
సాక్షి, అమరావతి: విశాఖ, పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గడువును ప్రభుత్వం వచ్చే నెల 28 వరకూ పొడిగించింది. జిల్లాలో భూ రికార్డులు ట్యాంపరింగ్ చేశారని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని, రికార్డులు మాయం చేశారంటూ వచ్చిన అభియోగాలపై లోతైన దర్యాప్తు నిమిత్తం 2019 నవంబర్ 17న ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతేడాది ఫిబ్రవరి 12న సిట్ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. కరోనా, లాక్డౌన్ కారణంగా తమ బృందం గతేడాది మార్చి 15వ తేదీ వరకే పని చేసిందని, అనంతరం గతేడాది జూన్ 10 నుంచే పని ప్రారంభించిందని సిట్ చైర్మన్ ప్రభుత్వానికి నివేదించారు. మిగిలిన రికార్డులను పరిశీలించి, నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని సిట్ చైర్మన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిట్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment