ఫిర్యాదులొచ్చాయి..
ఔషధ నియంత్రణ శాఖపై ఫిర్యాదులొచ్చిన మాట వాస్తవమే. ఈ విభాగాన్ని పూర్తిగా గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు చర్యలు చేపట్టాం. వసూళ్లకు పాల్పడిన వారు ఎవరైనా సరే చర్యలు తీసుకుంటాం. –వినోద్ కుమార్, కలెక్టర్
● అనంతపురం సుభాష్ రోడ్డులో ఉన్న కొన్ని బడా మెడికల్ షాపుల్లో ప్రిస్కిప్షన్లు లేకుండానే మందులు అమ్ముతున్నారు. రోజూ వేల మందికి మాత్రలు కట్టబెట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ షాపులవైపు డ్రగ్ ఇన్స్పెక్టర్లు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు.
● నెలరోజుల క్రితం అనంతపురం సాయినగర్లో ఆయుర్వేద డాక్టర్ ఒకరు అల్లోపతి మందులు అమ్ముతూ విజిలెన్స్ తనిఖీల్లో దొరికారు. ఏళ్ల తరబడి ఆయన ఈ పని
చేస్తున్నట్లు వెల్లడైంది.
● ఇటీవల రాయదుర్గం నియోజకవర్గంలో ఓ ఆర్ఎంపీతో చికిత్స చేయించుకున్న వ్యక్తి మృతి చెందాడు. సదరు ఆర్ఎంపీ ప్రమాదకర మందులు వినియోగించడం వల్లే రోగి పరిస్థితి విషమించినట్లు వెల్లడైంది... ఇవొక్కటే కాదు.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మందుల షాపుల నిర్వాహకులు, ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాథుడే కానరావడం లేదు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి జిల్లాలో ఔషధ నియంత్రణ వ్యవస్థ నీరుగారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ మందులతో రోగులకు హాని జరగకుండా చూడాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు నెలవారీ మామూళ్లతో తనిఖీలే మరచిపోయారు. ఏ మందుల షాపులో ఎలాంటి మందులు అమ్ముతున్నా అడిగేవారు లేరు. నాసిరకం మందులతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. కొత్త లైసెన్సు కావాలంటే డబ్బు, ఫార్మసిస్ట్ లేకుండా అమ్ముతుంటే డబ్బు,ప్రిస్కిప్షన్ లేకుండా అమ్ముతుంటే తనిఖీ చేయకపోవడానికి డబ్బు.. ఇలా ఒకటేమిటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో డ్రగ్ అధికారులు పూర్తిగా మామూళ్ల మత్తులో జోగుతున్నారు.
నిబంధనలు తుంగలోకి..
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,150 వరకూ హోల్సేల్, రీటెయిల్ మందుల షాపులున్నాయి. వీటిల్లో ఎక్కడా ప్రభుత్వ నిబంధనలన్నీ అమలు కావడం లేదు. మండలస్థాయిలో ఉన్న షాపులు ఆరు మాసాలకు రూ.3 వేలు, అదే అర్బన్లో అయితే ఆరుమాసాలకు రూ.5,500 లెక్కన ముట్టజెబుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు తాజాగా ఆ శాఖ ఏడీకి సెపరేటు కమీషన్ ఉన్నట్లు సమాచారం. ఏడాదిలో కనీసం రూ.2 కోట్ల వరకూ మెడికల్ షాపుల నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్కు, ఏడీలకు వెళుతున్నట్టు అంచనా. ఇందులోనే పై అధికారులకూ ఇస్తామని షాపుల యజమానులతో చెబుతున్నట్టు తెలిసింది. ఈ స్థాయిలో వసూళ్లు చేస్తున్నప్పుడు తనిఖీలు ఎలా చేస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఈ నిబంధనలు తప్పనిసరి..
ప్రతి మందుల షాపులోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.
మందులు అమ్మిన ప్రతి బిల్లులోనూ పేషెంటు వివరాలు నమోదు చేయాలి.
బిల్లులో మొబైల్ నంబరు కచ్చితంగా ఉండాలి.
ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మకూడదు.
ఎన్ఆర్ఎక్స్ అంటే నార్కొటిక్ మందులు ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదు.
షెడ్యూల్ బుక్ విధిగా నిర్వహించాలి.
రెస్టిల్, ఆల్ప్రాక్స్, యాంక్సిట్, డైజోపాం, లోరాజెపామ్, క్లోనాజెపాం, కోడెయిన్ వంటి మందులు ఇవ్వకూడదు.
ఏ ‘మాత్రమూ’ తనిఖీల్లేవ్
మందుల షాపుల నిర్వాహకుల ఇష్టారాజ్యం
ఏవి అమ్మినా.. ఎలా అమ్మినా అడిగే నాథుడే లేరు
నార్కొటిక్స్ మందులూ
విచ్చలవిడిగా విక్రయం
మామూళ్ల మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్లు
జిల్లాలో నీరుగారిపోయిన
ఔషధ నియంత్రణ శాఖ
Comments
Please login to add a commentAdd a comment