రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు | Sakshi
Sakshi News home page

రాజ్యాంగబద్ధ సంస్థలను కించపరిచేలా ఈనాడు రాతలు

Published Mon, Apr 29 2024 5:41 AM

Complaint by Civil Societies to Election Commission

ఎన్నికల సంఘం కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య అగాధం సృష్టించే పన్నాగం 

ఈసీ ఆదేశాలు పాటించినా సీఎస్‌ పనితీరుపై తప్పుడు కథనాలు 

తక్షణం ఈ కథనాలపై చర్యలు తీసుకోవాలి 

ఎన్నికల సంఘానికి పౌర సంఘాల ఫిర్యాదు

సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నేతృత్వంలో పనిచేసే కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం సృష్టించడం, వాటిని కించపరచడమే లక్ష్యంగా ఈనాడు దురుద్దేశపూర్వక కథనాలను ప్రచు­రిస్తోందంటూ పౌర సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రెండు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చి, ప్రజల్లో చులకన చేసే లక్ష్యంతో పెన్షన్ల పంపిణీపై ‘ఎవరి ఆధీనంలో ఎవరు’ అంటూ కథనాన్ని ప్రచురించారంటూ ఏపీ ఇంటిలెక్చువల్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ ఫోరం ఆదివారం ఫిర్యాదు చేశాయి.

ఈ సందర్భంగా  ఏపీ ఇంటిలెక్చువల్‌ అండ్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు పి. విజయబాబు మాట్లాడుతూ.. ఈనాడు కథనం ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకత, సమగ్రత, నిబద్ధ­తను ఈ కథనం ప్రశి్నంచేదిగా ఉందన్నారు. ఈ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఈ తరహా వార్తలు పత్రికా విలువలను, నైతికతను దిగజార్చేలా ఉన్నందున, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా జోక్యం తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీ ఎడి­టర్స్‌ అసోసియేషన్‌ ఫోరం అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీపై ఎన్ని­కల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచి్చందని, వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ కూడా పాటించిందని చెప్పారు. అయినప్పటికీ, ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లేదనే విధంగా ఈనాడు కథనం ఉండటం శోచనీయమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికల సంఘం ఇస్తున్న ఆదేశాలను సీఎస్‌ తూచ తప్పకుండా పాటిస్తున్నప్పటికీ, ఆయన పనితీరుపై అపోహలు కలి్పంచేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారన్నారు.

 రాష్ట్రంలోని కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాలను దించి వేయడం, వాటికి అనుకూలమైన పార్టీలను అందలం ఎక్కించడం అనే రాజ్యాంగ విరుద్ధమైన బాధ్యతను భుజాలకెత్తుకున్నాయని కృష్ణంరాజు విమర్శించారు. ప్రభుత్వాల పనితీరుపై ఎన్నికల సమయంలో ప్రజలే వారి నిర్ణయాన్ని ప్రకటిస్తారని, కానీ వారి నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. 

Advertisement
Advertisement