
విజయనగరం: విశాఖ వేదికగా ప్రశాంత వాతావరణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 విజయంతంగా జరిగితే ఓర్వలేని పచ్చపత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అడ్డగోలు రాతలు రాయడం దుర్మార్గమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయనగరంలో ఆదివారం జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంచి జరిగినప్పుడు రాయకపోయినా ఫర్వాలేదు. కానీ, చెడురాతలు రాయడం సరికాదు.
సమ్మిట్ ముగిసి ఒక్కరోజు కాకముందే రూ.12 లక్షల కోట్లు ఎంవోయూలు చేయడం గొప్ప కాదు... అవి ఆచరణలో చేసి చూపించగలరా... ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగలరా... అంటూ లెక్కలు వేసి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. వారిది నోరా.. తాటి మట్టా...’ అని బొత్స మండిపడ్డారు. ‘పచ్చపత్రికలు చెప్పిందే భగవద్గీతలా భావించే రోజులు పోయాయి. వారేమిచెప్పినా నిజమని నమ్మే పరిస్థితి లేదు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా నిర్వహించిన సమ్మిట్లపై ఎందుకు ఇలా రాయలేకపోయారు. రెండు రోజులపాటు జరిగిన విశాఖ సమ్మిట్కు దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సంస్థలు వచ్చిన విషయాన్ని ప్రజలు గమనించారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, దీనికోసం ప్రత్యేక కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుంది. ఈలోపే ఏమిటా రాతలు? ప్రజలను తప్పుదోవ పట్టించేలా 2019 ఎన్నికలకు ముందు మీరు ఎన్ని రాతలు రాసినా ఎవరూ పట్టించుకోలేదు.
వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు...’ అని బొత్స చెప్పారు. అదేవిధంగా కేంద్రమంత్రి నితిన్గడ్కరీ విశాఖలో ఎన్నో వనరులు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురే‹Ùబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment