
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు కావాల్సిన అత్యవసర వస్తువులను జిల్లాల్లో అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్న నిల్వలకు అదనంగా మరిన్ని వస్తువులను సమకూరుస్తోంది. 8.14 లక్షల హోం ఐసోలేషన్ కిట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వగా.. ఇందులో ఇప్పటికే 4.29 లక్షల కిట్లు అందుబాటులో ఉన్నాయి.
వైద్యులు, నర్సులు వినియోగించే ఎన్–95 మాస్కులతోపాటు పీపీఈ కిట్లను కూడా పెద్ద ఎత్తునే నిల్వ ఉంచింది. ఎటువంటి కొరత లేకుండా కోవిడ్ నియంత్రణకు అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర వస్తువులన్నీ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో తగినన్ని ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, వైరల్ ట్రాన్స్మిషన్ మీడియం (వీటీఎం), హోం ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచారు.