
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న డీబీటీ పద్ధతి కరోనా సమయంలో మంచి ఫలితాలను ఇచ్చిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో పేదలకు ప్రభుత్వ సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చేరిందని చెప్పారు. తాడేపల్లిలో సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దళారులు, అవినీతికి తావులేని టెక్నాలజీయే ఏపీ సర్కారు ఆయుధం అని ఆయన చెప్పారు.
ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆర్థికంగా కుంగిపోయిన సామాన్యులను ఆదుకోవడం, సంక్షేమ పథకాల వల్ల ప్రత్యక్షంగా వారికి మేలు చేయాలనే ఉద్దేశం సీఎం జగన్ ప్రభుత్వం ప్రధాన అజెండా అన్నారు. నవరత్నాలు సహా అనేక సంక్షేమ పథకాల అమలుకు డీబీటీ విధానం అక్కరకొచ్చిందని తెలిపారు. వలంటీర్లతో పాటు సచివాలయ వ్యవస్థ పాలనలో పారదర్శకత తీసుకొచ్చిందన్నారు. గ్రామంలో, వార్డు స్థాయిలో లబ్ధిదారుల జాబితాలు అందుబాటులోకి వచ్చాయి.
పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఇంతటి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏపీ సర్కారు నిజంగా పేదలకు, టెక్నాలజీకి అనుకూలమైనదని రుజువైందన్నారు. తానో హైటెక్ సీఎంగా ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు ఈ వాస్తవాలు కనిపించవా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో డీబీటీ విధానంలో నేరుగా రూ. 2 లక్షల కోట్లు తమ ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వంపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment