vx nerve agent
-
ఉత్తర కొరియానే అతన్ని హతమార్చింది!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ గత ఏడాది మలేషియా విమానాశ్రయంలో అత్యంత అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. జాంగ్ నామ్ను చంపింది ఉత్తరకొరియానేనని, అత్యంత విషపూరితమైన వీఎక్స్ అనే రసాయనిక సమ్మేళనంతో అతన్ని హతమార్చిందని తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. జాంగ్ నామ్ను హతమార్చినందుకు ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించినట్టు తెలిపింది. రసాయనిక యుద్ధాల్లో వినియోగించే వీఎక్స్.. జాంగ్ నామ్ ముఖంపై, కళ్లలో, రక్తంలో, మూత్రంలో, దుస్తుల్లో, బ్యాగులో దొరికినట్టు పోస్టుమార్టం నివేదికంలో తేలిందని వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి 13న జాంగ్ నామ్ కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మకావ్ వెళుతుండగా.. ఎయిర్పోర్టులో ఇద్దరు యువతులు వెనుకనుంచి పరిగెత్తుకొని వచ్చి.. అతనిపై గుర్తుతెలియని దవ్రాన్ని చల్లిన విషయం తెలిసిందే. ఈ ద్రవం పడటంతో వెంటనే స్పృహ కోల్పోయి.. కుప్పకూలిన జాంగ్ నామ్ ఎయిర్పోర్టుకు అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణాలు విడిచారు. జాంగ్ నామ్పై గుర్తుతెలియని ద్రవాన్ని చల్లి ఓ టాక్సీలో పారిపోయిన ఆ ఇద్దరు యువతులు ఉత్తరకొరియా ఏజెంట్లు అని దక్షిణ కొరియా టీవీ చానెల్ టీవీ చోసాన్ ఆ మరునాడు వెల్లడించింది. దివంగత ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఇల్, ఆ దేశ నటి సంగ్ హ్యే రిలకు పుట్టిన అక్రమ సంతానం కిమ్ జాంగ్ నామ్. అతను తన అధ్యక్ష పదవికి అడ్డు వస్తాడనే ఉద్దేశంతోనే ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అతన్ని ఇలా దారుణంగా చంపేసినట్టు ఇప్పటికీ దక్షిణ కొరియా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. -
ముట్టుకుంటే మటాష్...!
-
జోంగ్ నామ్ శరీరంలో ఆ విషం
కౌలాలంపూర్: ఉత్తర కొరియా నియంత కింగ్ జోంగ్ ఉన్ సోదరుడు కిమ్ జోంగ్ నామ్ శరీరంలోకి అత్యంత విషపూరితమైన కెమికల్ను పంపి ఆయన్ను హత్య చేసినట్లు మలేసియా పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు మలేసియా పోలీసులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నామ్ కళ్లు, ముఖంలోని మరికొద్ది భాగాల నుంచి సేకరించిన శాంపిల్స్లో వీఎక్స్ నర్వ్ ఏజెంట్కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించారు. ఈ విషాన్ని వీఎక్స్ నర్వ్ ఏజెంట్ లేదా ఎస్-2 డైసోప్రొఫైలమైనోఈథైల్ మిథైల్ఫాస్ఫోనోథియోలైట్ అని కూడా పిలుస్తారు. దీని వినియోగంపై యూనైటెడ్ నేషన్స్లో నిషేధం ఉంది. మకావు వెళ్లేందుకు కౌలాంలంపూర్ ఎయిర్పోర్టుకు వచ్చిన నామ్పై ఇద్దరు మహిళలు దాడి చేసి చంపారు. నామ్ను హతమార్చిన ఇరువురూ ఉత్తరకొరియా ఏజెంట్లేనని దక్షిణ కొరియా, అమెరికా దేశాల అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎయిర్పోర్టు వీడియోను దక్షిణ కొరియాకు చెందిన ఓ టీవీ ప్రసారం చేసింది. నామ్ వెనుక నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు ఆయన ముఖంపై విషాన్ని స్ప్రే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీఎక్స్ నర్వ్ ఏజెంట్ను కేవలం పార్మారంగ పరిశోధనలకు మాత్రమే వినియోగిస్తారు. క్రీమ్, లిక్విడ్ తదితర రూపాల్లో ఇది లభ్యమవుతుంది. పొరబాటున ఈ మిశ్రమాన్ని ఎవరైనా తాకితే 15 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాగా నిందితులను పట్టుకునేందుకు మలేసియా ప్రభుత్వం ఇంటర్పోల్ను అలర్ట్ చేసింది. పోలీసులు ఇప్పటికే ఓ ఉత్తర కొరియా జాతీయుడిని అదుపులోకి తీసుకోగా.. కేసుకు సంబంధించిన మరో ఏడుగురు అనుమానితులు పరారీలో ఉన్నారు.