'డిసెంబర్‌ 31'లోగా అని మాటిచ్చారు.. మరవకండి! | - | Sakshi
Sakshi News home page

'డిసెంబర్‌ 31'లోగా అని మాటిచ్చారు.. మరవకండి!

Published Wed, Dec 6 2023 11:34 PM | Last Updated on Thu, Dec 7 2023 8:49 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అధికారలోకి వచ్చిన నెలరోజుల్లోనే అంటే డిసెంబర్‌ 31లోగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ చేస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం. కార్యాలయాలను తిరిగి బోథ్‌లోనే ఏర్పాటు చేస్తాం’ బోథ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో రేవంత్‌ రెడ్డి అన్నమాటలివి.

బోథ్‌లో ఎన్నికల ప్రచారం బోథ్‌ డివిజన్‌ ఏర్పాటు హామీలపైనే జరిగింది. ప్రముఖ పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు తాము అధికారంలోకి వస్తే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చాయి. ప్రతి గ్రామంలో నాయకులు తిరుగుతూ ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు రెవెన్యూ డివిజన్‌ హమీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా బోథ్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ పైనే భారం..
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎం కాబోతుండటంతో బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేస్తారని ఇక్కడి ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్‌ 31లోగా బోథ్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డిపై బోథ్‌ను డివిజన్‌ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం.. బోథ్‌ను డిసెంబర్‌ 31లోగా డివిజన్‌గా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. బోథ్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు డివిజన్‌ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బోథ్‌లో బీఆర్‌ఎస్‌..
తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అధినేతలు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లు బోథ్‌ను డివిజన్‌ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా బోథ్‌లో మాత్రం బీఆర్‌ఎస్‌ నుంచి అనిల్‌ జాదవ్‌ గెలుపొందారు. అయితే ఇరు పార్టీలు డివిజన్‌ చేస్తామని ప్రకటించాయని, కాబట్టి ఇరు పార్టీలు బోథ్‌ను డివిజన్‌ చేయడానికి చొరవ చూపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

మాట ఇచ్చారు.. నెరవేర్చండి!
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు బోథ్‌ను డివిజన్‌ చేస్తామని హామీ ఇచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం డిసెంబర్‌ 31లోగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి. డివిజన్‌ ఏర్పాటుకు నాయకులు చొరవ చూపాలి. – అల్లం సాయికృష్ణ

డివిజన్‌ చేయాల్సిందే..
బోథ్‌ అన్ని రంగాల్లో నిరాదారణకు గురైంది. బోథ్‌ను డివిజన్‌గా చేస్తే అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. బోథ్‌ డివిజన్‌ కావడానికి అన్ని అర్హతలున్నాయి. అన్ని పార్టీలు డివిజన్‌ చేస్తామని హామీలు ఇచ్చాయి. ఇచ్చిన హామీల ప్రకారం.. బోథ్‌ను డివిజన్‌ చేసి అభివృద్ధి చేయాలి. ఇందుకు నాయకులు చొరవ చూపాలి. – గట్ల బలరామకృష్ణ, బోథ్‌

కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి ఇద్దరూ డివిజన్‌ హామీ ఇచ్చారు..
పీసీసీ అధ్యక్షుడిగా చెప్తున్నా గెలిచిన వెంటనే డిసెంబర్‌ 31లోగా రెవెన్యూ డివిజన్‌ చేస్తామని రేవంత్‌రెడ్డి బోథ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభలో పేర్కొన్నారు. మరుసటి రోజునే ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇరు పార్టీలు రెవెన్యూ డివిజన్‌పై హామీ ఇవ్వడం, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావ్‌ సైతం తాను గెలిస్తే బోథ్‌ రెవెన్యూ డివిజన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రధాన పార్టీలు డివిజన్‌పై హామీ ఇవ్వడంతో ఇప్పుటు డివిజన్‌ ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement