లైంగిక దాడుల కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు
● ఆదేశించిన డీఐజీ గోపీనాథ్ జెట్టీ ● విశాఖ రేంజ్ జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, విశాఖపట్నం : మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాలు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టీ అన్నారు. వీటిపై జిల్లా ఎస్పీలు ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, నిందితులపై కేసులు నమోదు చేసి త్వరితగతిన శిక్షలు పడేలా సీఐ, ఎస్ఐలు పనిచేయాలని ఆదేశించారు. అలాగే, నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం కల్పించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం విశాఖ రేంజ్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం జిల్లాల ఎస్పీలు ఇతర జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎన్.బి.డబ్ల్యూ అమలు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పొక్సో కేసులు, హేయమైన నేరాలు సంబంధించిన కేసుల పై సమీక్ష నిర్వహించారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న, గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై ప్రత్యేక షీట్స్ తయారు చేయాలన్నారు. గంజాయి నిందితుల ఆస్తుల స్వాధీనానికి, పీడీ యాక్ట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందేలా చర్య లు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో రేంజ్ పరిధిలోని 5 జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, వకుల్ జిందాల్, అమిత్ బర్దర్, కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎస్.వి.మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment