![Increased grid power consumption - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/20/fact.jpg.webp?itok=swpkg9Lr)
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు నిరంతరం కోతలు లేకుండా సరఫరా చేయడం కూడా తప్పే అన్నట్లుగా ఉంది రామోజీ తీరు చూస్తుంటే. ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం.. దానివల్ల విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిన విషయం కళ్లకు కనిపిస్తున్నా ఆయన ఇవేమీ పట్టనట్లు అడ్డగోలుగా రాసిపారేస్తూ జనం మెదళ్లను కలుషితం చేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు.
ఈ పెరుగుదల వ్యవసాయ, గృహ విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా.. ‘ప్రజలపై మరో రూ.1,723 కోట్ల భారం’ అంటూ ఆదివారం ఈనాడు పెట్టిన రంకెల్లో ఎప్పటిలాగే ఏమాత్రం పసలేకపోగా అదంతా పూర్తి ఊహాజనితమని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ. పృథ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు కొట్టిపడేశారు. ఈ మేరకు వారు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..
వర్షాభావంతో అదనంగా వినియోగం..
నిజానికి.. ఈ ఏడాది వాతావరణంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితులవల్ల వర్షాభావం, తీవ్ర ఎండ, ఉక్కపోతతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ పెరుగుదల వ్యవసాయ విద్యుత్ రంగంలోను, గృహ విద్యుత్ రంగంలోను స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు వినియోగం దాదాపు 10–31 శాతం వరకు ప్రతి నెలా అదనంగా నమోదవుతోంది.
అలాగే, గతేడాది మార్చి నుంచి అక్టోబరు కాలానికి జల విద్యుదుత్పత్తి దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు ఉంటే ఈ సంవత్సరం అది కేవలం 1,260 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. ఇది దాదాపు 60 శాతం తక్కువ. సాధారణంగా ఏటా వినియోగం 7–8 శాతం వరకూ పెరగవచ్చని భావించి ముందస్తు విద్యుత్ సేకరణ ప్రణాళిక తయారుచేస్తారు. కానీ, డిమాండ్ అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడం, దీర్ఘకాలిక వనరులనుంచి లభ్యత అనుకున్నంత రాకపోవడంవల్ల విద్యుత్ కొనుగోళ్లు అనివార్యమయ్యాయి.
సర్కారు ముందుచూపు..
ఇలా నెలవారీ విద్యుత్ డిమాండ్లో మునుపెన్నడూ లేనంత పెరుగుదలను గమనించి రాబోయే 7నెలల కాలానికి (సెపె్టంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు) వెయ్యి మెగావాట్ల కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని డీప్ ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా ఆగస్టులోనే టెండర్లు ఆహ్వానించారు.
ఈ ప్రక్రియలో రివర్స్ ఆక్షన్ కూడా పూర్తయ్యాక మనకు కావలసిన విద్యుత్ పరిమాణం లభించేంత వరకు అంటే బిడ్లలో పిలిచిన వెయ్యి మెగావాట్ల వరకు నిబంధనల ప్రకారం వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, ట్రేడర్లకు కొనుగోలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నెలలో మొత్తంగా ఒకశాతం వరకు విద్యుత్ కొనుగోలును తగ్గించుకునే అవకాశం ఈ టెండర్లలో ఉంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా నిబంధనలకు లోబడి చేపట్టారు. ఎవరైనా సరే ఈ వివరాలు పోర్టల్ వెబ్సైట్ ద్వారా కానీ, దరఖాస్తు ద్వారా కానీ పొందవచ్చు.
పరిమితులు, నియంత్రణ లేవు
ఇక స్వల్పకాలిక కొనుగోళ్లకు సంబంధించి ప్రతీ యూనిట్కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి ఉంది. మండలి నిర్దేశించిన ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు నిబంధన నియమావళి ప్రకారం.. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి ఈ అదనపు వ్యయం సర్దుబాటు ఏదైనా ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం పూర్తయ్యాక విద్యుత్ కొనుగోలులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి జరిగిన అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయం లెక్కించి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతారు.
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం విద్యుత్కు కటకటలాడుతుండగా రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం వినియోగదారులకు ఎలాంటి వినియోగ పరిమితి, నియంత్రణలు అమలుచేయకుండా వారి డిమాండ్కు తగినట్లుగా సరఫరా చేస్తున్నాయి. కానీ, రామోజీకి ఇవన్నీ తెలియనివి ఏమీకాదు. తన ఆత్మబంధువు చంద్రబాబును ఉన్నపళంగా సీఎం కుర్చిలో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం. అందుకే రోజూ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తన విషపుత్రిక ఈనాడులో నిత్యం విషం కక్కుతున్నారు. అంతే..!
ఇవ్వకపోతే అలా.. ఇస్తే ఇలానా రామోజీ..?
ఎప్పుడైనా ఒకసారి కరెంట్ ఇవ్వకపోతే కోతలు ఎక్కువైయ్యాయంటూ గగ్గోలు పెడతారు. అదే నిరంతరాయంగా సరఫరా చేస్తే అధిక మొత్తం పెట్టి కొనేస్తున్నారంటూ నానా యాగీ చేస్తారు. ఇదెక్కడి నీతి రామోజీ. నిజానికి.. మార్కెట్లో విద్యుత్ రేటు ఎంత ఉంటే అంతకు కొనితీరాల్సిందే.
ఏ రాష్ట్రానికైనా ఇదే పరిస్థితి. ఎక్కువ రేటు, తక్కువ రేటు అన్నది మన చేతిలో ఉండదు కదా.. అవసరమైనప్పుడు ఎవరైనా మార్కెట్ రేటును చెల్లించి కొనాల్సిందే.. అదే అవసరంలేనప్పుడు ఎవరూ కొనరు. టెండర్లు కూడా చాలా పారదర్శకంగా నిర్వహిస్తారు. మన ఒక్కరి కోసం రేట్లు పెంచడం లేదా తగ్గించడం అనేది ఉండదు. ఇదంతా మీకు తెలీదా!? చంద్రబాబు అధికారంలో లేడన్న ఒకే ఒక్క కారణంతో ఇంత అడ్డగోలుగా.. దారుణంగా పిచ్చి రాతలు రాసిపారేస్తారా ఏంటి రామోజీ..?
22% పెరిగిన గ్రిడ్ విద్యుత్ వినియోగం
రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, ఆదేశాల ప్రకారం.. ఇంతటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలనే భావనతో, స్వల్పకాలిక మార్కెట్లో నిబంధనలకు లోబడి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత నవంబరులో కూడా రికార్డు స్థాయిలో రోజువారీ విద్యుత్ వినియోగం 220 మిలియన్ యూనిట్ల వరకు నమోదవుతోంది. కిందటి ఏడాది నవంబరులో ఇదే కాలానికి సరాసరి విద్యుత్ వినియోగం దాదాపు 180 మిలియన్ యూనిట్లుగా వుంది.
అలాగే, కిందటి సంవత్సరంతో పోలిస్తే గ్రిడ్ విద్యుత్ వినియోగం పెరుగుదల దాదాపు 22 శాతం. ఈ పరిస్థితుల్లో కూడా రోజుకి దాదాపు 50 మిలియన్ యూనిట్లను స్వల్పకాలిక మార్కెట్ నుండి కొనాల్సి వస్తోంది. ఇందులో దాదాపు 20 మిలియన్ యూనిట్లు ఆగస్టులో చేపట్టిన టెండర్ల ప్రక్రియ ద్వారా సమకూరుతోంది. ఇలా దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత పరిస్థితుల కారణంగా వాటిని అధిగమించడానికి తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ముందస్తుగా ఈ స్వల్పకాలిక ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి.
రోజువారీ వివిధ వనరుల నుంచి అందుబాటులో వున్న విద్యుత్ను గ్రిడ్ డిమాండ్కు అనుగుణంగా డిస్కంలు బేరీజు వేసుకుంటున్నాయి. గ్రిడ్ డిమాండ్ బాగా పడిపోయిన రోజుల్లో రోజువారీగా దాదాపు 50శాతం వరకు విద్యుత్ సేకరణ నిలుపుదల, బ్యాక్డౌన్ చేసి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. విద్యుత్ ఎక్సే్చంజీల్లో విద్యుత్ కొంటే ఈ బ్యాక్డౌన్ సౌకర్యం అందుబాటులో ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment