
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 6కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (ఆదివారం) 70,338 మంది స్వామివారిని దర్శించుకోగా 22,741 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.96 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
మే నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 22న వర్చువల్ సేవల కోటా విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
ఫిబ్రవరి 23న అంగప్రదక్షిణం టోకెన్లు….
మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఫిబ్రవరి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల
తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
ఫిబ్రవరి 27న శ్రీవారి సేవ కోటా విడుదల
ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.