బాబు మోసాలపై ప్రజాగ్రహం: వైఎస్‌ జగన్‌ | YS Jagan On Chandrababu Govt in Meeting with party leaders | Sakshi
Sakshi News home page

బాబు మోసాలపై ప్రజాగ్రహం: వైఎస్‌ జగన్‌

Published Fri, Oct 4 2024 4:03 AM | Last Updated on Fri, Oct 4 2024 10:19 AM

YS Jagan On Chandrababu Govt in Meeting with party leaders

పార్టీ నేతలు, జెడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్‌ జగన్‌

తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోనూ చర్చ మొదలైంది

కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా వార్షిక బడ్జెట్‌ లేదు

పథకాలకు కేటాయింపులపై నిలదీస్తారనే భయంతోనే.. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌తో చంద్రబాబు కాలయాపన

సూపర్‌ సిక్స్‌ హామీల అమల్లో విఫలం.. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్థం.. ప్రతిదీ స్కామే

కేసులకు మనం భయపడాల్సిన అవసరం లేదు.. ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం

మళ్లీ వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే  

వైఎస్సార్‌సీపీ – టీడీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరి వల్ల మంచి జరిగిందన్నది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు మోసాలవుతాయి.. ఆ మోసాలపై ప్రజలకు రోజురోజుకూ ఆగ్రహం పెరుగుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. ఇప్పటి ఫలితాలు పూర్తిగా తారుమారు అవుతాయి.  
– వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా సీఎం చంద్రబాబు కనీసం వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దేశం, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం ఇంతవరకు రెగ్యులర్‌ బడ్జెట్‌ పెట్టలేదని, ఇంకా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పైనే కాలం గడుపుతోందని విమర్శించారు. 

రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే ఏయే స్కీమ్‌కు ఎంత కేటాయించారన్నది చెప్పాల్సి ఉంటుందని.. అలా చెప్పకుంటే ప్రజలు తిడతారనే భయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల పార్టీ నాయకులు, జెడ్పీటీసీలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పార్టీ మారినా, జెడ్పీటీసీలు కలసికట్టుగా నిలబడ్డారని ప్రశంసించారు. 

జెడ్పీటీసీల పోరాట స్ఫూర్తికి అభినందనలు తెలిపారు. ‘రాజకీయాల్లో మీరు విలువలు, విశ్వసనీయత చూపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 48 జెడ్పీటీసీల్లో మన పార్టీ తరఫున 46 మంది గెలిచాం. అందులో ఒకరు ఎమ్మెల్సీ కావడంతో 45 మంది మిగిలారు. కలసికట్టుగా నిలిచిన జెడ్పీటీసీలందరికీ ధన్యవాదాలు. మీ వ్యక్తిత్వం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది..’ అని అభినందించారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే...  

సమావేశానికి హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు  

సమస్యలున్నా మేం వెనక్కి తగ్గలేదు  
మన ఐదేళ్ల పాలనలో ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాం. రాజకీయాల్లో మేనిఫెస్టో అన్నదానికి ఒక నిర్వచనం ఇచ్చాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి తు.చ. తప్పకుండా తొలి రోజు నుంచే అమలు చేశాం. ఎలాంటి సాకులు వెతుక్కోలేదు. రెండేళ్లు కోవిడ్‌ లాంటి సమస్యలు ఎదుర్కొన్నా.. రాష్ట్రానికి ఆదాయాలు తగ్గినా ఎక్కడా ప్రజలకు చేయాల్సిన పనుల్లో మనం వెనక్కి తగ్గలేదు. 

అదే కారణాలు చెప్పాల్సి వస్తే.. మన ప్రభుత్వంలో వచ్చినన్ని కష్టాలు ఎక్కడా, ఎవరూ చూసి ఉండరు. చాలా మంది నా దగ్గరకు వచ్చి.. ఇన్ని కష్టాలున్నప్పుడు, ఆ కారణాలు చెప్పొచ్చు కదా? అని అన్నారు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మేనిఫెస్టోను అమలు చేయవచ్చని కూడా చెప్పారు. అయితే మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోను ఇచ్చాం. ప్రజలు మనకు ఓటేశారు. మనం ప్రజలకిచ్చిన మాట మరో 30 ఏళ్ల పాటు మన బాటను నిర్దేశిస్తుంది. 

ఎన్ని కష్టాలున్నా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని చిరునవ్వుతో నెరవేర్చాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్‌ కన్నా ముందే ప్రతి పథకానికి సంబంధించి  క్యాలెండర్‌ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో ముందే చెప్పాం. చెప్పినట్లుగా ఆ నెలలో బటన్‌ నొక్కి నేరుగా డబ్బులు విడుదల చేయడం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు.   

సమావేశానికి హాజరైన ఏలూరు జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు 

అబద్ధాల్లో అస్సలు పోటీ పడలేదు
ఐదేళ్ల పాలనా కాలంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఆ మంచి ఇంకా బతికే ఉంది. ‘జగన్‌ మంచే చేశాడు... ఎక్కడా చెడు చేయలేదు’ అన్న మాటే ప్రతి చోటా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుతో మనం అస్సలు పోటీ పడలేదు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు చంద్రబాబులా జగన్‌ కూడా హామీలు ఇవ్వాలని చాలా మంది ఆశించారు. 

పిల్లలు కనిపిస్తే చంద్రబాబులా.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. చెల్లెమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, 50 ఏళ్లు నిండిన పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని జగన్‌ కూడా చెబుతాడని ఆశించారు. మెడలో కండువాలతో రైతులు కనిపిస్తే.. నీకు రూ.20 వేలు అని జగన్‌ చెబుతాడని ఆశించారు. 20 ఏళ్లు దాటిన యువత కనిపిస్తే నీకు రూ.36వేలు అని చంద్రబాబు మాదిరిగా జగన్‌ కూడా చెబుతాడని ఆశించారు. కానీ జగన్‌ అలా చెప్పలేకపోయాడు.  



ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం.. 
ఒకవేళ జగన్‌ అవే మాటలు చెప్పి ఉంటే.. అధికారంలోకి వచ్చి ఉండే వాళ్లమేమో! కానీ ఇవాళ పరిస్థితులను మీరంతా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు కనీసం బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఇచ్చిన మాట ఏ ఒక్కటీ నెరవేర్చని పరిస్థితి కనిపిస్తోంది. 

మరి నేను కూడా అదే మాదిరిగా చేసి ఉంటే.. మీలో ఏ ఒక్కరైనా తలెత్తుకుని గ్రామాల్లోకి వెళ్లగలిగేవారా? మా జగన్‌ ఇది చెప్పాడు..! కానీ మా ప్రభుత్వంలో ఇది చేయలేకపోతున్నామనే మాట చెప్పాల్సి వస్తే.. మిమ్మల్ని  ప్రజలు ప్రశ్నిస్తే తట్టుకునేవారా? అందుకే.. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వసనీయత, విలువలు లేకపోతే ప్రజల్లో చులకన అవుతాం. మనం ఎప్పుడూ తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ఇకపై కూడా అలాంటి రాజకీయాలే చేస్తాం.   

కష్ట కాలంలోనే వ్యక్తిత్వం బయట పడుతుంది 
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు నమోదు అవుతాయి. వేధింపులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు తోడుగా, అండగా ఉండాలి. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా న్యాయపరమైన సహాయం చేయడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను  ప్రశ్నించాలి. 

రాజకీయాల్లోనూ చీకటి తర్వాత మళ్లీ పగలు వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించామన్నది రాజకీయాల్లో మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. కష్ట కాలంలోనే ఒక మనిషి వ్యక్తిత్వం బయట పడుతుంది. కష్టం వచ్చినప్పుడు ఒక మనిషి గట్టిగా నిలబడగలిగితే తనకు దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటాయి. అప్పుడే తను ఒక నాయకుడిగా ఎదుగుతాడు. ఇది రాజకీయాల్లో చాలా ముఖ్యమైన అంశం.  

వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే
ప్రజల తరపున మనం ఉద్యమించాలి. ప్రజల కష్టాల్లో భాగస్వాములు కావాలి. కేసులు పెడతారని భయపడొద్దు. కేసులు పెడితే ఏమవుతుంది? నన్ను 16 నెలలు జైలుకు పంపించారు. నన్ను వేధించినట్టుగా ఎవరినీ వేధించి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. మళ్లీ బయటకు వచ్చి ప్రజలకు అండగా నిలబడ్డాం. 

ముఖ్యమంత్రిని కూడా అయ్యా. కేసులు పెట్టడం మినహా ఇంతకన్నా ఏం చేయగలుగుతారు? రెడ్‌ బుక్‌ పెట్టడం ఏమన్నా పెద్ద పనా? అదేమన్నా గొప్ప విషయమా? న్యాయం, ధర్మం కచ్చితంగా ఉండాలని మన ప్రభుత్వంలో తాపత్రయ పడ్డాం. అందుకే ఈ మాదిరిగా పరిపాలన చేయలేదు. ఇవాళ రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోంది. ధైర్యంగా, కలిసికట్టుగా పోరాడుతూ ఉద్యమిద్దాం. కచ్చితంగా.. వచ్చేది మన ప్రభుత్వమే.  

అంతులేని అవినీతి.. పచ్చ నేతలకే మద్యం షాపులు  
ఇక ప్రభుత్వ అవినీతి గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. పేరుకు ఉచిత ఇసుక అంటూ వైఎస్సార్‌ సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా అధిక ధరకు అమ్ముతున్నారు. స్టాక్‌ పాయింట్లలో ఇసుక మాయం అవుతోంది. 

ఇక మద్యం పరిస్థితి కూడా అంతే. ప్రజలు బాగు పడాలని, వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. వినియోగం తగ్గాలని మనం తాపత్రయ పడ్డాం. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్‌ అమ్మాలి అనే ధోరణితో వెళ్తోంది. 120 రూపాయల మద్యం క్వాలిటీ బాగుంటుందా?. లేక 99 రూపాయల మద్యం బాగుంటుందా? రూ.99కే మద్యం సరఫరా చేసి అమ్మకాలు పెంచుతామంటున్నారు. అలా అమ్మకాలు పెంచితే డిస్టిలరీస్‌ చంద్రబాబుకు డబ్బులిస్తాయి. 

ప్రతి దాంట్లోనూ స్కామే. అధికార పార్టీ నేతలకే మద్యం షాపులు కట్టబెడుతున్నారు. ఈ షాపుల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వాటాలు సరేసరి. ఇక  ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపులు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. మట్కా  లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. దీన్ని ప్రశ్నిస్తూ ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే రివర్స్‌లో వారి మీదే దొంగ కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ప్రతి వ్యవస్ధ పూర్తిగా దిగజారి పోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోంది.

వేధింపులు అడ్డుకోలేవు..  పార్టీ అండగా ఉంటుంది 
రాజకీయాలలో ఎప్పుడూ చీకటే ఉండదు. వెలుగు కూడా వస్తుంది. ప్రజల తరపున పోరాటాలు చేయండి. ఇందులో వెనుకడుగు వేయాల్సిన పనిలేదు. చంద్రబాబు వేధింపులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ వేధింపులు, కేసులు తాత్కాలికం మాత్రమే. ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుంది. ఇంత వేగంగా వ్యతిరేకత మూట గట్టుకుంటున్న ప్రభుత్వం మీద ప్రజల తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. 

కేసులు పెడతారని ఎవరూ భయపడొద్దు. దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నాడు అనేందుకు తిరుపతి లడ్డూ వ్యవహారమే ఒక ఉదాహరణ. దారుణమైన అబద్ధాలతో విష ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన్‌ కళ్యాణ్‌.. అంతా కలిసి గోబెల్స్‌ ప్రచారం చేశారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి, దాన్ని మార్కెటింగ్‌ కూడా చేసి అమ్మేయగల సమర్ధుడు. అందుకే దేవుడు చంద్రబాబు పాపాలకు మొట్టికాయలు వేశాడు.

సూపర్‌ సిక్స్, సెవన్‌ ఏమయ్యాయి?
జగన్‌ పలావు పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదు కదా.. చివరకు ఉన్న పలావు కూడా పోయింది. ఇవాళ ప్రతి ఒక్కరూ సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. చదువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యాదీవెన, వసతి దీవెన పోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందని దుస్థితి. మూడు క్వార్టర్లు గడిచిపోయినా ఫీజుల్లేవు. డిగ్రీ, ఇంజనీరింగ్‌ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు.    

ఇంగ్లీషు మీడియం చదువులు అటకెక్కాయి. టోఫెల్‌ గాలికెగిరిపోయింది. రోజుకొక మెనూతో అమలయ్యే గోరుముద్ద కార్యక్రమాన్ని నీరు గార్చారు. వైద్య రంగం పూర్తిగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.2 వేల కోట్లకు పైగా పెండింగ్‌లో ఉండగా ఆరోగ్య ఆసరా అటకెక్కింది. ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టిన 17 కొత్త మెడికల్‌ కాలేజీల్లో మన హయాంలో ఐదు వచ్చాయి. మరో 5 కొత్త మెడికల్‌ కాలేజీలకు సీట్లు వస్తే వద్దని ఇప్పుడు అడ్డుకున్నారు. 

కడుతున్న కొత్త కాలేజీల నిర్మాణాన్ని ఆపేశారు. అవి కూడా అమ్మేస్తామంటున్నారు. 104, 108 ఉద్యోగులకు చంద్రబాబు వచ్చిన తర్వాత జీతాల్లేవు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ (గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌), డబ్ల్యూహెచ్‌ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ప్రమాణాలతో మందులు సరఫరా చేస్తే ఇప్పుడు అవి ఏమయ్యాయో తెలియదు. మనం స్పెషలిస్టు డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటే.. ఇవాళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారి కొరత స్పష్టంగా కనిపిస్తోంది. 

వ్యవసాయ రంగంలో పెట్టుబడి సాయం దేవుడెరుగు.. ఉచిత ఇన్సూరెన్స్‌ కూడా లేదు. ఆర్బీకేలు అటకెక్కాయి. ఈ–క్రాప్‌ సక్రమంగా నమోదు చేయలేదు. మన హయాంలో పథకాలు డోర్‌ డెలివరీ జరిగితే ఇవాళ అది గాలికెగిరిపోయింది. ఇప్పుడు అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అక్క నుంచి పంపిణీ చేస్తున్నారు. ప్రజలు అక్కడికే వెళ్లాలట. రెండు నెలలు అక్కడికి వెళ్లకపోతే పథకాలు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల పెన్షన్లు నిలిపివేశారు. ప్రతి అడుగులోనూ ఇదే జరుగుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement