Andhra Pradesh: CM YS Jagan Review Meeting On Agriculture And Horticulture Department - Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విషయంలో మరింత ముందుకు వెళ్లాలి: సీఎం జగన్‌

Published Fri, Jul 14 2023 1:53 PM | Last Updated on Fri, Jul 14 2023 7:36 PM

Cm Jagan Review On Agriculture And Horticulture Department - Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా  వినియోగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలని పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ సన్నద్ధతతో పాటు వ్యవసాయ అనుబంధశాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఈ–క్రాపింగ్‌లో జియో ఫెన్సింగ్‌ ఫీచర్‌ కూడా కొత్తగా ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. ఖరీఫ్‌ పంటల ఈ– క్రాపింగ్‌ మొదలైందని, ఈసారి ముందస్తుగానే మొదలుపెట్టామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు డేటాను అప్‌లోడ్‌ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే పురుగుమందుల వినియోగం లాంటి కార్యక్రమాలు డ్రోన్ల ద్వారా చేస్తున్నామని తెలిపారు. ఇదే కాకుండా డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు చేయించే పరిస్థితిని తీసుకురావాలని తెలిపారు. తద్వారా ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు చేసే స్థాయికి ఎదగాలని చెప్పారు. భూసార పరీక్షలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా తెలుసుకునే పరిస్థితి వస్తే.. ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు.

డ్రోన్ల ద్వారా వ్యవసాయానికి, రైతులకు మరింత మేలు
డ్రోన్ల ద్వారా డేటా కూడా కచ్చితత్వంతో ఉండేందుకు అవకాశం ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు. దీంతోపాటు పంట దిగుబడులపై అంచనాలకు కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వరి దిగుబడులపై డ్రోన్ల ద్వారా అంచనాలు పొందేలా డ్రోన్‌ టెక్నాలజీని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పగా.. మిగతా పంటల విషయంలో కూడా ఈ తరహా ప్రయోజనాలు డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా వచ్చే పరిస్థితి ఉండాలని సీఎం పేర్కొన్నారు.  బహుళ ప్రయోజనకారిగా డ్రోన్లను వినియోగించుకోవడంవల్ల వ్యవసాయ రంగానికి, రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. 

ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్‌లు ద్వారా 2.2 లక్షల శాంపిళ్లను సేకరించి రైతులకు ఫలితాలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు.  జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పారు. అయితే కౌలు రైతులకుకి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకూ రూ. 7802.5 కోట్లు  54.48 లక్షల మందికి పరిహారంగా అందించామని అధికారులు తెలిపారు. రబీ సీజన్‌కు సంబంధించి పంట బీమా పరిహారాన్ని అక్టోబరులో ఇచ్చేందుకు అన్ని రకాలుగా సిద్ధం  అవుతున్నామన్నారు  అధికారులు.

►10వేల ఆర్బీకేల్లో 10వేల డ్రోన్లు తీసుకు వచ్చి వాటితో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలి: సీఎం
►ముందస్తుగా 2వేల డ్రోన్లు తీసుకు వస్తున్నామన్న అధికారులు.
►డ్రోన్‌ టెక్నాలజీలో 222 రైతులకు శిక్షణ ఇచ్చి.. పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామన్న అధికారులు.

►డ్రోన్ల విషయలో భద్రత, సమర్థవంతమైన నిర్వహణ, సర్వీసు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామన్న అధికారులు.
►డ్రోన్‌ ఖరీదైనది కాబట్టి భద్రత, రక్షణ విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న అధికారులు.
►డీజీసీఏ సర్టిఫికేషన్‌ను పాటిస్తున్నామన్న అధికారులు.
►అన్నిరకాల భధ్రతా ప్రమాణాలు పాటించేలా, ఎదురుగా వచ్చే వస్తువును ఢీకొట్టకుండా నిలువరించే వ్యవస్థ ఉండేలా, నిర్దేశించిన మార్గంలోనే ఎగరవేసేలా, ఒకవేళ ఇంధన సమస్య వస్తే వెంటనే ఆటో పద్ధతిలో ల్యాంచింగ్‌ ఫ్యాడ్‌కు చేరుకునేలా ఈ డ్రోన్లు ఉంటాయన్న అధికారులు.

► సాగులో శిక్షణ కార్యక్రమాలపై మరిన్ని వీడియోలు రూపొందించి ఆర్బీకే ఛానెల్‌ ద్వారా మరింతగా రైతులకు చేరువ చేయాలన్న సీఎం.
►రైతుల పంటలకు ఎంఎస్‌పీ ధీమా, సీఎం ఆదేశాలతో చట్టానికి రూపకల్పన.
► ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు రైతుల దగ్గరనుంచి కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఎంఎస్‌పీ ధరలు ఇవ్వాల్సిందే.
► సీఎం ఆదేశాలమేరకు దీనికి సంబంధించి ఏపీ ఎంఎస్‌పీ యాక్ట్‌– 2023ని తీసుకురానున్న ప్రభుత్వం.
► ఆక్వా రైతులకు, డెయిరీ రైతులకు ఈ చట్టం ద్వారా వారి ఉత్పత్తులకు రక్షణ కల్పించే అవకాశం.
► దీనికి సంబంధించి చట్ట రూపకల్పన జరుగుతోందని తెలిపిన అధికారులు.

►గడచిన నాలుగేళ్లలో వ్యవసాయ పంటల నుంచి 4.34 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలవైపు మళ్లింపు.
► రెగ్యులర్‌ మార్కెట్‌కే కాకుండా ఫుడ్‌ప్రాసెసింగ్‌కు అనుకూలమైన వంగడాలను ఉద్యానవన పంటల్లో ప్రోత్సహించాలని అధికారులకు సీఎం ఆదేశం.

► గోడౌన్లు, కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ రూమ్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడం పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం. 
► దీనివల్ల పంట ఉత్పత్తుల జీవితకాలం పెరుగుతుందని, రైతులకు మంచి ధరలు వస్తాయన్న అధికారులు.
► ముఖ్యంగా ఉద్యానవన పంటలకు ఈ మౌలిక సదుపాయాలు చాలా అవసరమని తెలిపిన అధికారులు.

► ఫుడ్‌ప్రాసెసింగ్‌ విషయంలో  మరింత ముందుకు వెళ్లాలి: సీఎం
► వివిధ జిల్లాల్లో పండుతున్న పంటల ఆధారంగా  ఇప్పటికే ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు మొదలుపెట్టాం.
► త్వరలో కొన్ని యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి.
► నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్‌ చేయాలి.
►ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యే టమోటా, ఉల్లిలాంటి పంటల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక  దృష్టిపెట్టాలి.
► ఈ పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలి
► అంతేకాకుండా మహిళలతో నడిచే సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నంచేయాలి.
► మహిళల్లో స్వయం ఉపాధికి ఇది ఉపయోగపడుతుంది.
► ఆరువేల మైక్రో యూనిట్లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
► చేయూత లాంటి పథకాన్ని వినియోగించుకుని.. ఈ యూనిట్ల ద్వారా మహిళలు స్వయం ఉపాధికి ఊతమివ్వాలని అధికారులకు సీఎం ఆదేశం.

►పంటల సాగులో, బీమా కల్పనలో, ధాన్యం కొనుగోలులో రైతుభరోసా కేంద్రాలు ఇప్పటికే రైతులను చేయిపట్టుకుని నడిపిస్తున్నాయి.
►ధాన్యం సేకరణలో ఆర్బీకేల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం. 
►కనీస గిట్టుబాటు ధరలు రాని ఏ పంట కొనుగోళ్లులో అయినా ఆర్బీకే జోక్యం చేసుకుంటుంది.
►మిగిలిన పంటల కొనుగోలు కూడా ఆర్బీకే కేంద్రంగా జరిగేలా చూడాలి.
►ఏ రకమైన కొనుగోళ్లుకు అయినా ఆర్బీకే కేంద్రం కావాలి.
►విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వేటిలోనూ నకిలీలు, కల్తీ లేకుండా నివారించడంలో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
►ఇప్పుడు మార్కెటింగ్‌లో కూడా ఆర్బీకేలు ప్రమేయం ఉండాలి.
►ప్రభుత్వం వ్యవసాయ ఉపకరణాలు, డ్రయ్యింగ్‌ ప్లాట్‌ఫాంలతో పాటు ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది.
►ఇతర పంటలకు కూడా మార్కెట్‌తో సమన్వయం చేసి.. మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించాలి.
►ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement