
లోగోను ఆవిష్కరిస్తున్న మంత్రి అమర్నాథ్
బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ పాలసీతో కంపెనీల స్థాపన మరింత సులభతరం కానుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ఏర్పాట్లు తదితర అంశాలపై పల్సస్ గ్రూప్ లిమిటెడ్ సీఈవో గేదెల శ్రీనుబాబు నేతృత్వంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు.
వచ్చే ఏడాది కాలంలో విశాఖకి పలు ఐటీ దిగ్గజ కంపెనీలు రానున్నాయని చెప్పారు. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపె నీలకు తెలియజేసే ఉద్దేశంతోనే జనవరి నుంచి ఏప్రిల్ వరకు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులతో పాటు గ్లోబల్ టెక్ సదస్సును విశాఖలో నిర్వహిస్తున్నామని వివరించారు.
జనవరి 6,7,8 తేదీల్లో విశాఖలో హెల్త్ సమ్మిట్ జరగబోతుందని, అదే నెల 20, 21 తేదీల్లో ఇన్ఫినిటీ ఐటీ సదస్సు జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జీ 20 సదస్సు, మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు విశాఖలోనే నిర్వహిస్తున్నామని తెలి పారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు, గ్లోబల్ టెక్ సమ్మిట్ ద్వారా పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు, భారీ పరిశ్రమలు విశాఖకు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఒకటి, రెండు నెలల్లో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, అమెజాన్ త్వరలోనే విశాఖలో అడుగుపెట్టబోతుందని, హెచ్సీఎల్ విశాఖ, తిరుపతి, కాకినాడ, గుంటూరులో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిందని గుర్తుచేశారు. ఐటీ రంగానికి చెందిన యాంకర్ యూనిట్లు విశాఖకు వస్తే, ఐటీ హబ్గా పేరొందిన పలు నగరాల సరసన విశాఖ కూడా నిలుస్తుందన్నారు. విశాఖలో వాతావరణం కూడా ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో కూడా ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర పది రంగాలకు చెందిన పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి విశాఖలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తామన్నారు. త్వరలో ఎంఎస్ఎంఈలతోపాటు ఐటీ ఇన్సెంటివ్లను కూడా విడుదల చేస్తామని చెప్పారు.
గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ గ్లోబల్ టెక్ సమ్మిట్కు 1,000 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందన్నారు. ఈ సమ్మిట్కు సంబంధించి ఇప్పటికే భువనేశ్వర్, ఢిల్లీ, హైదరాబాద్లో రోడ్ షోలు నిర్వహించామని చెప్పారు. జీ 20 దేశాలలో కూడా ఈ సదస్సు ప్రాధాన్యత వివరించి ఐటీ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించనున్నామని తెలిపారు.
జీవీఎల్కు విభజన హామీల మీద చర్చించే ధైర్యం ఉందా..
రాష్ట్ర విభజన హామీల అమలుపై చర్చించే ధైర్యం బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుకు ఉందా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఇ వ్వాల్సిన ప్రాజెక్ట్లు, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని దా నికి జీవీఎల్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జీవీ ఎల్ను నాయకుడిగా బీజేపీ వాళ్లే గుర్తించడం లేదన్నారు. 2024 నాటికి జీవీఎల్ ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment