
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. 986 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుని రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
తొలిసారిగా ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీతోపాటు బెటర్మెంట్ పరీక్షను కూడా బోర్డు నిర్వహిస్తోంది. ఎస్సెస్సీ రెగ్యులర్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తుండటంతో మార్కులు పెంచుకునేందుకు ఈ బెటర్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 2,07,160 మంది, బెటర్మెంట్ పరీక్షలకు 8,609 మంది హాజరుకానున్నారు.
ఇంతకుముందు పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలు, ఇతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సెస్సీ బోర్డు అనేక జాగ్రత్తలు చేపట్టింది. అన్ని కేంద్రాలను నోఫోన్ జోన్లుగా ప్రకటించింది. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. డిజిటల్ డివైజ్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పోలీసులతో కూడిన మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటుచేసింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment