Global Investors Summit
-
ఒక్క ఫోన్ చాలు 'సమస్యలన్నీ పరిష్కారం'..
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని గుర్తు చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదిరిన ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ త్వరితగతిన అమల్లోకి తెస్తున్నామని, ఇందుకోసం కృషి చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. విశాఖ ఒప్పందాలు వేగంగా సాకారం.. పారిశ్రామిక రంగంపై ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, పుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి సారించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 386 ఎంవోయూలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ సాకారమయ్యేలా నిరంతరం సమీక్షిస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం. ఇందులో 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసం రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా వీటన్నింటినీ వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నాం. కలెక్టర్లు కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ దీన్ని మరింత వేగవంతం చేయాలి. ఎంఎస్ఎఈలతో 12.62 లక్షల మందికి ఉపాధి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. వీటి ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాం. ఎంఎస్ఎంఈ రంగంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేశాం. కోవిడ్ సమయంలో ఎక్కడా, ఎవరూ కుప్పకూలిపోకుండా వారికి చేయూతనిచ్చాం. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 1.88 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా 12.62 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందరం కలసికట్టుగా బాధ్యత తీసుకున్నాం కాబట్టే ఇది సాకారమైంది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మనం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే మెస్సేజ్ను ఎంత సానుకూలంగా తీసుకెళ్లగలిగితే అంత ఉత్సాహంగా ముందుకొస్తారు. ఇది కచ్చితంగా నా దగ్గర నుంచి మొదలుకుని మీ వరకు ఇదే రకమైన తత్వాన్ని అలవరచుకోవాలి. రూ.1,100 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం పరిశ్రమలు–వాణిజ్యశాఖ, పుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఇవాళ తొమ్మిది ప్రాజెక్టులు చేపడుతున్నాం. దాదాపు రూ.1,100 కోట్ల పెట్టుబడితో 21,744 మందికి ఉద్యోగాలు లభించేలా మంచి అడుగు పడుతోంది. మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, మిగిలిన ఆరు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం నేను పత్తికొండ వెళ్లినప్పుడు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయమని చెప్పా. కొద్ది కాలంలోనే అది అధికారుల కృషితో కార్యరూపం దాల్చి శంకుస్ధాపన దశకు వచ్చింది. రూ.12 కోట్ల పెట్టుబడితో టమోటా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు పత్తికొండలో శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకొంటున్న తొమ్మిది యూనిట్లకు శుభాభినందనలు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు, కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయం, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్కుమార్, హ్యాండ్లూమ్స్, టెక్టŠస్టైల్స్ కమిషనర్ ఎంఎం నాయక్, పరిశ్రమలశాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వరరెడ్డి, ఉన్నతాధికారులు, పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్లో శంకుస్థాపనలు, ప్రారంభించిన యూనిట్లు 1.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ముత్తుకూరు మండలం దొరువులపాలెంలో రూ.250 కోట్లతో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్ధ ఆధ్వర్యంలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ ప్రారంభం. దీని ద్వారా 1,150 మందికి ఉద్యోగాలు. ఏటా 4.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దీని సామర్ధ్యం. 2. రూ.144 కోట్లతో శ్రీవేంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పనులకు శంకుస్థాపన. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం కొమ్మూరు గ్రామం వద్ద ఏర్పాటయ్యే ఈ మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ ద్వారా 310 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 90 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. దీని ద్వారా వేలమంది రైతులకు ప్రయోజనం. 3. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద రూ.13 కోట్లతో బ్లూఫిన్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీకి శంకుస్థాపన. దీనిద్వారా 45 మందికి ఉద్యోగావకాశాలు. 3,600 మెట్రిక్ టన్నుల గోధుమలు, 480 టన్నుల మిల్లెట్స్, 720 మెట్రిక్ టన్నుల పొటాటో ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ఏర్పాటుతో స్థానిక రైతులకు లబ్ధి. 4. కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద టామాటో ప్రాసెసింగ్ యూనిట్ పనులకు శంకుస్థాపన. రూ.12 కోట్ల పెట్టుబడితో ఏటా 3,600 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తుల తయారీ. ఈ ప్రాజెక్టును పత్తికొండ వెజిటబుల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్కు అప్పగించనున్న ప్రభుత్వం. వారి ద్వారా లీజు ప్రాతిపదికన మంచి సమర్థత కలిగిన కంపెనీకి అప్పగించేలా సహకారం. పత్తికొండలో రైతులకు భారీ ప్రయోజనం. టమాటా ధరల స్థిరీకరణకు దోహదం చేయనున్న పరిశ్రమ. 5. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రేగ పంచాయతీ పెద్దిరెడ్లపాలెం వద్ద నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్కు ప్రారంభోత్సవం. ప్లాంట్ను నెలకొల్పిన ఏపీఎఫ్పీఎస్. ఎల్.కోట జైకిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్కు ప్లాంట్ను అప్పగించిన ప్రభుత్వం. నువ్వుల నూనె, చిక్కీ ఉత్పత్తుల తయారీ. రూ.2.5 కోట్ల పెట్టుబడితో 20 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కలిగిన ఈ యూనిట్తో స్థానిక రైతులకు ప్రయోజనం. పరిశ్రమల శాఖలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా 1. కర్నూలు జిల్లా ఓర్వకల్లు నోడ్ గొట్టిపాడు వద్ద సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా (ఏపీఐ) యూనిట్కు శంకుస్థాపన. రూ.280 కోట్ల పెట్టుబడితో 850 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 72 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 2. కర్నూలు జిల్లా ఓర్వకల్ నోడ్ గొట్టిపాడు వద్ద న్యూట్రాస్యూటికల్స్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న ఆర్పీఎస్ ఇండస్ట్రీస్. పనులకు వర్చువల్గా సీఎం శంకుస్థాపన. రూ.90 కోట్ల పెట్టుబడితో 285 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 4,170 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 3. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 18 జిల్లాల్లో 21 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, ఫ్యాక్టరీ కాంప్లెక్స్లకు సీఎం ప్రారంభోత్సవాలు, మరికొన్ని చోట్ల పనులకు శంకుస్ధాపనలు. కాంప్లెక్స్ ద్వారా రూ.1,785 కోట్ల పెట్టుడులకు అవకాశం. తద్వారా 18,034 మందికి ఉద్యోగాలు. 4. కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రింటింగ్ క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించిన సీఎం జగన్. ఈ సెంటర్లలో 1,000 మందికి ఉద్యోగాలు. -
పారిశ్రామికోత్సాహం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. ఆర్భాటానికి తావు లేకుండా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటం, శర వేగంగా అనుమతులు మంజూరవుతుండటంతో పారిశ్రామిక వేత్తలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఒక్క ఎంఎస్ఎంఈల విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి వాటి సంఖ్య 1,93,530 మాత్రమే ఉండగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన కొత్తగా అర కోటి మందికి ఉపాధి లభించడం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు ఇతర ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను సిద్ధం చేశారు. వీటి ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఏర్పాటు చేసిన సిమెంట్ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ నవోదయం, రీస్టార్ట్ వంటి ప్యాకేజీలకు తోడు ఎంఎస్ఎంఈలకు అన్ని రకాలుగా చేయూత అందిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహకాలు అందజేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడం గమనార్హం. వచ్చే నాలుగేళ్లల్లో కొత్తగా 6 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా క్లస్టర్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. వీటితోపాటు రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు రూ.402 కోట్లతో అయిదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్, విజయనగరంలో రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఎల్ కోటా సీసేమి యూనిట్ను ప్రారంభిస్తారు. ఏలూరులో రూ.144 కోట్లతో మొక్క జొన్న నుంచి గంజి పౌడర్ను తయారు చేసే వెంకటేశ్వరా బయోటెక్, విజయనగరంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆలూ చిప్స్, పాస్తా, న్యూడిల్స్ తయారు చేసే బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్, కర్నూలులో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసే టమాట ప్యూరీ యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఇంధన శాఖకు సంబంధించి సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్పీసీఎల్ ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టు, ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభించనున్నారు. వాస్తవ రూపంలోకి జీఐఎస్ ఒప్పందాలు విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జీఐఎస్ సమావేశంలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదరగా, అందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఇందులో 24 యూనిట్ల ద్వారా రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. గ్రీన్ల్యామ్, డీపీ చాక్లెట్స్, ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజ్, సూక్ష్మ గామా ఎల్ఎల్పీ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇవేకాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లు భూ కేటాయింపులు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. మరో 194 యూనిట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. చేయిపట్టి నడిపిస్తున్నాం.. జీఐఎస్లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలను చేయిపట్టి నడిపిస్తున్నాం. అనుమతులన్నీ వేగంగా ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధ్యక్షతన 17 మంది అధికారులతో కమిటీ వేసి.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పలు ఒప్పందాలు అమల్లోకి రాగా, మిగిలినవి కూడా అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్ యువరాజ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆహార పరిశ్రమల రంగానికి మరింత ఊతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఆహార శుద్ధి పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.775 కోట్లతో 9 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించగా, 1,130 మందికి ఉపాధి కల్పించారు. 1,510 మందికి ఉపాధి కల్పించేలా రూ.2,226 కోట్లతో మరో 9 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. తాజాగా రూ.232.5 కోట్లతో ఏర్పాటు చేసిన మరో రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రూ.169 కోట్లతో మూడు యూనిట్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా 1,625 మందికి ఉపాధి, 3,654 మంది రైతులకు లబ్ధి కలగనుంది. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ -
రూ.3,008 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ను వర్చువల్గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ.. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ను వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్ అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పినర్స్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్లో ఇవీ ప్రాజెక్టులు.. 1.డీపీ చాక్లెట్స్ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఇన్స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్కు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. 6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్పీఎస్ సీఈవో శ్రీధర్రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది. -
‘పవర్’ ఫుల్
► రూ.10,350 కోట్ల పెట్టుబడి, 2,300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్కో కంపెనీ నిర్మించే సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► 1,014 మెగావాట్లతో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్ధాపన. ఇందులో 700 మెగావాట్లు సోలార్ పవర్ కాగా 314 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► ఎకోరన్ ఎనర్జీ 2 వేల మెగావాట్ల (1,000 మె.వా. సోలార్, 1,000 మె.వా. విండ్ పవర్) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్ధాపన. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు.. ఎన్హెచ్పీసీతో ఒప్పందం ► 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్హెచ్పీసీతో ఒప్పందం. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల 2 వేల మందికి ఉద్యోగాల కల్పన. ► వీటితో పాటు ఎన్హెచ్పీసీతో మరో మూడు ప్రాజెక్టుల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై కలసి పని చేసేలా అడుగులు. రాష్ట్రానికి.. రైతులకు.. యువతకు మేలు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో మనకు జరిగే మేలును ఒక్కసారి పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో మన యువతకు స్ధానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా అందుబాటులోకి వస్తున్న ప్రతి మెగావాట్కు మరో వందేళ్ల పాటు అంటే ఈ ప్రాజెక్టు లైఫ్ ఉన్నంత కాలం మెగావాట్కు రూ.లక్ష చొప్పున రాయల్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుల వల్ల జీఎస్టీ ఆదాయం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు తమ భూములిస్తూ సహకరిస్తున్న రైతన్నలకు కూడా ఈ కంపెనీల నుంచి లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఆదాయం వస్తుంది. ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. అంటే రైతులు ఎవరైనా భూములివ్వాలనుకుంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి, ఏడాదికి రూ.30 వేలు లీజు రూపంలో ఇస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము కూడా పెరుగుతుంది. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడిన దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ రైతన్నలకు ఈ ప్రాజెక్టులతో మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగానికి భద్రత చేకూరేలా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుడుతూ చరిత్రాత్మక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాలను శరవేగంగా కార్యాచరణలోకి తెస్తూ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు. మరో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈమేరకు సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ జెన్కో ఎండీ చక్రధరబాబు, ఎన్హెచ్పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో అపార పెట్టుబడుల అవకాశాలపై సీఎం జగన్ శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మనతో పాటు ఉన్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారత్, గ్రీన్కో, ఆర్సెలర్ మిట్టల్, ఎకోరన్ గ్రూపు యాజమాన్యాలకు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఇక్కడకు వచ్చిన ఎన్హెచ్పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ గోయల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్కు ధన్యవాదాలు. ఇవాళ మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. నాలుగో కార్యక్రమం కింద ఎన్హెచ్పీసీతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నాం. మొదటి ప్రాజెక్టు గ్రీన్కో.. 2,300 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిస్తున్న ప్రాజెక్టు ఇది. ఇక పంప్డ్ స్టోరేజ్ అన్నది ఆర్టిఫీషియల్ బ్యాటరీ లాంటిది. పీక్ అవర్స్లో పవర్ జనరేట్ చేస్తాం. నాన్ పీక్ అవర్స్లో మళ్లీ నీళ్లని వెనక్కి పంప్ చేసి ఆ తరువాత, పీక్ అవర్స్లో పవర్ని జనరేట్ చేసేందుకు ఆర్టిఫీషియల్ బ్యాటరీ మాదిరిగా ఏర్పాట్లు ఉంటాయి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు భవిష్యత్తులో పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తయ్యేలా దోహదం చేస్తాయి. దీనివల్ల బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పర్యావరణానికి మంచి జరగాలంటే రాబోయే రోజుల్లో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సోలార్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో మనం అనుసంధానమవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో పెను మార్పులకు దారి తీస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అదే సమయంలో విద్యుదుత్పత్తికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రీన్ ఎనర్జీలో ఒక విప్లవాత్మక మార్పు వస్తుంది. మరో 30 ఏళ్లు ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా.. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8,998 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకు దీర్ఘకాలం పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు 16 వేల మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 7,200 మెగావాట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో యూనిట్ రూ.2.49కే అందేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా, ఒత్తిడి లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ అందించే వెసులుబాటు లభిస్తుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.49కే మరో 25 – 30 ఏళ్ల పాటు ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గొప్ప అడుగు. 41 వేల మెగావాట్లు.. 37 ప్రాంతాలు ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు పంప్డ్ స్టోరేజీని ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 41 వేల మెగావాట్లకు సంబంధించి 37 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 చోట్ల ప్రాజెక్టు ఫీజిబులిటీ పరిశీలన జరుగుతోంది. 20,900 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్లు కూడా పూర్తయ్యాయి. వీటిలో 16,180 మెగావాట్ల కెపాసిటీతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు అలాట్మెంట్లు కూడా పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్హెచ్పీసీతో ఒప్పందం చేసుకుంటున్నాం. దీనిలో యాగంటిలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు కలిపి మొత్తంగా దాదాపు 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్పీసీతో కలిసి నిర్మించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు ఫీజిబులిటీ స్డడీస్ పూర్తయ్యాయి. ఎన్హెచ్పీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం వాటాతో ప్రాజెక్టును అభివృద్ధిలా ఇవాళ ఎంవోఓయూ కుదుర్చుకున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్, డిప్యూటీ హెడ్ మిషన్ యూకే గవర్నమెంట్ వరుణ్ మాలి, యూకే గవర్నమెంట్ సీనియర్ అడ్వైజర్ నిషాంత్కుమార్ సింగ్, ఎన్హెచ్పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్, గ్రీన్కో వైస్ ప్రెసిడెంట్ ఎన్.శేషగిరిరావు, ఏఎం గ్రీన్ ఎనర్జీ బిజినెస్ హెడ్ సమీర్ మాథుర్, ఎకోరన్ గ్రీన్ ఎనర్జీ సీఎండీ వై.లక్ష్మీ ప్రసాద్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరో మూడు చోట్ల కూడా...! ఎన్హెచ్పీసీతో కలసి ఇంకా వేగంగా అడుగులు ముందుకువేసే కార్యక్రమంలో భాగంగా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి 3 ప్రాంతాలలో ఫీజుబులిటీ స్డడీస్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టులను కూడా ఎన్హెచ్పీసీతో కలిసి సంయుక్తంగా చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సామర్ధ్యాన్ని పెంచుకుంటూనే మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్కి కూడా అందుబాటులోకి తెచ్చి తద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నింటితో రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ దేవుడు గొప్పవాడు.. అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులను సృష్టించాడు. ఎండ బాగున్నప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోలార్ పవర్ని ఉత్ప త్తి చేస్తే సాయంత్రం 6 నుంచి ఉదయం వర కు విండ్ పవర్ ఉత్పత్తి అవుతుంది. పీక్ అ వర్స్లో నీళ్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను వాడుకోవచ్చు. ïపీక్ అవర్స్లో అవి ఆర్టిఫీషియల్ బ్యాటరీలా పనిచేస్తాయి. దీంతో ïపీక్ అవర్స్లో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల నుంచి బయటపడి పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ లభిస్తుంది. ఇది ప్రపంచాన్ని శాసించ బోయే ఎన ర్జీగా నిలుస్తుంది. అందులో ఏపీ తొలిస్థానంలో నిలిచేలా అడుగులు పడుతున్నాయి. -
పర్యాటకానికి మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. ఇందులో భాగంగా రూ.3,016 కోట్ల విలువైన 13 పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా వాస్తవరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ 13 ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని రెండునెలల్లో మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 ప్రాజెక్టుల్లో 11 స్టార్ హోటళ్ల నిర్మాణానివి కాగా రెండు పర్యాటక ప్రాంతాల్లో రోప్వే నిర్మాణానికి సంబంధించినవి. ఈ 13 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 17,032 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ సంస్థలైన ఒబరాయ్, నోవోటెల్, హయత్, హిల్టన్, మారియట్, మై ఫెయిర్, లెమన్ ట్రీ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఒబరాయ్ గ్రూపు కడప గండికోట వద్ద భారీ ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణంతోపాటు తిరుపతి విశాఖల్లో కూడా హోటళ్లు నిర్మించనుంది. అలాగే దేవభూమి రోప్వేస్ సంస్థ కృష్ణా, నంద్యాల జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనుంది. రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, అందులో తొలుత 13 ప్రాజెక్టులపై దృష్టిసారించామని ఏపీ టూరిజం అథారిటీ ఎండీ కె.కన్నబాబు చెప్పారు. ఈ 13 ప్రాజెక్టులకు డీపీఆర్లు పూర్తయ్యాయని, ఒకసారి ఎస్ఐపీబీ, మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే సీఎం చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖ, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
మరో 4 అడుగులు.. విశాఖ జీఐఎస్ ఒప్పందాల కార్యరూపం శరవేగంగా ..
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాల మేరకు మూడు జిల్లాల్లో రూ.1,425 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రాజెక్టులో ఉత్పత్తిని వర్చువల్గా ప్రారంభించారు. క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమల శిలాఫలకాలను సీఎం జగన్ వర్చువల్గా ఆవిష్కరించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ విస్తరించిన యూనిట్లో వాణిజ్య కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఈ రోజు మూడు జిల్లాల్లో నాలుగు యూనిట్లకు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతోందని, వీటివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన మూడు ప్లాంట్లు త్వరలో నిర్మాణ కార్యకలాపాలను పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయన్నారు. ‘ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. 12 నెలల్లో క్రిబ్కో ఇథనాల్ ప్లాంట్ నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపు రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ ఏర్పాటవుతోంది. 12 నెలలలోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. రోజుకు 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో ఇక్కడ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్లాంట్ ద్వారా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణపట్నం వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన క్రిబ్కో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏడాదిన్నరలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ ఇదే నెల్లూరు జిల్లాలోనే విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ కూడా వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పుతున్న బయో ఇథనాల్ ప్లాంట్ వల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రూ.315 కోట్లతో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మన యువతకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు లభించనుండటం ఆనందదాయకం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీ తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీని స్థాపిస్తోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16 వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పుతోంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నా. 9 నెలల్లోనే మొదలైన గోద్రెజ్ ఆగ్రోవెట్ యూనిట్ ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి, 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్ ఆయిల్ (వంట నూనె) రిఫైనరీ ప్రాజెక్టును విస్తరిస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన 9 నెలల్లోనే యూనిట్ ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం. ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల ఏలూరు జిల్లా యువకులకు మరో 500 ఉద్యోగ అవకాశాలు లభించడం శుభపరిణామం. కంపెనీ యాజమాన్యానికి అభినందనలు. సర్వేపల్లిలో ‘క్రిబ్కో’ గ్రీన్ ఎనర్జీ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బయో ఇథనాల్ తయారీని చేపడుతోంది. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 4 వేల టన్నుల డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్ తయారవుతాయి. బియ్యం, మొక్కజొన్నతో ‘విశ్వసముద్ర బయో ఎనర్జీ’ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని స్థాపిస్తోంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారీ చేయనున్నారు. వరి సాగు చేసే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరం. మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టిలరీతోపాటు బై ప్రొడక్ట్గా డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్ తయారు కానున్నాయి. కాంటినెంటిల్ ఇన్స్టెంట్ కాఫీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ పుడ్ బెవెరేజెస్ కంపెనీ ఏర్పాటు కానుంది. ఏటా 16 వేల టన్నుల సొల్యుబుల్ ఇన్స్టెంట్ కాఫీ ఈ ప్లాంట్లో తయారవుతుంది. యూనిట్ విస్తరించిన ‘గోద్రెజ్ ఆగ్రోవెట్’ ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ రోజుకు 400 టన్నుల వంట నూనె తయారీ సామర్థ్యంతో విస్తరించిన యూనిట్, 200 టన్నుల సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ను ప్రారంభించింది. -
రూ.లక్ష కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్
సాక్షి, విశాఖపట్నం : తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ఎన్టీపీసీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులను 2026కు, మొత్తం 2030నాటికి పూర్తి చేసే దిశగా ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. 1,200 ఎకరాల్లో ఏర్పాటు... రాబోయే 20 ఏళ్లలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులను క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏపీ సిద్ధమవుతోంది. ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా భూతాపం, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇందులో భాగంగా దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ పరిష్కృత ప్రాజెక్టు ఏర్పాటుపై జరిగిన ఒప్పందంలో భాగంగా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు తొలి విడత పనులను ఇటీవల ఎన్టీపీసీ ప్రారంభించింది. తొలి విడతలో 1,500 టన్నుల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సంబంధిత ఎక్వీప్మెంట్ ఉత్పత్తి, ఎగుమతులకు అవసరమైన మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ 1,200 ఎకరాలను ఎన్టీపీసీకి కేటాయించింది. ఈ భూమిని చదును చేసే ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ప్రాజెక్టు ప్రక్రియ పనులకు అవసరమైన మేర స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎన్టీపీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 9,000 ఎండబ్ల్యూహెచ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లు వారంలో ఖరారు ఇప్పటికే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఫేజ్–1 పనులు ప్రారంభించిన ఎన్టీపీసీ... 9,000 మెగావాట్హవర్ (ఎండబ్ల్యూహెచ్) స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లని ఈ వారంలో ఖరారు చేయనుంది. మొదటి విడత పనులను 2026 నాటికి పూర్తి చేయనుంది. సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొత్తం పనులను 2030నాటికి పూర్తి చేసి దేశానికి అంకితమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎన్టీపీసీ డైరెక్టర్(ఫైనాన్స్) శ్రీనివాసన్ తెలిపారు. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్స్, షెడ్లను నిర్మించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్పత్తి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సోలార్ రూఫ్టాప్లు, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీలు, సోలార్ వేపర్స్, సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్ ఎక్విప్మెంట్, కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ తదితర కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్లో తయారు కానున్నాయి. దక్షిణాసియా దేశాల మార్కెట్ కోసం రోజుకు 1,300 టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1,200 టన్నుల గ్రీన్ ఇథనాల్ సహా గ్రీన్ హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 13.4 గిగావాట్ల సోలార్, 20 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఎన్టీపీసీ ప్రకటించింది. -
ఎంఎస్ఎంఈలపై త్రిముఖ సూత్రం
సాక్షి, అమరావతి: అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ దేశాలకు ఎగుమతులు చేసే విధంగా డిమాండ్, టెక్నాలజీ, మార్కెటింగ్ లాంటి మూడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు కేవలం స్థానిక మార్కెట్లపైనే ఆధారపడకుండా ఎంఎన్సీలతో (బహుళ జాతి కంపెనీలు) అనుసంధానిస్తే మెరుగైన మార్కెటింగ్ ఫలితాలు ఉంటాయని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రంగాల వారీగా సమీక్షించారు. ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. డిగ్రీలకు తోడు నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవాలన్నారు. రూ.3,39,959 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది దఫాలు ఎస్ఐపీబీ సమావేశాలను నిర్వహించిం 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. వీటిద్వారా రూ.3,39,959 కోట్ల పెట్టుబడులు రానుండగా 2,34,378 మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. వీటిద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు కానున్నాయి. 2024 జనవరిలోపు 38 కంపెనీలు, మార్చి లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య సదస్సుల్లో 1,739 ఎంవోయూల ద్వారా రూ. 18,87,058 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోగా 10 శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. విశాఖ ఖ్యాతిని పెంచేలా ఐటీ హబ్ ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు విశాఖను హబ్గా తీర్చిదిద్దేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రముఖ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. దీనివల్ల విశాఖ నగర ఖ్యాతి పెరిగి ఐటీకి చిరునామాగా మారుతుందన్నారు. గత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.44,963 కోట్ల విలువైన 88 ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే 85 శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడం / ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీఐఎస్లో కుదిరిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.38,573 కోట్లు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. రూ.8.85 లక్షల కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకోగా 8 ఎస్ఐపీబీ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానుండగా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విశాఖ సదస్సు కంటే ముందు 20 విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదరగా 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో 11 ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,29,650 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తెచ్చేలా కృషి చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్లో తరచూ తీవ్ర వ్యత్యాసం ఉండే టమాటా, ఉల్లి లాంటి పంటల విషయంలో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు. నాలుగేళ్లలో వృద్ధి బాగుంది – స్థిర ధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 5.36 శాతం. ఇది దేశ సగటు 6.5 శాతం కన్నా తక్కువ – గత నాలుగేళ్లలో మాత్రం రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది ట – 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతానికి పెరిగింది – 2022–23లో జీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉంది. – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న ఏపీ – జీడీఎస్డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వాటా దాదాపు రూ.13 లక్షల కోట్లు. పారిశ్రామికరంగం వాటా 21 నుంచి 23 శాతానికి పెరుగుదల. – 2022 జనవరి – డిసెంబరు మధ్య రాష్ట్రానికి రూ.45,217 కోట్ల పెట్టుబడుల రాక. – 2022–23లో రాష్ట్రం నుంచి రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి. – 2021–22లో ఎగుమతుల విలువ రూ.1.43 లక్షల కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ. రూ.1.6 లక్షల కోట్లకు పెరుగుదల. -
పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్ఎంఈలది కీలక పాత్ర: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వెల్లడించగా, జీడీఎస్డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన అధికారులు.. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్ కామెంట్స్ ►పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర ►ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయి ►ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి ►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ► MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలి ►పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ►ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలి ►రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలి ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్.రమణా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా -
Andhra Pradesh: పారిశ్రామిక దూకుడు!
సాక్షి, అమరావతి: పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్లతోపాటు 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం లాంటి అనుకూలతలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు, లాజిస్టిక్స్తో పాటు వివాద రహితంగా అభివృద్ధి చేసిన భూములను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రాయితీలతోపాటు మౌలిక వసతులపై అధికంగా దృష్టిసారించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సీఎం జగన్ కోవిడ్ సంక్షోభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో రూ.11,753 కోట్లతో ఆరు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు రూ.18,897 కోట్లతో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కోవిడ్ సమయంలో ఏకకాలంలో చేపట్టారు. అంతేకాకుండా విశాఖ, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల కోసం ప్రతిపాదనలు పంపారు. మరోవైపు కాకినాడ వద్ద రూ.1,000 కోట్లతో బల్క్డ్రగ్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నారు. వీటివల్ల అభివృద్ధి చేసిన 50,000 ఎకరాలు అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గనుంది. తద్వారా అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదగనున్నట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం ఈ స్థాయిలో వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని పేర్కొంటున్నాయి. కోవిడ్లోనే కొప్పర్తి నోడ్ రెడీ ఒకపక్క కోవిడ్ సంక్షోభం వెంటాడుతున్నా విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలోని కొప్పర్తి నోడ్ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అందుబాటులోకి తెచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అభిృవృద్ధి చేస్తోంది. ఇందులో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 3,053 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇదే కారిడార్లో భాగంగా నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడ్లను ఏడీబీ, నిక్డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ నిధులతో తొలిదశలో రూ.2,900 కోట్లతో అభివృద్ధి చేయగా రెండోదశలో రూ.1,633 కోట్లతో అభివృద్ధి పనులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఈనెల 23న ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒక్క కారిడార్ పరిధిలోనే 26,182 ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక చెన్నై–హైదరాబాద్ కారిడార్ కింద కృష్ణపట్నం వద్ద 11,096 ఎకరాల్లో క్రిస్ సిటీని, హైదరాబాద్ –బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లు వద్ద 9,305 ఎకారాలను అభివృద్ధి చేయనుంది. ఈ పారిశ్రామిక పార్కులకు అవసరమైన నీటి వసతికి సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ మొదలు పెట్టింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు ఎయిర్పోర్టును అందుబాటులోకి తేగా భోగాపురంతోపాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వానికి భిన్నంగా.. టీడీపీ అధికారంలో ఉండగా తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు నెలన్నర ముందు ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముగించారు. ఇలాంటి వ్యవహారాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించడంతోపాటు ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ క్లోజర్) సమకూరిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల నిర్మాణం మొదలు కాగా ఈనెల 22వతేదీన మచిలీపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఏపీ మారిటైమ్ బోర్డును నెలకొల్పడమే కాకుండా మూడు పోర్టులకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేశారు. 2022 జూలైలో పనులు ప్రారంభించిన రామాయపట్నం శరవేగంగా సాకారమవుతోంది. ఈ ఏడాది చివరినాటికల్లా తొలి ఓడను ఇక్కడకు రప్పించే లక్ష్యంతో ముందుకువెళుతున్నారు. 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పోర్టులకు అదనంగా 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లలో పనులు వేగంగా జరుగుతుండటంతో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. జువ్వలదిన్నె పనులు 86 శాతానికిపైగా పూర్తి కాగా నిజాంపట్నంలో 62 శాతం జరిగాయి. మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు 50 శాతం దాటాయి. ప్రైవేట్ రంగంలో నిర్మిస్తున్న కాకినాడ గేట్వే పోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల కోసం రూ.18,897 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ పోర్టులను ఆనుకుని భారీ పారిశ్రామిక నగరాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మాన వనరులను సమకూర్చడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం 192 స్కిల్ హబ్స్ ఏర్పాటుతోపాటు 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ దేశీయ ఇన్ఫ్రా రంగంపై ఏటా ప్రకటించే అవార్డుల్లో ఈసారి మనకు చోటు దక్కింది. దేశంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అత్యున్నత ప్రగతిని గుర్తిస్తూ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుండటంతో దిగ్గజ సంస్థలైన అదానీ, అంబానీ, మిట్టల్, బిర్లా, భంగర్, భజాంకా, సంఘ్వీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 386 ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రాజెక్టŠస్ టుడే సర్వే వెల్లడించింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పోర్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సహజ వనరులను వినియోగించుకుంటూ మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రామాయపట్నం పోర్టుతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, మచిలీపట్నంతో కృష్ణా, ఎన్టీఆర్, మూలపేటతో శ్రీకాకుళం జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా 50,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాతే సీఎం జగన్ పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన మరుసటి రోజునుంచే పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్నది సీఎం ఆకాంక్ష. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి వ్యయం తగ్గించడమే లక్ష్యం పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. లాజిస్టిక్ వ్యయం తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్తో పోటీ పడేవిధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. యూరోప్లోని రోస్టర్ డ్యామ్, జపాన్లోని యకహోమా తరహాలో పోర్టు నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ఇన్లాండ్ వాటర్వేస్, గ్యాస్, రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటివల్ల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గుతుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంవోయూల కంటే ఎక్కువగా మూడు పారిశ్రామిక కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను ఏడీబీ, నికిడిక్ట్ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను ఏకకాలంలో నిర్మిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెంది రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఒప్పందం చేసుకున్న రూ.13.11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. – ప్రవీణ్కుమార్, వీసీఎండీ ఏపీఐఐసీ, సీఈవో ఏపీ మారిటైమ్ బోర్డు. -
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1 ..గుజరాత్ను అధిగమించి సత్తా
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23లో 306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలతో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్ను అధిగమించి ఏపీ నంబర్ వన్గా నిలిచింది. 2022–23లో టాప్ పది రాష్ట్రాల్లో 7,376 ప్రాజెక్టులకు సంబంధించి రూ.32,85,846 కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా ఏపీ నుంచే 23 శాతానికి పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరగడం విశేషం. ఏపీ ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో 57 భారీ ప్రాజెక్టుల విలువ రూ.7,28,667.82 కోట్లుగా ఉంది. ఇందులో ఏడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సంబంధించినవి కాగా మరో 18 హైడల్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్కు డిమాండ్.. గుజరాత్ రూ.4,44,420 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి గుజరాత్ మూడు భారీ ప్రాజెక్టులను ఆకర్షించింది. కర్ణాటక రూ.4,32,704 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,58,482 కోట్ల విలువైన 487 ప్రాజెక్టులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలున్నాయి. కోవిడ్ సంక్షోభం ముగిసిన తరువాత దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు బాగా పెరిగినట్లు సర్వే పేర్కొంది. 2022–23లో మొత్తం రూ.36.99 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో ప్రైవేట్ రంగ పెట్టుబడుల విలువ రూ.25,31,800 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు రూ.5,62,083 కోట్లు, రాష్ట్రాల పెట్టుబడులు రూ.6,05,790 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్దఎత్తున పెట్టుబడులు కుదిరే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టిసారించిన రాష్ట్రాలు ప్రైవేట్ పెట్టుబడులను అధికంగా ఆకర్షించనున్నట్లు సర్వే పేర్కొంది. విశాఖ సదస్సుతో ఏపీకి గరిష్ట ప్రయోజనం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ నిర్వహించగా అందులో అత్యధికంగా లబ్ధి పొందిన రా>ష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సర్వే తెలిపింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 386 ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈ సర్వేలో కొన్ని ప్రాజెక్టుల ఒప్పందాలను పరిగణలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు. -
పాలిటెక్నిక్ కోర్సులకు ‘కొత్త’ ఊపు
విశాఖ విద్య: ఒకప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉండేది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి కొలువు గ్యారెంటీగా దక్కేది. ఈ మూడేళ్ల కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందొచ్చు. అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలు క్రమంగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. జీఐఎస్ ఒప్పందాలతో నయా జోష్ విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్)లో ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పెద్దఎత్తున నెలకొల్పే పరిశ్రమలకు మానవ వనరుల అవసరం దృష్ట్యా, మూడేళ్ల కాల వ్యవధి గల పాలిటెక్నిక్ కోర్సులపై అందరి దృష్టి పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిం చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త కోర్సులకు రూపకల్పన ఎనర్జీ, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజ, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో వీటి విస్తరణకు అనువైన పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులైన యువతను అందించేందుకు వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిదశలో నాలుగుచోట్ల ఈ నేపథ్యంలో.. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కెమికల్ సుగర్ టెక్నాలజీ స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్టీ ఇంటిగ్రేటెడ్), సత్యవేడులో మెకానికల్ ఇంజనీరింగ్ స్థానంలో మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, గన్నవరంలో కొత్తగా కంప్యూటర్ సైన్సు, గుంటూరులో గార్మెంట్ టెక్నాలజీ స్థానంలో డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అనుమతిచ్చారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే వీటిలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు సరికొత్త కోర్సుల రూపకల్పన చేసేలా సాంకేతిక విద్యాశాఖ ముందుకెళ్తోంది. 84 కాలేజీలు.. 17వేల సీట్లు.. 28 రకాల కోర్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 84 కాలేజీలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలో 17వేల వరకు సీట్లున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, 3డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్టైల్ వంటి 28 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కాలేజీల బలోపేతంపై సాంకేతిక విద్యాశాఖ కార్యాచరణలోకి దిగింది. కొత్త కోర్సులు అవసరం ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తోంది. పాలిటెక్నిక్లో కొత్త కోర్సుల ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులు అవసరం. క్యాడ్ కామ్, పవర్ సిస్టమ్, ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు తీసుకొస్తే ఎంతో మేలు. – డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్పీటీఓ) అధ్యక్షులు పాలిటెక్నిక్ కాలేజీలకు మంచిరోజులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేలా సకల సౌకర్యాలున్నాయి. కొత్త కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీలకు మంచి రోజులొస్తున్నాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. – జీవీవీ సత్యనారాయణమూర్తి, పాలీసెట్ కనీ్వనర్, ఉమ్మడి విశాఖ జిల్లా క్యాంపస్ కొలువు కొట్టా మాది విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం. తండ్రి గోదాములో కలాసీగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటిదగ్గర మిషన్ కుడుతుంది. సత్వర ఉపాధి కోసమని పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ కోర్సు ఎంచుకున్నాను. క్యాంపస్ సెలక్షన్స్లో టాటా ప్రాజెక్టులో ఏడాదికి రూ.3.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. – ఈతకోట సియోన్, విశాఖపట్నం -
పనులు ప్రారంభిస్తే అదనపు రాయితీలు
సాక్షి, అమరావతి: కేవలం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఒప్పందాలను త్వరగా వాస్తవరూపంలోకి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున్న ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాల కోసం 2023–27 నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేకంగా ఎర్లీబర్డ్ ప్రాజెక్టŠస్ పేరుతో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సదస్సులో మొత్తం 386 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా వీటిద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు.. 6,07,383 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇంత భారీస్థాయిలో ఉపాధి లభించే అవకాశం ఉండటంతో ఈప్రాజెక్టులకు త్వరితగతిన అన్ని అనుమతులూ మంజూరు చేస్తూ పనులు మొదలుపెట్టేలా చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇప్పటికే 17 మంది సభ్యులతో ఒక మనాటరింగ్ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆర్నెలల్లో మొదలు పెడితే ప్రోత్సాహకాలు విశాఖ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తేదీ నుంచి ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎర్లీబర్డ్ కింద పలు ప్రోత్సాహకాలను నూతన పారిశ్రామిక విధానం–2023–27లో పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాలతో పాటు ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి అదనపు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్, 100 శాతం లాండ్ కన్వర్షన్ చార్జీల రీఎంబర్స్ చేయనున్నారు. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో వాటితో సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి స్థానిక ఉపాధితో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ప్రతిపాదించినట్లు పాలసీలో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులను ఈ పెట్టుబడుల ద్వారా వినియోగించుకోనున్నారు. మధ్య తరహా, లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పాలసీలో పేర్కొన్న రాయితీలకు అదనంగా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పాలసీలో వివరించారు. -
గేమ్ ఛేంజర్.. పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రేపటి తరాల భవిష్యత్, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పరితపిస్తున్న, శ్రమిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న అపార వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నారని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ (ఏపీ జీఐఎస్)పై శాసనసభలో శనివారం స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆ సదస్సులో రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ క్రమంలో 6,07,383 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో జీఐఎస్ గేమ్ చేంజర్ అని కొనియాడారు. వ్యూహాత్మక విధానాలతో విజయం రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించడానికి ముందు రోడ్షోలు, వివిధ దేశాల దౌత్యవేత్తలతో సమావేశాలు, కర్టెన్రైజర్ కార్యక్రమాలు నిర్వహించాం. తద్వారా తీసుకున్న చర్యలు, వ్యూహాత్మక విధానాల ద్వారా విజయం సాధించాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తలు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, భారత్ బయోటెక్ కృష్ణా ఎళ్ల, జీఎంఆర్ గ్రూప్స్, జీఎం రావు, ఇతరులు సమ్మిట్కు హాజరయ్యారు. ఇంధన శాఖలో రూ.9.05 లక్షల కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యంలో రూ.3.38 లక్షల కోట్లు, పర్యాటక శాఖలో రూ.22,096 కోట్లు, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రూ.41 వేల కోట్లు, వ్యవసాయ శాఖలో రూ.3,435 కోట్లు, పశు సంవర్థక శాఖలో రూ.1,020 కోట్లు చొప్పున రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెట్టుబడులకు వాస్తవ రూపం తీసుకు రావడం కోసం సీఎస్ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం వైఎస్సార్ వన్ కింద 23 శాఖలకు సంబంధించి 96 క్లియరెన్స్లు 21 రోజుల్లో ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఏపీ ప్రభుత్వమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రం నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. అప్పట్లో ఏటా సగటున రూ.90 వేల కోట్ల లోపు మాత్రమే ఎగుమతులు ఉండేవి. మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుంచి 2019–20లో రూ.1.04 కోట్లు, 2020–21లో రూ.1.24 లక్షల కోట్లు, 2021–22లో రూ.1.43 లక్షల కోట్లు, 2022–23లో డిసెంబర్ వరకు రూ.1.18 లక్షల కోట్ల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. వీటి పరిధిలో 48 వేల ఎకరాల భూమి పరిశ్రమలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం కూడా మాదే. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం జగన్ ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్, ఇతరత్రా చర్యలతో ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా 13 లక్షల మందికిపైగా ఉపాధి లభించింది. బకాయిలతో కలిపి రూ.2800 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించాం. మూడేళ్లలో రూ.56 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 111 భారీ పరిశ్రమలు తీసుకుచ్చాం. వీటిలో 73 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. మరో 88 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.16 వేల కోట్లతో మరో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచించిన నాయకులు నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్ మాత్రమే. టీడీపీ ప్రచారం అంతా అవాస్తవం. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను మేం ఇబ్బంది పెట్టామా? అనకాపల్లి జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లాంట్ నాలుగేళ్లుగా పన్ను చెల్లించలేదు. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి విప్లవాత్మక మార్పులతో పెట్టుబడులు సీఎం జగన్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమలకు విద్యుత్ శాఖ వెన్నెముక లాంటిది. ఇటీవల విశాఖలో మొత్తం రూ.13 లక్షల కోట్ల ఎంవోయూల్లో ఇంధన శాఖకు సంబంధించే రూ.8,85,515 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 2017లో చంద్రబాబు రూ.85,571 కోట్ల ఎంవోయూలు చేసుకుని 45,895 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. 2018లో రూ.67,115 కోట్లతో ఎంవోయూలు చేసుకుంటే ఇందులో కూడా ఉద్యోగాలు జీరోనే. మేం చేసుకున్న ఒప్పందాలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. భూమి, నీళ్లు, ఇతర వనరులను సమర్థవంతంగా వాడుకునేలా కొత్త పాలసీలు తెచ్చాం. ఏ రాష్ట్రానికైనా పవర్ ఇచ్చేలా 2020లో రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని తీసుకువచ్చాం. దీంతో సోలార్, ఎనర్జీ సంస్థలు వచ్చాయి. 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల టెక్నికల్ కమర్షియల్ ఫీజబుల్ రిపోర్ట్ సిద్ధం చేశాం. మరికొన్ని చిన్న ప్రాజెక్టులకు నివేదికలు తయారు చేస్తున్నాం. మన దేశంలో 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల స్థాపనలో ఎకరాకు రూ.31 వేలు చొప్పున రైతులకు లీజు లభిస్తుంది. – మంత్రి పెద్దిరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి ఆయనకు లోకజ్ఞానం ఉందా? దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్కు మాత్రమే వచ్చారంటే సీఎం జగన్ పట్ల వారు ఎంత నమ్మకంగా, సానుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఓ నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ నిర్వహించి.. దారిన పోయే వారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడారు. ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా? పారిశ్రామిక వేత్తల గురించి కనీస అవగాహన ఉందా? పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పారిశ్రామికవేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో తిప్పికొట్టాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సులకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో సీఎం అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని స్వయంగా ముఖేష్ అంబానీ సమ్మిట్లో అన్నారు. జే అంటే జగన్.. జే అంటే జోష్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగన్తోనే సాధ్యమని పునీత్ దాల్మియా ప్రశంసించారంటే ఇంతకంటే సర్టిఫికెట్ ఏం కావాలి? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. పర్యాటక రంగంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఎంవోయూలు చేసుకున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి టార్చ్ బేరర్ సీఎం జగన్ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఆశలను తన భుజస్కందాలపై వేసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్న టార్చ్ బేరర్ సీఎం జగన్. ఈ ప్రయాణంలో భాగంగా రాష్ట్ర యువత భవిష్యత్కు భరోసానిచ్చేలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తద్వారా దేశంతో పాటు, ప్రపంచాన్నే రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఈ సమ్మిట్ విజయవంతం అవ్వడంతో టీడీపీ నాయకులకు మైండ్ బ్లాంక్ అయింది. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కన్నా దోపిడీ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఫైబర్ నెట్ లిమిటెడ్లో రూ.రెండు వేల కోట్లు దోపిడీ చేసిన చరిత్ర లోకేశ్ ది. సీమెన్స్ కుంభకోణం రూపంలో రూ. 371 కోట్లు దోపిడీ చేశారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. – అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే -
‘సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఐదో రోజు బడ్జెట్ సమావేశాల సందర్బంగా విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సమ్మిట్పై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా జీఐఎస్కు వచ్చినట్టు స్పష్టం చేశారు. అనేక రంగాల్లో ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్. జీఐఎస్తో సీఎం వైఎస్ జగన్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. పరిశ్రమల ద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్తో తిప్పికొట్టాం. దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు. జె అంటే జగన్.. జె అంటే జోష్ అని పారిశ్రామికవేత్తలే చెప్పారు. జీఐఎస్తో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి రుజువు చేశారు. పర్యాటక రంగంలో 129 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారు. చంద్రబాబు హయంలో ప్రచారం ఎక్కువ.. పెట్టుబడులు తక్కువ అని ఎద్దేవా చేశారు. అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. చంద్రబాబు గ్రాఫిక్స్తో పెట్టుబడులు చూపించారు. మేం దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాం. రూ.13లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సూపర్ హిట్. జీఐఎస్తో సీఎం జగన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. జీఐఎస్ సక్సెస్ చూసి ఎల్లో బ్యాచ్కు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. జీఐఎస్ సక్సెస్ చూసి లోకేష్కు మైండ్ బ్లాంక్ అయ్యింది. లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. మాది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. -
మొదలైన పెట్టుబడుల కార్యాచరణ
సాక్షి, అమరావతి: విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సదస్సులో కుదిరిన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి సీఎస్ చైర్మన్గా 17 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. వీరితో పాటు వ్యవసాయ, పశు సంవర్థక, ఆర్థిక, ఇంధన, జలవనరులు, పర్యాటక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జీఏడీ (కో–ఆర్డినేషన్), స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్లానింగ్, ఐటీ–ఐటీఈఎస్, ట్రాన్పోర్ట్ శాఖల కార్యదర్శలు సభ్యులుగా ఉంటారు. వీరుకాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు. ప్రతీ శాఖలో కుదరిన ఒప్పందాలను ఆయా ఇన్వెస్టర్లతో సమీక్షించి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటిలోగా ఉత్పత్తిలోకి తీసుకొస్తారన్న అంశాలపై ఒక అజెండాను రూపొందించి ఆ వివరాలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు సమీక్ష కోసం మానిటరింగ్ కమిటీకి ఇవ్వాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇక మానిటరింగ్ కమిటీ తరచూ సమావేశమై పెట్టుబడులను త్వరితగతిన వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకులు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. విశాఖ జీఐఎస్–2023 సమావేశాల సందర్భంగా మొత్తం 386 ఒప్పందాలు జరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో పాటు 6,07,383 మందికి ఉపాధి లభించనుంది. ప్రతీ 15రోజులకోసారి సమీక్షిస్తాం జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ ప్రముఖలను విశాఖకు తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం ఇప్పుడు వాటిని వాస్తవరూపం తీసుకురావడంపై దృష్టిసారించింది. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు ఎప్పటిలోగా ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నాయో అన్న దానిపై సమాచారం సేకరించి దానికనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలి సమావేశం గత శుక్రవారం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఇలా ప్రతీ 15 రోజులకొకసారి సమావేశమై ఎంఓయూల పరిస్థితిని సమీక్షిస్తాం. – జి. సృజన, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ -
స్టార్టప్స్కు ఊతమిచ్చిన జీఐఎస్
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కేవలం భారీ పెట్టుబడులను ఆకర్షించడానికే కాకుండా రాష్ట్ర స్టార్టప్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా వేదికగా నిలిచింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జీఐఎస్లో 36కు పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆలోచన దగ్గర నుంచి దాన్ని వాణిజ్యపరంగా పూర్తిస్థాయి నూతన ఆవిష్కరణగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్ను తయారు చేసే విధంగా పరిశ్రమలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్స్, పరిశ్రమలతో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందుకోసం జీఐఎస్ ఎగ్జిబిషన్లో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి, స్టార్టప్స్పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 595 స్టార్టప్స్, 30 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఏపీ ఐటీ శాఖ నుంచి నాలుగు ఇంక్యుబేటర్లు, వివిధ కళాశాలల్లో మరో 26 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 1,500 మంది సొంతంగా ఇంటి నుంచే స్టార్టప్స్ కింద పనిచేయడానికి నమోదు చేసుకొన్నారు. రాష్ట్రంలోని స్టార్టప్స్ అంతర్జాతీయంగా ఎదిగేలా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా పలు సంస్థల సహకారాన్ని స్టార్టప్స్కి అందిస్తోంది. స్టార్టప్స్కు పరిశ్రమల మద్దతు రాష్ట్రంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్కు సహాయ సహకారాలందించడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. బహుళజాతి సంస్థలు పేటీఎం, ఒప్పొ, డసాల్ట్, స్మార్ట్ఫారి్మంగ్ టెక్, గ్లోబల్ యాక్సలేటర్ ఫర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ వంటి సంస్థలు స్టార్టప్స్ను ప్రోత్సహించనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇన్నొవేషన్స్ సొసైటీతో ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్స్కు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు పేటీఎం ముందుకొచ్చింది. అలాగే ప్రముఖ సెల్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన అనుంబంధ సంస్థ ఓప్లస్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని స్టార్టప్స్ ప్రమోట్ చేయనుంది. రాష్ట్రంలోని స్టార్టప్స్ అభివృద్ధి చేసిన ప్రొడక్ట్సను 100 రోజుల్లో మార్కెటింగ్ చేసేందుకు డసాల్ట్ ఇండియా సిస్టమ్స్ ఆసక్తి కనబరుస్తోంది. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఆవిష్కరించే నూతన టెక్నాలజీలకు ఆర్థిక సాయం అందించేందుకు నెదర్లాండ్స్కు చెందిన స్మార్ట్ ఫార్మింగ్ టెక్ బీవీ ముందుకొచ్చింది. బెంగళూరుకు చెందిన యాక్సిలేటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ రాష్ట్రంలోని స్టార్టప్స్ను దేశ విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి ఆర్థి క వనరులను సమకూర్చనుంది. ఫండింగ్ చేయడానికి మూడు సంస్థలు అలాగే రాష్ట్రంలోని స్టార్టప్స్ అభివృద్ధి చేసిన నూతన ఆవిష్కరణలకు దేశ విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజెల్ ఫండింగ్ రూపంలో ఆర్థి కసాయం అందించే విధంగా మూడు సంస్థలతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఒప్పందాలు చేసుకుంది. స్పెయిన్కు చెందిన యూరోపియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఈఈడీసీ), చెన్నైకి చెందిన కన్సార్టీయం ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సీటీఈ), బ్రిటన్కు చెందిన ఈస్క్వేర్ ఇన్నొవేషన్స్ లిమిటెడ్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదే విధంగా డీఎల్టీ ల్యాబ్ టెక్నాలజీస్, దుబాయ్కు చెందిన క్రియేటర్స్ ఎఫ్జెడ్కో, మై స్టార్టప్ టీవీ, నెక్టŠస్ వేవ్ వంటి స్టార్టప్ సంస్థలతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఇవి కాకుండా రాష్ట్రంలోని 13కుపైగా ఇంక్యుబేటర్ సంస్థలు, ఎస్టీపీఐ నెక్ట్స్, నాస్కాంలతో ఏపీఐఎస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ అభివృద్ధే లక్ష్యం నూతన ఆవిష్కరణలు ఆలోచన దగ్గర నుంచి వ్యాపార పరంగా నూతన అప్లికేషన్ ఆవిష్కరించే విధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రధానంగా మెటావర్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమ్ డెవలప్మెంట్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, డిజిటల్ ఆర్ట్, మార్కెటింగ్, మీడియా డిస్ట్రిబ్యూషన్ రంగాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాం. నాలుగో తరం టెక్నాలజీలో పనిచేస్తున్న వారందరినీ ఆన్లైన్లో ఒకే వేదికపైకి తేవడం ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. రంగాల వారీగా నెలవారీ, మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి సమీక్షలతో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రో గ్రాంలు, హ్యాక్థాన్లు, పోటీలు నిర్వహిస్తాం. – ఏపీ ఇన్నొవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు -
ఏపీలో సోలార్ ప్రాజెక్టు పెడతాం
సాక్షి ప్రతినిధి: ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీ.. పరిశ్రమలను ప్రోత్సహించడంలో ఇక్కడి పాలకులు అనుసరిస్తున్న విధానాలు పారిశ్రామిక దిగ్గజాలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో రూ. 9,57,139 కోట్ల పెట్టుబడులతో 42 ప్రాజెక్టుల ద్వారా 1,80,918 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ జాబితాలోకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా (ఎన్ఎల్సీఐ) లిమిటెడ్ కూడా చేరింది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను స్థాపించడానికి ఈ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఎన్ఎల్సీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ప్రసన్నకుమార్ మోటుపల్లి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పునరుత్పాదక విద్యుత్కు ఏపీలో అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ‘నైవేలీ’ సిద్ధంగా ఉంది. పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) విభాగంలో.. ముఖ్యంగా సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపనకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే మా కార్పొరేషన్ లక్ష్యం. ఇందుకు అనుకూలమైన రాష్ట్రాలేమిటని చూసినప్పుడు మాకు మొదట ఏపీ కనిపించింది. దీంతో వెంటనే ప్రభుత్వానికి మేం ప్రతిపాదించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్తో భేటీ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ఎల్సీ విస్తరణ, పవర్ ప్రాజెక్ట్లు నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై చర్చించాం. ప్రభుత్వం వైపు నుంచి మాకు అత్యంత సానుకూల వాతావరణం కనిపించింది. లిగ్నైట్ ద్వారా విద్యుదుత్పత్తి.. లిగ్నైట్ (గోధుమ బొగ్గు) ద్వారా విద్యుదుత్పత్తి చేయడం మా కార్పొరేషన్ ప్రత్యేకత. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్లలో మాత్రమే ఈ బ్రౌన్ కోల్ అందుబాటులో ఉంది. ఎన్ఎల్సీఐ ద్వారా లిగ్నైట్ మైనింగ్ చేసి నైవేలీలోనే విద్యుదుత్పత్తి చేస్తాం. అలా ఉత్పత్తి అయిన విద్యుత్ 8 వేల మెగావాట్లు కాగా అందులో థర్మల్ పవర్ 6 వేల మెగావాట్లు ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకి కార్పొరేషన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 310 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఏపీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో.. దేశంలోనే తొలిసారిగా నైవేలీలో రూ.12 వేల కోట్లతో 1,320 మెగావాట్ల లిగ్నైట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ని ఏర్పాటుచేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఒడిశా రాష్ట్రం తాలబిరలో రూ.22 వేల కోట్ల వ్యయంతో 3,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ని నిర్మించబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే ఏపీలో రూ.3 వేల కోట్లతో 500–1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు నచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. 2025లోగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగితే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి కూడా కేంద్రం ద్వారా మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రాజెక్టువల్ల ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విద్యుత్ కూడా తక్కువ ధరకే దొరుకుతుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) లిమిటెడ్తో ఏపీ ఇప్పటికే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ పొందడానికి ఒప్పందం చేసుకుంది. వారి ధర యూనిట్ రూ.2.49గా నిర్ణయించారు. మేం కూడా ఇంచుమించు అదే ధరకు సౌర విద్యుత్ను అందిస్తాం. -
ఎలక్ట్రానిక్ రంగంలో భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి : ఎల్రక్టానిక్స్ అండ్ డిజైనింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగానే పెట్టుబడులు ఆకర్షించింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.15,711 కోట్ల విలువైన 23 ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్గౌర్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా 57,640 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు విస్తరణ చేపట్టేలా ఒప్పందం చేసుకోగా మరికొన్ని కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక పెట్టుబడులు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనే వచ్చాయి. అత్యధికంగా టీసీఎల్ గ్రూప్.. టీసీఎల్ గ్రూపు రాష్ట్రంలో అత్యధికంగా రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. టీవీ డిస్ప్లే ప్యానల్స్ను టీసీఎల్ గ్రూపు ఉత్పత్తి చేయనుంది. ♦ సెల్ఫోన్ కెమెరాలు, ఇయర్ ఫోన్స్ వంటి ఉపకరణాలను తయారుచేసేందుకు సన్నీఆపె్టక్ రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ అలాగే, ఇప్పటికే శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన బ్లూస్టార్, డైకిన్ సంస్థలు తమ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. డైకిన్ సంస్థ రూ.2,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా.. బ్లూస్టార్ రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ ఇవికాక.. డ్రోన్స్, లాజిస్టిక్ సొల్యూషన్స్, డిఫెన్స్, వ్యవసాయ రంగాల్లో ఎల్రక్టానిక్ ఉత్పత్తులను తయారుచేసే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 23 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా మరిన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అపిటా గ్రూపు సీఈఓ కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. ఇక తిరుపతిలో రెండు, శ్రీసిటీలో ఒకటి, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ మొత్తం నాలుగు ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ అందుబాటులో ఉండటంతో ఎల్రక్టానిక్స్ సంస్థలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. -
బొబ్బిలి వీణ.. శిఖరాగ్ర ఆదరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన 20 సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశాల్లో బొబ్బిలి వీణ వైభవాన్ని చాటుకోనుంది. విశాఖలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న జీ–20 సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరయ్యే అతిథులను గౌరవించేందుకు 200 బొబ్బిలి వీణలను అధికారులు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయన చేతుల మీదుగా వీటిని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు దేశం నలుమూలల నుంచి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు, ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బొబ్బిలి వీణలను బహూకరించారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి ఇంటిపేరు గల కుటుంబీకులే దశాబ్దాలుగా బొబ్బిలి వీణలను తయారుచేస్తూ వస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 1994వ సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేసింది. 2002లో బొబ్బిలి పట్ణణ పరిధిలోని గొల్లపల్లిలో వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది వీణల తయారీయే ఆధారంగా ఉన్న మా కళాకారులకు టీటీడీతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంలో 200 వీణలను తయారుచేసి అందించాం. అతిథుల కోసం మా వీణలతో కచేరీ కూడా ఏర్పాటు చేయించారు. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు జీ–20 కోసం కూడా 200 వీణలకు ఆర్డర్ వచ్చింది. – సర్వసిద్ధి రామకృష్ణ, ఇన్చార్జి, బొబ్బిలి వీణల కేంద్రం -
జీఐఎస్ సక్సెస్తో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్: మంత్రి రోజా
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ బ్రాండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో అర్థమైందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జీఐఎస్ సక్సెస్తో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ‘‘రాష్ట్రానికి 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పారిశ్రామిక దిగ్గజాలు రావడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. టీడీపీ గోబెల్స్ ప్రచారానికి ఈ సమ్మిట్తో సమాధానమిచ్చాం’’ అని రోజా అన్నారు. పర్యాటక శాఖలో పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేశాం. గ్రౌండింగ్ చేయడానికి రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. పారిశ్రామిక దిగ్గజాలు రావడం ఈ ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్కి నిదర్శనం. అంబానీ, ఆదాని, దాల్మియా, జిందాల్ వంటి నేతలు సీఎం జగన్ పాలన కోసం చెప్పారు. సీఎం జగన్ పట్ల ఎంత విశ్వాసం ఉందో ఈ సమ్మిట్తో అర్థమైంది’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మా టూరిజం శాఖలో ఎంవోయూలు గ్రౌండ్ చేయడానికి రెండు కమిటీలు వేశాం. పర్యాటక శాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేశాం. ఒబేరాయ్ లాంటి సంస్థలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఏనాడైనా ఇంత గొప్ప పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు హయాంలో సమ్మిట్లకు వచ్చారా?. చంద్రబాబుకి చేతకానిది సీఎం జగన్ చేసి చూపించారు. సీఎం జగన్ క్రేజ్ ఎలా ఉంటుందో చంద్రబాబుకి అర్థమైంది’’ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్ -
మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్మోహన్ పాల్గొన్నారు. చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? -
పెట్టుబడుల కోసం సీఎం జగన్ది మంచి ప్రయత్నం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించడం ద్వారా పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కృషి చేశారన్నారు. సోమవారం ఆయన విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంవోయూలు) వాస్తవరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఐఎస్ నిర్వహణ భేష్: విష్ణుకుమార్రాజు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను గొప్పగా నిర్వహించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు విలేకరుల సమావేశంలో కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన ఎంవోయూలు కుదుర్చుకోవడం, అంబానీ, కరణ్ అదానీ, జిందాల్ వంటి అతిరథులు పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రానికి ఇంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చారంటే మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వేళ రాజకీయ విమర్శలు సరికాదని చెప్పారు. విశాఖలో రోడ్ల అభివృద్ధి, నగర సుందరీకరణ అభినందనీయమన్నారు. -
విశాఖను వరించిన పెట్టుబడులు
కేవలం 1 శాతం సంపన్నవంతులను మాత్రమే పట్టించుకుంటూ, ప్రపంచంలోని మిగతా 99 శాతం భవిష్యత్తును గాలికి వదిలేయకూడదు. కొద్దిమంది చేతుల్లో ద్రవ్య అధికార కేంద్రీకరణ జరిగి అది మిగతా ప్రపంచ భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వం. వీటిని పూర్తిగా గుర్తెరిగి, ప్రపంచ పెట్టు బడులను పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మలుస్తూ సాగింది విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్ర స్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగిన ఫలితమే – ఈ సదస్సు. ‘‘20వ శతాబ్దపు పెట్టుబడిదారీ వ్యవస్థ 21వ శతాబ్దపు సమాజాన్ని తీర్చిదిద్దడంలో విఫలమైందా? గత 30 సంవత్సరాల వ్యవ ధిలో సంపన్న వర్గాలకూ, పేద వర్గాలకూ మధ్య ఆదాయ వనరులలో వ్యత్యాసం దారుణంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు నూతన వ్యవస్థ అవసరమని చెప్పినంత మాత్రాన పరిస్థితులు మారవు. ఉన్న వ్యవస్థ ఎందుకు ప్రజాబాహుళ్యం అవసరాలను తీర్చలేకపోతోంది? కొలది మందిలో పేరుకుపోయిన అవధులు లేని కోరికలు; పేద, కార్మిక వర్గాల హక్కులపై సాగుతున్న దాడులు– ఈ పరిస్థితులు వెరసి ఉత్పత్తి అవుతున్న సంపద పంపిణీలో వాటాను పేద సాదలు అనుభవించనివ్వకుండా చేస్తున్నాయి. ఇలా పేద సాదల న్యాయమైన డిమాండ్ కుంచించుకు పోతూ, వ్యాపార సరళి దెబ్బతింటూపోతే వ్యాపార వర్గాల వ్యాపారమూ బతికి బట్ట కట్టలేదని గుర్తించాలి. కను కనే, అమెరికా అధ్యక్ష కార్యాలయ సలహాదారుగా పనిచేసిన లారీ సమ్మర్స్ 40 శాతం అమెరికన్లలో పెట్టుబడిదారీ విధానమంటే సాను కూల అభిప్రాయం లేదని బాహాటంగా చాటాడు’’. – షరాన్ బ్రూనో, అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ‘‘నానాటికీ పెరిగిపోతున్న సామాజిక అసమానతలు ప్రపంచ ప్రజల భావి భాగ్యోదయానికీ, భద్రతకూ కాచుకు కూర్చున్న పెద్ద ప్రమాదం’’. – ప్రపంచ ఆర్థిక, సహకారాభివృద్ధి సమాఖ్య ప్రపంచ పెట్టుబడులకు దావోస్ కేంద్ర స్థానంగా ఉండి, వర్ధమాన బతుకుల్ని శాసిస్తూ వచ్చిన దశ నుంచి కొత్త మార్పు మొదలైంది. కేవలం 1 శాతం సంపన్నవంతుల గొంతును వినిపిస్తూ ప్రపంచంలోని మిగతా 99 శాతం ప్రజాబాహుళ్యం భవిష్యత్తును దావోస్ గాలికి వదిలేస్తూ వచ్చింది. కనుకనే స్విట్జర్లాండ్ యువజన సమాఖ్య అధిపతి డేవిడ్ రాత్, కొద్దిమంది చేతుల్లో ఈ ఆర్థిక, ద్రవ్య అధికార కేంద్రీకరణ మిగతా ప్రపంచ ప్రజాబాహుళ్యం భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వంగా అభివర్ణించాడు. అలాంటి దావోస్ సభలలో చర్చలను, ఫలితాలను అవగతం చేసుకొని వచ్చిన అనుభవం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర సమగ్రా భివృద్ధి కోసం పథక రచన చేశారు. భారతదేశంలో విశిష్ట సహజ సాగర వనరులకు కేంద్రంగా, సహజ సంపదలకు ఆలవాలంగా ఉండి, దేశీయ పారిశ్రామిక స్థావరా లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కోస్తాలో ప్రభవిల్లుతూ వచ్చిన నగరం– విశాఖపట్నం. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రస్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో జగన్ ముందుకు సాగిన ఫలితమే – గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023. భారీ పారిశ్రామిక, ఉపాధి అవకాశాల కేంద్రంగా ఈ విశాఖ సదస్సును జయప్రదం చేయగలగడం అతని వయస్సుకు మించిన గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఎందుకంటే, బహు కొలది మందిగా ఉన్న సంపన్నుల చేతుల్లో ఆర్థిక, ద్రవ్య వనరుల కేంద్రీకరణ వల్ల ఆ వర్గాలే మిగతా అసంఖ్యాక ప్రజా బాహుళ్యంపై నియంతృత్వం చలాయించే ప్రమాదం ఇప్పటికే బలంగా పొంచి ఉంది. అందుకే జగన్ తన ‘నవరత్నాల’ పథకం ద్వారా ఆదిలోనే ప్రజా ప్రయోజనాల రక్షణకు ‘ఏడుగడ’గా నిలిచారు. అందుకే విశాఖ పెట్టుబడుల సదస్సు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయో జనాలకు రాగల నష్టం ఏమీ ఉండదు. పైగా ప్రపంచ వ్యాపిత పెట్టు బడులు రాష్ట్రానికి రాగల అవకాశాలు మరింతగా పెరిగాయి. రాష్ట్రానికి కేంద్రమూ, బీజేపీ పాలకులూ రాష్ట్ర విభజన సమయంలో హామీ పడిన ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న ‘రాజకీయ తాత్సారం’ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అపారమైన నష్టం వాటి ల్లింది. దీనికితోడు క్రియాశీల పాత్ర నిర్వహించవలసిన అతుకుల బొంత ‘తెలుగుదేశం’, ‘గాలివాటు’ రాజకీయాలకు పేరుమోసిన ‘సినీ వంగడం’ పవన్ కల్యాణ్ ‘వారాహి’ అబద్ధాలకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని దుఃస్థితిలో ఉన్నారు. ఈ రాజకీయ ‘విచిత్ర వేషధారణ’ తంతు పసికట్టిన ప్రధాని మోదీ తన బీజేపీ (ఆరెస్సెస్)కి ఏపీలో రాజకీయ అవకాశాల్ని పెంచుకోవడం కోసం ‘దేశం’తో పవ న్కు ఉన్న చెట్టాపట్టాల్ని తెగ్గొట్టగలిగారేగానీ, వారి మధ్య అక్కరకు రాని రహస్య సమావేశాల్ని ఆపలేకపోయారు. అయితే ఏపీ సీఎం జగన్ ప్రగతి మార్గాన్నీ, ‘నవరత్నాల’ బలమైన ప్రభావాన్నీ వీళ్లెవరూ అడ్డుకోలేక పోయారు. పైగా ఆయనకు అవాంతరాలు కల్పిస్తూ రోజు రోజుకీ ప్రజల ముందు అభాసుపాలవుతున్నారు. ఈ దశలో రాష్ట్రానికి దూసుకువచ్చిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ శిఖరాగ్ర సమావేశం జగన్ చొరవ ఫలితంగా జయప్రదం కాగల్గింది. అందుకే జగన్ ‘‘మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథ కాలు కావు. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిపైన పెట్టు బడిగా భావిస్తున్నాం. మా విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం విద్యాప్రమాణాలు పెంపొందిస్తున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేస్తున్నాం’’ అనగలిగారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 62 శాతం పదవులు ఇచ్చి దేశ చరిత్రలో నూతన ఒరవడిని సుస్థిరపరిచి దేశ చరిత్రలోనే మొదటి స్థానంలో జగన్ నిలబడటానికి ‘దమ్ము’ అందించినవీ, అధికారానికి రావడానికి ముందే సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా గడించిన ప్రజాస్పర్శతో ప్రకటించినవీ అనుల్లంఘనీయమైన ‘నవరత్నాల’ని మరచిపోరాదు. తద్వారా దేశంలోని రాజకీయ పార్టీలకూ, ముఖ్యమంత్రులకూ తండ్రి రాజశేఖరరెడ్డి తర్వాత అంత ఆదర్శంగా నిలిచినవాడు జగన్! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘ఎన్టీఆర్ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు భారీగా విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీకి గానీ, ఎల్లో మీడియాకు గానీ ఏ మాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ఏకంగా దేశంలో ఉన్న టాప్ క్లాస్ బిజినెస్ మాగ్నెట్లు అంతా రావడం, ఆంధ్రప్రదేశ్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని కొనియాడటం, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని నేరుగా ప్రకటించడం.. ఎల్లో బ్యాచ్కు మింగుడు పడలేదు. సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల సదస్సు జరిగితే అందులో రకరకాల వేషాలు, డ్రామాలు పుట్టుకొస్తాయి. అలాంటి ఓ విచిత్రమైన ఘటనను షేర్ చేసుకున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మంత్రిగా ఉండేవారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన, ఆయన చెప్పిన అనుభవం ఇది. "తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఫేక్ షోలు చేయడం అలవాటు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం.. ఆయనకు పెద్దగా తెలియదు. ఎప్పుడూ చుట్టూ ఉండే చంద్రబాబు, ఆయన మనుష్యులు ఓ రోజు ఒకాయనను తీసుకొచ్చారు. నేరుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశారు. అయ్యా.. ఈయన భూటాన్ రాయబారి అని పరిచయం చేశారు. ఎన్టీఆర్ దానికి ఎంతో సంతోషించారు.. స్వయంగా వెంట తీసుకెళ్లి బుద్ధుడి విగ్రహాం చూపించారు. ఆ వ్యక్తితో ఫోటోలు దిగి పేపర్లో వేయించారు. టుప్కా అని భూటాన్ నుంచి రాయబారి వచ్చారని, ముఖ్యమంత్రిని కలిశారని పేపర్లలో ప్రచారం చేయించారు. అప్పట్లో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పని చేస్తుండే వాడిని. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత .. నాతో పని చేస్తోన్న ఓ కొలీగ్ ఓ ఫోటో చూపించారు. అందులో నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న వ్యక్తి ఫోటో ఉంది. ఇతనే కదా మొన్న ఎన్టీఆర్ను కలిసిన భూటాన్ రాయబారి అని చెప్పారు. తెలుగుదేశం వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. స్వెట్టర్లు అమ్ముకునే వ్యక్తిని భూటాన్ రాయబారి అని చెప్పించిన ఘనత చంద్రబాబుది.." అని దేవులపల్లి అమర్ అన్నారు. చదవండి: జాకీ యూనిట్పై రాప్తాడులో టీడీపీ కాకిగోల.. వాస్తవాలతో సాక్ష్యం ఇదిగో -
ఏమిటా రాతలు?
విజయనగరం: విశాఖ వేదికగా ప్రశాంత వాతావరణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 విజయంతంగా జరిగితే ఓర్వలేని పచ్చపత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అడ్డగోలు రాతలు రాయడం దుర్మార్గమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయనగరంలో ఆదివారం జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంచి జరిగినప్పుడు రాయకపోయినా ఫర్వాలేదు. కానీ, చెడురాతలు రాయడం సరికాదు. సమ్మిట్ ముగిసి ఒక్కరోజు కాకముందే రూ.12 లక్షల కోట్లు ఎంవోయూలు చేయడం గొప్ప కాదు... అవి ఆచరణలో చేసి చూపించగలరా... ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగలరా... అంటూ లెక్కలు వేసి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. వారిది నోరా.. తాటి మట్టా...’ అని బొత్స మండిపడ్డారు. ‘పచ్చపత్రికలు చెప్పిందే భగవద్గీతలా భావించే రోజులు పోయాయి. వారేమిచెప్పినా నిజమని నమ్మే పరిస్థితి లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా నిర్వహించిన సమ్మిట్లపై ఎందుకు ఇలా రాయలేకపోయారు. రెండు రోజులపాటు జరిగిన విశాఖ సమ్మిట్కు దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సంస్థలు వచ్చిన విషయాన్ని ప్రజలు గమనించారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, దీనికోసం ప్రత్యేక కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుంది. ఈలోపే ఏమిటా రాతలు? ప్రజలను తప్పుదోవ పట్టించేలా 2019 ఎన్నికలకు ముందు మీరు ఎన్ని రాతలు రాసినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు...’ అని బొత్స చెప్పారు. అదేవిధంగా కేంద్రమంత్రి నితిన్గడ్కరీ విశాఖలో ఎన్నో వనరులు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురే‹Ùబాబు పాల్గొన్నారు. -
వైజాగ్.. ఓ బ్రాండ్ సిటీ.. సక్సెస్ మంత్రంగా బీచ్ ఐటీ కాన్సెప్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ఓవైపు కడలి కెరటాలు.. మరోవైపు పెట్టుబడులు పోటెత్తాయి. బెస్త గ్రామం నుంచి మహానగరంగా మారిన విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్). పరిపాలన రాజధానిగా కాబోతున్న నేపథ్యంలో వైజాగ్.. ఓ బ్రాండ్ సిటీ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ నగరానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. సదస్సు విజయవంతం అయిన తర్వాత ‘దేశానికి ఆర్థికకోట విశాఖ..’ అని అందరి నోటా ఒకే మాట. జీఐఎస్–2023తో పెట్టుబడుల స్వర్గధామంగా సరికొత్త ఇమేజ్కు నాంది పలికిన వైజాగ్.. ఇదే స్ఫూర్తితో జీ–20 సదస్సుకు సిద్ధమవుతోంది. రాజదానులెన్నింటికో రాదారిగా ఉన్న విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం సిద్ధించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. చోదకశక్తి కేంద్రాలుగా మారుతున్న ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల జాబితాలో అగ్రభాగంలో ఉన్న విశాఖపట్నంలో రెండురోజులు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగా విశాఖకు ఈ సమ్మిట్ నిర్వహణతో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. గత ప్రభుత్వ హయాంలో మూడుమార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా రాని ఇమేజ్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటు చేసిన జీఐఎస్తో వైజాగ్ పేరు ఖండాంతరాలు దాటింది. సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్గా నిర్వహించిన సమ్మిట్కు దేశవిదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరై విశాఖ నగర వైభవానికి వావ్ అన్నారు. కొత్త ఇమేజ్ తీసుకొచ్చారు ఇన్నాళ్లు.. విశాఖపట్నం అంటే అలల సవ్వడులతో.. అందాల నగరంగా.. పర్యాటక ప్రాంతంగా మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించిన తర్వాత నగరానికి సరికొత్త ఇమేజ్ వచ్చింది. ఎవరు వచ్చినా ఆహ్వానించదగ్గ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న విశాఖ నగరంలో తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించాలన్న ఆలోచనల్ని పారిశ్రామికవేత్తలు స్వయంగా చూసిన తర్వాత మరింత బలపరుచుకున్నారు. నివాసయోగ నగరాల్లో టైర్–1 సిటీలతో పోటీపడుతున్న విశాఖపట్నం పెట్టుబడులకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది. హైదరాబాద్ని మించి అభివృద్ధి చేసే అవకాశాలున్నప్పటికీ.. గత పాలకులు విశాఖని ఒక నగరంగానే గుర్తించి విస్మరించడంతో అనుకున్న మేర అభివృద్ధి చెందలేదు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నగరానికి కొత్త ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే పెట్టుబడుల సదస్సుతో ‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. ఉంటే వైజాగ్లోనే ఉండాలి.. చేస్తే విశాఖలోనే వ్యాపారం చేయాలి..’ అనే స్థాయికి తీసుకెళ్లారు. బహుళ ప్రాజెక్టులతో ఆకర్షణ మంత్రం సువిశాల సాగరతీరం చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐటీ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి సిటీ ఆఫ్ డెస్టినీని ఐటీ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో బీచ్ ఐటీ కాన్సెప్ట్ని తొలుత ప్రమోట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్సీఎల్, యాక్సెంచర్, రాండ్స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. తాజాగా విప్రో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు విశాఖనే ఎంపిక చేసుకుంది. ఇలా ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖలో ఇతర పరిశ్రమలకూ ఆస్కారం ఉందన్న ఆలోచన దిగ్గజ పారిశ్రామికవేత్తల మదిలో కలిగేలా సీఎం వైఎస్ జగన్ విశాఖని విశ్వవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. అందుకే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా వైజాగ్ టెక్పార్క్ కూడా డేటాసెంటర్తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీలను రూ.21,844 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసి 39,815 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, టర్బో ఏవియేçÙన్.. ఇలా విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని విశాఖ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపడానికి కారణం వైజాగ్ బ్రాండ్ అంబాసిడర్గా మారిన సీఎం వైఎస్ జగన్ అన్నది జగమెరిగిన సత్యం. జీఐఎస్ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరో అంతర్జాతీయ సదస్సుకు ముస్తాబు భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం వైపు చూస్తున్నారు. జీఐఎస్ విజయవంతం కావడంతో అంతర్జాతీయ ప్రముఖులకు సైతం వైజాగ్ అంటే ఇష్టం పెరిగింది. మళ్లీమళ్లీ నగరానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన జీ–20 సదస్సుకు నగరం ముస్తాబవుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ స్ఫూర్తితో జీ–20 సదస్సుని విజయవంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. మరోవైపు త్వరలో విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించడంతో ప్రజల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే జీ–20 సదస్సును విజయవంతం చేయడంలో తాము కూడా భాగస్వాములవుతామని నగరవాసులు చెప్పకనే చెబుతుండటం విశేషం. -
Andhra Pradesh: ప్రభుత్వ మద్దతు అమోఘం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు తమ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఫ్రభుత్వంపై తమకున్న విశ్వాసాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు వేదికగా ప్రపంచానికి చాటిచెప్పారు. విశాఖలో జరిగిన రెండ్రోజుల జీఐఎస్ సదస్సులో కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకోవడమే కాకుండా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న వివిధ సంస్థలు తమ భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. రిలయన్స్ గ్రూపు దగ్గర నుంచి కొత్త తరం నోవా ఎయిర్ సంస్థ వరకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందిస్తున్న తీరును సభా వేదికగా కీర్తించాయి. అంతేకాక.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రండి అంటూ ఇతర పారిశ్రామికవేత్తలను ఆయా సంస్థల అధిపతులు ఆహ్వా నించడం విశేషం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, రిటైల్ వంటి వ్యాపారాల్లో ఇప్పటికే రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో మరో రూ.50,000 కోట్లతో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ పార్కును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ మరో రూ.43,664 కోట్లు అలాగే.. అదానీ గ్రూపు పోర్టులు, సిమెంట్ వంటి రంగాల్లో రాష్ట్రంలో సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టగా భవిష్యత్తులో ఆయా రంగాల్లో సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు ఏపీ సెజ్ సీఈఓ కరణ్ అదానీ ప్రకటించారు. రాష్ట్రంలో డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీతో పాటు వివిధ రంగాల్లో రూ.43,664 కోట్ల పెట్టుబడులను పెట్టే విధంగా అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక లాక్డౌన్ కాలంలో తక్కువ సమయంలో యూనిట్ను ప్రారంభించామని, దీనికి రాష్ట్ర మద్దతే కారణమని నోవా ఎయిర్ సీఈఓ, ఎండీ గజానన్ నంబియార్ స్పష్టంచేశారు. సాధారణంగా ఆక్సిజన్ వంటి పారిశ్రామిక వాయువుల తయారీ యూనిట్ను ఏర్పాటుచేయడానికి కనీసం 18 నుంచి 24 నెలల సమయం పడుతుందని, కానీ కేవలం 14 నెలల కాలంలోనే యూనిట్ను ప్రారంభించి వేలాది మంది జీవితాలను కాపాడినట్లు ఆయన తెలిపారు. జేఎస్డబ్ల్యూ రూ.50,632 కోట్లు జిందాల్ స్టీల్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీ పారిశ్రామిక రాష్ట్రంగా ఎదగనుందన్నారు. అందుకే తన సోదరుడికి చెందిన జేఎస్డబ్ల్యూ రూ.50,632 కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇక, ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ పార్కును దక్కించుకుంది. దీనితో రాష్ట్రంలో ఫార్మా రంగం మరింతగా విస్తరించనుంది. సాధారణంగా ఫార్మా పరిశ్రమ స్థాపనకు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని, కానీ అన్ని అనుమతులున్న బల్క్ డ్రగ్ పార్కులో తక్షణం కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం కలుగుతుందని దివీస్ ఫార్మా వైస్ ప్రెసిడెంట్ మధుబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా రంగానికి ఇస్తున్న మద్దతుతో తాము మరింతగా కార్యకలాపాలు విస్తరించడానికి రూ.వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు దివీస్, లారస్, హెటిరో, అపోలో తదితర సంస్థలు ప్రకటించాయి. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న సంస్థలు ఇలా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశంతో పాటు దాని అనుబంధ పత్రికల దుష్ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నట్లు పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ సక్సెస్
-
‘సీఎం కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు’
సాక్షి,పశ్చిమగోదావరి:పారిశ్రామిక విధానం, గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారన్న భరోసాతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కారుమూరి స్పందిస్తూ.. దేశంలో అతి పెద్ద రెండో తీరప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం.. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులే పెట్టుబడిదారులను ఏపీ వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఊహించని రీతిలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేయడం లేదని, ఆయన హయాంలో లాగా హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే సిబ్బందికి సూట్లు, కోట్లు తగిలించి దొంగ ఒప్పందాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంబానీ,ఆదానీ,అపాచీ మిట్టల్, జెఎస్డబ్ల్యు, జిఎంఆర్ తదితర బడా పారిశ్రామిక వేత్తలు వాస్తవ ఒప్పందాలు జరిగాయని చెప్పుకొచ్చారు. భావి తరాలకు చక్కని విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగాల కోసం సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. -
నాడు చంద్రబాబు అలా.. నేడు సీఎం జగన్ ఇలా..
ఆ సన్నివేశం చూస్తేనే ఎంతో సంతోషం కలుగుతుంది. నిజంగా ఏపీలో ఇంత ప్రముఖంగా పారిశ్రామిక సదస్సు జరిగిందా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సమర్ద నాయకుడు పాలకుడుగా ఉంటే ఇంత గొప్పగా కార్యక్రమం జరుగుతుందన్నమాట అన్న నమ్మకం ఏర్పడుతుంది. ఇదంతా దేని గురించి చెబుతున్నది అర్ధం అయ్యే ఉంటుంది. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సమ్మిట్ గురించే.. ఈ సమ్మిట్లో సుమారు 14 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు ముందుకు రావడం బ్రహ్మాండమైన శుభ పరిణామం. 350 ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అన్నిటికంటే అందరిని ఆకర్షించిన అంశం ఏమిటంటే దేశంలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముకేష్ అంబాని స్వయంగా విశాఖకు తన మందీ మార్బలంతో వచ్చి పరిశ్రమ పెట్టడానికి ప్రతిపాదన ఇవ్వడం. ఇది వినడానికి, చూడటానికి ఎంత ఆనందం కలుగుతుంది!. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కనే అంబానీ మూడు గంటలకుపైగా కూర్చుని ఆయా అంశాలపై మాట్లాడుతుండటం ఒక విధంగా సంచలనమే అని చెప్పాలి. ప్రతీ నిమిషాన్ని లెక్క వేసుకునే స్థాయిలో ఉన్న అంబానీ.. ఏపీ కోసం అంత టైమ్ కేటాయించడం, మొదటిసారిగా దక్షిణాదిలో ఒక పారిశ్రామిక సదస్సులో పాల్గొనడం ఇవన్నీ రాష్ట్రానికి శుభ సంకేతాలుగా కనిపిస్తాయి. సీఎం వైఎస్ జగన్ సత్తా ఏమిటో ఈ గ్లోబల్ సదస్సు రుజువు చేసింది. ఒక్క అంబానీనే కాదు.. అదానీ, జిందాల్, హెటిరో, అరబిందో, భారత్ బయోటెక్.. ఇలా ఒకటేమిటి దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు తరలి వచ్చి ఏపీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయి. తమ పరిశ్రమలు పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలలో ఒక విశ్వాసం, నమ్మకం కలిగించడానికి వారు సిద్దం అవడం ఒకరకంగా గేమ్ చేంజర్ అని అంతా భావిస్తున్నారు. ఏపీలో కొన్ని శక్తులు, టీడీపీ వంటి రాజకీయ పక్షం, టీడీపీ మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఈ సదస్సును విఫలం చేయాలని ప్రయత్నించినా, పారిశ్రామికవేత్తలను భయపెట్టేలా టీడీపీ ఆరోపణలతో రాష్ట్రానికి ద్రోహం చేస్తే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా శక్తివంచన లేకుండా పచ్చి అబద్దపు కథనాలను వండి వార్చినా సీఎం జగన్ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. వీరు చేసిన విష ప్రచారాన్ని దేశ, విదేశాలలోని పారిశ్రామిక ప్రముఖులు ఎవరూ విశ్వసించలేదు. అందుకే వారంతా విశాఖకు తరలివచ్చి సమ్మిట్ను గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ మొత్తం సదస్సు ఏపీ ఏయే రంగాలలో బలంగా ఉందో తెలియచేసింది. కేవలం ఐటీ రంగం వస్తేనే పరిశ్రమలు వచ్చినట్లుగా భావించే దశ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ మొదలైన రంగాలలో ఏపీ తన పట్టును నిరూపించుకోగలిగిందని వెల్లడైంది. అదే సమయంలో ఐటీకి సంబంధించి కూడా నలభై వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. విశాఖలో గ్రీన్ టెక్ నిర్మాణం, విజయవాడ కృష్ణా నదిలో టూరిజం ప్రాజెక్టు. సుమారు తొమ్మిది లక్షల కోట్ల మేర గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వంటి రెన్యూవబుల్ ఇంధన రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం అంటే బహుశా దేశంలోనే ఒక రికార్డు అని చెప్పాలి. ఇంత విద్యుత్ ఉత్పత్తి జరిగితే ఏమి చేసుకుంటారని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ, దేశం అంతా వస్తున్న ఎనర్జీ విప్లవంలో ఎవరు ముందుకు వెళితే వారు సాధించగలుగుతారు. రానున్న కాలంలో సాంకేతిక విప్లవంలో ఇంకెన్ని మార్పులు వస్తాయో ఊహించలేం. అంబానీ, అదానీ, తదితరులు ఈ రంగంలోకి వస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న ప్రాధాన్యత అర్ధం అవుతుంది. అలాగే టూరిజం, ఫార్మా, మినరల్ తదితర పోర్టు ఆధారిత పరిశ్రమలకు ఒప్పందాలు కుదిరాయి. కొందరు కావాలని సీఎం జగన్ దావోస్ ఒక్కసారే వెళ్లారని, ఈ నాలుగేళ్లలో ఒకేసారి సమ్మిట్ పెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. దావోస్కు వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ సాధించిన విజయాలు చూశాం. అదే సమయంలో ప్రపంచమంతా రెండేళ్లు కోవిడ్ కుదిపేసిన సంగతిని దాచిపెట్టి కొందరు కువిమర్శలు చేస్తే పట్టించుకోనవసరం లేదు. దావోస్ను మించి విశాఖపట్నంలో పదిరెట్ల విజయాలను ఆయన సాధించారు. 2018లో టీడీపీ హయాంలో సుమారు నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, జగన్ ప్రభుత్వం ఒకే సదస్సులో 14 లక్షల కోట్ల పెట్టుబడులు సంపాదించింది. దీనిని బట్టే ఈ సదస్సు ఎంత విజయవంతమైంది అనేది తెలుస్తుంది. ఇవన్నీ ఆచరణలోకి వస్తాయా అన్న సంశయం రావచ్చు. ఆ మాటకు వస్తే చంద్రబాబు టైమ్లో అన్ని సదస్సులు కలిపి ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పేవారు. కానీ, ఆచరణలో కేవలం ఏడు శాతం మాత్రమే అమలు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రచార యావలో పడి ఎవరితో పడితే వారితో ఎంవోయూలు చేసుకున్నారు. దారినపోయే వారితో కూడా ఒప్పందం అయ్యారన్న విమర్శలు వచ్చాయి. సీఎం జగన్ మాత్రం అలా చేయలేదు. ఉన్నంతలో అమలుకు అవకాశం ఉన్న ఎంవోయూలే చేసుకున్నారు. అందువల్లే ఒప్పందాలు సంఖ్య 350గానే ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలలో తొంభై శాతం దిగ్గజ కంపెనీలు, లేదా పది మందికి తెలిసిన కంపెనీలే అన్న విషయం బోధపడుతుంది. ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు అమలు అయిపోతాయని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటేనే ఆరు నెలల నుంచి ఏడాదిపైగానే పడుతుంది. అలాంటిది ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి ఎన్నో సమకూర్చుకోవాలి. అందుకు మూడు, నాలుగేళ్లపాటు పట్టవచ్చు. అది పెట్టుబడిని బట్టి ,సామర్ధ్యం బట్టి ఉంటుంది. మౌలిక సదుపాయాలు, యంత్ర పరికరాలు, మార్కెటింగ్, బ్యాంక్ రుణం తదితర అవసరాలను పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అవి అవాంతరాలుగా మారతాయి. ఇదే సమయంలో ప్రభుత్వపరంగా సహకారం విషయంలో ఎక్కడా జాప్యం ఉండకూడదు. అనుమతులను నిర్దిష్ట సమయంలోనే మంజూరు చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికే ముందంజ వేసిందని చెప్పాలి. ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ సీఈవో ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రభుత్వం సహకారం వల్ల ఏడాది ముందుగానే తమ షెడ్యూల్ పూర్తి అవుతోందని, దీని వల్ల తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇక్కడే ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయినట్లు భావించవచ్చు. ఆయన తరచుగా పరిశ్రమలకు ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయండని చాలా స్పష్టంగా చెబుతున్నారు. సీఎం జగన్ సమర్ధతను, పరిశ్రమలపై ఉన్న చిత్తశుద్దిని అనేక మంది పారిశ్రామికవేత్తలు తమ ఉపన్యాసాలలో స్పష్టంగా చెప్పారు. ఇందులో రిలయన్స్ అధినేత అంబానీ ఒకరు. ఆయన ఏపీలో తమ ప్రజెన్స్ వివరిస్తూ, కొత్తగా పది గిగావాట్ల సామర్ద్యంతో సోలార్ ఎనర్జీ పరిశ్రమ స్థాపిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతను కొనియాడారు. ఏపీకి అపార వనరులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో లక్షాఇరవై కోట్ల రూపాయల వ్యయం చేస్తోందని, ఇది మంచి విషయమని సైంట్ సంస్థ వ్యవస్థాపకులు మోహన్ రెడ్డి మెచ్చుకున్నారు. గతంలో చంద్రబాబు పార్టనర్షిప్ సదస్సు పేరుతో నిర్వహించిన సమావేశాల్లో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ తరచూ ఆయనే ప్రసంగాలు చేస్తుండేవారు. కానీ, సీఎం జగన్ అలాకాకుండా నిర్దిష్ట టైమ్లో అవసరమైనమేర క్లుప్తంగానే చెప్పదలచుకున్న విషయాలను సూటిగా చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చి మాట్లాడించారు. ఏపీని షోకేస్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయబోతున్న అంశాన్ని మరోసారి ఉద్ఘాటించారు. ఇక పరిశ్రమల ప్రతిపాదనలు అమలు కావడానికిగాను ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతివారం సమీక్షించాలని ఆదేశించారు. ఈ రకంగా కేవలం సమ్మిట్కే పరిమితం కాకుండా ఫాలో అప్ యాక్షన్కు కూడా సిద్దం అవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఈ విజయాన్ని చూసి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. ఏవో పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రకటనలు చేసింది. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి యత్నించింది. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టీవీ-5 వంటివి కూడా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని భయపెట్టేరీతిలో కథనాలు ఇచ్చాయి. అయితే, ఈనాడు.. సదస్సు జరిగినంతవరకు కవరేజీ మాత్రం పద్దతిగానే ఇచ్చిందని చెప్పాలి. మిగిలిన టీడీపీ మీడియా మాత్రం తమ ధోరణి మార్చుకోలేదు. పదమూడేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. చంద్రబాబు విశాఖలో అంబానీని చూడగానే అప్ సెట్ అయి ఉంటారు. తన హయాంలో రాని దిగ్గజం, సీఎం జగన్ నిర్వహించిన సమ్మిట్కు వస్తారా అని కడుపు మంటకు గురై ఉండవచ్చు. అందుకే తన పార్టీ నేతలతో చెత్త విమర్శలు చేయించారని అనుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సదస్సు జరిగిన రెండు రోజులు మాట్లాడబోనని చెప్పడం మంచిదే. కేంద్రం నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు పార్టీలతో నిమిత్తం లేకుండా ఏపీకి పలు ప్రయోజనాలు చేకూర్చే రీతిలో ప్రసంగాలు చేయడం హర్షణీయం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సహజ శైలిలో ఏపీకి మౌలిక సదుపాయాల కల్పనలో ఏ విధంగా కేంద్రం నిధులు మంజూరు చేసేది తెలిపారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సోనోవాల్ వచ్చి పారిశ్రామిక సదస్సుకు వన్నె తెచ్చారు. విశాఖపట్నం అభివృద్దికి వీరిద్దరూ కలిసి 13 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, కొత్తవి రావడంలేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నవారికి విశాఖ సదస్సు గట్టి జవాబే ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్ ఆశించినట్లు ఈ పెట్టుబడుల ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే ఏపీ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుందన్నది నిజం. ఆ క్రమంలో ఇది ఒక ముందడుగు. - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు, సీ.ఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్. -
గత ప్రభుత్వం చేయలేనిది సీఎం జగన్ ఎలా సాధించారు ?
-
ఏపీ ఓ బంగారు గని
దొండపర్తి (విశాఖ దక్షిణ): పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే గ్రీన్ అమ్మోనియా ఏపీలో పుష్కలంగా ఉందని, రాష్ట్రం ఒక బంగారు గని అని ఫార్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ సౌత్ అండ్ సౌత్ఈస్ట్ అధ్యక్షుడు అలార్డ్ ఎం.నూయ్ అభివర్ణించారు . గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) రెండోరోజైన శనివారం ఆడిటోరియం–4లో పశ్చిమ ఆస్ట్రేలియా, వియత్నాం దేశాల ప్రతినిధులతో సెషన్స్ నిర్వహించారు. ఇందులో పశ్చిమ ఆ్రస్టేలియా ప్రతినిధిగా పాల్గొన్న అలార్డ్ ముందుగా ఆ దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పతికి అనుసరిస్తున్న మార్గాలు, అందుకు అవసరమయ్యే ఖనిజాలను వెలికితీసేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిపైనే దేశాలన్నీ దృష్టిసారిస్తాయని అలార్డ్ అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్ని ప్రైవేటు పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. దీని ఫలితంగానే రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా మూడో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రస్తుతించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ టాప్ దేశంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టీఆర్ గిబిన్కుమార్ తెలిపారు. జీఐఎస్లో జరిగిన మరో సెషన్లో రాష్ట్రంలో ఆక్వా, మెరైన్ ఉత్పత్తులు, ఇక్కడున్న వ్యాపార అవకాశాలను వియత్నాం ఎంబసీ ప్రతినిధులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా గిబిన్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త పోర్టులతోపాటు ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఒకవైపు సముద్ర ఉత్పత్తులతోపాటు రిజర్వాయర్లు, చెరువులు, ఇతర ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించే విషయంపై ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు. అలాగే.. మెరైన్, ఆక్వా రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఉత్పత్తుల ఎగుమతులపై కూడా దృష్టిసారించాలని వియత్నాం ఎంబసీ ట్రేడ్ ఆఫీస్ ఫస్ట్ సెక్రటరీ డూ డుయ్ ఖాన్, ఎంబసీ పొలిటికల్ కౌన్సిలర్ థి ఎన్జాగ్ డెంగ్ ఎన్గుయెన్లను కోరారు. అలాగే, వియత్నాం మెరైన్ రంగంలో ఉన్న వాణిజ్య, వ్యాపార అవకాశాలను ఎంబసీ అధికారులు వివరించారు. ఈ సెషన్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ అడిషినల్ డైరెక్టర్ పి. కోటేశ్వరరావు, మ్యాట్రిక్స్ సీ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ సీఈఓ శివప్రసాద్ వెంపులూరు పాల్గొన్నారు. ఏపీతో కలిసి పనిచేస్తాం.. గత కొన్నేళ్లుగా పశ్చిమ ఆ్రస్టేలియా.. భారత్తో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తోందని అలార్డ్ గుర్తుచేశారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన అభినందించారు. అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, ప్రాజెక్టులకు కల్పించే మౌలిక సదుపాయాలపై పాలసీ ప్రకటిస్తే విదేశీ పెట్టుబడులు ఆంధ్రాకు పెద్దఎత్తున వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంతో మరిన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాల మెరుగుకోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో కొత్త ఇండస్ట్రీ పాలసీ దేశంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజ సంస్థలే కాకుండా విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలోనే ప్రభుత్వం కొత్త ఇండ్రస్టియల్ పాలసీని ప్రవేశపెట్టనుందన్నారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా ఈ పాలసీని రూపొందించినట్లు వివరించారు. రాష్ట్రంలో అవలంబిస్తున్న మైనింగ్ విధానాలు, అందుబాటులో ఉన్న వనరులను మైన్స్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వివరించారు. ఈ సమావేశానికి పశ్చిమ ఆ్రస్టేలియా ప్రతినిధులకు, రాష్ట్ర అధికారులకు సమన్వయకర్తగా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ నషీద్ చౌదరి వ్యవహరించగా, హెచ్ఏఎస్ హోల్డింగ్స్ డైరెక్టర్ అక్షయ్ పాల్గొన్నారు. -
ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఏపీకి అపార అవకాశాలు
(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : ఆత్మనిర్భర్ భారత్ విధానంలో భాగంగా కేంద్రం 14 కీలక రంగాల్లో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలను అమలు చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆహార ఉత్పత్తులు, వైద్య పరికరాలు మొదలైనవి వీటిలో ఉన్నాయని చెప్పారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ..ఏపీకి ఉన్న సానుకూలతల దృష్ట్యా మెరైన్ ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో వృద్ధి చెందడానికి రాష్ట్రానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి తోడ్పాటుపందిస్తుందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ తరహా సహకారం కీలకంగా ఉంటుందన్నారు. 2014లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్డీఐలు 2021–22 నాటికి రెట్టింపై 85 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. వ్యాపారాలను సులభతరం చేసే విధానాల్లో భారత్ ర్యాంకింగ్ను గణనీయంగా మెరుగుపర్చుకుందన్నారు. పన్నుల విధానాల్లో, కార్పొరేట్ చట్టాల్లోనూ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. యూనికార్న్ల (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల అంకుర సంస్థలు)కు సంబంధించి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. -
ఉన్నత విద్యలో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అమలు చేస్తున్న విద్యా విధానం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యా రంగ నిపుణులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ప్రశంసనీయమని చెప్పారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రెండో రోజు శనివారం ఉన్నత విద్యపై ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి అధ్యక్షతన ప్యానల్ చర్చ జరిగింది. ‘ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై విద్యా రంగ నిపుణులు చర్చించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ వృత్తి నైపుణ్య కేంద్రంగా మారిందని చెప్పారు. నాస్కాం, మైక్రోసాఫ్ట్, స్కిల్ ఫోర్స్, టీం లీడ్స్, టీసీఎస్ వంటి కంపెనీలతో ఏపీఎస్సీహెచ్ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. ఇంజినీరింగ్, ప్రొఫెషనల్, డిగ్రీ, ఫార్మసీ విద్యార్థులకు ఆన్లైన్లో అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సులను అందిస్తూ ఉద్యోగ కల్పనలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. ఏపీలో విద్యా విధానం భేష్ విట్ ఫౌండర్, చాన్సలర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ ఏపీలో ఉన్నత విద్యా బోధన, విధానం చాలా బాగున్నాయని, ప్రభుత్వం దీనిపై అధిక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. ఏఐసీటీఈ సీవోవో బుద్దా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయాన్ని కల్పించడం వల్ల చాలా కుటుంబాల్లో ఇంజినీర్లు తయారవుతున్నారని చెప్పారు. చర్చలో ఐఐఎస్సీ (బెంగళూరు) ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్, ఐఐటీ హైదరాబాద్ ఫౌండర్ ఉదయ్ దేశాయ్, ఐఐఎం విశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యం
(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం గతిశక్తి పథకంతో మౌలిక సదుపాయల కల్పన వేగవంతం కావడంతో పాటు ప్రాజెక్టుల వ్యయాలూ తగ్గుతున్నాయని చెప్పారు. వివిధ రవాణా మార్గాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం గల ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందంజలో ఉంటుందని అన్నారు. సాగర్మాలా కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్లో రూ. 1.1 లక్షల కోట్ల విలువ చేసే 110 ప్రాజెక్టులను గుర్తించినట్లు సోనోవాల్ చెప్పారు. ఇప్పటికే రూ. 32,000 కోట్ల విలువ చేసే 32 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన వైజాగ్ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా ఉందని తెలిపారు. వైజాగ్ పోర్టు కార్గో విభాగం ఆరోగ్యకరమైన వృద్ధి సాధిస్తోందని తెలిపారు. మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉండేలా ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోంద అన్నారు. దాదాపు రూ. 97 కోట్లతో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ పనులు పూర్తి కావొస్తున్నాయని చెప్పారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్లోనే అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. -
పెట్టుబడులకు అత్యుత్తమం
సాక్షి, విశాఖపట్నం: అక్షర క్రమంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. విజనరీ లీడర్ షిప్తో అన్ని రంగాల్లో ఏపీ దూసుకెళుతోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని కొనియాడారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను తమ తొలి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఫోన్ కాల్ చాలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్ల పరిశ్రమల యాజమాన్యాలన్నీ పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. 11.47 శాతం వృద్ధితో ఏపీ అగ్రభాగంలో ఉండటం గర్వకారణం. దూరదృష్టి కలిగిన నాయకత్వం ఆధ్వర్యంలో రూపొందించిన పారిశ్రామిక పాలసీ అద్భుతమని అందరి మాటగా చెబుతున్నా. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారినందుకు సంతోషంగా ఉంది. రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన సదస్సులో ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలన్న సీఎం వైఎస్ జగన్ భరోసా అందర్నీ ఆకట్టుకుంది. ఆయన చెప్పిన మాట నిజంగా వాస్తవం. ఫోన్ చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరిస్తున్నారు. – గజానన్ నబర్, నోవా ఎయిర్ సీఈవో, ఎండీ అసాధారణ ఘనత.. ప్రపంచమంతా పునరుత్పాదక ఇంధనం వైపు పయనిస్తోంది. ఈ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీలో పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులకు అనువైన స్థలాలను గుర్తించగలిగాం. సోలార్, విండ్, పంప్డ్ హైడ్రో పవర్ ఉత్పత్తిలో ఏపీ ప్రపంచంలోనే నంబర్1 గా ఎదిగే అవకాశాలున్నాయి. దీని వెనుక సీఎం జగన్ అకుంఠిత దీక్ష ఉంది. గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో పాటు సోలార్, విండ్, హైడ్రో ప్రాజెక్ట్లలో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ రంగంలో ఏపీలో భారీగా పెట్టుబడులు పెడతాం. కర్బన రహిత పర్యావరణం కోసం ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా తొలి స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. పారిశ్రామిక వాతావరణం అద్భుతంగా ఉండటం వల్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాం. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. – వినీత్ మిట్టల్, ఆవాదా గ్రూప్ చైర్మన్ చురుకైన ప్రభుత్వం.. రాష్ట్ర విభజన తర్వాత బల్క్ డ్రగ్ క్యాపిటల్గా ఏపీ మారింది. రాష్ట్రంలో కొన్ని అతిపెద్ద ఏపీఐ యూనిట్లు పనిచేస్తున్నాయి. మేం 2007లో ఒక ఉద్యోగి స్థాయి నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగామంటే సీఎం జగన్ అందించిన సహకారమే కారణం. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ, చురుకైన ప్రభుత్వం, నిపుణులైన అధికారులు, నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఏపీకి ప్రత్యేకంగా మార్కెట్ అవసరం లేదు. పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా పెడితే పెట్టుబడులు వస్తాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డ్రగ్ కంట్రోలర్ అనుమతులతో సహా ప్రక్రియను వేగంగా నిర్వహించేలా డిజిటల్ డ్రైవ్లోనూ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రపంచానికి కావాల్సిన ఔషధాలు ఏపీలో తయారవుతున్నాయి. – సూర్యనారాయణ చావా, లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో పరిశ్రమలు కోరుకునే సుస్థిర వాతావరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ నాయకత్వం కారణంగా సమ్మిట్లో అనూహ్యరీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిర విధానాలు, ఆహ్లాదకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉంది. పెట్టుబడుల్ని క్రమంగా ఇక్కడ విస్తరిస్తాం. నాణ్యమైన మానవ వనరులను అందించడం, పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్రం నంబర్వన్గా ఉంది. ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి పరిష్కరిస్తున్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఏపీలో ఉన్నందున నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టవచ్చు. – సంతానం, సెయింట్ గోబెన్ సీఈవో 96 సేవలు ఒకే చోట ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. కొత్తగా వచ్చే పరిశ్రమలకు 21 రోజుల్లో అన్ని అనుమతులను మంజూరు చేస్తున్నాం. 24 ప్రభుత్వ శాఖలకు చెందిన 96 సేవల్ని ఒకే చోట చేర్చి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి సంస్థకు పూర్తి స్థాయి మద్దతిస్తూ ప్రతి విషయంలోనూ సహకరిస్తాం. – డా.కె.ఎస్.జవహర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండేళ్లలో రూ.రెండు వేల కోట్లు కోవిడ్ తర్వాత ఫార్మా రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భారత్ను ఫార్మా స్యూటికల్ రంగంలో భాగస్వామిగా చేసుకునేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చూపిస్తున్న చొరవ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారం కారణంగా ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – వంశీకృష్ణ, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ -
నైపుణ్య మానవ వనరులకు ఏపీ చిరునామా
సాక్షి, విశాఖపట్నం: ‘ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా సహజ వనరులున్నాయి.. సన్నద్ధంగా నైపుణ్య మానవవనరులు ఉన్నాయి.. నైపుణ్యవనరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిరునామాగా నిలుస్తుంది..’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఎస్ఐ)లో రెండోరోజు శనివారం ఆరు సెక్టార్లలో సెమినార్లు నిర్వహించారు. వీటిలో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్, ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్సైన్సెస్, పెట్రోలియం–పెట్రోకెమికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్స్టైల్స్ రంగాల్లో సెమినార్లు నిర్వహించారు. పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లకు ఏపీ ప్రభుత్వం అందించే అవకాశాలతో పాటు ఇక్కడ సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన యువత, పుష్కలంగా నీటివనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, విస్తారంగా భూమి లభ్యత గురించి ఆయన వివరించారు. స్కిల్లింగ్ ఏపీ ఫర్ సర్వింగ్ గ్లోబల్ ఎకానమీ సదస్సు సెమినార్ హాల్లో జరుగుతున్న ప్యానల్ డిస్కషన్లో ముఖ్య అతిథిగా మంత్రి బుగ్గన హాజరయ్యారు. నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ అధ్యక్షతన ‘స్కిల్లింగ్ ఏపీ ఫర్ సర్వింగ్ గ్లోబల్ ఎకానమీ’ అనే అంశంపై వారు చర్చించారు. టాటా స్టైవ్, సీఈవో అనితా రాజన్, ఈడీ4ఆల్ చైర్మన్ సంజయ్ విశ్వనాథన్, బెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు భరత్లాల్ మీనా ఐఏఎస్ (విశ్రాంత), నాస్కమ్ ఫ్యూచర్ స్కిల్స్ సీఈవో కీర్తి సేథ్, సునీల్ దహియా (మాడరేటర్), నైపుణ్యాభివద్ధి, శిక్షణసంస్థ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి చర్చలో పాల్గొన్నారు. ముందుగా సౌరభ్ గౌర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ, 55 స్కిల్ స్పోక్ ట్రైనింగ్ సెంటర్లు, స్కిల్ ఇంటర్నేషనల్ ఎకోసిస్టం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,87,932 మందికి నిరుద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. 100కిపైగా జాబ్మేళాలు, 1,030 పూల్ డ్రైవ్స్ నిర్వహించినట్లు తెలిపారు. సీఎం ఎక్సలెన్స్ సెంటర్ల ద్వారా 102 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.72 లక్షల మందికి ట్రైనింగ్, ఎంప్లాయిబిలిటీ స్కిల్ సెంటర్ల ద్వారా 498 డిగ్రీ, పీజీ కాలేజీల్లో 2.27 లక్షలమందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. స్కిల్స్ స్పోక్స్–ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనేది ఎంవోయూలో ప్రధానంగా ఉందన్నారు. ఇప్పటివరకు 21,411 మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 18,043 మందికి ప్లేస్మెంట్ కల్పించామని చెప్పారు. ఏపీఎస్ఎస్డీసీ రంగంలో 40 ఎంవోయూలు టాటా స్టైవ్, ఈడీ4ఆల్, సాని భారత్, ద టైమ్స్ గ్రూప్, జేబీఎం గ్రూప్, జేసీబీ ఇండియా లిమిటెడ్, ప్రకార్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఆరెంజ్ క్రాస్, ఎకొహమా ఇండియా, గ్రీన్కో గ్రూప్, ఈ–ప్యాక్ కాంపోనెట్స్, డైకిన్ ఇండియా, స్కైదర్ ఎలక్ట్రిక్, వింగ్టెక్ ఇండియా, బొల్లినేని మెడ్స్కిల్స్, అపోలో మెడ్స్కిల్స్, ఎడ్యునెట్ ఫౌండేషన్, విహాన్ ఎలక్ట్రిక్స్, టెక్నోడోమ్ ఇండియా, రమ్యశ్రీ ఎలక్ట్రికల్ ఆటోమేషన్, ఇండస్ ఇన్ఫోటెక్, బ్రాండెక్స్, నాస్కోమ్ ప్యూచర్ స్కిల్స్, లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, కాపిటల్ గూడ్స్ స్కిల్ కౌన్సిల్, కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ ఇండియా, ఆటోమేటివ్ సెక్టార్, డొమెస్టిక్ వర్కర్స్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్, లెథర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హైడోకార్బన్, టెక్సటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ తదితర సంస్థలు ఏపీఎస్ఎస్డీసీ రంగంలో 40 ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఎంవోయూలను మంత్రి బుగ్గన చేతుల మీదుగా అందజేశారు. -
లక్ష్యాన్ని మించి పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటమే ప్రధాన లక్ష్యంగా రెండు రోజుల పాటు నిర్వహించిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ –2023’ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని భావించినా, సీఎం జగన్ నాయకత్వంలో లక్ష్యాన్ని మించి రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతోనే ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని చెప్పారు. జీఐఎస్ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించామని చెప్పారు. ఫలితంగా సుమారు 378 ఎంవోయూలు జరిగాయన్నారు. ఈ సదస్సులో 48 దేశాలకు చెందిన 100 మంది వరకు వివిధ అంశాలపై చర్చించారని చెప్పారు. ఈయూ కూటమి దేశాల నుంచి అధిక సంఖ్యలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారన్నారు. 40 దేశాలకు చెందిన 595 మంది ప్రతినిధులు వర్చువల్గా పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వ పని తీరుపై కేంద్ర మంత్రులు, కార్పొరేట్ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి , పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి.సృజన, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్రాండ్ భరోసా
(విశాఖ జీఐఎస్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : విశ్వసనీయత, భరోసాకు నిదర్శనంగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి బ్రాండ్గా మారింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ తానే స్వయంగా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా మారి పారిశ్రామిక సెన్సెక్స్లో రాష్ట్ర సూచీని ఉవ్వెత్తున ఎగసేలా చేశారు. ఒక్క పేరు కల్పించిన విశ్వాసంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా విశాఖ సమ్మిట్కు హాజరయ్యారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 వేదికగా అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. సత్వర నిర్ణయాలు, సమర్థ నాయకత్వం జీఐఎస్ 2023 సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడులను సాధించడం ద్వారా పారిశ్రామిక వర్గాల్లో నమ్మకాన్ని రుజువు చేసుకుంది. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఎంతో కాలయాపన తరువాతగానీ నిర్ణయం తీసుకోని అగ్ర పారిశ్రామికవేత్తలు సైతం ఏపీలో పెట్టుబడుల విషయంలో మీనమేషాలు లెక్కించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సత్వరం సానుకూలంగా స్పందించి ఏకంగా 20 రంగాల్లో 378 పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ సమర్థ నాయకత్వం ఉందన్న నమ్మకమే దీనికి కారణం. విశ్వసనీయత, సమర్థత, సత్వర నిర్ణయాలకు సీఎం జగన్ను ప్రతీకగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. కోవిడ్ సమయంలో పరిశ్రమలకు అండగా నిలవడంతోపాటు గత మూడున్నరేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధిని కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు. కోవిడ్లో కాపాడిన సంక్షేమం కోవిడ్ ప్రతికూల పరిస్థితులను దీటుగా ఎదురొడ్డి మరీ ఆంధ్రప్రదేశ్ 2021–22లో 11.43 శాతం వృద్ధి రేటు సాధించడం సాధారణ విషయం కాదు. గత మూడేళ్లలో ఎగుమతుల్లో సగటు వార్షిక వృద్ధిరేటు 9.3 శాతంగా నమోదైంది. సులభతర వాణిజ్య విధానాల్లో దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ విజయాలన్నీ ముఖ్యమంత్రి జగన్ దక్షత, రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధతకు నిదర్శనంగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల విపక్షాలు ఎంత బురద చల్లుతున్నా కరోనా గడ్డు కాలంలో రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టింది అవేనని పారిశ్రామికవేత్తలు గుర్తించారు. అంత సమర్థ నాయకత్వం ఉన్నందువల్లే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమై ముందుకొచ్చారు. తీరం.. మనకు వరంలా ఇక అతి పొడవైన తీర ప్రాంతం రాష్ట్రానికే ఉందని గత పాలకులు చెప్పటమే కానీ సద్వినియోగం చేసుకున్న దాఖలాలు లేవు. ఇందుకు భిన్నంగా తీర ప్రాంతాన్ని రాష్ట్ర ప్రగతికి చుక్కానిగా మలచుకోవాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అందుకే ఇప్పటికే నిర్వహణలో ఉన్న ఆరు పోర్టులతోపాటు కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు చర్చించి పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానించేందుకు రూ.20 వేల కోట్ల రహదారి ప్రాజెక్టులను మంజూరు చేయించడంలో విజయం సాధించారు. కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. తద్వారా ఏపీని లాజిస్టిక్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో సీఎం జగన్ అతి పెద్ద ముందడుగు వేశారు. ఆ పోర్టులు, పారిశ్రామిక కారిడార్ల పరిధిలో భారీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించగలిగారు. దీంతో రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం అమాంతం మారిపోనుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యువతకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా రాచబాట పరిచారు. దార్శనికత చాటిన దూరదృష్టి మారిన పరిణామాల నేపథ్యంలో యావత్ ప్రపంచం దృష్టి కర్బన ఉద్గారాలను తగ్గించడం, కాలుష్య నియంత్రణ మీదే ప్రధానంగా ఉన్నట్లు సీఎం జగన్ గుర్తించారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక ఇంధన వనరుల రంగానిదేనని స్పష్టం కావడంతో ఆ దిశగా రాష్ట్రంలో వనరుల సద్వినియోగంపై దృష్టి సారించారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించారు. అందుకే ఇంధన రంగంలో రికార్డు స్థాయిలో రూ.9,57,139 కోట్ల మేర పెట్టుబడుల వరద పారింది. సగం విజయం ముందుగానే.. ఆంధ్రప్రదేశ్లో అపార సహజ వనరులున్నా గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదు. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ పరిణామాలను ముందుగానే అంచనా వేయడం ద్వారా 50 శాతం లక్ష్యాన్ని సాధించారు. అందుకనుగుణంగా రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించి మిగిలిన 50 శాతం లక్ష్యాన్ని చకచకా పూర్తి చేశారు. ఆ ఒక్క మాట... ఆ ఒక్క నిర్ణయం జీఐఎస్ వేదికగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన రెండు మాటలు యావత్ పారిశ్రామిక ప్రపంచానికి భరోసానిచ్చాయి. ఎంవోయూల మేరకు పరిశ్రమల స్థాపనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు పరిష్కరిస్తానని స్పష్టమైన హామీనిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి భరోసానివ్వలేదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక వేగంగా ఎంవోయూల సాకారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో అత్యున్నత కమిటీని నియమిస్తున్నట్లు సీఎం జగన్ చేసిన ప్రకటన పెట్టుబడిదారుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. అటు ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉండటం... ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి వారం పరిశ్రమల ఏర్పాటును పర్యవేక్షించనుండటం విధానపరంగా విప్లవాత్మక నిర్ణయాలనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన గమ్య స్థానమన్న భావన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్లో స్థిరపడిపోయింది. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు టేకాఫ్ అందుకున్నాయని, ఇక రాష్ట్ర ప్రగతి ఉవ్వెత్తున దూసుకుపోవడం ఖాయమన్నది జీఐఎస్–2023 ద్వారా స్పష్టమైంది. -
పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరిస్తూ ‘అడ్వాంటేజ్ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ హిట్ అయ్యింది. దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు చేసుకున్నారు. రెండు రోజుల సమావేశాలకు రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు కరణ్ అదానీ, జిందాల్, బంగూర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎం రావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతా రెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి, మసహిరో యమగుచి, టెస్లా కోఫౌండర్ మార్టిన్ ఎబర్హార్డ్ వంటి 30కిపైగా కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. అంబానీ మొదలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త వరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకోవడమే కాకుండా అందులో భాగస్వామ్యమవుతామంటూ ప్రకటించారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో 20 రంగాల నుంచి రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 378 ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా 6,09,868 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గత ప్రభుత్వాల వలే ప్రచారం కోసం ఒప్పందాలు కుదుర్చుకొని వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి.. సీఎస్ అధ్యక్షతన ఒప్పందాల పర్యవేక్షణ కమిటీ వేశారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఒప్పందాల అమలు తీరు, అనుమతుల మంజూరు వంటి అంశాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రకటించడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్థవంతమైన చర్చలు ఈ సమావేశాల సందర్భంగా 15 రంగాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఇందులో ఆయా రంగాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ నిపుణులు పాల్గొని చర్చించారు. పలు దేశాల్లో ఉన్న పరస్పర పెట్టుబడుల అవకాశాలపై వియత్నాం, నెదర్లాండ్స్, యూఏఈ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా దేశాలతో కంట్రీసెషన్స్ జరిగాయి. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని పెట్టుబడులు, ఉత్పత్తులు, ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 137 స్టాల్స్తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో జిల్లాల వారీగా ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఉత్పత్తుల స్టాల్ విశేషంగా ఆకర్షించింది. 25 దేశాల నుంచి 46 మంది రాయబారులతో పాటు మొత్తం 14,000కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 14 యూనిట్లు ప్రారంభం రాష్ట్రంలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైన 14 యూనిట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ సమక్షంలో వర్చువల్గా ప్రారంభించారు. ఈ యూనిట్ల ప్రారంభం ద్వారా రూ.3,841 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడమే కాకుండా 9,108 మందికి ఉపాధి లభించనుంది. క్లింబెర్లీ క్లార్క్, బ్లూస్టార్, అంబర్, హావెల్స్, ఎక్సలెంట్ ఫార్మా, ఎన్జీసీ టాన్స్మిషన్స్, చార్ట్ ఇండస్ట్రీస్, లారస్ ల్యాబ్, అమరా లైఫ్, శారదా ఫెర్రో అల్లాయిస్, విన్విన్ స్పెషాలిటీ, ఏవోవీ ఆగ్రో ఫుడ్స్, ఎస్హెచ్ ఫుడ్, అవేరా కంపెనీలున్నాయి. -
వాస్తవం ఆవిష్కృతం
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్న విధంగా వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించింది. గత సర్కారు హయాంలో మాదిరిగా పెట్టుబడుల సదస్సు పేరిట హంగు, ఆర్భాటాలు కాకుండా దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. టీడీపీ అధికారంలో ఉండగా సదస్సుకు ఊరు పేరు తెలియని సంస్థలు, డ్రైవర్లను తరలించి సూటు బూటు వేసి భారీ సంఖ్యలో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేసుకుంది. నాడు చంద్రబాబు సర్కారు నాలుగు సమ్మిట్స్ ద్వారా రూ.18 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేసుకోగా కనీసం పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదు. తొలిసారిగా అంబానీ రాక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించడం, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా తాజాగా నిర్వహించిన విశాఖ సదస్సుకు రిలయన్స్, అదానీ, జేఎస్డబ్ల్యూ, జిందాల్, ఒబెరాయ్, దాల్మియా, బంగర్, బజాంకా తదితర పారిశ్రామిక దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. చంద్రబాబు హయాంలో నిర్వహించిన సదస్సులకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ముఖేష్ అంబానీ హాజరు కాకపోవడం గమనార్హం. దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ పెట్టుబడుల సమావేశానికి ఆయన హాజరైన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన పెట్టుబడుల సమావేశానికి భారీ సంఖ్యలో పారిశ్రామిక దిగ్గజాలు హాజరు కావడం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కార్పొరేట్ల నమ్మకానికి నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. దుష్ప్రచారానికి చెంపపెట్టులా సదస్సు విశాఖ సమ్మిట్ ద్వారా ఒక్క సమావేశంతో రికార్డు స్థాయిలో రూ.13.4 లక్షల కోట్లకుపైగా విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ అంతర్జాతీయంగా పేరు పొందినవే. థర్మల్ పవర్ నుంచి గ్రీన్ ఎనర్జీ రంగంలోకి అడుగుపెట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ ఎన్టీపీసీ అందుకు రాష్ట్రాన్ని వేదికగా చేసుకుని రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. రిలయన్స్, ఏబీసీ, జేఎస్డబ్ల్యూ ఆదిత్య బిర్లా, జిందాల్, ఫ్యూచర్, అదానీ, ఐవోసీఎల్ , అరబిందో, హీరో తదితర దిగ్గజ కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా తరచూ చేస్తున్న దుష్ప్రచారానికి తాజా సదస్సు చెంపపెట్టు లాంటిదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సదస్సులకు గతంలో ఒకరిద్దరు మాత్రమే ప్రముఖులు హాజరయ్యే వారని అలాంటిది ఈసారి ఇంతమంది కార్పొరేట్ దిగ్గజాలు ఒకేసారి రావటాన్ని నమ్మలేకపోతున్నామని సమావేశానికి హాజరైన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒకరు పేర్కొన్నారు. కార్యాచరణ ప్రారంభం కేవలం పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుని వదిలేయడం కాకుండా అమల్లోకి తెస్తూ కార్యాచరణను సైతం రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ప్రారంభించింది. ఒప్పందాలను వేగంగా వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. త్వరగా కార్యరూపం దాల్చే ఒప్పందాలకు ఎర్లీబర్డ్ రాయితీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఆరోగ్య రంగంలో ఆదర్శ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ద్వారా పెట్టుబడులకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతంగా మారింది. హెల్త్కేర్ విభాగంలో దేశానికి ఆదర్శంగా నిలిచే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. పారిశ్రామికంగానే కాకుండా రాష్ట్రం సామాజికంగా పురోగమించడంలో సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం. విశాఖ మరింతగా ఎదుగుతుంది. విశాఖలో మాకు 5 ఫార్ములేషన్ యూనిట్లు, రెండు బల్క్ డ్రగ్ యూనిట్లు ఉన్నాయి. మున్ముందు కూడా పెట్టుబడులను కొనసాగిస్తాం. – డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్రెడ్డి రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, సీఎం జగన్ సహకారం వల్ల ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. – వంశీకృష్ణ బండి, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ‘అపాచీ’ మరో 100 మిలియన్ డాలర్లు అపాచీకి చైనా, భారత్, వియత్నాంలో ప్లాంట్లు ఉండగా ఏపీ ప్లాంటే అతి పెద్దది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు వెచ్చించాం. మరో 100 మిలియన్ డాలర్ల (రూ. 820 కోట్లు) పెట్టుబడుల కోసం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ విధానాల వల్ల వ్యాపారాల నిర్వహణ సులభతరంగా మారిందనడానికి మా సంస్థే ఉదాహరణ. – అపాచీ ఇండియా డైరెక్టర్ సెర్గియో లీ ‘దివీస్’ రెండు కొత్త ప్లాంట్లు రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు నెలకొల్పబోతున్నాం. రూ.780 కోట్ల ప్రతిపాదన ఆమోదం పొందగా.. మరో రూ.700 కోట్ల ప్రతిపాదనలకు సంబం ధించి ఒప్పందం కుదుర్చుకున్నాం. దీంతో అదనంగా 22 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. – దివీస్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు -
పారిశ్రామిక హబ్గా ఏపీ
రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా పెంచేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు నిర్వహించే కార్యకలాపాలకు మా ప్రభుత్వ మద్దతు, సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. మీతో బంధం మాకు చాలా విలువైనది. రెండు రోజుల ఈ సదస్సు రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి అద్భుతంగా దోహదపడుతుంది. పారిశ్రామికీకరణ దిశగా ప్రయత్నాలకు రెట్టింపు ప్రోత్సాహాన్నిస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ జీఐఎస్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా తీర్చిదిద్దుతున్నామని, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల వృద్ధికి కృతనిశ్చయంతో ఉన్న తమ ప్రభుత్వం.. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు కల్పిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసానిచ్చారు. కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి మూడున్నరేళ్లలో ఆర్థికాభివృద్ధి సాధించడం తమ ప్రభుత్వ ఘనత అని చెప్పారు. కీలక సమయంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన 378 ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో 6.09 లక్షల మందికి ఉద్యోగాలు లభించనుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సమ్మిట్లో కుదిరిన ఒప్పందాల మేరకు పరిశ్రమలను స్థాపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’ రెండో రోజు శనివారం ముగింపు సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమ్మిట్ను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా తన ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అయిందని చెప్పారు. ఈ సమ్మిట్లో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మూడున్నరేళ్లలో పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ ♦ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పుంజుకుంది. కోవిడ్ మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అనేక రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చింది. ♦ మా సుపరిపాలన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలిచాయి. ద్రవ్యలోటు నియంత్రణలో ఉండేలా చేశాయి. తద్వారా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా మా ప్రభుత్వం చూసింది. కోవిడ్ సమయంలో అత్యంత జాగురూకతతో వ్యవహరించి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు మరింత సానుకూల వాతావరణం కల్పించేందుకు ఒక నిర్దిష్ట మార్గాన్ని ఏర్పాటు చేశాం. మౌలిక సదుపాయాల వ్యవస్థను బలోపేతం చేశాం. ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ సేవలను విస్తరించి యువతలో నైపుణ్యాలను మరింతగా పెంపొందించాం. పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా ఏపీ ♦ అత్యంత కీలక సమయంలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను నిర్వహించాం. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ను అనుకూల గమ్యస్థానంగా నిలపడంలో ఈ సమ్మిట్ విజయం సాధించింది. వివిధ రంగాలపై 15 సెషన్లుగా నిర్వహించిన చర్చాగోష్టుల్లో 100 మందికి పైగా ప్రముఖులు, నిపుణులు మాట్లాడారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న సానుకూల అంశాలేమిటో వివరించారు. ♦ ఆటోమొబైల్, ఈవీ సెక్టార్, హెల్త్ కేర్, మెడికల్ ఎక్విప్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, అగ్రి ప్రాసెసింగ్, టూరిజం తదితర రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను విశదీకరించారు. మరిన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు అవకాశాలను అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలను భాగస్వాములుగా చేసుకుని మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించాం. సమ్మిట్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ♦ ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ అనే థీమ్తో 137 స్టాళ్లను ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశాం. సమ్మిట్ సందర్భంగా రెండు రోజులపాటు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపడం సంతోషంగా ఉంది. ఈ సమావేశాలన్నీ ఫలప్రదమయ్యాయి. పరిశ్రమల గ్రౌండింగ్కు కమిటీ ♦ పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకించి మా ప్రభుత్వం మీద మీరు చూపించిన నమ్మకానికి ధన్యవాదాలు. ఎంవోయూలు కుదుర్చుకున్న వారంతా త్వరగా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాను. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. ♦ పరిశ్రమలు స్థాపించేలా పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసే ఈ కమిటీలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఈ సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకుంటుంది. పరిశ్రమలు స్థాపించే క్రమంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఎంవోయూలు ఫలప్రదమయ్యేలా చూస్తుంది. మా సానుకూల దృక్పథానికి నిదర్శనం ♦ రూ.3,841 కోట్లతో స్థాపించిన 14 పారిశ్రామిక యూనిట్లను ఈ సమ్మిట్ వేదిక నుంచి ప్రారంభించాం. వాటితో 9,108 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటిక్, లారస్ ల్యాబ్, హేవెల్స్ ఇండియా, శారదా మెటల్స్, అల్లాయిస్ తదితర కంపెనీలు ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నాను. ♦ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును సాకారం చేయడానికి, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించడంలో మా ప్రభుత్వ సానుకూల దృక్పథానికి ఈ రోజు ప్రారంభించిన ఈ పారిశ్రామిక యూనిట్లే నిదర్శనం. ఈ రోజు యూనిట్లు ప్రారంభించిన వారందరికీ శుభాకాంక్షలు. వారి పారిశ్రామిక కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. సరైన మార్గ నిర్దేశం చేస్తాంపారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమే కాకుండా, వారికి సరైన మార్గనిర్దేశం చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యవంతమైన మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ కల్పిస్తున్నాం. వ్యాపారాల్లో ఉన్న నష్టతరమైన సంక్లిష్టతను తగ్గించడంతోపాటు ఎంవోయూల మేరకు ఆటంకాలు లేకుండా పరిశ్రమల స్థాపనకు ఇది దోహదపడుతుంది. 378 ఒప్పందాలు.. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు ♦రెండు రోజుల సదస్సులో రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడులతో 378 ఎంఓయూలు కుదిరాయి. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 6,09,868 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఒక్క ఇంధన రంగంలోనే రూ.9,57,112 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాం. దాంతో 1,80,918 మందికి ఉద్యోగాలు వస్తాయి. ♦ఐటీ, ఐటీ ఆధారిత రంగాలకు సంబంధించి 82 ఒప్పందాలు చేసుకున్నాం. వీటి విలువ రూ.73,819 కోట్లు. దాంతో 1,40,002 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటక రంగానికి సంబంధించి 117 అవగాహన ఒప్పందాలు చేసుకున్నాం. వాటితో రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాంతో 30,787 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రెండో రోజు సదస్సులో భాగంగా రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులతో 286 ఎంఓయూలు చేసుకున్నాం. వీటి ద్వారా సుమారు 2.09 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ♦ పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో భారీగా పెట్టుబడులు సాధించాం. గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలున్న రంగాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ రంగం ప్రధానం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి మేం సాధిస్తున్న పెట్టుబడులు ఈ రంగంలో ఉన్న సమస్యను, సంక్లిష్టతను పరిష్కరిస్తాయి. శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులను చూపిస్తాయి. కర్బన రహిత లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా మన దేశ లక్ష్య సాధనకు ఆంధ్రప్రదేశ్ తగిన సహకారం అందిస్తుంది. -
ఇంకా అనేక కంపెనీలు ఏపీకి వస్తాయి : ఎంపీ మిథున్ రెడ్డి
-
ఎంవోయూలు గ్రౌండింగ్.. సీఎస్ అధ్యక్షతన కమిటీ: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయ్యిందని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం మొదటిసారి అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రానికి 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 6 లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఎంవోయూలు గ్రౌండింగ్ అయ్యేలా సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఎంవోయూ పారదర్శకంగా రూపొందిందన్నారు. కాగా, మునుపెన్నడూ చోటు చేసుకుని పరిణామానికి ఆంధ్రప్రదేశ్ వేదికైంది. పాలన రాజధాని విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అడ్డగోలుగా విమర్శించే వాళ్ళ నోళ్లే.. అబ్బురపోయేలా పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రానికి పోటెత్తింది. చదవండి: ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా.. -
AP Global Investors Summit రెండో రోజూ: వ్యాపార ప్రముఖుల ఫోటోలు
-
ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా..
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ఏపీకీ పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు ఇలా.. ► ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు ► ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు ► ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు ► పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు ► వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు ► పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు జీఐఎస్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు. చదవండి: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్.. ఇండస్ట్రీస్ మ్యాప్లో ఏపీ సుప్రీం -
గ్లోబల్ సమ్మిట్ చాలా అద్భుతంగా జరిగింది : పీవీ సింధు
-
రాజధానిగా విశాఖ..! చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి
-
GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి. అంచనాలను మించి అందుకున్న లక్ష్యం. దటీజ్ ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు కూడా. విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నారాయన. మునుపెన్నడూ చోటు చేసుకుని పరిణామానికి ఆంధ్రప్రదేశ్ వేదికైంది. పాలన రాజధాని విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అడ్డగోలుగా విమర్శించే వాళ్ళ నోళ్లే.. అబ్బురపోయేలా పెట్టుబడుల ప్రవాహం పోటెత్తింది రాష్ట్రానికి. ఇది రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష నేతకు ఏమాత్రం సహించని పరిణామమే!. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు ఇన్వెస్టర్లు. సదస్సులో భారీపెట్టుబడులకు ఆసక్తిక కనబరిచారు. ప్రభుత్వంతో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా.. రాష్ట్రం దిశనే మార్చేసింది ఈ సదస్సు. విశాఖ తీరాన విప్లవాత్మకమైన నిర్ణయాలకు జీఐఎస్ ప్రాంగణం నెలవైంది. ఎనర్జీ విభాగంలో ఏకంగా రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3,35వేల కోట్లకు పైనే, ఐటీ అండ్ ఐటీఈఎస్ కేటగిరీలో 39 వేల కోట్ల రూపాయలపైనే, టూరిజంలో 22 వేల కోట్ల రూపాయలకుపైనే, వ్యవసాయ విభాగంలో వెయ్యి కోట్ల రూపాయలకుపైనే, పశుసంవర్థక విభాగంలో మరో వెయ్యి కోట్ల రూపాయలకుపైనే పెట్టుబడులు వచ్చాయి. -
నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్
-
ఏపీ అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
-
ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి : కిషన్ రెడ్డి
-
ఏపీని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతున్నాం : సీఎం జగన్
-
విశాఖలాంటి నగరం ఉండటం ఏపీ అదృష్టం: సర్బానంద సోనోవాల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు పోర్ట్స్ అండ్ షిప్పింగ్ కేంద్ర మంత్రిసర్బానంద సోనోవాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘జీఐఎస్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలో విశాఖపట్నం ప్రత్యేక నగరంగా నిలిచింది. శతాబ్ధాలుగా భారతదేశంలో విశాఖ కీలకంగా ఉంది. విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. విశాఖపట్నం చాలా అందమైన ప్రదేశం. విశాఖలాంటి నగరం ఉండటం ఏపీ అదృష్టం. భారత దేశ ప్రగతిలో ఏపీ కీలకం కానుంది’ అని కామెంట్స్ చేశారు. -
కీలక సమయంలో సదస్సు నిర్వహించాం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధి చెందేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ రెండో రోజు సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ‘‘పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుందని, మీతో మా బంధం చాలా అమూల్యమైనది’’ అని సీఎం అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ♦గౌరవనీయులైన కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, రాష్ట్ర మంత్రివర్గంలోని నా సహచరులు, వ్యాపార ప్రముఖులు మరియు పారిశ్రామిక ప్రతినిధులు, అధికారులందరికీ నమస్సులు. ♦జీఐఎస్ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సదస్సు ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను ఉప్పొంగేలా చేసింది. ♦రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధిచెందేందుకు మేం కృత నిశ్చయంతో ఉన్నాం. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుంది. మీతో మా బంధం చాలా అమూల్యమైనది. ♦రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ♦మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ శర వేగంతో తిరిగి పుంజుకుంది. కోవిడ్ మహమ్మారి విస్తరించి, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా అనేక రంగాలకు మా ప్రభుత్వం సమయాను కూలంగా ప్రోత్సాహం ఇచ్చింది. సుపరిపాలన, సమర్థవంతమైన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలవడమే కాకుండా ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచింది. ♦అంతేకాకుండా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా చూసింది. ఇదే సమయంలో పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారస్తులకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి కోవిడ్ సమయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాం. మౌలికసదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చి యువతలో నైపుణ్యాలను మరింత బలోపేతం చేశాం. ♦అత్యంత కీలక సమయంలో ఈ సదస్సును నిర్వహించాం. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించడంలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషిస్తున్నాను. 15 సెషన్లు- 100 మంది వక్తలు.. ♦ఈ సదస్సులో భాగంగా వివిధ రంగాలపై 15 సెషన్లు నిర్వహించాం.100 మందికిపైగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను కున్న బలాలేంటో చెప్పారు. ఆటోమైబైల్– ఈవీ సెక్టార్, హెల్తకేర్– మెడికల్ ఎక్విప్మెంట్, రెన్యువబుల్ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్అమ్మెనియా, అగ్రి ప్రాససింగ్ మరియూ టూరిజం తదితర రంగాలు.. ఇందులో ఉన్నాయి. ♦ఆంధ్రప్రదేశ్తో సహకారంకోసం మరిన్ని అవకాశాలు అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్ఆస్ట్రేలియాలతో మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించాం. ♦సదస్సులో భాగంగా మేం పెట్టిన ఎగ్జిబిషన్ఎరీనా ప్రత్యేకంగా అందర్నీ ఆకట్టుకుంది. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి ( ఒన్ డిస్ట్రిక్ట్ – ఒన్ ప్రొడక్ట్) థీమ్ఆధారంగా 137 స్టాళ్లను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశాం. ♦గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా ఈరెండు రోజులపాటు కేంద్రం మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి చర్చలు జరపడం సంతోషంగా ఉంది. ♦ఈ సమావేశాలన్నీ అత్యంత ఫలప్రదంగా సాగాయి. పెట్టబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉంది. 352 ఎంఓయూలు– రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంతో భాగస్వామ్యానికి సంబంధించి మేం చూపిన ధృఢమైన నిబద్ధత కారణంగా, సానుకూల వ్యాపార పరిస్థితులు కారణంగా ఈ రెండు రోజుల సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎనర్జీ రంగంలోనే రూ.8.84 లక్షల పెట్టుబడులు... ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ. 8,84,823 కోట్లకు సంబంధించి 40 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నాం. 1,90,268 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఐటీ రంగంలో... ఐటీ మరియు ఐటీఈ రంగానికి సంబంధించి 56 ఒప్పందాలను కుదర్చుకున్నాం. వీటి విలువ రూ.25,587 కోట్లు. 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం రంగంలో 117 ఎంఓయూలు కుదుర్చుకున్నాం. రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయి. రెన్యువబుల్ ఎనర్జీ– గణనీయంగా పెట్టుబడులు.. గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఒకటి రెన్యువబుల్ఎనర్జీని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్ స్టో్టరేజీ మరియు గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి వస్తున్న పెట్టుబడులు పునరుత్పాదక శక్తికి సంబంధించిన క్లిష్టతలను పూర్తిగా తగ్గిస్తాయి. శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయి. కర్బన రహిత లక్ష్యంగా, గ్రీన్ఎనర్జీ దిశగా అడుగులేస్తున్న భారత్కు తన లక్ష్యసాధనలో చక్కటి సహకారాన్ని అందిస్తాయి. మీ నమ్మకానికి ధన్యవాదాలు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రభుత్వంమీద మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. ఎంఓయూలు కుదుర్చుకున్న వారంతా వీలైనంత త్వరగా తమ పెట్టబడులతో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుతున్నాను. దీనికోసం అన్నిరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీ వ్యాపారాలు ప్రారంభించడానికి, పరిశ్రమలు పెట్టేందుకు వేగవంతంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా సదుపాయాలను కల్పిస్తుంది. వీటిని సాకారం చేసేందుకు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాల అధికారులు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఈ సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు దిశగా కృషి చేస్తుంది. మీ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వాటిని ఈ కమిటీ పరిష్కరిస్తూ.. ఈ పెట్టుబడులు ఫలప్రదమయ్యేలా ఆటంకాలు లేకుండా చూస్తుంది. సదస్సు వేదికగా రూ.3841 కోట్ల విలువైన 14 యూనిట్లు ప్రారంభం... ఈ సదస్సు వేదికగా ఇవాళ రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తున్నాం. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటెక్, లారస్ ల్యాబ్, హేవెల్స్ఇండియా, శారదా మెటల్స్ మరియు అల్లాయిస్ తదితర కంపెనీలు ఈపెట్టుబడులను పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం గర్వకారణం. పరస్పర ప్రయోజనాల దిశగా.... రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేయడం, మరియు పెట్టుబడులు పెట్టేవారికి సహకారం అందించడంలో మా ప్రభుత్వం ఆలోచనా దృక్పథానికి ఇవాళ ప్రారంభం అవుతున్న యూనిట్లు ప్రతిబింబంలా నిలుస్తాయి. ఇవాళ యూనిట్లు ప్రారంభిస్తున్న వారంతా మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టబడిదారులకు ఆహ్వానం పలకడమే కాదు, వారికి మార్గనిర్దేశం చేయడంలో, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో, నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ లభిస్తుంది. వ్యాపారాల్లో ఉండే నష్టతరమైన క్లిష్టతలను తగ్గించడంలో మరియు, మీ పెట్టుబడులను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. దీనివల్ల పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా మీకేకాదు, రాష్ట్రానికి కూడా పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మీరు నమ్మకాన్ని ఉంచి, ఈ సదస్సును అద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. -
ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది : సతీష్ రెడ్డి
-
విశాఖ రాజధాని.. కిషన్ రెడ్డి నోట ఆ మాట..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇక సమ్మిట్ కోసం విశాఖకు విచ్చేసిన కిషన్ రెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృధ్ది చెందిన విశాఖలో.. జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీగా మాధవ్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే, పార్టీ కోసం కిషన్ రెడ్డి పైవ్యాఖ్యలు చేసినప్పటికీ.. రాజధానిగా విశాఖను ధృవీకరిస్తూ చేసిన కామెంట్స్ ప్రముఖంగా నిలిచాయి. ఇక సదస్సు సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జీఐఎస్లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతం. ప్రతిభగల యువత ఏపీలో ఉన్నారు. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించింది. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగింది. నూతన భారత్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్ సంస్థలు ఉంటాయి. రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సమాఖ్య స్పూర్తితో ఏపీకి అన్ని విధాలా సహకారం అందిస్తాం. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఏపీలో ఎంవోయూలు జరిగాయి. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు అభినందనలు. ఏపీ ప్రగతికి చిత్తశుద్ధితో కృషిచేస్తోన్న సీఎం జగన్కు అభినందనలు అంటూ ప్రశంసలు కురిపించారు. -
ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్
-
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు: రెండో రోజు ఫొటోలు
-
సీఎం వైఎస్ జగన్ మాటల మనిషి కాదు..చేతల మనిషి : అమర్నాథ్
-
రెండో రోజు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
-
ఇన్నోవేషన్లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది: రెడ్డీస్ ల్యాబ్ సతీష్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సమ్మిట్ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో పెట్టబోయే పెట్టుబడులను ప్రకటిస్తున్నారు. సమ్మిట్లో భాగంగా.. రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషి అమోఘం అని అన్నారు. అవాడ గ్రూప్ ఛైర్మన్ వినిత్ మిట్టల్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ అప్రోచ్ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ వన్గా నిలిచింది. నెంబర్ వన్గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు. సెయింట్ గొబెయిన్ సీఈవో సంతానం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది. లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నాయి. నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాజర్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జోష్గా సాగింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు. అపాచీ అండ్ హిల్టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియో లీ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. మూడు దేశాల్లో అపాచీ గ్రూప్ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్ విజనరీ లీడర్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో డైనమిక్ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు. -
జీఐఎస్ రెండో రోజు: ఏపీ సర్కార్ కీలక ఎంవోయూలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం.. పరిపాలన రాజధాని విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతమైంది. సదస్సులో రెండో రోజైన శనివారం(మార్చి 4వ తేదీ) ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో.. రిలయన్స్ కంపెనీ 50వేల కోట్ల రూపాయలతో అగ్రగామిగా(ఇవాళ్టి ఒప్పందాల ప్రకారం) ఉంది. విశాఖ జీఐఎస్.. రెండోరోజు ఎంవోయూల జాబితా పరిశీలిస్తే.. ►రిలయన్స్ ఎంవోయూ రూ. 50,000 కోట్లు ►హెచ్పీసీఎల్ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్లు ►టీవీఎస్ ఐఎల్పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు ►ఎకో స్టీల్ ఎంవోయూ రూ. 894 కోట్లు ►బ్లూస్టార్ ఎంవోయూ రూ. 890 కోట్లు ►ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ రూ. 850 కోట్లు ►గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►ఎక్స్ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►రామ్కో ఎంవోయూ రూ. 750 కోట్లు ►క్రిబ్కో గ్రీన్ ఎంవోయూ రూ. 725 కోట్లు ►ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ రూ. 723 కోట్లు ►ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►తాజ్ గ్రూప్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►కింబర్లీ క్లార్క్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►అలియన్న్ టైర్ గ్రూప్ ఎంవోయూ రూ. 679 కోట్లు ►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు ►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు ►డీఎక్స్ఎన్ ఎంవోయూ రూ. 600 కోట్లు ►ఈ-ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ రూ. 550 కోట్లు ►నాట్ సొల్యూషన్న్ ఎంవోయూ రూ. 500 కోట్లు ►అకౌంటిఫై ఇంక్ ఎంవోయూ రూ. 488 కోట్లు ►కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►ఆటమ్స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►క్లేరియన్ సర్వీసెస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►వీఆర్ఎమ్ గ్రూప్ ఎంవోయూ రూ. 342 కోట్లు ►రివర్ బే గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►హావెల్స్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►పోలో టవర్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఇండియా అసిస్ట్ ఇన్సైట్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►స్పార్క్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►టెక్ విషెన్ సాఫ్ట్వేర్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►మిస్టిక్ పామ్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►నియోలింక్ గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు ►అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు ►సర్ రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►హ్యాపీ వండర్లాండ్ రిసార్ట్స్ ఎంవోయూరూ. 250 కోట్లు ►చాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు ►ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు ►ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు ►హైథియన్ హ్యూయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు ►గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు ►ఎస్పీఎస్ ఇన్ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు ►డీవీవీ బయో ఫ్యూయల్స్ ఎంవోయూ రూ. 223 కోట్లు ►దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►ఆమ్ కన్స్ట్రక్షన్స్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►కేపిటల్ బిజినెస్ పార్క్ ఎంవోయూ రూ. 184 కోట్లు ►చాంయిన్ యాచ్ ఎంవోయూ రూ. 190 కోట్లు ►ఎన్జీసీ ట్రాన్స్మిషన్ ఎంవోయూ రూ. 185 కోట్లు ►యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ఎంవోయూ రూ. 176 కోట్లు ►విన్విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ ఎంవోయూ రూ. 174 కోట్లు ►ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్మెంట్ ఎంవోయూ రూ. 165 కోట్లు ►చాంపియన్ ఇన్ఫ్రాటెక్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►స్విచ్గేర్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►ఆంబర్ ఎంటర్ప్రైజస్ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు ►ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లుగా ఉన్నాయి. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికగా తొలి రోజు కూడా ఏపీ ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు కుదిరాయి. మొత్తం 92 ఎంవోయూలు జరిగాయి. వీటి విలువ రూ.11లక్షల 87 వేల 756 కోట్లు. వీటిలో ఎన్టీపీసీ రూ. 2..35లక్షల కోట్ల ఎంవోయూతో అగ్రగామిగా నిలిచింది. ఏబీసీ లిమిటెట్ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ. 97, 550 కోట్లు), ఇండోసాల్ (రూ. 76, 033 కోట్లు), ఏసీఎమ్ఈ (రూ. 68,976 కోట్లు), టీఈపీఎస్ఓఎల్ ( రూ. 65, 000 కోట్లు), జేఎస్డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు), హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు), అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు) జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఇక రెండు రోజుల ఈ అవగాహన ఒప్పందాల ద్వారా ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ చేసిన ప్రకటన.. కార్యరూపం దాల్చినట్లయ్యింది. మొత్తంగా 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ ఎంవోయూల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. -
సీఎం జగన్ పై నమ్మకంతోనే సదస్సుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరు
-
సీఎం జగన్ సమర్థవంతమైన నాయకత్వం వల్లే భారీగా పెట్టుబడులు : మంత్రి రోజా
-
వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్
-
సీఎం జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు : అమర్నాథ్
-
విశాఖ అభివృద్ధిలో పోర్టుదే కీలక పాత్ర: చైర్మన్ కె రామ్మోహనరావు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు. ప్రముఖులు హాజరయ్యారు కూడా. ఈ సందర్భంగా సాక్షి టీవితో విశాఖ పోర్టు చైర్మన్ కే రామ్మోహన్రావు కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఏపీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రం. ఏపీలో సహజ వనరుల తోపాటు తగినంతలో మానవ వనరులు కూడా ఉన్నాయి. సుదీర్ఘమైన కోస్తా తీర ప్రాంత ఏపీ సొంతం. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్)కి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరు కావడం ఎంతో శుభపరిణామం. ఏపీ ప్రభుత్వ విధానాల వల్లే లక్షల కోట్ల రూపాయాలు పెట్లుబడుల వచ్చాయాని సీఎం జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో మౌలిక సదుపాయాలు, రహదారులు, పోర్టులు అభివృద్ధిపై దృష్టి సారించడం వల్లే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అంతేగాదు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో పోర్టులదే కీలక పాత్ర. ఈ విశాఖ పోర్టు ఏర్పాటై సుమారు 90 ఏళ్లు అయ్యింది. ఈ పోర్టు ద్వారా రికార్డు స్థాయిలో 77 మిలియన్ల టన్నుల సరుకు రవాణ అయ్యింది. అంతేగాదు పెట్టుబడులకు విశాఖ నగరం అన్ని విధాల అనువైన నగరమే గాక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీనే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం ఈ పోర్టు నుంచి భోగాపురం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ జరగబోతుంది. "అని చెప్పుకొచ్చారు. (చదవండి: ఎలాంటి సహకారానికైనా ఒక్క ఫోన్కాల్ దూరంలో: సీఎం జగన్) -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్
-
‘ఏపీకి సీఎం జగనే బ్రాండ్ అంబాసిడర్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులను ఉద్దేశించి మంత్రి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ భారీ పెట్టుబడులు ఆయన ఛరిష్మాతోనే వచ్చాయి అని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. అలాగే.. త్వరలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోందన్న ఆయన.. అందులో భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు అభివృద్ధికి కీలకం కానుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల పండుగగా వర్ణిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రెండో రోజూ కొనసాగుతోంది. -
జగన్ దార్శనికతే ఏపీ ప్రగతి దిక్సూచి
-
ఇండియాకే ఏపీ రోల్ మోడల్..!
-
అదానీ గ్రూప్ : మా టార్గెట్ ఇదే..
-
2500 మంది పోలీసులతో భద్రత
-
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2వ రోజు షెడ్యూల్..!
-
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు అనూహ్య స్పందన
-
విశాఖ జీఐఎస్: దిగ్గజ కంపెనీలతో ఏపీ ఎంవోయూలు (ఫొటోలు)
-
విశాఖ జీఐఎస్: వ్యాపార ప్రముఖులను సత్కరించిన సీఎం వైఎస్ జగన్(ఫొటోలు)
-
పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు. సదస్సుపై శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం. ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. ప్రధాని నరేంద్రమోదీ నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామికవాతావరణాన్ని కలిగి ఉంది. విశాఖ వేదికగా చేసిన వాగ్దానాలు రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తాయని ఆశిస్తున్నాం. నితిన్ గడ్కరీ హాజరు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుందో చూపిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం మరియు ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. @narendramodi గారి నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామిక (1/2)@blsanthosh pic.twitter.com/TzmR5Cqrdz — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 3, 2023