
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి పదివేల లేఅవుట్లను గుర్తించామని, ఈ లేఅవుట్లలో ఉపాధి హామీ కింద అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన గురువారం ఉపాధి హామీ మండలి సమావేశం నిర్వహించారు. పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్, డైరెక్టర్ (ఇజీఎస్) చిన్నతాతయ్య, వాటర్షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఉపాధి హామీ మండలి (ఎస్ఇజిసి) సభ్యులు హాజరయ్యారు. (చదవండి: ‘ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి’)
రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకమని, ఇతర రాష్ట్రాల్లో ఉపాధి హామీ ఏ రకంగా జరుగుతుందో మండలి సభ్యులు పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయించబోతున్నాం. నూరు శాతం ఉపాధి హామీ నిధులతోనే పనులు చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్ క్లినిక్, ఆర్బీకే, నాడు-నేడు, సచివాలయ భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని’’ అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి హామీ కింద ఈ నాలుగు రకాల పనులను అక్టోబర్ నెల నాటికి పూర్తి చేస్తే నియోజకవర్గానికి ఇంకా అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..)
Comments
Please login to add a commentAdd a comment