
శ్రీవారి ఆలయంలో చక్రస్నానం నిర్వహిస్తున్న అర్చకులు
తిరుమల: తిరుమలలో నిర్వహిస్తున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ధ్వజావరోహణంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఆది వారం ఉదయం శ్రీవారికి చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉ. 6 నుంచి 9 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని అయినమహల్ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అయినమహల్ ముఖమండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి స్నానం చేయించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ‘షోడశదిన సుందరకాండ దీక్ష’
ఈ నెల 29 నుంచి అక్టోబర్ 14 వరకు తిరుమలలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష జరగనుంది. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 14 వరకు తిరుమలలోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ దీక్ష జరగనుంది. ఇందుకుగాను సెప్టెంబర్ 28న రాత్రి 7 గంటలకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ చేయనుంది. లోక కల్యాణార్థం 16 రోజుల పాటు నిష్ణాతులైన వేద పండితులతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఘనంగా రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు
శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దజీయర్ మఠం స్థాపించి 900 ఏళ్లు అయిన సందర్భంగా తిరువేంగడ రామానుజ జీయర్ తిరు నక్షత్రోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.