
సాక్షి, విజయవాడ: బీసీలకు సామాజిక న్యాయం చేసిన ఘనత సీఎం జగన్దే అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
బీసీలకు సీఎం జగన్ చేసిన న్యాయం మరెవరూ చేయలేదు. అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. తద్వారా సామాజిక న్యాయం పాటించారు. బీసీలకు ఒక గుర్తింపు ఇచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ తరపున ఆర్.కృష్ణయ్య లాంటి బీసీ నాయకుడిని రాజ్యసభకు పంపాం. సామాజిక సాధికారతకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్దే అని సజ్జల పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఏనాడూ బీసీలను పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ బీసీల ఆకాంక్షలకు పెద్దపీట వేశారు. విద్య, వైద్యమే ఏ కుటుంబానికైనా అతిముఖ్యం. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఆర్థికంగా నిలబడేందుకు అన్ని వర్గాలకు అండగా నిలిచాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నాం. మూడున్నరేళ్ల కిందట రాష్ట్రం ఎలా ఉండేదో.. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ఎలా ఉందో ఆలోచించాలి అని ప్రజలకు సజ్జల పిలుపు ఇచ్చారు.
ఇంకా ఏమన్నారంటే..
బీసీలకి వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ వైఎస్సార్ సీపీ. పద్నాలుగేళ్లు చంద్రబాబు అధికారంలో ఉండి బీసీలకు ఏమి చేయలేదు. కానీ, గడిచిన మూడున్నరేళ్లలో బీసీల జీవితాలలో మార్పు వచ్చింది. ఈ జన సంక్షేమ ప్రభుత్వంపై ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో అసమానతలను తొలగించాం. జాతీయ పార్టీలో ఉండి కూడా దివంగత మహానేత వైఎస్సార్ బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
బీసీల తలరాతలను వారే మార్చుకునేలా సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఇక విదేశీ విద్యలోను గత ప్రభుత్వం వివక్ష చూపింది.అందరికి ఇవ్వలేదు. కొందరికే ఇచ్చి చేతులు దులుపుకుంది. విదేశాల్లో టాప్ 100 యూనివర్సిటీలో అవకాశాలు దక్కించుకున్న విద్యార్ధులకి వాళ్ల వాళ్ల విద్యకు అయ్యే ఖర్చును మొత్తం మా ప్రభుత్వమే(వైఎస్సార్సీపీ) భరిస్తుంది. గతంలో 4 లక్షల మంది ఉద్యోగాలుంటే.. నేడు ఆ సంఖ్య ఆరు లక్షలకి పైగా పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తర్వాత అధిక శాతం నాయకత్వం బిసిలకే కట్టబెట్టాం. 2029 నాటికి వైఎస్సార్సీపీలో టిక్కెట్లకోసం బీసీల నుంచే ఎక్కువ పోటీ ఉండబోతోంది. సంక్షేమ పథకాలు కొనసాగలంటే సీఎం జగన్ మళ్లీ గెలవాలి. 175 స్థానాల్లో వైసీపీ గెలవడం అంటే బీసీల విజయంగా భావించాలి. ఆర్థిక పరిస్థితి బాగోకపోయిన సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ ది. అందమైన భవిష్యత్ కోసం సీఎం వైఎస్ జగన్కి చేయూతనివ్వాలి.. మళ్లీ ఆయన్ని గెలిపించాలి అని ప్రజలను కోరారు సజ్జల
ఇదీ చదవండి: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు!
Comments
Please login to add a commentAdd a comment