
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ స్కామ్లో అరెస్టయిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా)
టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ భారీ స్కామ్లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment