Fact Check: ఈనాడు దగాకోడ్‌ రాతలు | Eenadu Trick Is To Blackmail The Police, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: ఈనాడు దగాకోడ్‌ రాతలు

Published Fri, Apr 12 2024 5:35 AM

Eenadu trick is to blackmail the police - Sakshi

‘ఈసి’డించుకునేలా కథనాలు

పోలీసు యంత్రాంగంపై కక్షగట్టి విద్వేషం 

మొన్న ఐపీఎస్‌లపై... నేడు డీఎస్పీలు, సీఐలపై..  

పోలీసుల బ్లాక్‌మెయిలింగ్‌కు ఈనాడు కుతంత్రం 

ఈసీ మార్గదర్శకాల ప్రకారమే రక్షకభటుల విధి నిర్వహణ 

టీడీపీ అరాచకాలు, దౌర్జన్యానికి కళ్లెంవేస్తున్న వైనం

సాక్షి, అమరావతి: ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుండటంతో రాష్ట్రంలో ఎల్లో సిండికేట్‌ బెంబేలెత్తుతోంది. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో వరుసగా రెండోసారి టీడీపీ ఓటమి ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావుల కాళ్ల కింద భూమి కంపిస్తోంది. తమ రాజకీయ జీవితానికి ముగింపు కార్డు పడిందని చంద్రబాబుకు.. తమ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుందని రామోజీరావుకు భయం పట్టుకుంది.

తమ భవి­ష్యత్తు సినిమా కళ్ల ముందు కనిపిస్తోంది. ఫలితంగా దింపుడు కళ్లెం ఆశతో విద్వేష కథనాలు అల్లుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా విషం చిమ్ముతున్నారు. ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్‌(ఈసీ) అధికార పరిధినీ ప్రశ్నిస్తూ కట్టుకథలతో ‘ఈనాడు’ పత్రిక చెలరేగిపోతోంది. ఎన్నికల విధి నిర్వహణ­లో ఉన్న పోలీసు, అధికార యంత్రాంగాన్ని బ్లాక్‌­మెయిల్‌ చేయాలని పన్నాగం పన్నింది.

మొన్న ఐపీఎస్‌ అధికారుల పోస్టింగులను ప్రశ్నిస్తూ ఈసీనే బ్లాక్‌ మెయిల్‌ చేసేందు­కు యత్నించిన ఈనాడు.. తాజాగా డీఎస్పీలు, సీఐ­లు, ఎస్సైలే లక్ష్యంగా అబద్ధాలను వల్లెవేసింది. ‘వైకాపా కోడ్‌ నడు­స్తోంది’ అంటూ బుధవారం ఓ విష కథనాన్ని వండి వార్చింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది.

పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం 
తాజాగా ఈనాడు రామోజీరావు క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించే పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని దు్రష్పచార కుట్రకు తెరతీశారు. ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్‌మెయిల్‌ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్నది పచ్చ కుట్ర. ఇటీవల రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు పత్రిక వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు.

తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఇటువంటి ఘటనలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం యావత్‌ పోలీసు యంత్రాంగం ఈసీ మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహిస్తోంది. ఈ వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ వైఎస్సార్‌ సీపీ నేతల ఆదేశాల ప్రకారం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని కట్టుకథలను ఈనాడు ప్రచారంలోకి తీసుకువస్తోంది.

టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకున్నా సరే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండాలి అన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. నిజంగా పోలీసులు ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈసీ విచారించి తగిన చర్యలు తీసుకుంటుంది. కానీ చంద్రబాబుగానీ ఈనాడు రామోజీరావుగానీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పోలీసులు నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నారు.

అందుకే ఈనాడు పత్రిక ద్వారా పోలీసు అధికారులపై దు్రష్పచారానికి పాల్పడుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో పని చేసే పోలీసు అధికారులను బెదిరించి టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్నది చంద్రబాబు, రామోజీ లక్ష్యం. కానీ వారి కుట్రలను తిప్పికొడుతూ ఈసీ నిబంధనల మేరకు సక్రమ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది.

మొన్న ఐపీఎస్‌లపై అక్కసు బెడిసికొట్టి.. 
చంద్రబాబు హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చలామణి అయిన రామోజీరావు ప్రస్తుతమూ తన మాటే శాసనం అనేట్టుగా ఉండాలని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నదీ ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అని.. రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సాగుతుందని గానీ గుర్తించేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. తాను చెప్పిన అధికారులనే ఎస్పీలుగా నియమించాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

అందుకు విరుద్ధంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఇటీవల ఎన్నికల కమిషన్‌ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించడంతో ఆయన చిందులు తొక్కారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ ఈనాడు పత్రికలో విద్వేష కథనాన్ని ప్రచురించారు. దీనిపై యావత్‌ పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించడం విశేషం. ఏకంగా 13 మంది ఐపీఎస్‌ అధికారులు సంతకాలు చేసి మరీ టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఈనాడు పత్రికను అడ్డంపెట్టుకుని పోలీసు వ్వవస్థను, ఈసీని బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు యత్నిస్తున్నాయన్న వాస్తవం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఈసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశాలు ఉండటంతో రామోజీరావు తోక ముడిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ నోళ్లు కూడా మూతపడ్డాయి. కానీ అధికారయంత్రాంగం ఆత్మస్థైర్యం దెబ్బతీసే కుతంత్రాలు మాత్రం ఆపలేదు.

Advertisement
Advertisement