
సాక్షి, విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఏపీ ప్రభుత్వం మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సీఎం జగన్ చూపిన గౌరవం, ఆప్యాయత మరువలేనివని తెలిపారు. గవర్నర్, సీఎం సంబంధాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. సీఎం జగన్ అందరికీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు.
‘ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారని ప్రారంభంలో అడిగా. దేవుడి దయతో అన్నీ పూర్తవుతాయని సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది. ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం ఎంతో అద్భుతమైనది.
కరోనా కాలంలో ఏపీలోని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. సీఎం జగన్ను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నా రెండో ఇల్లు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీ ప్రజలను మరవను’ అని గవర్నర్ ప్రసంగించారు. కాగా బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయిన విషయం తెలిసిందే. మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఏపీ గవర్నర్గా సేవలందించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్: జోగి రమేష్