Respiration
-
Delhi Stampede: ఆ ఐదుగురి ఉసురు తీసింది ఈ వైద్య పరిస్థితే..!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 18 మంది ప్రాణాలు కోల్పోగా, పదిమందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఆ బాధితులలో ఐదుగురు మాత్రం బాధకరమైన పరిస్థితితో మరణించినట్లు ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ ఘటన ఫుట్ఓవర్ వంతెనపై నుంచి దిగుతుండగా కొంతమంది ప్రయాణికులు జారిపడి పడిపోవడంతో చోటుచేసుకుందన్న సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకున్నట్లు ఆ ఐదుగురు బాధితులు మాత్రం తొక్కిసలాట కారణంగా చనిపోలేదంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. ప్రయాణీకులతో కిక్కిరిసిన ప్రదేశాల్లో కొందరికి అలాంటి వైద్య పరిస్థితి ఎదురై ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు. ఇంతకీ అస్సలు ఆ బాధితులు మరణానికి ప్రధాన కారణం ఏంటి..?. ఆ వైద్య పరిస్థితిని ఏమని పిలుస్తారు..? ఎలా నివారించాలి..?ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్లో రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిఖిల్ మోడీ ఐదుగురు బాధితుల మరణానికి ప్రధాన కారణాన్ని వివరించారు. వారంతా ట్రామాటిక్ అస్ఫిక్సియా అనే శ్వాసకోశ వ్యాధి కారణంగా మృతి చెందినట్లు వెల్లడించారు. బాధితుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఈ పరిస్థితికి గురయ్యినట్లు తెలిపారు.అలాగే ఆ ఆస్పత్రి సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ..గాయపడిన బాధితులను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకురాలేదని, కానీ ఈ ఐదు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నుంచి ఆర్ఎంఎల్కి తరలించడంతో ఈ విషయం నిర్థారణ అయినట్లు తెలిపారు. అంతేగాదు ఆ నివేదికలో ఆ వైద్య పరిస్థితి గురించి సవివరంగా పేర్కొన్నారని సదరు వైద్యుడు వెల్లడించారు. ఇంతకీ ఏంటీ ట్రామాటిక్ అస్ఫిక్సియా..?ట్రామాటిక్ అస్ఫిక్సియాట్రామాటిక్ అస్ఫిక్సియాను క్రష్ అస్ఫిక్సియా అని కూడా పిలుస్తారు. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై తీవ్ర ఒత్తిడిని కలుగజేసితే సంభవిస్తుంది. ఈ తీవ్రమైన శక్తి డయాఫ్రాగమ్ విస్తరించకుండా నివారిస్తుంది. ఫలితంగా సాధారణ శ్వాస కూడా కష్టమవుతుంది. అదనంగా పీడనం రక్తాన్ని పైశరీరంలోకి తిరిగి నెట్టివేస్తుంది. దీనివలన ముఖం, మెడ, కళ్లల్లో పెటెచియే(కేశనాళికలు పగిలిపోవడం వల్ల ఊదా-ఎరుపు రంగు మారడం) వంటి సంకేతాలు కనిపిస్తాయి. అంటే తల, పై శరీరం వాపుకి గురైనట్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే బాధితుడు నిమిషాల్లోనే స్ప్రుహ కోల్పోవచ్చు. తదనంతర అంతర్గత అవయవాలు వైఫల్యం జరిగి నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వ్యక్తులకు పరిస్థితి విషమించక మునుపే సకాలంలో ఆక్సిజన్ థెరపీ వంటి వైద్య చికిత్సలు అందిస్తే తొందరగా ఆ విషమ పరిస్థితి నుంచి బయటపడేలా చేయడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితి ఊపిరాడనంత రద్దీ ప్రదేశాల్లో కొందరికి ఎదురవుతుందని చెబుతున్నారు.అయితే ఇలాంటి శ్వాసకోశ సమస్యను నివారించాలంటే ప్రమాదకరమైన వాతావరణం లేదా రద్దీ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటేనే సాధ్యమని తేల్చి చెప్పారు వైద్యులు. అంతేగాదు అధికారులు సైతం ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉత్ఫన్నం కాకుండా నివారించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తులు చేపట్టారు.(చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్తో..) -
చైనాలో పెరుగుతున్న కేసులు..ఆరు రాష్ట్రాల్లో అలర్ట్!
చైనాలో కొత్తగా నిమోనియా కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ముఖ్యంగా చైనాలోని చిన్నారులే ఈ నిమోనియా వ్యాధి బారిన పడటంతో సర్వత్రా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. తమ పరిధిలో ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో అనే ఆరోగ్య సంసిద్ధతపై సమగ్రస్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలని ప్రకటన చేసింది. దీంతో దాదాపు ఆరు రాష్ట్రాలు తమ పరిధిలోని ఆరోగ్య మౌలిక సదుపయాలను అప్రమత్తం చేశాయి. ఈ మేరకు రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాల ఆరోగ్య శాఖ శ్వాసకోసశ సంబంధిత సమస్యలతో వచ్చే రోగులకు సత్వరమే వైద్యం అందించేలా సంసిద్ధంగా ఉండేటమేగాక ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకోవాలని ఆస్పత్రులను, సిబ్బందిని కోరింది. నిజానికి సీజనల్గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే కాలానుగుణంగా ఈ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే గైడ్లైన్స్లు కూడా వారికి అందించాలని పేర్కొంది. ఇక రాజస్థాన్ ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం..ప్రస్తుతం పరిస్థితి ఏమీ అంత ఆందోళనకరంగా లేదని తెలిపింది. అయినప్పటికీ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి, అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం తోపాటు పీడియాట్రిక్ యూనిట్లతో సహా మెడిసిన్ విభాగాలలో తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలాగే గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేశ్ మాట్లాడుతూ..ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలన్నింటిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడూ ఆయా ప్రభుత్వ ఆస్పత్రులన్నీ తమ ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించాలని ఆరోగ్య అధికారులను కోరారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా శ్వాసకోశ వ్యాధులపై నిఘా పెంచాలని ఆరోగ్య అధికారులను ఆదేశించింది. పైగా ఉత్తరాఖండ్లోని దాదాపు మూడు జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మరింత కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. హర్యానా రాష్ట్రం ప్రభుత్వం ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులను శ్వాసకోస సమస్యకు సంబంధించిన కేసు వస్తే వెంటనే నివేదించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. తమిళనాడు ఆరోగ్య శాఖ కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకు పిల్లలకు సంబంధించిన న్యూమోనియో కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ. ఒకవేళ ఏ కేసు అయినా నమోదైతే వెంటనే పరిష్కరించేలా ఆరోగ్య సంసిద్ధతను సమీక్షించుకునేలా అధికారుల అప్రమత్తంగా ఉండేందుకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొంది. ఆ కరోనా మహమ్మారి వచ్చిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా చైనాలో పిల్లలో ఈ కొత్త తరహ నిమోనియా కేసులు నమోదవ్వడంతో ప్రపంచదేశాలన్ని ఉలిక్కిపడ్డాయి. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడూ పరిస్థితి గురించి వెల్లడించాలని చైనాను ఆదేశించడంతో ప్రపంచదేశాలన్నీ కలవరపాటుకు గురయ్యాయి. చైనా మాత్రం శీతకాలం తోపాటు వివిధ వ్యాధి కారకాల వల్లే ఈ వ్యాధి ప్రబలినట్లు వివరణ ఇచ్చుకుంది. పైగా ఇది కోవిడ్-19 మహమ్మారి సమయం నాటి తీవ్రత కాదని కూడా స్పష్టం చేసింది చైనా. (చదవండి: శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమిదే : చైనా) -
జీవన చలనం
చలనం ఉండాలి; మనకు చలనం అన్నది కావాలి. చలనంతో మనం సాగుతూ ఉండాలి. మనలోని రక్తంలో చలనం లేకపోతే మనం ఉండం. మన రక్తంలో ఉన్న చలనం మన తీరులోనూ ఉండాలి. చలనం లేకుండా ఆగిపోయిన నీరు బురద అయిపోతుంది. చలనం లేకపోతే ఎవరి జీవనం అయినా ఎందుకూ పనికి రాకుండా పోవడమే కాదు హానికరం అయిపోతుంది కూడా. చలనం పరంగా ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు మనకు తొలిపాఠాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల చలనం లేకపోతే మనం మనకే చెందం కదా? శ్వాసకు చలనం ఉండడంవల్లే మనం బతుకుతూ ఉన్నాం; మనకు ఉన్నవి ఉండడానికి కారణం శ్వాసకు చలనం ఉండడమే. మనం చలనంతో ఉండాలి అన్న ఆలోచన శ్వాసలాగా మనకు ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. మనిషికి ప్రధానమైన వ్యాధి స్తబ్దత. ఈ స్తబ్దతకు వైద్యం, విరుగుడు చలనం. అడుగు వేస్తే పడిపోతాం అనుకుని స్తబ్దతలో ఉండిపోవడం సరికాదు. భద్రత కోసం అనో, జరిగిపోతోంది కదా అనో స్తబ్దతలో, స్తబ్దతతో ఉండిపోవడం పెనుదోషం. ఆ దోషం ముదిరితే అది పాపంగా కూడా పరిణమిస్తుంది. ‘జీవితం వెనక్కు వెళ్లదు; అది నిన్నటితో ఉండిపోదు’ అని కవి–తాత్త్వికుడు ఖలీల్ జిబ్రాన్ ఒక సందర్భంలో అంటారు. చలనం అన్నది ఉంటుంది, ఉండాలి కాబట్టి ఆయన అలా అన్నారు. చలనం లేకుండా స్తబ్దతలో ఉండిపోతే జీవితం వెనక్కు, ఆ వెనక్కు పడిపోతుంది, జీవితం నిన్నటితో ఉండిపోవడం కాదు మొన్నటికీ, అటు మొన్నటికీ జారిపోతుంది. జీవితం నుంచి జీవనం జారిపోకూడదు; జీవనానికి జీవితం లేకుండా పోకూడదు. అందుకు స్తబ్దత కాదు చలనం కావాలి; చలనం ఉండాలి. సేద తీరచ్చు కానీ స్తబ్దతలో ఉండిపోకూడదు. అలిసిపోవడం సహజమైందే కానీ బిగుసుకుపోవడం అసహజమైంది. స్తబ్దతకు మలిదశ బిగుసుకుపోవడం. స్తబ్దత, బిగుసుకుపోవడం మనుగడలో ఉన్న మనిషి లక్షణాలు కావు, కాకూడదు. మరణించిన వ్యక్తి లక్షణాలు స్తబ్దత, బిగుసుకుపోవడం. మరణించాక తప్పనిసరిగా వచ్చేవి అవి. కాబట్టి మరణం రానంత వరకూ అవి మన దగ్గరకు రాకూడదు. మనుగడ ఉన్నంతవరకూ మనం వాటిని రానివ్వకూడదు. స్తబ్దత కారణంగా మనుగడలో ఉన్న మనం మరణించిన వ్యక్తులంలాగా మారిపోకూడదు. మరణించాక కూడా జీవించి ఉండేందుకు మనం చలనాన్ని ఒంటపట్టించుకోవాలి. మెరుపు మెరుపయింది చలనం వల్లే. గాలికి చలనం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? మేఘాలకు, భూమికి చలనం అన్నది లేకపోతే మనకు ఉండేది ఏమిటి? మనకు మనగడే ఉండదు. చలనం అన్నది లేకపోతే మనం ప్రపంచానికి ఉండం; మనకు ప్రపంచం ఉండదు. చలనం లేకపోతే గమనం ఉంటుందా? ఉండదు. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. జీవితానికి జీవనం ఉన్నప్పుడు జీవనానికి చలనం ఉండాలి. స్తబ్దతలో మనల్ని మనం మోసుకుంటూ ఉండిపోవడం జీవనం కాదు; స్తబ్దతతో మనం మనకే బరువైపోవడం జీవితం కాదు. చలనం ఇంధనం కాగా జీవితం పండాలి. జీవితానికి జ్వలనం కావాలంటే జీవనానికి చలనం కావాలి. నది నది అయ్యేది చలనం వల్లే. చలనమే లేకపోతే నది అన్నదే లేదు; నది లేకపోతే జరగాల్సిన మేలు జరగదు. చలనం వల్ల ఏం మేలు జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో నది మనకు తెలియజెబుతునే ఉంది. నదిని మనం స్ఫుర్తిగానూ, ఆదర్శంగానూ తీసుకోవాలి. మనం చలనంతో నదిలాగా బతకాలి; బతుకే గెలుపై మనం మునుముందుకు నడుస్తూ ఉండాలి. జీవనం అంటేనే గమనం. గమనానికి ఆరంభం చలనం. గమనానికి మాత్రమే కాదు ఏ గమ్యానికైనా తొలిచుక్క చలనమే. – రోచిష్మాన్ -
సిలికోసిస్కు చికిత్స ఉందా?
పల్మునాలజీ కౌన్సెలింగ్ నా వయసు 55. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడిదగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. - కె. పద్మనాభరావు, విజయవాడ మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్లో మూడు రకాలు ఉన్నాయి. అవి... క్రానిక్ సిలికోసిస్: ఇది చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది. యాక్సిలరేటెడ్ సిలికోసిస్: సాధారణంగా కేవలం 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అక్యూట్ సిలికోసిస్: కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే చాలా ఎక్కువ మొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరితీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. సమయం పెరుగుతున్నకొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు ఒకసారి మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ -
నిమోనియా హాయైన శ్వాస కోసం!
శ్వాసక్రియ జరగకుండా మనిషి ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేడు. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి వెళ్లిన గాలి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అది జీవక్రియలకు అవసరమైన ఆక్సిజన్ను ఊపిరితిత్తుల చివరి భాగమైన అల్వియైలై అనే గాలి గదిలో మార్పిడి చేసి... జీవక్రియల్లో విడుదలైన హానికర వ్యర్థవాయువులైన కార్బన్డయాక్సైడ్ వంటి వాటిని అక్కడి నుంచి బయటకు తీసుకువస్తుంది. ఈ కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండటం వల్లనే ప్రాణులు జీవించగలుగుతున్నాయి. ఊపిరితిత్తులలోని అత్యంత కీలకమైన గాలిగది ఆల్వియోలై అనే భాగంలో ఈ ఆక్సిజన్, కార్బన్డైయాక్సైడ్ల మార్పిడి జరుగుతుంటుంది. ఏదైనా కారణాల వల్ల ఆల్వియోలైలో ద్రవాలు చేరితే వాయుమార్పిడి జరగక శ్వాసక్రియ సక్రమంగా సాగదు. ఆ పరిస్థితినే నిమోనియా అంటారు. ఈ నెల 12న ప్రపంచ నిమోనియా దినం సందర్భంగా ఆ వ్యాధిపై అవగాహన కోసమే ఈ కథనం. నిమోనియా వచ్చే పరిస్థితులు ఎవరెవరిలో..? నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ సోకడం అంటే అది కాస్త తీవ్రమైన పరిస్థితే. సాధారణంగా ఏ వయసు వారిలోనైనా కనిపించే ఇది పిల్లల్లోనూ, 65 ఏళ్లు పైబడ్డవారిలోనూ ఎక్కువ. దీనికి తోడు సాధారణంగా గుండెజబ్బులు, డయాబెటిస్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, వంటివి ఉన్నవారికి తేలిగ్గా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా చలికాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పొగతాగే అలవాటు ఉన్నవారికి నిమోనియా వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఊపిరితిత్తుల పనితీరు ఇలా..! మనం శ్వాసించే సమయంలో ముక్కు ద్వారా గాలిని పీల్చుకుంటాం. ఇది తొలుత ట్రాకియా అనే గాలిగొట్టం నుంచి లోనికి ప్రవేశిస్తుంది. ఇదే ట్రాకియా బ్రాంకై అనే రెండు గొట్టాలుగా విడిపోయి- ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి... బ్రాంకియోల్స్ అని పిలిచే అనేక శాఖలుగా చీలిపోతాయి. ఈ బ్రాంకియోల్స్ చివర గాలి తిత్తులు ఉంటాయి. వీటినే ఆల్వియోలై అంటారు. మనం గాలి పీల్చే సమయంలో మన ముక్కు, నోరు ద్వారా రోగకారక క్రిములు ట్రాకియా మార్గం నుంచి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆల్వియోలైలోకీ చేరే అవకాశం ఉంది. ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా చూసేందుకు మన రోగనిరోధక శక్తి, దాంతోపాటు... మన ముక్కు ఆకృతి, ఫ్యారింగ్స్ తోడ్పడతాయి. అవి ప్రవేశించినప్పుడు దగ్గడం ద్వారా వాటిని బయటకు పంపే ఏర్పాటుతో పాటు... బ్రాంకై అనే గాలిగొట్టాల్లో ఉన్న సీలియా అనే వెంట్రుకల వంటి నిర్మాణం... ఎల్లప్పుడూ ఒక ఎస్కలేటర్లా స్పందిస్తూ రోగకారక అంశాలను బయటకు పంపివేస్తూ ఉంటాయి. ఏదైనా కారణాల వల్ల మన రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, రోగకారక క్రిములు శరీరంలోకి ప్రవేశించడమో లేదా మనమే ఎక్స్పోజ్ కావడమో జరిగినప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. ఇలాంటి సమయాల్లో మన తెల్లరక్తకణాలు ఆల్వియోలైలోకి ప్రవేశించి అక్కడ ఉన్న రోగకారక క్రిములపై దాడి చేస్తాయి. ఇలా జరిగే క్రమంలో మన ఆల్వియోలైలో తెల్లరక్తకణాలు, ప్రోటీన్లు, ఇతర ద్రవాలు, ఎర్రరక్తకణాలు నిండిపోతాయి. ఫలితంగా నిమోనియా లక్షణాలు బయటపడతాయి. నిమోనియా - దుష్ర్పభావాలు నిమోనియాను యాంటీబయాటిక్స్తో చాలా తేలిగ్గానే తగ్గించవచ్చు. అయితే కొందరిలో కొన్ని సందర్భాల్లో నిమోనియాను నిర్లక్ష్యం చేయడం వల్ల కనిపించే దుష్ర్పభావాలు (కాంప్లికేషన్స్) చాలా త్రీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా హై-రిస్క్ గ్రూపునకు చెందిన వారిలో ఈ దుష్ర్పభావాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులైన సీఓపీడీ (ఎంఫసిమా) లేదా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారిలోనూ ఈ దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి. అవి... ఊపిరితిత్తుల్లో ద్రవాలు నిండటం : ఊపిరితిత్తుల పొరలైన ప్లూరాకూ, ఛాతీ లోపలి పొరకూ మధ్య ఒక్కోసారి ద్రవాలు నిండవచ్చు. ఈ కండిషన్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. నిమోనియా వల్ల ఇలా ద్రవాలు నిండితే... ఒక్కోసారి ఛాతీలో ట్యూబ్ వేసిగానీ లేదా చిన్న శస్త్రచికిత్స ద్వారాగాని ఆ ద్రవాలను తొలగించాల్సి వస్తుంది. ఆబ్సెస్ : నిమోనియాతో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో చీము నిండటాన్ని యాబ్సెస్ అంటారు. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు సాధారణంగా యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారు. అయితే చీమును తొలగించడానికి అరుదుగా సర్జరీ కూడా అవసరం కావచ్చు. బ్యాక్టీరిమియా : ఒక్కోసారి ఊపిరితిత్తులకు సోకిన నిమోనియా వాటికే పరిమితం కాకుండా రక్తప్రవాహానికీ వ్యాపించవచ్చు. ఇలా వ్యాపించడం అన్నది చాలా తీవ్రమైన పరిస్థితి. ఎందుకంటే ఒకసారి రక్తప్రవాహానికి విస్తరించాక ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడంతో పాటు అన్ని అవయవాలకూ విస్తరిస్తుంది. ఈ కండిషన్ను బ్యాక్టీరిమియా అంటారు. ఇది ఒక్కోసారి రోగి తాలూకు రక్తపోటును గణనీయంగా పడిపోయేలా చేస్తుంది.సాధారణంగా నిమోనియా వచ్చిన రోగుల్లో కోలుకోడానికి ఉండే అవకాశాలే చాలా ఎక్కువ. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం కేవలం 5 నుంచి 10 శాతం కేసుల్లో మాత్రమే ఒక్కోసారి పరిస్థితి విషమించిపోయే పరిస్థితికి దారితీయవచ్చు. నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారు సాధారణంగా కొందరిలో నిమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువ. వారినే హై-రిస్క్ గ్రూప్ గా అభివర్ణిస్తారు. వారు ఎవరంటే... 65 ఏళ్లు పైబడినవారు పొగతాగే అలవాటు ఉన్నవారు ఆరోగ్యకారణాల వల్లగానీ లేదా ఇతరపరిస్థితుల వల్లగాని తగినంత పోషకాహారం తీసుకోనివారు ఏదైనా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు (అంటే... సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్, ఎంఫసిమా వంటివి) డయాబెటిస్ లేదా గుండెజబ్బుల వంటి ఇతర వ్యాధులు ఉన్నవారు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ వల్లగానీ లేదా అవయవమార్పిడి చికిత్స వల్లగాని, కీమోథెరపీతోగాని లేదా దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్ వాడుతుండటం వల్ల స్వతహాగా ఉండే వ్యాధినిరోధకశక్తి లోపించిన వారు ఆల్కహాల్ లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల సమర్థంగా దగ్గలేనివారు శ్వాసకోశవ్యవస్థలో పైభాగానికి ఇన్ఫ్లుయెంజా వంటి ఇన్ఫెక్షన్ సోకిన వారు. వ్యాధి నిర్ధారణ రోగి చెప్పిన లక్షణాలను బట్టి, రోగిని పరీక్షించడం ద్వారా నిమోనియా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. దాంతోపాటు ఎక్స్రే, కళ్లె పరీక్ష, కొన్ని సందర్భాల్లో యూరిన్ యాంటిజెన్ పరీక్ష, రక్త పరీక్ష వంటివి వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. ఇక రక్తంలో ఆక్సిజన్ పాళ్లను పరీక్షిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి నిమోనియా వల్ల రక్తంలోని ఆక్సిజన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది. తీవ్రమైన నిమోనియాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు యాంటీబయాటిక్ చికిత్స తర్వాత కూడా మెరుగుదల కనిపించని సందర్భాల్లోనూ లేదా చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి నిలకడగా లేక దిగజారుతున్న సందర్భాల్లోనూ బ్రాంకోస్కోపీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఎటుపడితే అటు తేలిగ్గా ఒంగే ఒక గొట్టానికి కెమెరాను అమర్చి ట్రాకియా, బ్రాంకైలలోని లోపలి దృశ్యాలను పరిశీలించడంతో పాటు అక్కడి ద్రవాల నమూనాలను సేకరించడం, అవసరాన్ని బట్టి చిన్న ముక్కను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపడం వంటివి చేస్తారు. నివారణ నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా నిమోనియాను చాలా ప్రభావపూర్వకంగా నివారించవచ్చు.పొగతాగే అలవాటు ఉన్నవారు దాన్ని పూర్తిగా మానేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తాము నివసించే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం, చేతులను నిత్యం సబ్బుద్వారాగాని లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్ల సహాయంతోగాని శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తల ద్వారా దీన్ని నివారించవచ్చు. రోగి తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవడమో, పొడవు చేతుల చొక్కా ఉంటే చేతి మడతలో తుమ్మడమో చేయాలి. చికిత్స సాధారణంగా ఇరుకు ప్రదేశాల్లో గుంపులుగా ఉండటం వల్ల వచ్చే కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా ఇన్ఫెక్షన్కు చికిత్సతో పాటు నిమోనియా వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్లకూ చికిత్స చేస్తారు. నిమోనియా కేసుల్లో తొలుత దానికి కారణమైన అంశాలను కనుగొని దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. సాధారణంగా నిమోనియా రోగుల్లో అత్యధికులకు నోటిద్వారా యాంటీబయాటిక్స్ ఇస్తారు. అయితే నిమోనియా తీవ్రత ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో నిమోనియా రోగులకు నిత్యం గుండె స్పందన రేటు, శ్వాసించే తీరు, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు వంటి అంశాలను నిత్యం పర్యవేక్షిస్తూ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో చేర్చిన రోగులకు రక్తనాళం (ఐవీ) ద్వారా యాంటీబయాటిక్స్ను అందిస్తారు. రోగికి ఉన్న ఇతర వ్యాధులు, అతడు చికిత్సకు స్పందిస్తున్న తీరును బట్టి ఎంతకాలం ఆసుపత్రిలో ఉండాలన్నది నిర్ణయిస్తారు. అప్పటికే ఊపిరితిత్తులకు ఏదైనా వ్యాధి ఉన్నవారు, ఊపిరితిత్తులలో ఒకదాని కంటే ఎక్కువ తమ్మెల (లోబ్స్)లో వ్యాధి ఉండే వాళ్లు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. రోగికి ఎలాంటి యాంటీబయాటిక్ వాడాలన్నది... రోగికి సంక్రమించిన సూక్ష్మజీవి ఎలాంటిదన్న అంశంతో పాటు... ఆ మందుకు అతడు ఎలా స్పందిస్తున్నాడనేలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే... ఏదైనా వ్యాధి వల్ల అప్పటికే రోగి ఇతర యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే ఆ తరహా యాంటీబయాటిక్స్కు ఆ క్రిములు నిరోధకత పెంచుకొని ఉండవచ్చు. అందుకే చికిత్స ప్రక్రియలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కారణాలు సాధారణంగా అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మక్రిముల వల్ల నిమోనియా సోకవచ్చు. అయితే ఫంగస్తో వచ్చే అవకాశాలు ఒకింత తక్కువ. ఏదైనా ఇతర వ్యాధులు లేదా హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఇది ఫంగై కారణంగా రావచ్చు. ఇక మైకోప్లాస్మా అని పిలిచే మరికొన్ని సూక్ష్మక్రిముల వల్ల కూడా నిమోనియా రావచ్చు. కానీ ఇది అంత తీవ్రమైనది కాదు. అయితే ఒక్కోసారి ఇది కూడా తీవ్రమైన పరిస్థితికి దారితీయవచ్చు. నిమోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. అలాగే ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది గుంపులుగా నివసించాల్సిన పరిస్థితుల్లోని 20 శాతం కేసుల్లో కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా (సీఏపీ) అనే ఈ వ్యాధి చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. లక్షణాలు జ్వరం చలిగా అనిపించడం ఊపిరి సరిగా అందకపోవడం శ్వాస తీసుకునే సమయంలో ఒక్కోసారి నొప్పి చాలా వేగంగా శ్వాసతీసుకోవడం గుండెవేగం పెరగడం వికారం వాంతులు దగ్గు ఒక్కోసారి దగ్గుతున్నప్పుడు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో కళ్లె పడటం కొన్ని సందర్భాల్లో కళ్లె తుప్పు రంగులో కనిపించడం అయోమయానికి గురికావడం, ఆలోచనల్లో స్పష్టతలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డా. టి. అనూరాధ, పల్మొనాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్