఫ్ను జైలు నుంచి విడిపించుకొని వెళ్లేందుకే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. ఖలీస్థాన్ చీఫ్ జైలు నుంచి పరార్ కావడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పంజాబ్లో వేర్పాటువాద చిచ్చును రగిలిస్తున్న ఖలీస్థాన్ చీఫ్ను 2014 నవంబర్లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పంజాబ్లో అల్లకల్లోలం సృష్టించేందుకు మింటూ పాకిస్థాన్ ఐఎస్ఐ నుంచి థాయ్లాండ్లో శిక్షణ పొందాడని పోలీసులు గుర్తించారు.