
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న శాసనమండలి సమావేశంలో గురువారం శాంతిభద్రతలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మండలిలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థీకృతమైన మార్పులు తేవాలని పదేపదే చెబుతూ ఉంటారన్నారని చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదాలు చూడని వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అన్నారు. సంక్షేమంతో పాటు సంరక్షణ కూడా ముఖ్యమని భావించే ముఖ్యమంత్రి ఆయన అన్నారు. నెల్లూరు అబ్దుల్ సలాం ఘటన బాధాకరమన్నారు.
సలాం ఘటన జరగగానే తమ ప్రభుత్వం వెంటనే స్పందించిందని, ఈ కేసులో ఓ పోలీసు అధికారిని కూడా అరెస్టు చేశారన్నారు. అయితే ఇలాంటి ఘటనలలో పోలీసులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఎక్కడా జరగలేదని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ముస్లిం యువకులుపై దేశద్రోహం కేసులు పెట్టారని తెలిపారు. తమ ప్రభుత్వం లౌకికవాదానికి కట్టుబడి ఉందని, దళితులు, మైనార్టీలు, మహిళలపైన దాడి జరిగితే తమ ప్రభుత్వం సహించదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.