
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయానికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అంబటి రాంబాబు మరోమారు స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదు అంటే రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని పేర్కొన్నారు.
'వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధానం మూడు రాజధానులే. దీనికి కారణమేమిటంటే సమతుల్యం. మూడు ప్రాంతాలను సమానంగా చూసుకోవాలనే భావన. ఇంతకుముందు మనకు ఈ రాష్ట్రంలో చాలా అనుభవాలు ఉన్నాయి. రీజినల్ ఫీలింగ్స్ ఉన్నాయి. దాని వల్ల ఒకసారి దెబ్బతిన్నాం. తెలంగాణ ఫీలింగ్తో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వంటి గొప్ప ప్రదేశాన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ అక్కడే ఉన్నాయి.
కానీ అలా ఉండకుండా అన్ని చోట్లా అభివృద్ధి జరగాలనే సదుద్దేశంతో ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మూడు రాజధానులు అవసరం. మూడు రాజధానులంటే ఒకటి రాయలసీమకి, ఒకటి కోస్తా ఆంధ్రకి, ఒకటి ఉత్తరాంధ్రకి ఇచ్చి అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచడంతో పాటు, ఓన్ చేసుకునే విధానాన్ని చేయటం. దీని వల్ల భవిష్యత్తులో ఏ విధమైన ఆందోళన, అభద్రతా భావం ఏ ప్రాంతానికీ ఉండకూడదనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడింది తప్ప మరొకటి కాదు. అది మా పాలసీ. ఆ పాలసీకే కట్టుబడి ఉన్నాం. మీరు దాని గురించి సందేహపడాల్సిన అవసరం లేదు.' అని అంబటి అన్నారు.
చదవండి: అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ