Reit
-
మైండ్స్పేస్ చేతికి సస్టెయిన్ ప్రాపర్టీస్
న్యూఢిల్లీ: మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సస్టెయిన్ ప్రాపర్టీస్ను కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి సంస్థ విలువను రూ. 2,038 కోట్లుగా లెక్కగట్టి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈక్విటీ వాటా కోసం రూ.613 కోట్లు చెల్లించనుండగా, రూ.1,400 కోట్ల రుణభారం మైండ్స్పేస్ రీట్కు బదిలీ అవుతుంది. ప్రతిగా సస్టెయిన్ ప్రాపర్టీస్ షేర్హోల్డర్లకు మైండ్స్పేస్ రీట్లో యూనిట్లు లభిస్తాయి. ఒక్కో యూ నిట్కు రూ. 379.08 రేటు చొప్పున 1,61,68,090 యూనిట్లను సస్టెయిన్ ప్రాపర్టీస్ షేర్హోల్డర్లకు జారీ చేసే ప్రతిపాదనకు మైండ్స్పేస్ రీట్ బోర్డు ఆమోదముద్ర వేసింది. మార్చి ఆఖరు నాటికి డీల్ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్తో సస్టెయిన్ ప్రాపర్టీస్కి హైదరాబాద్లో కామర్జ్వన్ రాయ్దుర్గ్ పేరిట ఉన్న 18.2 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్.. మైండ్స్పేస్ రీట్ చేతికి దక్కుతుంది. యూనిట్హోల్డర్లకు మరింత విలువ చేకూర్చేలా ఈ డీల్ ఒక మైలురాయిగా ఉంటుందని మైండ్స్పేస్ రీట్ సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. ఆదాయాలు, కంపెనీ పోర్ట్ఫోలియోలు మెరుగుపడేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. కే రహేజా కార్పొరేషన్ గ్రూప్నకు చెందిన మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ 2020 ఆగస్టులో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. -
రీట్, ఇన్విట్.. పెరుగుతున్న ఆకర్షణ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్న కొద్దీ.. వీటిల్లోకి మరిన్ని పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇందుకు గతేడాది గణాంకాలే నిదర్శనం. 2023లో రీట్, ఇన్విట్లలోకి రూ.11,474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022లో వచి్చన రూ.1,166 కోట్లతో పోలిస్తే పది రెట్ల వృద్ధి గతేడాది నమోదైనట్టు తెలుస్తోంది. సెబీ తీసుకున్న చర్యలు, ఆకర్షణీయమైన రాబడులు ఈ సాధనాల దిశగా ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ఈ సాధనాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అంచనాను వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత అంచనా, విధానాల్లో వచి్చన మార్పులను ప్రస్తావిస్తున్నారు. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వడ్డీ రేట్లను తగ్గించే చర్యలు చేపట్టొచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారికి రీట్, ఇన్విట్లు ఆకర్షణీయంగా మారతాయి’’అని క్లారావెస్ట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు మనకి పరులేకర్ పేర్కొన్నారు. రీట్, ఇన్విట్ సాధనాల్లోకి భారీగా 2020లో రూ.29,715 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2021లో రూ.17,641 కోట్లు వచ్చాయి. రీట్,ఇన్విట్లను ఏడెనిమిదేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో 23 రిజిస్టర్డ్ ఇన్విట్లు, ఐదు రీట్లు ఉన్నాయి. వీటి నిర్వహణలో మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రీట్ల ద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో, ఇన్విట్ల ద్వారా ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. -
ఎంబసీ రీట్ నుంచి బ్లాక్స్టోన్ ఔట్
న్యూఢిల్లీ: లిస్టెడ్ సంస్థ ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్) నుంచి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్స్టోన్ వైదొలగినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్లో తమకుగల మొత్తం 23.5 శాతం వాటాను విక్రయించినట్లు వెల్లడించాయి. ఒక్కో షేరుకి రూ. 316 సగటు ధరలో వాటా విక్రయాన్ని చేపట్టినట్లు తెలిపాయి. బుధవారం ముగింపు ధర రూ. 331తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్కాగా.. తద్వారా బ్లాక్స్టోన్ రూ. 7,100 కోట్లు సమకూర్చుకున్నట్లు అంచనా. ఈ బ్లాక్డీల్స్లో ఏడీఐఏసహా ప్రస్తుత యూనిట్ హోల్డర్లు, ఎస్బీఐ ఎంఎఫ్ తదితర కొత్త ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్స్టోన్, ఎంబసీ గ్రూప్ సంయుక్తంగా ప్రమోట్ చేసిన ఎంబసీ ఆఫీస్ పార్క్స్ దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన తొలి రీట్గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2019లో చేపట్టిన ఐపీవోలో భాగంగా రూ. 5,000 కోట్ల సమీకరణ ద్వారా లిస్టయ్యింది. సంస్థలో దేశీ ఎంబసీ గ్రూప్నకు సుమారు 8 శాతం వాటా ఉంది. -
రీట్ హోల్డర్లకు ప్రత్యేక హక్కులు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్లకూ మార్గమేర్పడనుంది. యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. -
వాణిజ్య ప్రాపర్టీకి యజమాని అవుతారా..! రూ.కోట్లతో పని లేదు..
ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. నివాసం కోసం కొనుగోలు చేసే ఇల్లు ఎప్పటికీ పెట్టుబడి కాబోదు. రాబడులు అందించేదే పెట్టుబడి అవుతుంది. ఆ విధంగా చూస్తే వాణిజ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడి కిందకే వస్తుంది. మరి వాణిజ్య ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే రూ.కోట్ల పెట్టుబడి కావాలి. అంత పెట్టుబడి అందరికీ సాధ్యపడదు. రూ.కోట్లతో పని లేకుండా, వెయ్యి రూపాయలు ఉన్నా.. వాణిజ్య ప్రాపర్టీకి యజమానులను చేసేవే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్/ఆర్ఈఐటీ)లు. ప్రతీ ఇన్వెస్టర్కు ఇవి అనుకూలమని చెప్పడానికి కుదరదు. కొందరికే అనుకూలం. రీట్లో పెట్టుబడితో ప్రయోజనం ఏ మేరకు? ఎవరికి అనువైనవో తెలియజేసే కథనం ఇది... రియల్ ఎస్టేట్ అనేది భారతీయులకు ఎంతో ఇష్టమైన ప్రాధాన్య పెట్టుబడుల్లో ఒకటిగా ఉంటుంది. ఇల్లు లేదా ఫ్లాట్పైనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే తమ బడ్జెట్ ధరలో ఇవి అందుబాటులో ఉంటాయి కనుక. అదే ఓ కమర్షియల్ షాప్ లేదా బిల్డింగ్ కొనుగోలు చేయాలంటే కొంచెం అధిక మొత్తం కావాల్సి వస్తుంది. వ్యక్తులు వాణిజ్య ప్రాపర్టీలపై తక్కువగా పెట్టుబడులు పెట్టడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఇదే. అయినా కానీ, తమ శక్తికొద్దీ, తమ బడ్జెట్ పరిధిలోనే వాణిజ్య రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకునే వారికోసం ఉద్దేశించినవి రీట్లు. ఇన్వెస్టర్లకు మరిన్ని సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలనే సంక్పలంతో సెబీ వీటికి అనుమతించింది. భారత స్టాక్ ఎక్ఛ్సేంజ్లలో లిస్ట్ అయిన తొలి రీట్ ‘ఎంబసీ ఆఫీస్ పార్క్స్’. రూ.4,750 కోట్లను సమీకరించి 2019 ఏప్రిల్లో ఇది లిస్ట్ అయింది. ఇన్వెస్టర్ల ముందున్న మార్గం? రీట్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ప్రాపర్టీ మార్కెట్లలో గ్రేడ్ ఏ ఆఫీసు స్థలాలపై పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నట్టు శోభిత్ అగర్వాల్ తెలిపారు. అలాగే, భవిష్యత్తులో మెరుగైన డివిడెండ్ ఆదాయానికి అవకాశం ఉంటుంది. రీట్ను వైవిధ్యానికి ఉపకరణంగా భావించి, తన మొత్తం పెట్టుబడుల్లో కొంత మేరకు వీటికి కేటాయించుకోవడాన్ని పరిశీలించొచ్చు. ‘‘మీ ఆర్థిక పరిస్థితులు అనుమతిస్తే మొత్తం పెట్టుబడిలో కొంత మొత్తాన్ని రీట్కు కేటాయించుకోవచ్చు. కానీ, ఒకరి మొత్తం పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్ లేదా రీట్ మాదిరి రియల్ ఎస్టేట్ సాధనాల్లో 10–30 శాతం మించి ఉంచకూడదు’’అని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంజీవ్ గోవిల సూచించారు. రీట్లు మన దేశంలో కొత్త తరహా పెట్టుబడి సాధనాలు. కనుక వీటి రాబడులను స్టాక్ మార్కెట్ రాబడులతో పోల్చుకోకూడదు. రాబడులు ఎలా..? రీట్లో పెట్టుబడులపై రెండు రకాలుగా రాబడి ప్రయోజనానికి అవకాశం ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో యూనిట్ ధర వృద్ధి చెందడం ద్వారా పెట్టుబడి విలువ పెరుగుతుంది. యూనిట్ ధర పెరగడానికి రెండు అంశాలు దోహదం చేస్తాయి. ఆ రీట్ నిర్వహణలోని ఆస్తుల విలువ పెరగడం, ఆయా ఆస్తులపై అద్దె రాబడి పెరగడం యూనిట్ విలువను పెంచుతుంది. మరో రూపంలో ఇవి డివిడెండ్ చెల్లిస్తుంటాయి. కాకపోతే స్టాక్స్తో పోలిస్తే వీటిల్లో డివిడెండ్ పంపిణీ ఎక్కువగా ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం రీట్లు తమ పోర్ట్ఫోలియోలో 80 శాతం ఆదాయాన్నిచ్చే ఆస్తులు కలిగి ఉండాలి. అంటే నిర్మాణం పూర్తయి క్రమం తప్పకుండా అద్దె ఆదాయం వచ్చేవి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నవి కావొచ్చు. దీంతో 80 శాతం ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేయడానికి వీలుంటుంది. రెంట్, లీజు ఆదాయానికి తోడు, రియల్ ఎస్టేట్ విలువ పెరగడం రూపంలోనూ యూనిట్దారులకు ఆదాయం వస్తుందని అనరాక్ క్యాపిటల్ సీఈవో, ఎండీ శోభిత్ అగర్వాల్ తెలిపారు. సానుకూలతలు.. అధిక రాబడులు ఇచ్చే వాణిజ్య రియల్టీలో స్వల్ప మొత్తం పెట్టుబడికి రీట్ వీలు కల్పిస్తుంది. కావాలంటే ఒక్క యూనిట్ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. లిస్ట్ అయిన అన్ని రీట్లలో ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్ యూనిట్ ధర రూ.303గా ఉంది. అంటే రూ.303తో ఇందులో పెట్టుబడికి అవకాశం ఉంటుంది. రిటైల్ మాల్స్తో కూడిన నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్లో అయితే రూ.107తో ఒక యూనిట్ కొనుగోలు చేసుకోవచ్చు. అద్దె ఆదాయం రూపంలో రీట్లకు స్థిరంగా ఆదాయం వస్తుంటుంది. పన్నులు పోను 90 శాతం లాభాన్ని వాటాదారులకు పంపిణీ చేయాలనేది నిబంధన. కనుక ప్రతీ మూడు నెలలకు రీట్ యూనిట్ వాటాదారులకు ఆదాయం వస్తుంటుంది. కచ్చితంగా, నూటికి నూరు శాతం డివిడెండ్ వస్తుందన్న గ్యారంటీ ఉండదు. ఆర్థిక సంక్షోభ సమయాల్లో, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో రాకపోవచ్చు. లేదా డివిడెండ్ ఆదాయం పంపిణీని తగ్గించొచ్చు. కానీ అవి తాత్కాలిక పరిణామాలే. రీట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. ఇతర సాధనాలతో పాటు వీటికి కొంత కేటాయింపులు చేసుకోవడం ద్వారా వైవిధ్యం చేసుకోవచ్చు. ప్రతికూలతలు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ట్రేడ్ అవుతుంటాయి కనుక రీట్లలో ముందుగా మార్కెట్ రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ, జాతీయ పరిణామాల ప్రభావం ఈక్విటీ మార్కెట్లపై ఉన్నట్టే.. వీటి ధరల్లోనూ అస్థిరతలు ఉంటాయి. ఇతర షేర్ల మాదిరే డిమాండ్ సరఫరా వీటి యూనిట్ ధరలను నిర్ణయిస్తుంది. క్లియర్ టైటిల్ కాకపోతే రీట్లు న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రీట్లలో ఉన్న ఒక పెద్ద ప్రతికూలత ఏమిటంటే, అవి కలిగి ఉన్న రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువపైనే యూనిట్ నికర విలువ (ఎన్ఏవీ) ఆధారపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతే, అది యూనిట్ ధరపైనా ప్రతిఫలిస్తుంది. దాంతో నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతున్నాయని తెలిస్తే, వెంటనే పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి. పెట్టుబడి శ్రేణి ఆఫీస్ స్థలాలు డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోతే, స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి వాటి ఆస్తుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని, ఇది కూడా ఒక రిస్కేనని అగర్వాల్ తెలిపారు. ఆఫీసు స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్నే రీట్లు వాటాదారులకు పంపిణీ చేస్తాయి. మరి రీట్ల నిర్వహణలోని ఆస్తుల్లో ఆక్యుపెన్సీ (భర్తీ) ఇక్కడ కీలకం అవుతుంది. కొంత స్థలం ఖాళీగా మిగిలిపోతే ఆ మేరకు ఆదా యం తగ్గిపోతుంది. అది డివిడెండ్ పంపిణీని ప్రభావితం చేస్తుంది. ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ క్షీణత సందర్భాల్లో కార్యాలయ స్థలాలకు ఖాళీ ఏర్పడవచ్చు. చివరిగా రీట్లలో పెట్టుబడులకు తప్పనిసరిగా బ్రోకర్ వద్ద ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగి ఉండాల్సిందే. రీట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల్లో వేటిని ఎంపిక చేసుకోవాలి, ఎప్పుడు వాటి నుంచి బయటపడాలి, తిరిగి ఎప్పుడు వాటిల్లో పెట్టుబడులు పెట్టాలనే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు అంతగా అవగాహన ఉండదు. అటువంటప్పుడు వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం మూడు రకాల రీట్ మ్యూచువల్ ఫండ్స్ మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రీట్ యూనిట్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. కాకపోతే ఇవి మన మార్కెట్ ఒక్కటే అని కాకుండా ఇతర దేశాల మార్కెట్లలోని రీట్లలోనూ ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. అంటే వివిధ దేశాల రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు వర్గీకరించినట్టుగా అర్థం చేసుకోవాలి. కోటక్ ఇంటర్నేషనల్ రీట్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) ఇందులో ఒకటి. దేశంలో రీట్ ఆధారిత తొలి మ్యూచువల్ ఫండ్ పథకం ఇది. 2020 డిసెంబర్లో మొదలైంది. రూ.100 కోట్లను సమీకరించింది. ఈ పథకం భారత్తో పాటు సింగపూర్, ఆస్ట్రేలియా, హాంగ్కాంగ్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. గడిచిన ఏడాది కాలంలో 7 శాతం నష్టాలను ఇచ్చింది. పీజీఐఎం ఇండియా గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ ఎఫ్వోఎఫ్ మరొక పథకం. ఈ పథకం తన పెట్టుబడులు తీసుకెళ్లి పీజీఐఎం గ్లోబల్ సెలక్ట్ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 12 దేశాల్లోని రీట్లలో ఈ పేరెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పథకం గత ఆరు నెలల్లో 2 శాతం రాబడులు ఇస్తే, ఏడాది కాలంలో రాబడి సున్నాగా ఉంది. మహీంద్రా మనులైఫ్ ఆసియా పసిఫిక్ రీట్ ఎఫ్వోఎఫ్ పథకం 2021 సెప్టెంబర్లో మొదలైంది. ఈ పథకం తన పెట్టుబడులు తీసుకెళ్లి మనులైఫ్ గ్లోబల్ ఫండ్ ఆసియా పసిఫిక్ రీట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ పథకం గత ఏడాది కాలంలో 5 శాతం నష్టాలను ఇచ్చింది. ఈ మూడు ఫండ్ రీట్లలో ఏడాది కాలంలో ఎలాంటి రాబడులు లేవు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఇన్వెస్టర్లు మరికొంత కాలం పాట వేచి చూడడమే సరైనది అవుతుంది. వీటికి బదులు లిస్టెడ్ రీట్లు కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాయి. రీట్ అంటే..? మ్యూచువల్ ఫండ్ మాదిరే రీట్ కూడా. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకం ఎన్నో స్టాక్స్లో పెట్టుబడులు పెడుతుంటుంది. కానీ, ఇన్వెస్టర్లకు షేర్లకు బదులు యూనిట్లను కేటాయిస్తుంటుంది. రీట్ కూడా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలపై పెట్టుబడులు పెడుతుంది. ఆయా ప్రాపర్టీలకు సంబంధించి యూనిట్లను కేటాయిస్తుంది. ఫండ్స్ నిర్వహణలో షేర్లు, ఈటీఎఫ్లు, బాండ్లు, సెక్యూరిటీలు ఉన్నట్టే, రీట్ల నిర్వహణలో రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉంటాయి. ప్రస్తుతం మూడు రీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ట్రస్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ వాణిజ్య ప్రాపర్టీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ మూడింటి నిర్వహణలో దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో 93 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య ఆఫీసు స్థలాలు ఉన్నాయి. ‘‘ఈ మూడు రీట్లు లిస్టింగ్ ధరతో పోలిస్తే ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో రాబడులు, నగదు, డివిడెండ్ ఈల్డ్, క్యాపిటల్ వృద్ధి కలిపి వార్షికంగా 13–15 శాతం మధ్య ఉన్నాయి’’అని కొలియర్స్ ఇండియా ఎండీ పీయూశ్ గుప్తా తెలిపారు. ఇవి వార్షికంగా 5–6 శాతం మధ్య రాబడిని త్రైమాసికం వారీగా యూనిట్దారులకు చెలిస్తున్నాయి. ఇవి కాకుండా రిటైల్ షాపులతో కూడిన మాల్స్ను నిర్వహించే నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పేరుతో మరో రీట్ కూడా ఉంది. -
ఐపీవోకు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తద్వారా 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. వెరసి దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న తొలి రిటైల్ రంగ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. కంపెనీకి 14 నగరాలలో నిర్వహణలోగల 17 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీటిలో 3,000 స్టోర్స్ ఉన్నాయి. కోటి చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న ఈ పోర్ట్ఫోలియో విలువ 300 కోట్ల డాలర్లుగా అంచనా. 2023 క్యాలండర్ ఏడాది తొలి అర్ధభాగంలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మూడో రీట్.. నెక్సస్ సెలెక్ట్ బ్లాక్స్టోన్ పెట్టుబడులు గల మూడో రీట్కాగా.. తొలుత ఎంబసీ ఆఫీస్ పార్క్స్, తదుపరి మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లను వెలువరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రీట్ను దేశీయంగా కొద్దికాలంక్రితమే అనుమతించారు. వీటి ద్వారా రియల్టీ ఆస్తుల విలువను అన్లాక్ చేయడంతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో మూడు రీట్లు ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్ఫీల్డ్ ఇండియా లిస్టయ్యాయి. అయితే ఇవి లీజ్డ్ ఆఫీస్ ఆస్తులుకాగా.. నెక్సస్ సెలెక్ట్ రిటైల్ రియల్టీ ఆస్తులతో కూడిన తొలి అద్దె ఆదాయ కంపెనీ కావడం గమనార్హం! -
ఎంబసీ ఆఫీస్ పార్క్స్ నుంచి రూ.5,000 కోట్ల రీట్
న్యూఢిల్లీ: రీట్ (రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) ద్వారా రూ.5,000 కోట్ల సమీకరణకు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్స్టోన్, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు కంపెనీలు కలసి ఎంబసీ ఆఫీస్ పార్క్స్ పేరుతో ఒక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీ రీట్ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ఆఫర్ డాక్యుమెంట్ను ఈ జేవీ ఇటీవలనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇదే మన దేశపు తొలి రీట్ కానుంది. ఈ రీట్ ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించాలని, వీలైతే అదనంగా మరో 25 శాతం నిధులను కూడా సమీకరించాలని ఈ జేవీ యోచిస్తోంది. ఈ రీట్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇష్యూకు వచ్చే అవకాశాలున్నాయి. మార్కెట్ పరిస్థితులు, వివిధ సంస్థల ఆమోదాల లభ్యతను బట్టి ఈ రీట్ ఎప్పుడు వచ్చేది ఆధారపడి ఉంటుంది. అద్దెలు వచ్చే రియల్ ఎస్టేట్ ఆస్తులను నిర్వహించే ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్గా రీట్ను చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్ ఎవరైనా ఈ ప్లాట్ఫార్మ్పై ఇన్వెస్ట్ చేసి ఆదాయం పొందవచ్చు. -
ఆర్ఈఐటీ నిబంధనల మార్పునకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)ల నిబంధనలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన సలహాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వీటి ఆస్తుల కనీస పరిమాణాన్ని రూ. 1,000 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అధిక రిస్క్ల నేపథ్యంలో తొలి దశకింద పెద్ద ఇన్వెస్టర్లకు మాత్రమే వీటిలో పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించేందుకు ప్రతిపాదించింది. వెరసి కనీస పెట్టుబడి పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లతోపాటు, దేశీ బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్ తదితరాలు వీటిలో ఇన్వెస్ట్చేసేందుకు వీలు కల్పించింది. ఆర్ఈఐటీ నిబంధనలతోపాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్స్)లకు సంబంధించిన మార్గదర్శకాలకు కూడా ఈ నెల 10న(ఆదివారం) జరగనున్న సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 12వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇన్ఫ్రా రంగానికి అవసరమయ్యే రూ. 65 లక్షల కోట్ల పెట్టుబడుల సమీకరణకు వీలు కల్పించే యోచనతో ఇన్విట్స్కు తెరలేపింది. సెబీ బోర్డు సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యే అవకాశముంది. జైట్లీ ప్రకటించిన సాధారణ బడ్జెట్లో రియల్టీ, ఇన్ఫ్రా ట్రస్ట్లలో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.